12 జిల్లాల్లో 22 లక్షల మంది ప్రభావితం
అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచన
పట్నా: బిహార్లో గంగా నది ఉధృత రూపం దాలుస్తోంది. నదిలో వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రాజధాని పట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది నీటి మట్టం గరిష్ట వరద స్థాయిని దాటడంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో 22 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావం బారిన పడ్డారని ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది.
రాబోయే ఒకటి నుంచి మూడు రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ నదుల్లో నీటి మట్టాలు భారీగా పెరగడం వల్ల పటా్న, భోజ్పూర్, సరన్, వైశాలి, భాగల్పూర్, బేగూసరాయ్, బక్సర్, సమస్తీపూర్, ముంగేర్, కతిహార్, అరారియా తదితర జిల్లాల్లో 22.42 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని అధికారులు ప్రకటించారు.
అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రమాదకరమైన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వరద నియంత్రణకు సంబంధించిన వనరులు, యంత్రసామగ్రిని సిద్ధంగా ఉంచాలని పేర్కొంది. పట్నాలో గాంధీ ఘాట్ వద్ద ఆదివారం ఉదయం 6 గంటలకు గంగా నది నీటి మట్టం 50.57 మీటర్లుగా నమోదైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 1,345 పడవలను ఉపయోగిస్తున్నారు. 27 ఎస్డీఆర్ఎఫ్, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.


