అందరు భయాలు, కష్టాలను చూసి వెనక్కి అడుగు వేస్తే ఆమే మాత్రం అక్కడ ఆశాదీపాలను చూసింది. దీనంగా చూస్తున్న కళ్లు ఆమెను వెనక్కి వెళ్లనివ్వలేదు. సాయం అందించి ఆదుకుందామంటే..అక్కడకు వెళ్లేదారే ఘోరం. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా నిస్వార్థంగా సేవ చేసిన మహోన్నత మహిళ ఆమె. ఆమె అనితరమైన సేవలు చూసి దేశమే అబ్బురపడింది. ఆ మహిళ ఎవరంటే..
ఆ మహిళే డాక్టర్ బుధ్రి తటి. సెప్టెంబర్ 15, 1966న చండీగఢ్, బస్తర్లోని దంతెవాడ జిల్లా, హిరనార్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించింది. నిజానికి ఆమె విద్య, వైద్యం ఇతర ప్రాథమిక సేవలు లేని మారుమూల గ్రామంలో ఆమె బాల్యం గడిచింది. సుమారు ఆరేళ్ల వయసులో గిరిజన సంక్షేమ ఆశ్రమంలో చేరి, పదోతరగతి వరకు చదువుకున్నారు. అక్కడి జీవితానుభవాలే ఆమె జీవిత గమనాన్ని మార్చేశాయి. అంతేగాదు ఆ నేపథ్యం ఆమెను సేవ వైపు మళ్లేలా చేసింది.
అలా ఆమె 15 ఏళ్ల వయసులో 'ఆల్-ఇండియా వనవాసి కళ్యాణ్’ ఆశ్రమంలో అధికారికంగా చేరారు. ఇది గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ. అందులో విద్యాభ్యసం తోపాటు సేవ కార్యక్రమాలు ఆమెను ఆకర్షించేవి. అయితే ఆమె చురుగ్గా సేవ కార్యక్రమాల్లో పాల్గొంది మాత్రం కౌమరదశలోనే. 1980 ఆ టైంలో బస్తర్ చుట్టుపక్కల దుర్భరమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించడం కష్టంగా ఉండేది.
అక్కడకు ఏ స్వచ్ఛంద సంస్థలు చేరుకోలేకపోయేవి. దాంతో ఆ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు. అలాగే కనీస సాయం కూడా పొందలేక విలవిల్లాడేవి. అలాంటి ప్రాంతాలకు ఆమె స్వయంగా కాలి నడకన వెళ్లి తను చేయగలిగింది చేయాలని నిర్ణయించుకుంది. నిజానికి ఈ పనికి ఆమె స్వచ్ఛంద సంస్థ నుంచి కూడా ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు. అయినాసరే వెనక్కి తగ్గకుండా ఆమె ఆ బస్తర్ చుట్టుపక్కల సుమారు 570 గిరిజన గ్రామాలను సందర్శించి అక్కడ పిల్లలు పాఠశాలకు వెళ్లేలా ప్రోత్సహించి వారికి చదువు అందేలా చేసిందామె.
అంతేగాదు సరైన రోడ్డు మార్గం లేక స్కూల్కి రాలేకపోతున్న పిల్లల కోసం హస్టల్ ఏర్పాటు చేసి ప్రోత్సహించే ప్రయత్నం చేశారామె. అలా తొలి బాలికల హాస్టల్ 1990లో బర్సూర్లో 11 మంది బాలికలతో ప్రారంభమైంది. ఆమె చొరవ కారణంగానే ప్రభుత్వానికి ఆ గ్రామాల సమస్యలు తెలిసి రోడ్డు, రవాణ వంటి కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు దారితీసింది. అక్కడితో ఆమె ఆగిపోలేదు తల్లి శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా సహాయక బృందాలనే ఏర్పాటు చేసి వారందర్నీ ఏకతాటిపైకి వచ్చేలా చేశారామె.

అలాగే మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు అయ్యేలా ప్రోత్సహించారామె. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మహిళల విద్య, స్వావలంబన కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆమె. నాలుగు దశాబ్దాల్లలో వందలాది గ్రామాలు, లెక్కలేనన్ని జీవితాల్లో వెలుగులు నింపారామె. ఇప్పటికీ బుధ్రి తటి ఆ గ్రామాలను సందర్శిస్తూ..అక్కడి కుటుంబాలతో చక్కటి సత్సంబంధాలు ఏర్పరుచుకుంటూ మరిన్ని సేవలందించే ప్రయత్నం చేస్తుంటుందని స్థానికులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆ ప్రజలు ఆమెను నమ్మేలా వాళ్ల మనసులను గెలుచుకున్నారు బుధ్రి.
అంతేగాదు ఆ గిరిజన ప్రాంతాలు ఆమెను ‘బడి దీదీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అలాగ ఆమె తన జీవతకాలం ఇలా నిస్వార్థ సేవకే అంకితమై చేసిన కృషని భారత ప్రభుత్వం గుర్తించి, ఇటీవలే భారత అత్యున్న పురస్కారమైన పద్మశ్రీతో గౌరవించి సత్కరించింది. ఇక్కడ బుధ్రి ప్రచారానికి దూరంగా ఉంటూ దశాబ్దాలు నిశబ్దంగా సేవ చేస్తూ పోయారామె..ఇన్నేళ్లకు ఆమె నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు లభించడం విశేషం. ఈమె కథ సేవ చేయాలనే సంకల్పానికి ఆర్భాటాలు ప్రచారాలతో పనిలేదు..ఆ గొప్ప పనే ఏదో ఒక రోజు గుర్తింపు తెచ్చేలా చేస్తుంది అని నర్మగర్భంగా చెబుతోంది కదూ..!.
(చదవండి: 47 ఏళ్ల వయసులో చెప్పులు లేకుండా మారథాన్..గెలిచిన అమ్మ!)


