కళ్ల రక్షణ కోసం పర్యావరణానికి హానిచేయని హైడ్రోజెల్ మాస్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ మాస్క్ కంటికి అవసరమైన తేమను, పోషణను అందిస్తుంది. ఇది కాగితపు మాస్క్ కంటే భిన్నంగా, అత్యంత వేగంగా చర్మానికి తేమను అందిస్తుంది. జెల్ రూపంలో ఉండటం వల్ల ఇవి అధిక పరిమాణంలో తేమను, పోషక సీరమ్ను నిల్వ చేసుకుంటాయి.
చర్మంపై ఉంచినప్పుడు ఈ జెల్ చల్లటి హాయిని ఇస్తూ, తేమను క్రమంగా విడుదల చేస్తుంది. ఈ మాస్క్ని ఉపయోగించడం పూర్తయిన తరువాత వేడినీటిలో వేస్తే పది సెకన్ల కంటే తక్కువ సమయంలోనే కరిగిపోతుంది. ఈ హైడ్రోజెల్ మాస్క్ ఉపయోగించడం కూడా సులభంగా ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే ఈ విధానం పర్యావరణ ప్రియులను, సౌందర్య ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రాణిగారి జుట్టు రహస్యం
ఆస్ట్రియా రాణి ఎలిజబెత్ జుట్టు పాదాల వరకు ఉండేది. ఆమె తన జుట్టు సంరక్షణకోసం ఒక ప్రత్యేక మిశ్రమాన్ని వాడేవారు. గుడ్డు సొన, కొద్దిగా బ్రాందీ కలిపిన మిశ్రమాన్ని ప్రతి రెండు వారాలకొకసారి జుట్టుకు పట్టించేవారు. గుడ్డులోని ప్రొటీన్లు జుట్టుకు బలాన్ని ఇస్తే, బ్రాందీ తలలో ఉన్న నూనెలను శుభ్రం చేసి మెరుపును ఇస్తుందని ఆమె నమ్మేవారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టు కలిగిన రాణిగా ఆమె ప్రసిద్ధి చెందారు.
మెడ మెరిసేలా!
ముఖం మెరిసిపోతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మెడ వద్ద చర్మం నల్లగా మారుతుంటుంది. హార్మోన్ల అసమతుల్యత, మురికి పేరుకుపోవడం వల్ల వచ్చే ఈ నలుపును చిన్నచిన్న చిట్కాలతో ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవచ్చు. పసుపు, శనగపిండి, పెరుగు– ఈ మూడింటిని కలిపి పేస్ట్లా చేసి మెడపై రాసి 20 నిమిషాల తరువాత కడిగేయాలి.
బంగాళాదుంపలో చర్మాన్ని ప్రకాశవంతం చేసే సహజ సిద్ధమైన సమ్మేళనాలు ఉంటాయి. బంగాళాదుంప రసాన్ని రోజూ మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే నలుపు త్వరగా మాయమవుతుంది. కలబంద జెల్ను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మెడకు మర్దన చేసి, ఉదయాన్నే కడిగితే చర్మం మృదువుగా మారడమే కాకుండా రంగు కూడా మెరుగుపడుతుంది. దోసకాయ రసంతో నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
(చదవండి: తలగడలోని డస్ట్మైట్స్తో అలర్జీలు!)


