పాముల మధ్య బిక్కుబిక్కుమంటూ చిన్నారుల చదువు! | children study in huts terrified by snakes | Sakshi
Sakshi News home page

పాముల మధ్య బిక్కుబిక్కుమంటూ చిన్నారుల చదువు!

Sep 1 2026 5:32 PM | Updated on Sep 1 2026 5:45 PM

children study in huts terrified by snakes

పట్నా: బిహార్‌లో ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో అక్కడి సమస్తిపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చూస్తే అర్థమవుతుంది. పేద, దళిత బస్తీకి చెందిన చిన్నారులు కనీస సౌకర్యాలు లేకుండా ఈ బడిలో చదువుకుంటున్నారు. సమస్తిపూర్ నగరంలోని బీఈడీ కాలేజ్‌ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు కనీస విద్యా సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. పక్కా తరగతి గదులు లేకపోవడంతో పిల్లలు గుడిసెలాంటి రెండు గదుల్లో నేలపై కూర్చొని చదువుతున్నారు.

ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదు తరగతులకు కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయి. ఒక గదిలో 1, 2, 3 తరగతుల పిల్లలకు కలిపి బోధిస్తున్నారు. మరో గదిలో 4, 5 తరగతుల పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. పిల్లలు ఎక్కువగా నేలపైనే కూర్చుంటున్నారు. సరైన బెంచీలు, డెస్కులు లేవు. బ్లాక్‌బోర్డు కూడా సరిగా లేదు. వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పాఠశాలలో తగినన్ని ఫ్యాన్లు లేకపోవడంతో తరగతి గదుల్లో వేడి, ఉక్కపోతతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.  

పాముల భయం
పాఠశాలలో విద్యార్థులు పాముల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పాఠశాలలో సరైన బెంచీలు, డెస్కులు లేకపోవడంతో పిల్లలు నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో పాములు లోపలికి వస్తే వారిని కరిచే ప్రమాదం ఉంది. పాఠశాల చుట్టుపక్కల పాములు కనిపిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గుడిసెలాంటి నిర్మాణం, చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా పిల్లల్లో భయం నెలకొంది. తమ చిన్నారులను పాఠశాలకు పంపుతున్న తల్లిదండ్రులు కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు సురక్షితంగా ఉండాల్సిన పాఠశాలలోనే పాముల భయం ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతపై పాఠశాల యాజమాన్యం, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

వర్షాకాలంలో మరో సమస్య ఎదురవుతోంది. గుడిసెలాంటి గదుల పైకప్పు నుంచి వర్షపు నీరు కారుతుంది. దీంతో పిల్లలను కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం కష్టంగా మారుతోంది. పుస్తకాలు, నోటుపుస్తకాలు తడిసే ప్రమాదం ఉండటంతో కొన్ని సందర్భాల్లో చదువును ఆపి పిల్లలకు సెలవు ఇవ్వాల్సి వస్తోంది. అంతేకాదు, పాఠశాలలో పిల్లలకు కనీసం మరుగుదొడ్డి సదుపాయం కూడా లేదు. ప్రాథమిక పాఠశాల పిల్లలకు అత్యవసరమైన ఈ సౌకర్యం లేకపోవడం పాఠశాల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఎక్కువగా దళిత బస్తీ పిల్లలే
ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లల్లో చాలామంది సమీపంలోని దళిత బస్తీకి చెందినవారే. వారి తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారు. పిల్లలను దూరంలోని మరో పాఠశాలకు ప్రతిరోజూ పంపే పరిస్థితి తమకు లేదని వారు చెబుతున్నారు.

పాఠశాల సమస్యకు పరిష్కారంగా అధికారులు దీనిని మరో పాఠశాలలో విలీనం చేయాలని సూచించినట్లు ప్రధానోపాధ్యాయుడు విశ్వజీత్ ఝా తెలిపారు. అయితే తల్లిదండ్రులు దానికి అంగీకరించడం లేదు. మరో పాఠశాల దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో చిన్న పిల్లలను అక్కడికి పంపడం తమకు కష్టమని వారు చెబుతున్నారు. అదే ప్రాంతంలో పక్కా పాఠశాల భవనం నిర్మించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement