ఢిల్లీ హాస్టల్‌ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య | Delhi PG Hostel Collapse: Death Toll Rises Fresh CCTV Footage Emerges | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హాస్టల్‌ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య

Sep 7 2026 7:40 AM | Updated on Sep 7 2026 7:43 AM

Delhi PG Hostel Collapse: Death Toll Rises Fresh CCTV Footage Emerges

ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చిన విద్యార్థుల జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం కుప్పకూలిన పీజీ హాస్టల్‌ భవనం ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాత్రంతా కొనసాగిన సహాయక చర్యల్లో మరో వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా.. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.

బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరుగుతుండగానే.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలడానికి బేస్‌మెంట్‌ పనులు, నిర్మాణంలో లోపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సీసీటీవీ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా భవనం కూలడం ప్రారంభమైంది. భారీగా దుమ్ము కమ్ముకోవడంతో అప్రమత్తమైన అతడు వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల వ్యవధిలోనే భవనం కుప్పకూలడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.

తప్పిన పెనుముప్పు?
సత్య నికేతన్‌లోని ఈ ఐదు అంతస్తుల భవనంలో సుమారు 15 గదులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉండేవారని చెప్పారు. ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోవడంతో చాలామంది విద్యార్థులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం కొంత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ఇక సుమారు 30 ఏళ్ల నాటి ఈ భవనంలో ‘హాస్టల్‌ డేజ్‌’ పేరుతో పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. 

ప్రమాదానికి ముందు బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వర్షాలతో బేస్‌మెంట్‌లో నీరు చేరి పునాది బలహీనపడటం వల్లే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

శిథిలాల కింద ఆర్తనాదాలు..
భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ ఫోన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు బాధితులు లోపల నుంచి వీడియోలు తీసి మిత్రులకు పంపించారు. శిథిలాల కింద ఉన్నవారు ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సిజన్‌ సిలిండర్లను పంపించినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇరుకైన వీధులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

పీజీల నిర్వహణపై ప్రశ్నలు
సత్య నికేతన్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. పాత భవనాలను పీజీలుగా మార్చి నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ప్రముఖుల సంతాపం
ఈ విషాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు.. మృతుల సంఖ్య ఆరుకు చేరడం, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండటంతో సత్య నికేతన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా బయటపడిన సీసీటీవీ దృశ్యాలు మాత్రం ప్రమాదం కూలిన భవనం లోపలే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారినీ ఎంతటి ముప్పులోకి నెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: రీల్స్‌ చూసి మోసపోవద్దు! పాపం ఆ అమ్మాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement