వైద్యులపై శివసేన నేతల దాడి.. ఐసీయూలోకి చొరబడి.. | Shiv Sena workers allegedly attacked doctors | Sakshi
Sakshi News home page

వైద్యులపై శివసేన నేతల దాడి.. ఐసీయూలోకి చొరబడి..

Sep 6 2026 5:42 PM | Updated on Sep 6 2026 5:46 PM

Shiv Sena workers allegedly attacked doctors

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ కార్యకర్తలకు సంబంధించిన మరో వివాదం తెరపైకి వచ్చింది. పాల్ఘర్‌లో వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై శివసేన పదాధికారులు దాడి చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన రిసెప్షనిస్ట్‌పై ఓ రాజకీయ కార్యకర్త చెంపదెబ్బ కొట్టినట్లు, ఓ మహిళా ఉద్యోగిని బెదిరించినట్లు సమాచారం.

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున పాల్ఘర్‌లోని రిలీఫ్‌ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ‘దహీ హండి’లో పాల్గొనే కృష్ణ భక్తులను ‘గోవిందాలు’గా పిలుస్తారు. ‘దహీ హండి’ కార్యక్రమంలో పాల్గొని గాయపడిన గోవిందాల వైద్య చికిత్స ఖర్చుల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్‌ సమయంలో రూ.19,866 బిల్లు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది కోరడంతో గోవిందాల బృందం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఆస్పత్రి సిబ్బంది బిల్లు అందించిన తర్వాత తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సిబ్బందిని శివసేన కార్యకర్తలు దుర్భాషలాడి, బెదిరించి, దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్పత్రి ఉద్యోగి కుందన్ సాంకే ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శివసేన జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరాట్‌ తదితరులు అత్యవసర విభాగంలోకి ప్రవేశించి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన రిసెప్షనిస్ట్‌పై వారిలో ఒకరు చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

మరోవైపు కొంతమంది కార్యకర్తలు ఐసీయూలోకి కూడా చొరబడ్డారు. అక్కడ ఉన్న నర్సు గాయపడిన ఓ గోవిందాకు అమర్చిన ఐవీ డ్రిప్‌ను తొలగించి, అతడిని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లినట్లు ఆస్పత్రి సిబ్బంది ఆరోపించారు. పాల్ఘర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత, వైద్య సేవల రక్షణ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాంకే, ఘరాట్, స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర గవిత్ కుమారుడు రోహిత్ గవిత్ సహా కనీసం 17 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు.

ఆస్పత్రిపై దాడితో తీవ్ర ఆగ్రహం
ఈ ఘటనను ‘సిగ్గుచేటు’గా అభివర్ణించిన కాంగ్రెస్ నేత అతుల్ లొంధే పాటిల్ మాట్లాడుతూ.. “ఇది మహాయుతి రాజకీయ నాయకుల గూండాగిరి. వారికి చట్టంపై నమ్మకం లేదు. పాల్ఘర్‌లో రిసెప్షనిస్ట్‌పై దాడి చేశారు. వైద్యులపై కూడా దాడి చేసినట్లు నాకు చెబుతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. బాధ్యత ఎప్పుడు నిర్ధారిస్తారు?” అని ప్రశ్నించారు.

పాల్ఘర్‌లోని వైద్య వర్గాలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులపై పలు దాడులు జరిగిన నేపథ్యంలో వైద్యుల భద్రతపై వారు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement