breaking news
National News
-
పరిష్కారమా... కొత్త సవాలా?
2026 ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందో ళనకు దారితీశాయి. ఫలితంగా పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రశ్నాపత్రాన్ని కాగితం నుంచి కంప్యూ టర్కు మార్చడమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. అంతర్జాతీయ అనుభ వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన చైనా గావ్కావ్, దక్షిణ కొరియా సీఎస్ఏటీ ఇప్పటికీ పేపర్–పెన్సిల్ విధానంలోనే అత్యంత కట్టు దిట్టమైన భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల పరీక్షా విధానం కంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, పారదర్శకత, క్రమశిక్షణే విశ్వస నీయ పరీక్షలకు పునాది అని స్పష్టమవుతోంది. నీట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే, కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. అందువల్ల బహుళ షిఫ్టులు తప్పనిసరి అవుతాయి. జేఈఈ మెయిన్లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్న పత్రాల క్లిష్టతలో తేడాలు రావడం, నార్మలైజేష¯Œ పై వివాదాలు తలెత్తడం వల్ల సమాన ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉపయోగించే ఐటమ్ రెస్పాన్స్ థియరీ వంటి శాస్త్రీయ మనో కొలమాన పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయడం మరింత సముచితం.కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మరో ప్రధాన సవాలు డిజిటల్ అంతరం. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ పరీక్షల అనుభవం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో సాంకేతిక పరిజ్ఞాన పరిచయం విద్యార్థి ప్రతిభను ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ, మాక్ పరీక్షలు అందుబాటు లోకి తీసుకురావడం అత్యవసరం. పరీక్షపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. ప్రశ్నాపత్రాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం, లీకేజీలకు పాల్పడిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసరం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడా వుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది.– ఏటూరి శేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్లు జరిగినా, లేదా స్కామ్ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
పాపం ధనుష్.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్ యాంగిల్లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్లు, మీటింగ్స్కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్ రాజకీయ ప్రయాణమే. విజయ్ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.ఇటు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ధనుష్ను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్ను ఆయన మాజీ మామ, సూపర్స్టార్ రజినీకాంత్తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్ వల్లే కాలేదు.. ఇంక ధనుష్ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ధనుష్ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. -
నీట్ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్పై కీలక నిర్ణయం?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఉదయం ప్రెస్మీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నీట్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.#WATCH | LoP, Lok Sabha, Rahul Gandhi says, "...Students have three demands, and these are not negotiable demands... The first demand is that the Education Minister, who is corrupt, incompetent, and misaligned, has to be sacked... There's some talk going on in Mr. Modi's cabinet… pic.twitter.com/hKoXOQ4SSz— ANI (@ANI) July 25, 2026మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
ఒక్కరి రాజీనామాతో ఆగదా?: సీజేపీ సంచలన వ్యాఖ్యలు
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యలు కోరుతూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తోనే ఆగిపోదని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని సీజేపీ తాజాగా ప్రకటించింది. కేంద్రంతో నిన్నటి చర్చలు, కొనసాగుతున్న ఆందోళనల నడుమ సీజేపీ ప్రతినిధి(చర్చల) అశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని, ఇది “టైమ్ బాంబ్”లా మారుతోందని.. ఏ క్షణమైనా పేలొచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం త్వరగా స్పందించి విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.‘ఇక డిమాండ్లు మారొచ్చు’సీజేపీ ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే.. నీట్ మరణాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. నీట్ నిరసనల్లో విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని మరో రెండు డిమాండ్లు ఉంచారు. వీటిల్లో.. మంత్రి రాజీనామా అంశంపై కేంద్రం ఒక్కరోజు గడువు కోరింది. ఇవాళ.. సీజేపీ, కేంద్రం మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఆ భేటీలో కేంద్రం ఏం చెప్పనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో రంకా మాట్లాడుతూ.. అసంతృప్తి క్రమంగా పెరిగితే అది కేవలం ఒక్కరి రాజీనామా డిమాండ్కే పరిమితం కాకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. “ఇక ఈ డిమాండ్ మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది” అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే.. మరిన్ని రాజీనామాలు డిమాండ్ చేసే అవకాశం ఉందన్నట్లు ఆయన మాట్లాడారు. అంతకు ముందు దీప్కే కూడా..విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నెరవేరిస్తేనే తాము ఆందోళనలను విరమిస్తామని.. అప్పటిదాకా జంతర్ మంతర్లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం మొండిపట్టు పడితే.. అవసరమైన పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ రాజీనామా కూడా డిమాండ్ రావచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. చర్చల్లోనూ కొనసాగుతున్న ప్రతిష్టంభనకేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నీట్ వివాదంలో ప్రభావిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై చర్చ జరిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు.నీట్ వివాదం.. బాధ్యతపై పోరునీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు కేవలం పరీక్షల అంశంగా కాకుండా.. ప్రభుత్వ జవాబుదారీతనం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుండగా.. మరోవైపు నిరసనకారులు వ్యవస్థాపరమైన మార్పులతో పాటు రాజకీయ బాధ్యతను కూడా డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చ మధ్యలోకి తీసుకొచ్చాయి. ఉద్యమం ఏ దిశగా సాగుతుంది.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్చుక్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్.. తన దీక్ష విరమణపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. కేంద్రంతో ‘డీల్ కుదుర్చుకుని’ దీక్ష విరమించారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన.. అక్కడి నుంచే నేరుగా ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.. ‘‘26 రోజుల పాటు ఆకలితో పోరాడిన తర్వాత కూడా నా నిజాయితీని నిరూపించుకోవాలా?’’ అంటూ ప్రశ్నించారు. తన పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్చుక్ మాట్లాడుతూ.. తన దీక్ష వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.‘నా శరీరం ఎంత నష్టపోయిందో తెలుసా?’దీక్ష విరమణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి వాంగ్చుక్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా సమస్యల కోసం తాను ప్రాణాలను సైతం పణంగా పెట్టానని తెలిపారు. ‘‘26 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నాను. నా శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఇంత చేసిన తర్వాత కూడా నా నిబద్ధతకు సర్టిఫికెట్ కావాలా?’’ అని ప్రశ్నించారు. తన పోరాటాన్ని, త్యాగాన్ని రాజకీయ లెక్కలతో అంచనా వేయొద్దని కోరారు.ఐసీయూలో వాంగ్చుక్.. 11 కిలోల బరువు తగ్గింపువాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా విమర్శలపై స్పందించారు. 26 రోజుల నిరాహార దీక్ష కారణంగా ఆయన 11 కిలోల బరువు కోల్పోయారని, అందులో కండరాల నష్టం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం వాంగ్చుక్ గురుగ్రామ్లోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ‘‘విమర్శించే ముందు ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోండి. 26 రోజుల పాటు ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తికి కనీసం కాస్త సానుభూతి చూపించండి’’ అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026ఎందుకు దీక్ష విరమించారు?నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల సంస్కరణలు, విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ల నుంచి కొన్ని హామీలు రావడంతో గురువారం ఆయన దీక్షను విరమించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోకుండా చూడటం, పరీక్షల సంస్కరణలపై పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించడం, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాన్ని పరిశీలించడం వంటి హామీలు లభించాయని వాంగ్చుక్ తెలిపారు.విమర్శల మధ్య కొనసాగుతున్న చర్చదీక్ష విరమణ తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే వాంగ్చుక్ మాత్రం తన పోరాటం వెనుక ఉన్న ఉద్దేశం మారలేదని స్పష్టం చేశారు. ‘‘ఇది వ్యక్తిగత విజయం కోసం చేసిన పోరాటం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమం’’ అని ఆయన పేర్కొన్నారు. -
అటు బ్రహ్మపుత్ర ఉగ్రరూపం.. ఇటు గుజరాత్లో ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ అలర్ట్
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ఇప్పటివరకు కనీసం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలో వరదలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుండగా.. గుజరాత్లో రికార్డు స్థాయి వర్షాలతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.బ్రహ్మపుత్ర ఉగ్రరూపం.. అసోంలో వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బ్రహ్మపుత్ర సహా పలు నదులు ఉప్పొంగడంతో 25 జిల్లాల్లోని 1,800కు పైగా గ్రామాలు నీటమునిగాయి. లక్షలాది మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.అయితే మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. నదీ పరివాహక ప్రాంతాల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి.Assam Drowns in Deadly Floods.41 dead, over 7 lakh people affected as floods swallow 11 districts. Rivers still rising.Assam is hurting. Homes are gone, lives have been changed forever and even innocent animals have been lost.Please keep every affected family in your… pic.twitter.com/yAt3PCkyvb— زماں (@Delhiite_) July 24, 2026గుజరాత్లో ‘వర్ష’ విపత్తుఅసోంతో పాటు పశ్చిమ భారతంలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో కేవలం 24 గంటల్లోనే 1,100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.సహాయక బృందాలు సుమారు 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నవ్సారీ, వల్సాద్ సహా పలు జిల్లాల్లో పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.సౌరాష్ట్రపై పొంచి ఉన్న ముప్పుగుజరాత్పై ప్రస్తుతం ఓ వాతావరణ వ్యవస్థ ప్రభావం చూపుతోంది. దాదాపు ఒకే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతున్న ఈ వాయుగుండం తరహా వ్యవస్థ భారీ నుంచి అతి భారీ వర్షాలకు కారణమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలో రాత్రివేళ వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అహ్మదాబాద్ సహా మధ్య గుజరాత్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.🌧️ WATCH | Cars Go Underwater After Heavy Rain Floods Vapi Parking Lot.Flooding in Gujarat’s Vapi leaves several cars submerged as heavy rains continue to lash Valsad district.#Gujarat #Vapi #Valsad #Floods #HeavyRain #Monsoon #IndiaNews #BreakingNews pic.twitter.com/NhPQg0TpzM— India Focus Daily (@indiafocusdaily) July 24, 2026ఎందుకింత తీవ్రత?సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దేశానికి అవసరమైన వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. అయితే తక్కువ సమయంలో భారీ వర్షాలు కురవడం వల్ల నదులు, డ్రైనేజీ వ్యవస్థలు తట్టుకోలేక వరదలు సంభవిస్తున్నాయి. ఈసారి పలు ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న అతిభారీ వర్షాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ముఖ్యంగా నదులు పొంగిపొర్లడం, నేలలో తేమ అధికంగా ఉండటం వల్ల వరద ముప్పు పెరిగింది.అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికరానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో ప్రయాణించవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకవైపు అసోంలో వరదల విలయం.. మరోవైపు గుజరాత్లో కుండపోత వర్షాలు.. దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రకృతి పరీక్ష పెడుతున్నాయి. -
ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్లో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ స్ట్రీట్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని శుక్రవారం సీజేపీ చెబుతోంది. నిరసనకారులపై కేసులు తప్పవని, జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగిస్తామని, పాస్పోర్టులు సీజ్ చేస్తామని.. అఖరికి అరెస్టులు చేస్తామని హెచ్చరికలు వచ్చినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. విద్యా వ్యవస్థలో మార్పులు, తమపై జరిగిన పోలీసుల చర్యలపై బాధ్యులపై చర్యలు, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్రంతో సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.కేంద్రం ప్రయత్నాలుమరోవైపు ఆందోళనను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సీజేపీ ప్రతినిధులతో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి. సీజేపీ తరఫున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు భేటీ అయ్యారు. ఎలాగైనా ఆందోళనలు విరమింపజేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తమ ప్రధాన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రతినిధులు చర్చలకు వెళ్లే ముందు మీడియాకు స్పష్టం చేశారు. ‘‘మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. మాపై లాఠీ చార్జి చేసింది పోలీసులు కాదు.. ఆ ముసుగులో ఉన్న గూండాలు. వాళ్లకు శిక్ష పడాల్సిందే. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లు నెరవేరే దాకా పోరాటం ఆపం’’ అని ఆ ఇద్దరు ప్రకటించారు. దీంతో చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నం.. పోలీసుల అప్రమత్తంఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నాం జంతర్ మంతర్ నుంచి కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.కేబినెట్ భేటీఅటు చర్చలు.. ఇటు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. పేపర్ లీకుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు కఠిన శిక్షలతో చట్టం అమలయ్యేలా సంస్కరణల రూపకల్పన దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాంగ్చుక్ దీక్ష విరమించినా.. పోరాటం కొనసాగింపుప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా.. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ముందుగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్సీజేపీ తమ ప్రధాన ఎజెండాను స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నీట్ సహా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వివాదాలు, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చింది. మంత్రి రాజీనామా తర్వాతే విద్యా సంస్కరణలు, ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామని సీజేపీ పేర్కొంది.ఒకవైపు ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుండగా.. మరోవైపు సీజేపీ మాత్రం తమ డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో పార్లమెంట్ స్ట్రీట్లో కొనసాగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం–సీజేపీ మధ్య జరగనున్న చర్చల ఫలితంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. -
రాజుల కాలం కాదు.. ముగ్గురంటే ఎలా బాసూ!
“భయ్యా.. పెళ్లి చేసుకున్నావా?”“అవును..”“కంగ్రాట్స్.. సంతోషంగా ఉన్నావా?”“అదే అర్థం కావడం లేదు బాబూ.. సంతోషమో.. సవాలో!”“అదేందన్నా.. ఎందుకలా అంటున్నావ్?”“ఒక్కరిని మెప్పించడమే కష్టంగా ఉంటుంది కదా.. అలాంటిది ముగ్గురి మనసులు గెలవాలంటే రోజులో 24 గంటలు సరిపోతాయా చెప్పు!”ఇది ఏదో సినిమా కథ కాదు.. ఉత్తరప్రదేశ్లో వైరల్గా మారిన ఓ పెళ్లి కథ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పరిచయమైన ఓ యువకుడు.. ఆ పరిచయమే చివరకు పెళ్లి బంధంగా మారిందని చెబుతున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. ఈ పెళ్లి నిజమేనా? చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)కెమెరామెన్ నుంచి భర్త వరకు..ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వీడియోలకు కెమెరామెన్గా పనిచేసిన వికాస్ అలియాస్ విక్కుతో పరిచయం ఏర్పడింది. మొదట రీల్స్లో భర్త పాత్ర పోషించిన వికాస్.. చివరకు నిజ జీవితంలోనే వారి జీవిత భాగస్వామిగా మారాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మొదట అంతా ఇదేదో సోషల్ మీడియా స్టంట్ అనుకున్నారు. కానీ ముగ్గురు సోదరీమణులు స్వయంగా స్పందిస్తూ.. “ఇది నిజమైన పెళ్లి. మా ఇష్టంతో తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.విడిపోవడం ఎందుకని..ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు సొంత రక్తం. మరొకరు.. ఆ ఇంట్లోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసే పెరిగామని చెబుతున్నారు. వేర్వేరు కుటుంబాల్లోకి వెళ్లిపోవడం ఇష్టం లేకే ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నామని వెల్లడించారు. “మేమంతా పెద్దవాళ్లమే. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది” అంటూ వారు స్పష్టం చేశారు. వికాస్ కూడా వారి నిర్ణయానికి అంగీకరించాడని, అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివాహం జరిగిందని తెలిపారు. సరే.. మనసులు కలిశాయి.. మరి చట్టం?ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. “ప్రేమకు హద్దులు ఉండవు” అని వారు చెబుతున్నా.. చట్టానికి మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం హిందూ వివాహ చట్టం ఒక వ్యక్తికి ఒకేసారి ఒక భార్య ఉండే విధానాన్ని గుర్తిస్తుంది. అంటే.. ఇలాంటి వివాహం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అధికారికంగా నమోదు జరిగిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)“రాజుల కాలం వేరు.. ఇప్పటి చట్టాలు వేరు”ఈ పెళ్లిపై ప్రశ్నలు రావడంతో ముగ్గురు సోదరీమణులు పాతకాలపు ఉదాహరణలు చెబుతున్నారు. రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారని పేర్కొంటున్నారు. కానీ న్యాయ నిపుణుల ప్రకారం.. చారిత్రక ఆచారాలు, ప్రస్తుత చట్టాలు ఒకేలా ఉండవు.రీల్ లైఫ్ బాగుంది.. రియల్ లైఫ్ ఎలా?సోషల్ మీడియాలో ఓ వీడియోకు లక్షల వ్యూస్ రావచ్చు. కానీ నిజ జీవితంలో ఒక బంధాన్ని కొనసాగించాలంటే ప్రేమతో పాటు బాధ్యత, అవగాహన కూడా అవసరం. ఇప్పటివరకు ఈ కథలో అందరి మాట ఒక్కటే.. “మేము సంతోషంగా ఉన్నాం. సోషల్ మీడియా ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మొగుడి పేరిట కాస్త భూమి ఉంది” అని. కానీ అసలు పరీక్ష మాత్రం ముందుంది. రీల్లో కలిసి కనిపించడం సులువు.. రియల్ లైఫ్లో కలిసి నడవడమే అసలు సవాల్!. -
నీట్ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్లో చదివిస్తావా?
నీట్–యూజీ పరీక్ష నిర్వహణపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడిన నీట్ వంటి కీలక పరీక్షపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. కాబట్టి నైతిక బాథ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో..నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘సామాన్య విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్ష వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి?’’ అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.‘నీట్ను కంగాళి చేసి..’ అంటూ విమర్శలునీట్ వివాదంపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీట్ కోసం పోరాడుతున్న దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.కుమార్తె సోషల్ మీడియా ఖాతాపై చర్చసోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం ఇదేనని ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొందరు నెటిజన్లు దీనిని నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.విమర్శలు ఎటు వరకు?ప్రజా విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విమర్శలు కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల వరకు వెళ్లకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షా ప్రక్రియలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.రాజకీయ రంగు పులుముకున్న నీట్ వివాదంనీట్ పరీక్ష వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ.. ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు.. ఇలా నీట్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్ష వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. -
గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు నిరసనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా పరిణామాలు ఇవే..Live Updates08: 14 PMగాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనఇండి కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శనగాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పిస్తున్న ఇండి కూటమి నేతలుమొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించిన నేతలుప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వచ్చిన నేతలునీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండికూటమి నేతల నివాళి 07: 30 PMవిద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కాలని భావించాం: రాహుల్ఇండియాగేట్కు వెళ్దామంటే అనుమతి ఇవ్వలేదువిద్యార్థులంతా రోడ్డుపై ఉన్నారురాజ్ఘాట్కు వెళ్దామని అనుకుంటున్నాంమా బస్సును పోలీసులు అడ్డుకున్నారుబస్సును వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు07:18 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల ర్యాలీరాజ్ఘాట్కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్, ఇండి కూటమి నేతలురాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్న ఇండి కూటమి నేతలువిద్యార్థులు ఒంటరి వారు కాదు.. బాసటగా నిలుస్తాం: రాహుల్07:08 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలురాహుల్ నివాసంలో ముగిసిన ఇండి కూటమి ఎంపీల భేటీరాజ్ ఘాట్ బయల్దేరిన రాహుల్, ఇండి కూటమి నేతలువిద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్06:13 PMరాహుల్ గాంధీ నివాసంలో విపక్షాల కీలక భేటీవిద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చసమావేశం అనంతరం రాజ్ఘాట్కు వెళ్లే యోచనరాహుల్ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు04:50PMరేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపుశాంతియుతంగా నిరసనలు చేపట్టాలన్న సీజేపీ 03:21 PMనీట్ పేపర్ లీక్ కేసుపై కేంద్రం కీలక నిర్ణయంనాలుగు రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుబాంబే హైకోర్టులోని రెండు బెంచ్ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులుపేపర్ లీక్ చట్టం కింద ప్రతిరోజూ విచారణ03:13 PMసీజేపీని మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంఅన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం..జంతర్మంతర్లోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్న సీజేపీ02:03 PM | కేంద్రం సంచలన నిర్ణయంఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలునిరసనకారుల్ని మూడు నెలల బంధించే అధికారంసీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీస్ కమిషనర్కు విశేష అధికారాలిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుసీజేపీ ఆందోళనలతో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలునేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించే అవకాశంగెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ1:58 PM | నిరసనకారుల్ని బెదిరించిన పోలీస్పై చర్యలుముంబైలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు డ్రైవర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.‘‘డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’’ అంటూ విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ.. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.01:18 PM | సీజేపీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతుజంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుఅంతకంతకు పెరుగుతున్న మద్దతు కమల్ హాసన్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటుల మద్దతుమొదటి విద్యార్థి మరణం దగ్గరే ప్రభుత్వం స్పందించి ఉండాల్సిందేన్న కమల్బాలీవుడ్ మద్దతు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్న షాఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్ తారలుఇటు సౌత్లోనూ పలువురి సపోర్ట్12:21 PM | మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు దృష్టిసీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో మూసివేసిన మెట్రో స్టేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది.సెంట్రల్ ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీంకోర్టు సమీప మెట్రో స్టేషన్ మూసివేత వల్ల కేసులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.ఎంట్రీ పాస్లు ఉన్న న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల తర్వాత అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం తర్వాత తాను జోక్యం చేసుకుంటానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.ఇప్పటికే మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 11:33 AM | ముంబైలో పోలీస్ వాహనం నుంచి నిరసనకారుల పరార్చెంబూర్లో జరిగిన CJP నిరసనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.అదుపులోకి తీసుకున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ తలుపును ఓ వ్యక్తి తెరిచినట్లు వైరల్ వీడియోలో కనిపించింది.దీంతో పలువురు విద్యార్థులు వాహనం నుంచి బయటకు వచ్చి పరారైనట్లు సమాచారం.నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు.దాదాపు 700–800 మంది ఆందోళనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.సుమారు 200 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.11:31 AM | రాళ్ల దాడిలో ఢిల్లీ ఏసీపీకి గాయాలుజంతర్ మంతర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు.తలకు గాయం కావడంతో పాటు చేతులు, కాళ్లు, భుజంపై గాయాలైనట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.చెవి నుంచి రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.11:14 AM | ప్రధాని మోదీ ట్వీట్పై CJP చీఫ్ సెటైర్పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేశారు.ప్రధాని ట్వీట్లోని “యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం” అన్న వ్యాఖ్యలపై సెటైరికల్గా పోస్టు చేశారు.‘‘Hi, my name is Nothing’’ అంటూ గ్రాఫిక్ను షేర్ చేశారు. https://t.co/mo44rK6tNc pic.twitter.com/kEeHWUMouF— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026 11:08 AM | బిహార్ అసెంబ్లీలో నీట్ నిరసనల సెగవిద్యార్థులపై లాఠీచార్జ్ అంశం బిహార్ అసెంబ్లీని కుదిపేసింది.విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రశ్నించారు.మరోవైపు తమ వాహనంపై దాడి చేసిన వారిని అధికార కూటమి ఎమ్మెల్యేలు ‘గూండాలు’గా అభివర్ణించారు.అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతపార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యువత ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులు.. భారీగా మోహరింపుయువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటుఇవాళ పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజు భేటీఉభయ సభల్లోనూ విపక్షాల నిరసనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వంశాంతియుతంగానే నిరసనలు కొనసాగుతాయన్న సీజేపీచలో సంసద్ మళ్లీ ఉండబోదన్న సీజేపీజంతర్ మంతర్ వద్దే దీక్ష చేస్తున్న మద్దతుదారులునిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సీజేపీ ఆరోపణఅప్రమత్తంగా ఉండాలని వలంటీర్లకు ప్రతినిధుల పిలుపు11:04 AM | అభిజిత్ దీప్కేకు అస్వస్థతCJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు అస్వస్థతనిరసనలకు దూరంగా ఇవాళ రెస్ట్ తీసుకోనున్న దీప్కే గత కొన్ని రోజులుగా జ్వరం, తీవ్ర ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సీజేపీ వెల్లడి.నొప్పి నివారణ మందులతో ఇప్పటివరకు కొనసాగానని.. విశ్రాంతి కోసం కొంత సమయం పాటు నిరసన స్థలం నుంచి దూరంగా ఉంటాడని వెల్లడితిరిగి సాయంత్రానికి తిరిగి జంతర్ మంతర్కు వచ్చే చాన్స్.10:50 AM | పోలీసుల చర్యలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలునిరసనకారులపై లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరారు.10:46 AM | ‘విద్యార్థుల మాట వినండి’నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని ప్రియాంక గాంధీ అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.10:43 AM | జంతర్ మంతర్కు అలఖ్ పాండేఫిజిక్స్ వాలా సీఈవో అలఖ్ పాండే జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో పాల్గొన్నారు.ఆందోళనకారులను ‘పాక్ ఫండెడ్’, ‘చైనా మద్దతుదారులు’గా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు.పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించారు.10:34 AM | చండీగఢ్కు విస్తరించిన నిరసనలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో చండీగఢ్లోనూ నిరసనలు జరిగాయని CJP తెలిపింది.దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.10:31 AM | చర్చలు ఉంటాయా? ఉండవా?!మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న విపక్షాలు, నిరసనకారులురాజీనామా తర్వాతే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలంటున్న ప్రతిపక్షాలుఅప్పటిదాకా సమావేశాలను ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టీకరణఇటు.. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుమంత్రి రాజీనామా చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని స్పష్టీకరణఇదివరకే మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులురాజీనామా సహా మూడు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తిడిమాండ్లపై ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రంచర్చలు ఉంటాయంటూనే.. ముందుకు అడుగు వేయని వైనంచర్చలకు కేంద్రమే దిగి రావాలని.. తాము వెళ్లబోమని సీజేపీ కుండబద్ధలులీక్కు కారకులైన వాళ్లను వదలమని.. కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటనమంత్రి రాజీనామాపై మాత్రం మౌనం!ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ముడిపడి ఉన్న నీట్ నిరసనల వ్యవహారంకేంద్రం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠచర్చలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం10:00 AM | నిరసనల్లోకి చొరబడ్డ అసాంఘిక శక్తులు!కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ఆరోపణలు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. నిరసనల్లోకి కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డారని తెలిపారు. వారిని నియంత్రించేందుకు వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. రాత్రి సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు.09:49 AM | ‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’పేపర్ లీక్లపై ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.09:49 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: CJP పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై స్పందించిన CJP.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ను మరోసారి తెరపైకి తెచ్చింది.09:42 AM | పోలీస్పై దాడి వీడియో వైరల్జూలై 20న జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని వెంబడించి దాడి చేసినట్లు కనిపిస్తోంది.09:28 AM | ముంబైలోనూ CJP నిరసనలు.. 1,500 మందికి పైగా పాల్గొనడంNEET పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్క్లో భారీ నిరసన చేపట్టారు. ఇందులో నటులు, కమెడియన్లు కూడా పాల్గొన్నారు.09:17 AM | NEET పేపర్ లీక్పై ఫాస్ట్ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ ప్రకటనపరీక్షల పేపర్ లీక్లకు పాల్పడిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.09:05 AM | ముంబైలో నిరసనలు.. 200 మంది అదుపులోకిఅనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్లో జరిగిన ఆందోళనలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.08:59 AM | నిరసనల్లో గాయపడిన పోలీస్ అధికారి ఫొటో వైరల్CJP ఆందోళనల్లో ఇన్స్పెక్టర్ నందకిశోర్పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఫొటో బయటకు వచ్చింది.08:21 AM | కేంద్రంపై ఆప్ నేత అతిషి విమర్శలుఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతపై ఆప్ నేత అతిషి స్పందించారు. సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కానీ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.08:21 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది: CJP చీఫ్CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.08:21 AM | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీనియర్ అధికారిఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పోలీసులను పరామర్శించారు.07:55 AM | పోలీస్ అధికారి చర్యలపై CJP స్పందననిరసనకారిణిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ADCPను విధుల నుంచి తప్పించడంపై CJP స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.🔴 08:21 AM | ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేతCJP నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, మండీ హౌస్, ఐటీవో వంటి కీలక స్టేషన్ల వద్ద రాకపోకలను నిలిపివేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి.🔴 08:13 AM | మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం: CJPకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసన 34వ రోజుకు చేరిందని, సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.🔴 07:55 AM | పోలీస్ అధికారిపై చర్యలకు CJP డిమాండ్జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారిపై పోలీస్ అధికారి చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో.. సదరు అధికారిని సస్పెండ్ చేసి, విచారణ జరపాలని CJP డిమాండ్ చేసింది.🔴 07:24 AM | భద్రత కట్టుదిట్టం.. మెట్రో సేవలపై ప్రభావంకేంద్ర ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.🔴 07:13 AM | ఇంటర్నెట్ నిలిపివేతపై కాంగ్రెస్ ఆరోపణలుజంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. యువత నిరసన గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.🔴 05:01 AM | ముంబైలో 13 ఎఫ్ఐఆర్లు నమోదుCJPకి మద్దతుగా జరిగిన అనుమతి లేని నిరసనలపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. దాదాపు 400 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.🔴 03:46 AM | నాగ్పూర్లో నిరసనకారుల తరలింపునాగ్పూర్లోని సంవిధాన్ స్క్వేర్ వద్ద కొనసాగిన నిరసనను పోలీసులు రాత్రివేళ తొలగించారు. గడువు ముగిసినా ఆందోళన కొనసాగించడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్య సమయంలో కొందరు యువకులు జాతీయ గీతం ఆలపించారు.🔴 02:44 AM | మరో పోలీస్ చర్యపై CJP ఆరోపణలుజంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని CJP ఆరోపించింది. మరోసారి పోలీస్ చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నించింది.🔴 02:04 AM | షరతులతో దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఆందోళన విరమించి చర్చలకు రావాలని కోరారు.🔴 01:45 AM | నిరసనలో నేరస్తుడి హల్చల్!జూలై 20న జంతర్ మంతర్ నిరసనలో చరిత్ర కలిగిన నేర చరిత్ర కలిగిన హాజీ అఫ్జల్ కనిపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.🔴 01:18 AM | బ్యారికేడ్లు దాటేందుకు మళ్లీ ప్రయత్నంజంతర్ మంతర్ వద్ద కొందరు నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.🔴 11:16 PM | దేశవ్యాప్తంగా నిరసనలపై కేంద్రం సమీక్షCJP ఆందోళనలు పలు రాష్ట్రాలకు విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యధికంగా నిరసనలు నమోదయ్యాయని, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, అసోం, హర్యానాల్లోనూ ఆందోళనలు జరిగాయని అధికారులు తెలిపారు.🔴 10:30 PM | ఢిల్లీలో రాళ్ల దాడి ఘటనకనాట్ ప్లేస్ సమీపంలోని టాల్స్టాయ్ మార్గ్ వద్ద పోలీసులు, RAF సిబ్బందిపై కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ గాయపడినట్లు వెల్లడించారు. -
సీజేపీ నిరసనకు స్పాన్సర్ ఎవరు?.. అసలు కథ ఇదే
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. జంతర్మంతర్ వద్ద మరో ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిరసనకారుల వెనుక ఎవరున్నారు?. అసలు వాళ్లకు మద్దతుగా వస్తున్న ఆహారం, నీరు, ఇతర సహాయ సామగ్రి ఎవరు పంపిస్తున్నారు? నిజంగానే ఆ ఆర్డర్లు ముంబై, హైదరాబాద్లాంటి నగరాల నుంచి ఆర్డర్ చేస్తున్నవేనా?.. ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.సీజేపీ ఆందోళనలు దేశానికి ప్రమాదకరమని.. ఈ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విదేశీ నిధులు, ముఖ్యంగా పాక్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అదే సమయంలో నిరసన ప్రాంగణంలో కనిపిస్తున్న పరిణామాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.జంతర్మంతర్కు వరుసగా.. నిరసన ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్ డెలివరీలు వస్తూనే ఉన్నాయి. దాల్ చావల్, రాజ్మా చావల్, టీ, శాండ్విచ్లు, బర్గర్లు, తాగునీటి బాటిళ్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. కొందరు డెలివరీ రైడర్లు వరుసగా రావడం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారో తమకు తెలియదని వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్డర్ వచ్చిన ప్రాంతం మాత్రమే తెలుస్తుందని.. పంపించిన వ్యక్తుల వివరాలు తమకు తెలియవని అంటున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయం?నిరసనకారుల ప్రకారం.. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి కూడా సహాయం అందుతోందని వారు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా.. తమ మద్దతును ఆహారం, నీరు వంటి రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తాము మద్దతుగా ఆర్డర్లు పెడుతున్నామంటూ కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. జూలై 20 తర్వాతే పెరిగిన మద్దతుజూలై 20న చలో సంసద్కు సీజేపీ ప్రయత్నించింది. అయితే ఘర్షణల నేపథ్యం, అలాగే నిరసనకారులకు గాయాలు అయిన నేపథ్యంలో.. శాంతియుతంగా జంతర్ మంతర్ వద్దే ఆ మరుసటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అంటోంది. అయితే లాఠీ చార్జి పరిణామాల తర్వాత నిరసనకు ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న సహాయం.. ఆ తర్వాత భారీగా పెరిగిందని వాలంటీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆహార కొరత లేదని, రోజంతా పలు పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒకానొక దశలో.. ఫుడ్ ఆర్డర్లు భారీగా చేరడంతో ఇక భోజనాలు పంపొద్దంటూ CJP తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసింది.ఫండింగ్పై రాజకీయ ఆరోపణలు.. సోషల్ మీడియాలో చర్చఅయితే ఉద్యమానికి వస్తున్న మద్దతుపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్న అంశంపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొన్ని వర్గాలు నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని వాదిస్తున్నారు.సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫుడ్ సపోర్ట్ను ప్రజల స్వచ్ఛంద మద్దతుగా చూస్తుంటే.. మరికొందరు ఉద్యమానికి నిధుల మూలాలపై స్పష్టత అవసరమని ప్రశ్నిస్తున్నారు.పేర్లు తెలియని దాతలు.. కనిపిస్తున్న మద్దతుప్రస్తుతం జంతర్మంతర్ వద్ద కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే.. పేర్లు వెల్లడించని వ్యక్తుల నుంచి ఆహారం, నీరు వంటి సహాయం నిరసనకారులకు చేరుతోంది. అయితే ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం వ్యక్తిగత మద్దతేనా? లేదంటే మరేదైనా వ్యవస్థీకృత సహకారం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఒకవైపు.. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. సీజేపీ నిరసనల చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చల మధ్య.. జంతర్మంతర్ ఫుడ్ ప్యాకెట్ల కథ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. -
గాడ్జిల్లా ఎల్ నినో భయపెట్టింది.. మరి ఈ మేఘాలు ఎలా వచ్చాయి?
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం భారత రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. బలమైన ఎల్ నినో భారత్లో వర్షాలను తగ్గిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 95 శాతం ప్రాంతం మేఘాలతో కప్పుకుపోయింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగుతుందని తేల్చేశారు. మరి ఎల్ నినో ఉన్నా ఈ మేఘాలు, వర్షాలు ఎందుకు వస్తున్నాయి?ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. భారత రుతుపవనాల విషయంలో ఎల్ నినో సాధారణంగా వర్షాలకు ప్రతికూలంగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రతిరోజు వాతావరణాన్ని నియంత్రించదు. ఒక వారం లేదా కొన్ని రోజుల వర్షాలను ఆపే శక్తి దీనికి ఉండదు. మొత్తం రుతుపవనాల కాలంలో వర్షపాతం ఎలా ఉండొచ్చనే అంచనాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది.స్థానిక వాతావరణ పరిస్థితులే కారణంప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండటానికి స్థానిక వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తేమతో కూడిన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రెండు సముద్రాల నుంచి భారీగా తేమ దేశ భూభాగంలోకి చేరుతోంది. ఈ తేమ, గాలి కలయికతో మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్నినో ఈ స్థానిక పరిస్థితులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది.మళ్లీ పుంజుకున్న రుతుపవనాలుఇటీవల కొంతకాలం ఉత్తర దిశగా వెళ్లిన రుతుపవన ద్రోణి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. బంగాళాఖాతం నుంచి తేమ సరఫరా పెరగడంతో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. పశ్చిమ బెంగాల్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం ఎంత?భారత వర్షాలను ప్రభావితం చేసే మరో కీలక అంశం ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). ఇది హిందూ మహాసముద్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల సముద్ర ఉష్ణోగ్రతల తేడాలను సూచిస్తుంది. పాజిటివ్ IOD ఉన్నప్పుడు భారత్వైపు అదనపు తేమను తీసుకురావడంలో సహకరిస్తుంది. 1997లో బలమైన ఎల్ నినో ఉన్నప్పటికీ పాజిటివ్ IOD భారత్ను కరువు నుంచి కాపాడింది. అయితే ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలో ఉంది. దీంతో ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకునే బలమైన సహకారం అందడం లేదు.మరి వర్షాల లోటు ముగిసినట్టేనా?ప్రస్తుతం దేశమంతా మేఘాలతో కప్పుకున్నా.. రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయినట్లు భావించలేమని నిపుణులు చెబుతున్నారు. ఒకటి రెండు వారాల వర్షాలు మొత్తం సీజన్ పరిస్థితిని నిర్ణయించవు. కొన్ని రోజుల పాటు సాధారణ వాతావరణ వ్యవస్థలు బలమైన ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించగలవు. అయితే రుతుపవనాల మొత్తం గమనాన్ని తెలుసుకోవాలంటే రాబోయే నెలల్లో వర్షపాతం ఎలా ఉంటుందన్నదే కీలకం. -
జంతర్మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి సమయంలో, అలాగే మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, వేదికను తొలగించారు. అయితే బుధవారం ఉదయం నుంచి నిరసనకారులు మళ్లీ అక్కడకు చేరుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.లేటెస్ట్ అప్డేట్స్:ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులుపోలీసులపై అల్లరిమూకల దాడిదాడిలో పలువురు పోలీసులకు గాయాలుజంతర్మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్పై నిషేదంగాయపడిన పలువురు పోలీసులుజంతర్మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణంపోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులుపోలీసులు, RAF సిబ్బందిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరిన ప్రొటెస్టర్లుగాయపడిన పలువురు పోలీసులు ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర హైటెన్షన్భారీగా తరలివస్తున్న యువతపార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలుప్రభుత్వం చర్చలకు రావాలంటే తమ వద్దకే రావాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమేనని, కానీ తమ షరతులను అంగీకరించాలని తెలిపారు.ప్రభుత్వ అహంకారం తగ్గాలని డిమాండ్ చేశారు.NEET పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్పై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.చర్చలు తటస్థ ప్రదేశంలో లేదంటే జంతర్ మంతర్లో జరగొచ్చని CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ప్రభుత్వం తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు విద్యార్థులపై పోలీసు చర్యలకు దిగిందని CJP ఆరోపించింది.తమ ప్రతినిధులను జేపీ నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు పిలిచి మరోవైపు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని విమర్శించారు.జూలై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది.మరోవైపు, నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.NEET అంశంపై CJP–ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు కొనసాగుతున్నాయి.నాలుగు నినాదాలే చేద్దాం: సీజేపీ జంతర్ మంతర్లో CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు.ఆందోళనల్లో నాలుగు నినాదాలకే పరిమితం కావాలని పిలుపు.‘‘భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’’ అంటూ నినాదాలు చేయాలని సూచన.ప్రతికూల నినాదాలతో ఉద్యమంపై తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ.ఎలాంటి నెగెటివ్ స్లోగన్స్ను సహించబోమని స్పష్టం చేశారు.స్పీకర్ను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్NEET అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాల ఒత్తిడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్రాజీనామాకు పట్టుబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. విపక్షాలుఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామంలోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠCJP నిరసనలు.. తాజా పరిణామాలువిద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని DMK ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.NEET వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని విమర్శించారు.సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను 20 రోజులకు పైగా కొనసాగించేందుకు అనుమతించారని గుర్తుచేశారు.ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని DMK ఎంపీ ఆరోపించారు.విద్యార్థుల పోరాటం ఆగదని, వారు తమ డిమాండ్ల కోసం కొనసాగుతారని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో భద్రతా కారణాలతో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.రాజీవ్ చౌక్, ఐటీవో, మండీ హౌస్ సహా 16 మెట్రో స్టేషన్లు తదుపరి ఆదేశాల వరకు మూసివేశారు.జంతర్ మంతర్ పోలీస్ యాక్షన్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు👉 ‘సమయం వృథా చేయొద్దు’జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. “మా సమయం, మీ సమయం వృథా చేయొద్దు” అని న్యాయవాదికి సూచించింది. 👉 వీడియోలు చూడబోమన్న సీజేఐపోలీసుల చర్యకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోరగా.. “మేము ఎలాంటి వీడియోలు చూడాలనుకోవడం లేదు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.👉 పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తతనీట్ పేపర్ లీక్పై CJP చేపట్టిన నిరసనల్లో భాగంగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.👉 లాఠీఛార్జ్ చేశారంటూ ఆరోపణలువిద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది. పలువురు గాయపడ్డారని తెలిపింది.👉 ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్పోలీసుల చర్యపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.👉 ‘కోర్టును ఇందులోకి లాగొద్దు’పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సూచన చేసింది. కేసును బుధవారం విచారణకు లిస్ట్ చేసింది. విచారణ జరగాల్సి ఉంది.👉 నిరసనలు కొనసాగుతున్నాయిజంతర్ మంతర్ వద్ద CJP ఆందోళనలు కొనసాగుతుండగా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.CJP హెచ్చరిక.. ఢిల్లీకి లక్షల మంది వస్తారుNEET పేపర్ లీక్ ఆరోపణలపై ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని CJP హెచ్చరిక.జూలై 20న జరిగిన నిరసన కేవలం ‘‘ట్రైలర్ మాత్రమే’’ అని CJP జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా వ్యాఖ్య.ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది ఢిల్లీకి తరలివస్తారని హెచ్చరిక.స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యమమని రంకా పేర్కొన్నారు.ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో నిరసనలు తప్పవని వ్యాఖ్య.జూలై 20 మార్చ్ పోలీసుల జోక్యం వరకు శాంతియుతంగానే సాగిందని ఆరోపణ.ఆందోళనకారులను హింసాత్మకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శ.పోలీసులు విద్యార్థులపై బలప్రయోగం చేయడంతోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.31 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా ఉద్యమం సాగుతోందని చెప్పారు.CJP–ప్రభుత్వం రెండో దఫా చర్చలు నేడుNEET-UG 2026 పేపర్ లీక్ వివాదంపై కొనసాగుతున్న CJP ఆందోళనలు.నేడు మధ్యాహ్నం 12 గంటలకు CJP–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు.జూలై 20న తొలిసారి CJP ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ.ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం సమర్పించిన CJP.కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా తొలగింపు కోరిన CJP.NEET పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.తొలి చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.CJP ఆందోళనకు TMC మద్దతుCJP చేపట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించిన TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీ.విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ స్పందన దురదృష్టకరమని వ్యాఖ్య.‘‘విద్యార్థుల మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు?’’ అని ప్రశ్న.ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై విమర్శలు చేసిన బెనర్జీ.పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు.నిరసనల్లో భద్రతా సిబ్బంది, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేశారు.జంతర్ మంతర్ పోలీస్ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో విచారణజంతర్ మంతర్లో విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యను సవాల్ చేస్తూ పిటిషన్.ఈ పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.జూలై 18న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించిన ఘటనపై అభ్యంతరం.పోలీస్ ఆపరేషన్పై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డులు భద్రపరచాలని కోరారు.శాంతియుత నిరసన హక్కును కాపాడేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి.భవిష్యత్లో నిరసనకారులపై విచక్షణారహిత పోలీస్ చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.CJP నిరసనలు.. 10 ఎఫ్ఐఆర్లు నమోదుఢిల్లీలో CJP నిరసనలకు సంబంధించి మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.న్యూఢిల్లీ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్లో 4, కన్నాట్ ప్లేస్లో 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.మండీర్ మార్గ్, బరాఖంబా రోడ్, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేశారు.నిరసనల సమయంలో హింస, రాళ్ల దాడి, విధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం వంటి అంశాలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.హింస ముందస్తు ప్రణాళికలో భాగమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఘటనలకు సంబంధించిన 250కిపైగా వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.👉 పార్లమెంట్లో చర్చకు సిద్ధం: కేంద్రంనీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.👉 ‘ఘోర పాపం’ అన్న ప్రధాని మోదీనీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యువత భవిష్యత్తో ఆడుకోవడం ‘ఘోర పాపం’ అని వ్యాఖ్యానించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.👉ఆయన రాజీనామా చేయాల్సిందే!నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్లు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే ఆందోళనలను విరమిస్తామని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలేవీ కనిపించడం లేదు. తొలిరోజు నిరసనల సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన నిరసనకారుల ప్రతినిధులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించినప్పటికీ.. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా తప్పు చేసినవాళ్లను జైల్లో పెట్టామని ప్రధాని మోదీ అంటుండగా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధమంటూ ధర్మేంద్ర ప్రదాన్ విపక్షాలకు స్పష్టం చేశారు. #WATCH | Delhi | Cockroach Janta Party (CJP) National Spokesperson Ashutosh Ranka says, "This is the biggest movement in India's post-independence history...We have said this very clearly, what happened on 20th was a trailer. If the Govt doesn't agree, millions more will come to… pic.twitter.com/YwBpgeGkXc— ANI (@ANI) July 22, 2026👉జంతర్ మంతర్లో మళ్లీ భారీగా చేరిన నిరసనకారులువర్షం కురుస్తున్నప్పటికీ CJP కార్యకర్తలు జంతర్ మంతర్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం ఉదయం ఆందోళనకారుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కొనసాగిస్తున్నారు.👉 CJP నేత వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అంటూ ఆరోపణCJP ప్రతినిధి సౌరవ్ దాస్ తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని ఆరోపించారు. తమ నిరసనల నేపథ్యంలోనే డిజిటల్ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే తమ సంస్థకు చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలు, వ్యవస్థాపకుడికి సంబంధించిన ఖాతాలు బ్లాక్ లేదా సస్పెండ్ అయ్యాయని CJP ఆరోపిస్తోంది.👉 పోలీసులపై రాళ్ల దాడి.. కేసు నమోదుమంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి జరిగిన ఘటనపై కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.👉 RAF వాహనంపై దాడికన్నాట్ ప్లేస్లో గుంపును చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. RAFకు చెందిన వజ్ర వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు సంయమనం పాటించారని అధికారులు తెలిపారు.👉 రాహుల్ గాంధీ నిరసన.. ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తతజంతర్ మంతర్ ఆందోళనకు దూరంగా ఉన్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వైపు నిరసనకు వెళ్లారు. పోలీసులు అడ్డుకుని రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు.👉భద్రత కట్టుదిట్టంజంతర్ మంతర్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత పెంచారు. -
దళంలోనే వేధింపులు.. నరకం చూశా
ఒకప్పుడు అడవుల్లో తుపాకీ పట్టుకుని తిరిగింది.. మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది.. కానీ ఇప్పుడు అదే దళాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయింది. కారణం.. బయటి శత్రువులు కాదు.. సంస్థలోనే ఎదురైన వేధింపులు, అనుభవాలేనని ఆమె చెప్పడం సంచలనంగా మారింది.ఝార్ఖండ్లోని గిరిడీహ్లో మావోయిస్టు పార్టీకి చెందిన మహిళా నేత అనిత కిస్కు అలియాస్ బబితా పోలీసుల ఎదుట లొంగిపోయారు. రూ.25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు అగ్రనేత అజయ్ మహతో అలియాస్ టైగర్ భార్య అయిన ఆమె.. దళంలో కొనసాగిన సమయంలో ఎదురైన వేధింపులు, గ్రామస్తులపై జరుగుతున్న హింస తనను తీవ్రంగా కలచివేశాయని వెల్లడించారు.భర్త అరెస్ట్ తర్వాతే..అనిత లొంగుబాటు వెనుక ఆమె భర్త అరెస్ట్ కీలక పరిణామంగా మారింది. మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్న అజయ్ మహతోను ఝార్ఖండ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. పారస్నాథ్ ప్రాంతంలో ఏరియా కమాండర్గా పనిచేసిన అజయ్పై హత్యలు, ఐఈడీ పేలుళ్లు, భద్రతా బలగాలపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి తీవ్ర కేసులు నమోదయ్యాయి. అతనిపై వివిధ జిల్లాల్లో 240కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. భర్త అరెస్ట్ అనంతరం అనిత కూడా హింసాత్మక మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.సాంస్కృతిక కార్యక్రమం నుంచి..బొకారో జిల్లాకు చెందిన అనిత కిస్కు వయసు సుమారు 30 ఏళ్లు. నాలుగో తరగతి వరకు చదువుకున్న ఆమెకు 2009లో ఓ సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా మావోయిస్టు సంస్థతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా దళంలో చేరిన ఆమె.. 2017లో అడవిలోనే అజయ్ మహతోను వివాహం చేసుకున్నట్లు తెలిపింది. పారస్నాథ్ జోన్, లుగు హిల్స్, జుమ్రా హిల్స్, కోల్హాన్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.Influenced by the #Jharkhand Government’s surrender and rehabilitation policy, Anita Kisku alias Babita Mahato, wife of hardcore #Maoist Ajay Mahato, surrenders before the Giridih Police. Giridih Superintendent of Police Dr. Bimal Kumar informed that Babita, who had been… pic.twitter.com/Q7uinWwKEH— All India Radio News (@airnewsalerts) July 21, 2026“గ్రామాల్లో భయాన్ని సృష్టించాల్సి వచ్చేది”దళంలో ఉన్న సమయంలో తనకు గ్రామాల్లో భయ వాతావరణం సృష్టించడం, లెవీ వసూళ్లు వంటి పనులు అప్పగించారని అనిత వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే కాలం గడిచేకొద్దీ మావోయిస్టు సంస్థలోని అంతర్గత వ్యవహారాలు, సీనియర్ నేతల వ్యవహారశైలి, సాధారణ ప్రజలపై జరుగుతున్న దాడులు తనను కలచివేశాయని ఆమె పేర్కొన్నారు. దీనికి తోడు దళ సభ్యుల నుంచే వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. గ్రామస్తులపై అనవసరంగా హింసకు పాల్పడటం, కార్యకర్తలపై ఒత్తిడి పెరగడం తనలో అసంతృప్తిని పెంచాయని.. చివరకు ఆ జీవితం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.15 కేసుల్లో నిందితురాలుఅనిత కిస్కుపై కూడా పలు తీవ్ర కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్య, దోపిడీ, పేలుడు పదార్థాల చట్టం, యూఏపీఏ, ఆయుధాల చట్టం కింద మొత్తం 15 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. జార్ఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నయీ దిశా – ఏక్ నయీ పహల్’ పునరావాస పథకం ద్వారా ఆమెను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.మావోయిస్టులకు పోలీసుల పిలుపుఅనిత లొంగుబాటు గిరిడీహ్, బొకారో, కోల్హాన్, సింగ్భూమ్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద ఎదురుదెబ్బ అని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా హింసా మార్గాన్ని వీడి మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని అధికారులు కోరారు. -
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్కు అతిపెద్ద రాజకీయ సవాల్గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్గా వెల్లడించారు. -
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఎన్టీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు.‘తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లీక్కు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని.. ఇప్పటివరకు 13 మంది నిందితులు జైలులో ఉన్నారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంనీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ పరీక్షకు ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని.. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను కూడా నిర్ణీత సమయంలో ప్రకటించామని తెలిపారు.పరీక్షా వ్యవస్థలో మార్పులపై దృష్టిపరీక్షా పత్రాల లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో మరింత పటిష్ఠమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పరీక్షల భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.ఎన్టీయే భేటీలో పలు అంశాలపై చర్చఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ వివాదంతో పాటు పార్లమెంట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారని తెలిపారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి తప్పుకోవడం లేదా కేంద్రం ఆయనను తప్పించడం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని పేర్కొంటూ.. తమ డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా అందజేసింది. ఆ డిమాండ్లపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా సీజేపీ నిరసనలపై స్పందించారు. యువత సమస్యలను ప్రభుత్వం వినాలని, నీట్ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
రాహుల్, ప్రియాంక గాంధీ విడుదల
కాక్రోచ్ జనతా పార్టీ తగ్గేదే లే అంటోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్పై పట్టు బట్టి కూర్చుంది. ఈ క్రమంలో రెండో రోజు ఇవాళ పార్లమెంట్ మార్చ్ నిర్వహించబోతోంది. దీంతో ఢిల్లీలో మరోసారి హైఅలర్ట్ నెలకొంది. -
త్రిపుర డీజీపీ ఆత్మహత్య
అగర్తలా: త్రిపుర డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) అనురాగ్ ఠాకూర్(60) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన సొంత ఆఫీసు ఛాంబర్ బాత్రూంలో ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు. ఠాకూర్ మరణ వార్త విని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జేకే సిన్హా,, ఆరోగ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టె తదితరులు ఆస్పత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అనురాగ్ ఠాకూర్ మృతిపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‘మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ అనురాగ్ ఠాకూర్ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు 12.48 గంటలకు ప్రకటించారు’అని గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి మెడిసిన్ డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ ప్రదీప్ భౌమిక్ వివరించారు. పోస్టుమార్టం అనంతరమే ఠాకూర్ మృతికి దారి తీసిన కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన అనురాగ్ ఠాకూర్కు భార్య, కుమార్తె ఉన్నారు. మేలో డీజీపీగా నియమితులైన ఠాకూర్ మరో 11 నెలల్లో రిటైరవ్వాల్సి ఉంది. #BreakingNews | #Tripura Director General of Police (DGP) Anurag Dhankar was found dead at his office at the Police Headquarters in Agartala on Monday.Preliminary reports suggest that the senior IPS officer allegedly died by suicide. However, the exact circumstances surrounding… pic.twitter.com/ks4KYnOB6Z— NORTHEAST TODAY (@NortheastToday) July 20, 2026 కాగా, రాష్ట్ర పోలీస్ చీఫ్ ఆఫీసులోనే చనిపోవడంపై ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా సీనియర్ ఐపీఎస్ ఆత్మహత్య పాల్పడటాన్ని చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ఆయన తీవ్ర ఒత్తిడులకు గురయ్యారు. అవేంటో వెల్లడికావాలి. ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలి. మృతికి కారణాలను వెల్లడించాలి’అని జితేంద్ర చౌదరి డిమాండ్ చేశారు. డీజీపీ అనురాగ్ ఠాకూర్ మరణంపై మెజిస్టీరియల్ దర్యాప్తు జరుగుతోందని, నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ అభిõÙక్ దేబ్రాయ్ తెలిపారు. -
పార్లమెంట్ ఆవరణలో కాక్రోచ్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే దేశ రాజధానిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్తో పార్లమెంట్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీ కారణంగా సాధారణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.నీట్ NEET పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ వైపు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ మార్చ్కు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించబోమని పేర్కొంటూ నిరసనకారులను అడ్డుకున్నారు.జంతర్మంతర్లో లాఠీచార్జ్.. ఉద్రిక్తతజంతర్మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా న్యూఢిల్లీ జిల్లాలో BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ఐదుగురు.. అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం నిషేధమని వెల్లడించారు.And it has finally begun. Security personnel using lathicharge to disperse crowd at CJP protest in Delhi. pic.twitter.com/JYTNKLq0Tj— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026పార్లమెంట్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్సీజేపీ నిరసన, భారీ భద్రతా ఏర్పాట్ల కారణంగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు, సిబ్బంది సైతం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.పని చేయని ఫోన్లు?ఇదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో కొంతసేపు మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదన్న ఫిర్యాదులు కూడా వినిపించాయి. దీంతో కొందరు ఎంపీలు, ఇతరులు కమ్యూనికేషన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిసింది. అయితే మొబైల్ సేవల అంతరాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మెట్రో స్టేషన్లు మూసివేత.. కట్టుదిట్టమైన భద్రతనిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్, జంతర్మంతర్, ఇతర కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. భద్రతా కారణాలతో రాజీవ్ చౌక్, జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.నిరసన వెనుక కారణాలివేనీట్ సహా పోటీ పరీక్షల్లో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలన్న లక్ష్యంతో ఉద్యమం చేపట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనం వాంగ్చుక్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే సీజేపీ ఈ ర్యాలీని చేపట్టింది.ఇటీవల వ్యంగ్య డిజిటల్ ఉద్యమంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ సంస్థ చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ పార్లమెంట్ సమావేశాల వేళ రాజకీయంగా వేడి పెంచింది. -
నెల రోజులుగా ఎన్నో జరిగాయి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సోమవారం సంసద్ భవన్(పార్లమెంట్) ఆవరణలో మీడియా ద్వారా మాట్లాడిన ఆయన.. ‘‘గత నెల రోజులుగా దేశంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిపై సభలో చర్చలు జరగాలి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ వేదిక కావాలి’’ అని అన్నారు. ఈ సందర్భంలో తాజా స్కైరూట్ విక్రమ్ ప్రయోగంపై ప్రశంసలు గుప్పించారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ సాధించిన విజయాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతరిక్షంలో నవశకం మొదలైందని.. స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం దేశానికే గర్వకారణమని అన్నారు. ‘‘కేవలం 28 ఏళ్ల యువకులు ఈ ఘనత సాధించారు. ఇది భారత యువశక్తికి, కొత్త ఆలోచనలకు నిదర్శనం’’ అని మోదీ పేర్కొన్నారు.56 ఏళ్ల యువకుడ్ని కాదు!అయితే ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. స్కైరూట్ బృందం సక్సెస్ను ప్రస్తావిస్తూ.. ‘‘నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన. రాహుల్ గాంధీ వయసు 56 ఏళ్లు కావడంతో.. మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతపై పరోక్ష సెటైర్గా భావిస్తున్నారు.సభ సజావుగా సాగాలి..పార్లమెంట్ సమావేశాలు రాజకీయ విభేదాలకు మాత్రమే పరిమితం కాకుండా.. దేశ ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎంపీలందరూ సహకరించి నిర్మాణాత్మక చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదనలు సహజమని.. అయితే సభా సమయం వృథా కాకుండా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడింది. అన్ని దేశాలు నష్టపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారాయన. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అయినా ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని అన్నారాయన. ఈ క్రమంలోనే హైడ్రోజన్తో నడిచే రైలును పరుగులు పెట్టించినట్లు మోదీ చెప్పారు. ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తివర్షాకాల సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చకు అవకాశం ఉండటంతో.. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రధాని కోరారు.Speaking at the start of the Monsoon Session of Parliament. May this session witness productive discussions that strengthen India's development journey. https://t.co/v25Vg62apy— Narendra Modi (@narendramodi) July 20, 2026 -
ఆమరణ దీక్షను విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్
విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆమరణ దీక్షను విరమించేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ సిద్ధమయ్యారు. ఆయన పిలుపు మేరకు మద్దతుదారులు, కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడికి సిద్ధమైన వేళ.. ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అయితే మూడు షరతులు నెరవేరిస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్చుక్ స్పష్టం చేశారు. జూన్ 28న ప్రారంభమైన వాంగ్చుక్ ఆమరణ దీక్ష 23వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న దీక్షను పోలీసులు ఇటీవల తొలగించి ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి చేతిరాతతో విడుదల చేసిన ఓ ప్రకటనలో వాంగ్చుక్.. దీక్ష ముగించేందుకు మూడు షరతులను వెల్లడించారు. విద్యా వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న వైఫల్యాలు, పేపర్ లీక్ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇవ్వాలని కోరారు. అలాకాకుంటే తన ఆరోగ్య పరిస్థితి కారణంగా దీక్ష కొనసాగించడం సాధ్యం కాకపోతే.. ఎంపీలు, రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి ఇదే హామీ ఇస్తే తాను ఉపవాస దీక్షను విరమిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన కదలికలు, మాట్లాడే స్వేచ్ఛ, కమ్యూనికేషన్పై ఆంక్షలు ఉన్నాయని వాంగ్చుక్ ఆరోపించారు.Activist Sonam Wangchuk tweets, "... I will end my fast on 20th July if:a. If the govt takes accountability of the recent failures in Education system, Paper leaks etc orb. If I and the leadership of CJP reach the doorsteps of Parliament where MPs and leaders of various… pic.twitter.com/XBAgvbkvkw— ANI (@ANI) July 20, 2026భార్య ప్రకటనలో రెండే!ఇదే సమయంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో కూడా ఆయన దీక్ష విరమణపై స్పందించారు. రాజకీయ నేతలు ఆయనను కలసి.. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై పార్లమెంట్లో చర్చకు హామీ ఇస్తే దీక్ష ముగిస్తారని ఆమె తెలిపారు.ఆమె వెల్లడించిన రెండు అంశాల్లో.. ఒకటి రాజకీయ నేతలు వాంగ్చుక్ను కలవడం, రెండోది విద్యా వ్యవస్థలో బాధ్యతపై పార్లమెంట్లో అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇవ్వడం. అయితే ఆ తర్వాత వాంగ్చుక్ స్వయంగా విడుదల చేసిన ప్రకటనలో ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలను కలిపి మూడు షరతులుగా వివరించారు.ప్రైవేటు ఆసుపత్రికి తరలింపుపై కోర్టు నిరాకరణవాంగ్చుక్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతరంగా తరలించేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీర్ఘకాల ఉపవాసం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య పర్యవేక్షణ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, బలవంతపు చర్యలు జరుగుతున్నాయని ప్రాథమికంగా భావించలేమని పేర్కొంది. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.నేడు ‘చలో సంసద్’.. ఢిల్లీలో భారీ భద్రతమరోవైపు వాంగ్చుక్ మద్దతుదారులు సోమవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న రోజే ఈ కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమతి లేకుండా ఎలాంటి మార్చ్కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ ప్రాంతంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు చేశారు. జంతర్మంతర్, పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు.వైద్యుల పర్యవేక్షణలో వాంగ్చుక్దాదాపు మూడు వారాలుగా ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్చుక్ 10 కేజీల బరువు కోల్పోయారు. బలహీనత, డీహైడ్రేషన్కు గురయ్యారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. రక్త పరీక్షలు, ఇతర ఆరోగ్య సూచికలను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నీట్ ప్రశ్నపత్రం లీక్ వంటి అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని వాంగ్చుక్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమణ ప్రకటన, ‘చలో సంసద్’ కార్యక్రమం దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. -
ఎల్ నినో నుంచి ఊరట? నైరుతి రీ ఎంట్రీ! వర్షాలు ఎక్కడంటే..
వర్షాల కోసం ఎదురుచూస్తున్న దేశానికి ఊరటనిచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. జూలైలో కొంత మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని దాదాపు మూడింట రెండొంతుల ప్రాంతాన్ని మేఘాలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాలకు కొత్త ఊపునివ్వనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.జూలై 19న ఇస్రోకు చెందిన ఇన్శాట్-3డీఆర్ (INSAT-3DR) ఉపగ్రహం తీసిన చిత్రాల విశ్లేషణలో దేశ భూభాగంలో దాదాపు 60 నుంచి 70 శాతం ప్రాంతం మేఘాలతో కప్పుకున్నట్లు కనిపించింది. జమ్మూకశ్మీర్ నుంచి గంగా మైదానాల మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు భారీ మేఘాలు విస్తరించాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోనూ వర్షాలను మోసుకొచ్చే మేఘాలు కదులుతున్నాయి. మరోవైపు అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు రావడంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో కూడా మేఘాల ప్రభావం కనిపిస్తోంది.అయితే ఉపగ్రహ చిత్రాల్లో మేఘాలు కనిపించడమే ప్రతిచోటా భారీ వర్షాలు పడతాయని అర్థం కాదు. కొన్ని ప్రాంతాల్లో మేఘాలు ఉన్నా అవి కేవలం వాతావరణాన్ని చల్లబరిచే స్థాయిలోనే ఉంటాయి. భారీ వర్షాలు కురవాలంటే మేఘాల ఎత్తు, వాటిలోని తేమ, గాలుల వేగం వంటి అంశాలు కీలకంగా మారతాయి. ప్రస్తుతం అత్యంత చల్లటి మేఘ శిఖరాలు కనిపిస్తున్న ప్రాంతాల్లోనే భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వానలు నమోదయ్యే అవకాశం ఉంది.జూలైలో రుతుపవనాలు బలహీనపడటానికి ప్రధాన కారణం బ్రేక్ మాన్సూన్ దశ. సాధారణంగా ఈ సమయంలో రుతుపవన ద్రోణి ఉత్తర దిశగా హిమాలయాల వైపు కదులుతుంది. దీంతో మధ్య భారతం, ఉత్తర మైదానాల్లో వర్షాలు తగ్గిపోతాయి. అదే సమయంలో హిమాలయాల పాద ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతాయి. ఈసారి కూడా ఇదే పరిస్థితి కనిపించింది. గంగా మైదానాలు, మధ్య భారతంలోని అనేక ప్రాంతాలు వర్షాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.ఇప్పుడు పరిస్థితి మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తాజా అల్పపీడన వ్యవస్థ రుతుపవనాలను మళ్లీ చురుగ్గా మార్చనుంది. సముద్రం నుంచి తేమ గాలులను తనవైపు లాగుకునే ఈ వ్యవస్థ తూర్పు తీరం నుంచి మధ్య భారతం వైపు కదిలే అవకాశం ఉంది. దీంతో రుతుపవన ద్రోణి మళ్లీ సాధారణ స్థానానికి చేరుకుని విస్తృత వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.ఈ వారం ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే చురుగ్గా ఉన్న రుతుపవనాలు మరింత బలపడే సూచనలు ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంటుంది.ఈ వర్షాల ప్రభావం ఒక్కరోజుకే పరిమితం కాకుండా దాదాపు 3 నుంచి 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన వ్యవస్థ కదలిక, రుతుపవన ద్రోణి స్థితిని బట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగవచ్చు. ముఖ్యంగా మధ్య, ఉత్తర, తూర్పు భారతంలో విస్తృత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో మరింత ఎక్కువ కాలం వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో వర్షాలు ఉండవు. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులతోనే సరిపోవచ్చు.ఉత్తర భారత మైదానాలకు కూడా ఈ వర్షాలు కొంత ఉపశమనం ఇవ్వనున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో ఈ వారం విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఊరటనివ్వనున్నాయి. మధ్య భారతంలోనూ వర్షాల జోరు పెరగనుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భ, తూర్పు మహారాష్ట్ర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగు వేగం పుంజుకోవడానికి ఈ వర్షాలు కీలకంగా మారనున్నాయి.ఇటు దక్షిణ భారతంలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక తీర ప్రాంతాలు, కొంకణ్ ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దక్షిణ ద్వీపకల్పంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో వర్షాలు ఉండకపోవచ్చు.మరోవైపు పశ్చిమ రాజస్థాన్, తమిళనాడులోని కొన్ని అంతర్గత ప్రాంతాలు, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో మేఘాల కదలిక పరిమితంగా ఉండటంతో పొడి వాతావరణం కొనసాగవచ్చు.ఎల్ నినో పరిస్థితి ఏంటి?ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కూడా చర్చనీయాంశంగా మారింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఏర్పడే ఎల్ నినో సాధారణంగా భారత రుతుపవనాలను బలహీనపరిచే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పట్టింది. దీంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. అయితే రుతుపవనాల తీరును ఎల్ నినో ఒక్కటే నిర్ణయించదు. సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, అల్పపీడనాల సంఖ్య వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.జూలైలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు కొనసాగుతోంది. సాధారణంగా ఈ కాలంలో 323.1 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 244.6 మిల్లీమీటర్ల వర్షమే నమోదైనట్లు అంచనాలు చెబుతున్నాయి. వర్షాలు తగ్గడంతో భూమి వేడెక్కి, గాలిలో తేమ పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా మారింది. వర్షాలు లేకపోయినా తేమ తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.ప్రస్తుతం కురిసే వర్షాలు రైతులకు ఎంతో కీలకంగా మారనున్నాయి. వరి, పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాల సాగుకు ఈ వర్షాలు ఊతమివ్వనున్నాయి. అయితే జూలైలో ఏర్పడిన వర్ష లోటు పూర్తిగా భర్తీ కావాలంటే ఆగస్టులోనూ రుతుపవనాలు స్థిరంగా కొనసాగాల్సి ఉంటుంది.మొత్తంగా చూస్తే.. ఎల్ నినో ప్రభావం కాస్త తగ్గడం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం, ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో విస్తృతంగా మేఘాలు కనిపించడం.. ఇవన్నీ రుతుపవనాలు మళ్లీ బలపడుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ వారం దేశంలోని పలు ప్రాంతాలకు వానల ఊరట లభించే అవకాశం ఉంది. అయితే ఆగస్టులో రుతుపవనాల ప్రదర్శనే ఈ ఏడాది వర్షపాత తీరును నిర్ణయించనుంది. -
రీల్స్ రచ్చ.. యోగి సర్కార్కు అగ్నిపరీక్ష!?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ బరిలోకి దిగుతున్నారు. 2017లో తొలిసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. 2022లోనూ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని యోగి నాయకత్వానికి ప్రజా మద్దతు ఉందని నిరూపించింది. ఇప్పుడు 2027లోనూ అదే విజయ పరంపర కొనసాగించాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఎన్నికల ముంగిట సోషల్ మీడియా ప్రచారాలు కొత్త రాజకీయ చిక్కులను తెచ్చిపెడుతున్నాయి.రామ మందిరం.. అయోధ్య.. హిందుత్వం.. ఇవన్నీ బీజేపీ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన అంశాలు. అలాంటి అయోధ్యలోనే భక్తులు ఇచ్చిన విరాళాలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ వివాదం.. ఇప్పుడు రీల్స్, వీడియోల రూపంలో గ్రామీణ ప్రాంతాలకూ చేరుతోంది.అయితే ఈ చర్చ యోగి ప్రభుత్వంపై నేరుగా ప్రభావం చూపుతుందా? లేదంటే ఇది కేవలం ఆలయ ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన అంశంగానే మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఆసక్తికర ప్రశ్నగా మారింది.భక్తి అంశం.. రాజకీయ అస్త్రంగా మారుతుందా?అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విరాళాలు అందించారు. ప్రతి రూపాయి వెనుక భక్తి భావన ఉందని చాలామంది భావించారు. అలాంటి విరాళాల విషయంలో ఆరోపణలు రావడంతో కొందరు భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. “భక్తితో ఇచ్చిన డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి” అనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ వ్యవహారాన్ని ఆలయ ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన అంశంగానే చూస్తున్నారు. దీనికి నేరుగా యోగి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా చూడటం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు మాత్రం రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ.. ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చూస్తోంది.మళ్లీ తెరపైకి వచ్చిన పాత గాయంఅయోధ్య అంశంతో పాటు ఉత్తరప్రదేశ్లో మరోసారి చర్చకు వచ్చిన విషయం ఉన్నావ్ అత్యాచార కేసు. 2017లో సంచలనం సృష్టించిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే ఇటీవల ఆయనకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు, బెయిల్ ప్రయత్నాలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపాయి. మహిళా భద్రత, న్యాయ వ్యవస్థ, అధికార పార్టీ వైఖరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.ఈ అంశంపై వస్తున్న రీల్స్.. ముఖ్యంగా మహిళా భద్రతకు సంబంధించిన ప్రశ్నలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని యోగి ప్రభుత్వంపై విమర్శలకు ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీ మాత్రం చట్టం తన పని చేసిందని, కోర్టు ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రత్యక్ష పాత్ర ఉండదని చెబుతోంది.కుంభమేళ విషాదం కూడా..ఉత్తరప్రదేశ్లో మరో కీలక అంశం మహా కుంభమేళ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట విషాదం. కోట్లాది మంది భక్తులు పాల్గొన్న ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు, ప్రత్యక్ష దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రశ్నలు వచ్చాయి.అయితే మరోవైపు ఇంత భారీ జన సమూహాన్ని నిర్వహించడం సవాలుతో కూడుకున్నదని, ఇలాంటి ఘటనలను రాజకీయ కోణంలో మాత్రమే చూడకూడదని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఎన్నికల సమయంలో ప్రజల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే ఇలాంటి ఘటనలు సహజంగానే రాజకీయ చర్చలకు దారితీస్తాయి.రీల్స్ యుగంలో మారుతున్న రాజకీయాలుఒకప్పుడు రాజకీయ ప్రచారం సభలు, పత్రికలు, టీవీ చర్చలకే పరిమితమయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 30 సెకన్ల వీడియో.. ఒక వైరల్ రీల్.. లక్షల మందికి చేరే శక్తిని కలిగి ఉంది. ప్రభుత్వ విజయాలను చూపించే రీల్స్ ఎంత వేగంగా వ్యాపిస్తాయో.. సమస్యలను చూపించే వీడియోలు కూడా అంతే వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.యోగి ప్రభుత్వం రోడ్లు, మౌలిక వసతులు, శాంతిభద్రతలు, పెట్టుబడులపై తన విజయాలను ప్రచారం చేస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, మహిళా భద్రత వంటి అంశాలను సోషల్ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాయి.ఓటరు నిర్ణయాన్ని రీల్స్ మార్చగలవా?అయితే కేవలం సోషల్ మీడియా ప్రచారాలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా? అనేది మాత్రం ప్రశ్నగానే ఉంది. ఉత్తరప్రదేశ్ వంటి భారీ రాష్ట్రంలో కుల సమీకరణాలు, స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నాయకత్వంపై నమ్మకం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఒక వీడియోతో ఓటరు అభిప్రాయం పూర్తిగా మారిపోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అదే సమయంలో.. ఒక అంశాన్ని నిరంతరం ప్రజల చర్చలో ఉంచే శక్తి సోషల్ మీడియాకు ఉందని అంగీకరిస్తున్నారు.హ్యాట్రిక్ లక్ష్యానికి ముందు సో.మీ. పరీక్షయోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2027 ఎన్నికల్లో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న వేళ.. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల భావోద్వేగ అంశాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయోధ్య విరాళాల వివాదం, ఉన్నావ్ కేసు, కుంభమేళ ఘటన వంటి అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు యోగి ప్రభుత్వానికి రాజకీయ నష్టంగా మారాయని చెప్పలేం. కానీ ఎన్నికల వరకు ఈ అంశాలు ఎలా ప్రయాణిస్తాయి? ప్రజల మనసుల్లో ఎలాంటి ముద్ర వేస్తాయి? అన్నదే అసలు పరీక్ష. -
ఢిల్లీ కొత్త పోలీస్ బాస్.. ఎవరీ అనురాగ్ కుమార్?
దేశ రాజధాని ఢిల్లీ పోలీస్ కమిషనర్గా అనురాగ్ కుమార్ నియమితులయ్యారు. సాధారణ పోలీస్ అధికారి కాకుండా.. దేశ అత్యంత కీలక నిఘా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహించిన అధికారి ఇప్పుడు ఢిల్లీ భద్రతా వ్యవస్థకు నాయకత్వం వహించబోతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పోలీసింగ్, ఇంటెలిజెన్స్ అనుభవం ఉన్న ఆయన నియామకం ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ కుమార్ ఏజీఎంయూటీ కేడర్కు చెందినవారు. కేంద్ర నియామకాల కమిటీ ఆమోదంతో ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన సతీష్ గోల్చా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.దేశ రాజధాని పోలీస్ చీఫ్ పదవి అత్యంత సున్నితమైన బాధ్యతగా భావిస్తారు. ఎందుకంటే ఢిల్లీలో పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, సుప్రీంకోర్టు, విదేశీ రాయబార కార్యాలయాలు, కీలక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ శాంతిభద్రతల నిర్వహణతో పాటు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను కూడా సమర్థంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.ఐబీలో కీలక పాత్ర.. భద్రతా వ్యూహాల్లో అనుభవంఅనురాగ్ కుమార్ తన కెరీర్లో ఎక్కువ కాలం భద్రత, నిఘా రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్గా పనిచేసిన ఆయనకు దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలపై లోతైన అవగాహన ఉంది. ఐబీలో పనిచేసిన సమయంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సున్నితమైన భద్రతా అంశాలు, ఇంటెలిజెన్స్ సేకరణ, విశ్లేషణ వంటి కీలక విభాగాలను పర్యవేక్షించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించే విధానంలో ఆయనకు ప్రత్యేక అనుభవం ఉంది.ఇదే అనుభవం ఇప్పుడు ఢిల్లీ పోలీస్కు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. దేశ రాజధానిలో ఉగ్రవాద ముప్పు, అంతర్జాతీయ స్థాయి భద్రతా సవాళ్లు ఉన్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నేపథ్యం ఉన్న అధికారి నియామకానికి ప్రాధాన్యత ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.ఇంజినీర్ నుంచి ఐపీఎస్ అధికారి వరకుఅనురాగ్ కుమార్ విద్యాపరంగా ఇంజినీరింగ్ పట్టా పొందారు. ఆ తర్వాత సివిల్ సర్వీసుల ద్వారా పోలీస్ శాఖలోకి వచ్చారు. 1994లో ఐపీఎస్గా ఎంపికైన ఆయన మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో సేవలందించారు. పోలీసింగ్తో పాటు పరిపాలన, భద్రతా నిర్వహణ, దర్యాప్తు వ్యవస్థల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా 2010లో పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అందుకున్నారు.ముందున్న అతిపెద్ద సవాళ్లుఢిల్లీ పోలీస్ కమిషనర్గా అనురాగ్ కుమార్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడం ఆయనకు తొలి ప్రాధాన్యతగా మారనుంది. దేశ రాజధాని ఎప్పుడూ ఉగ్రవాద సంస్థల లక్ష్యంగా ఉండే అవకాశం ఉండటంతో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సి ఉంటుంది. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాలు మరో పెద్ద సవాల్. ఆన్లైన్ మోసాలు, డిజిటల్ నేరాలు కొత్త రూపాల్లో విస్తరిస్తున్న సమయంలో సైబర్ క్రైమ్ నియంత్రణకు ఆధునిక వ్యూహాలు అవసరం కానున్నాయి. మహిళల భద్రత కూడా ఢిల్లీలో కీలక అంశమే. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పించడం, పోలీసుల స్పందన వేగాన్ని పెంచడం ఆయన ముందున్న మరో బాధ్యత.దేశ రాజధాని రీజియన్లో పెరుగుతున్న సంఘటిత నేరాలు, గ్యాంగ్స్టర్ నెట్వర్క్లు, మాదకద్రవ్యాల రవాణా వంటి అంశాలపై కూడా ఆయన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో వీఐపీ భద్రత, కీలక ప్రాంతాల రక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంటుంది.‘ఇంటెలిజెన్స్ మైండ్’తో ఢిల్లీ పోలీస్లో మార్పులు వస్తాయా?అనురాగ్ కుమార్ నియామకంలో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఆయనకు ఉన్న ఇంటెలిజెన్స్ నేపథ్యం. సాధారణ పోలీసింగ్తో పాటు ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతికత వినియోగాన్ని పెంచడం, భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది.దేశ రాజధాని భద్రత కేవలం నేర నియంత్రణకు పరిమితం కాదు. అది దేశ ప్రతిష్ట, అంతర్గత భద్రతతో ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన అనురాగ్ కుమార్ ఢిల్లీ పోలీస్ను ఏ దిశగా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.మూడు దశాబ్దాల పోలీసింగ్ అనుభవం.. ఐబీలో పదునైన భద్రతా వ్యూహాలు.. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ పగ్గాలు. దేశ రాజధాని భద్రతకు అనురాగ్ కుమార్ నియామకం ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. -
20వ రోజుకు వాంగ్చుక్ దీక్ష.. వైద్యుల హెచ్చరిక!
దేశ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, అలాగే లడఖ్ సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతోంది. ఆయన దీక్ష నేటితో(శుక్రవారం)20వ రోజుకు చేరుకోగా.. వైద్యులు తాజా హెల్త్ అప్డేట్ రిలీజ్ చేశారు. శరీరంలో కీలక మార్పులు మొదలయ్యాయని.. పరిస్థితి మరింత దిగజారితే అవయవాల పనితీరుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.తాజా వైద్య నివేదిక ప్రకారం.. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి వాంగ్చుక్ 9 కిలోలకు పైగా బరువు తగ్గి ప్రస్తుతం 56.9 కిలోలకు చేరుకున్నారు. దీర్ఘకాల ఉపవాసంలో శరీరం మొదట గ్లూకోజ్ నిల్వలను ఉపయోగించుకుంటుందని, ఆ తర్వాత కొవ్వు, కండరాలను కరిగించడం ప్రారంభిస్తుందని వైద్యులు తెలిపారు. ఆయనలో కీటోన్ స్థాయి పెరగడం, యూరిక్ యాసిడ్ పెరిగిన స్థాయిలో నమోదవడం లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే తదుపరి దశలో గుండె, మూత్రపిండాలు వంటి కీలక అవయవాలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్ నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. పరీక్షల పేపర్ లీకులు, నీట్ వ్యవహారంలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణించడంతో.. వ్యవహారం కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించింది. వాంగ్చుక్కు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. ఆయన ప్రాణం విలువైనదని, అన్ని రకాల వైద్య చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ఫోర్స్ ఫీడింగ్(బలవంతంగా ఆహారం అందించాలని) కోర్టు సూచించింది.తగ్గేదే లే అంటున్న వాంగ్చుక్తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి వాంగ్చుక్ భరోసా ఇచ్చారు. తనకు బాగానే ఉందంటూ ప్రకటించారు. వైద్య పరీక్షల్లో పెద్ద సమస్యలు బయటపడలేదని.. మద్దతుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా దీక్ష విరమిస్తే తప్పుడు సందేశం వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. జూలై 20న నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్ను విజయవంతం చేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.పెరుగుతున్న మద్దతు.. వాంగ్చుక్ ఆరోగ్యంపై రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్కు వెళ్లి వాంగ్చుక్కు సంఘీభావం తెలిపారు. ప్రతి ఏడాది పేపర్ లీక్లతో యువత నష్టపోతున్నారని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వినాలని కేజ్రీవాల్ కోరారు. మరోవైపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా వాంగ్చుక్ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసింది.సినీ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. జూలై 20న చేపట్టనున్న పార్లమెంట్ మార్చ్లో సుమారు 1.5 లక్షల మంది పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని నిరసనకారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తానని సోనమ్ వాంగ్చుక్ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. -
కుండంకుళం రియాక్టర్లో డేటా లీక్ కలకలం
భారత్లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటైన కుండంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్కు సంబంధించిన డేటా లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. హ్యాకర్లు ‘వరల్డ్ లీక్స్’ డార్క్వెబ్లో వేల సంఖ్యలో పత్రాలను విడుదల చేసినట్లు వెలుగులోకి రావడంతో సైబర్ భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఈ ఘటన వల్ల ఏం జరగలేదని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) చెబుతోంది. కుండంకుళం ప్రాజెక్టుకు(KKNPP) సంబంధించిన దాదాపు 19 వేల ఫైల్స్ (సుమారు 14.3 జీబీ డేటా) డార్క్వెబ్లో ప్రత్యక్షమైనట్లు సమాచారం. వీటిలో ఇంజినీరింగ్ డాక్యుమెంట్లు, కొన్ని డిజైన్లు, సరఫరాదారుల వివరాలు, తనిఖీ నివేదికలు, పరికరాల సమాచారానికి సంబంధించిన పత్రాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ డేటా అంతా నేరుగా కుండంకుళం అణు కేంద్రం నుంచి దొంగిలించిందా? లేదంటే దానికి సంబంధించిన ఓ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిందా? అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.థర్డ్ పార్టీ సర్వర్ నుంచే లీక్?ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ సైబర్ దాడి కుండంకుళం ప్లాంట్ ప్రధాన వ్యవస్థలపై కాకుండా.. ఓ థర్డ్ పార్టీ సర్వర్పై జరిగినట్లు తెలుస్తోంది. కుండంకుళం యూనిట్లు 3, 4 నిర్మాణ పనుల్లో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ సంస్థకు చెందిన డేటా.. ఓ థర్డ్ పార్టీ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ యొట్టా డేటా సర్వీసెస్ (Yotta Data Services) సర్వర్లో ఉన్నట్లు సమాచారం. ఆ సర్వర్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినట్లు యొట్టా తెలిపింది. ఇటు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తమ డేటాలో “పాక్షిక ఉల్లంఘన (partial breach)” జరిగినట్లు అంగీకరించి.. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ([Reuters][2])అణు వ్యవస్థలు భద్రంగానే!డేటా లీక్ వార్తలతో అణు భద్రతపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ.. NPCIL కీలక వివరణ ఇచ్చింది. లీక్ అయినట్లు చెబుతున్న సమాచారం అణు భద్రత (nuclear safety), అణు రక్షణ (nuclear security) వ్యవస్థలకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. సాధారణ మౌలిక సదుపాయాలు, నిర్మాణ పనులకు సంబంధించిన సమాచారమే బయటకు వచ్చిందని పేర్కొంది. అంటే రియాక్టర్ నియంత్రణ వ్యవస్థలు, అణు ఇంధన నిర్వహణ వంటి అత్యంత కీలక విభాగాలు ప్రభావితం కాలేదని అధికారులు చెబుతున్నారు.హ్యాకర్ల లక్ష్యం ఏంటి?సైబర్ నిపుణుల ప్రకారం.. రాన్సమ్వేర్ దాడుల్లో హ్యాకర్లు సాధారణంగా సంస్థల నుంచి డేటాను దొంగిలించి.. డబ్బు డిమాండ్ చేయడం లేదంటే తమ సామర్థ్యాన్ని చూపించేందుకు సమాచారాన్ని బహిర్గతం చేయడం చేస్తుంటారు. అయితే కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏ చిన్న సమాచారం బయటకు వచ్చినా.. భవిష్యత్ భద్రతా అంచనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల రంగంలోకి..ఈ ఘటనపై కేంద్ర సైబర్ భద్రతా సంస్థలు, సంబంధిత విభాగాలు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. లీక్ అయిన డేటా అసలు ఏమిటి? ఎంత మేరకు సున్నితమైన సమాచారం బయటకు వెళ్లింది? హ్యాకర్లు ఎలా యాక్సెస్ పొందారు? అనే అంశాలపై పరిశీలన జరుగుతోంది. సైబర్ భద్రత కొత్త సవాల్?అణు విద్యుత్ కేంద్రాలు దేశ భద్రతలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలు. గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. కుండంకుళం ఘటనలో రియాక్టర్ వ్యవస్థలు ప్రభావితం కాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. కీలక రంగాల్లో పనిచేసే సంస్థలు, కాంట్రాక్టర్ల డేటా భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.కుండంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (KKNPP) తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉన్న భారతదేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటి. భారత్–రష్యా సహకారంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో రష్యా తయారీ VVER-1000 ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండు యూనిట్లు వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.. ఒక్కో యూనిట్ సామర్థ్యం 1,000 మెగావాట్లు కాగా మొత్తం సామర్థ్యం 2,000 మెగావాట్లు. దేశ దక్షిణ గ్రిడ్కు కీలక విద్యుత్ వనరుగా ఉన్న ఈ ప్లాంట్.. భవిష్యత్లో మరిన్ని యూనిట్ల విస్తరణకు కూడా ప్రణాళికలు కలిగి ఉంది. అణు భద్రత, కఠినమైన నియంత్రణ ప్రమాణాలతో పనిచేసే ఈ కేంద్రం భారత ఇంధన రంగంలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.తాజా సైబర్ ఎటాక్తో అణు కేంద్రం సురక్షితమేనా? అనే ప్రశ్నకు అధికారులు భరోసా ఇస్తున్నా.. సైబర్ దాడుల ముప్పు మాత్రం పెరుగుతున్న సంకేతాలు ఈ ఘటనతో మరోసారి స్పష్టమయ్యాయి. -
గగన్యాన్ వేళ ఇస్రోకు షాక్.. రాజీనామాల కలకలం
చంద్రయాన్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రోకు ఇప్పుడు మరో సవాల్ ఎదురైంది. గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లు ముందున్న సమయంలో.. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల రాజీనామాలు చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలపై అప్రమత్తమైన కేంద్రం.. కీలక సిబ్బంది ఎగ్జిట్పై కట్టడి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల నిష్క్రమణ అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇస్రో వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. ఇటీవల కాలంలో 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు సంస్థను వీడి ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC), తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి ఎక్కువ మంది నిపుణులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో ఉపగ్రహాలు, రాకెట్లు, మానవ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కీలక విభాగాల్లో పనిచేసిన శాస్త్రవేత్తలు ఉన్నట్లు సమాచారం.అప్రమత్తమైన కేంద్రంఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష శాఖ (Department of Space) అప్రమత్తమైంది. గగన్యాన్ సహా దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి దరఖాస్తులను సాధారణంగా ఆమోదించకుండా.. ఉన్నత స్థాయి పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇస్రో కేంద్రాలకు సూచించినట్లు తెలుస్తోంది.ఇస్రో బలం కేవలం సాంకేతిక పరికరాలు కాదు.. వాటిని అభివృద్ధి చేసే శాస్త్రవేత్తల అనుభవం. ఒక రాకెట్ ప్రయోగం విజయవంతం కావడానికి వెనుక ఏళ్ల తరబడి సాగే పరిశోధనలు, వందలాది పరీక్షలు, ఎన్నో వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. గగన్యాన్ మిషన్ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అంతేకాదు.. భవిష్యత్లో భారత అంతరిక్ష కేంద్రం, మరిన్ని చంద్ర అన్వేషణ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు బయటకు వెళ్లడం సంస్థకు సవాల్గా మారింది. నిపుణుల స్థానాల్లో కొత్త వారిని నియమించడం సాధ్యమే అయినా.. ఒక నిర్దిష్ట మిషన్పై సంవత్సరాల పాటు పనిచేసిన వారి అనుభవాన్ని వెంటనే భర్తీ చేయడం అంత తేలిక కాదు.నిష్క్రమణకు కారణం ఏంటంటే.. ఇస్రో నుంచి శాస్త్రవేత్తల నిష్క్రమణకు ప్రధాన కారణంగా ప్రైవేట్ స్పేస్ రంగం విస్తరణ కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో భారత్లో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు పెరిగాయి. రాకెట్లు, ఉపగ్రహాలు, స్పేస్ టెక్నాలజీలపై పనిచేసే స్టార్టప్లు వేగంగా ఎదుగుతున్నాయి. ఇస్రోలో సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకు ఈ సంస్థల్లో అధిక వేతనాలతో పాటు కొత్త ప్రయోగాల్లో భాగస్వామ్యం, నిర్ణయాధికారం, కొన్నిసార్లు సంస్థల్లో వాటాల అవకాశాలు కూడా లభిస్తున్నాయి. దీంతో కొందరు శాస్త్రవేత్తలు కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇస్రోలో ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం సంఖ్య కాదు.. నాణ్యత. ఒక ప్రాజెక్ట్కు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త వెళ్లిపోతే.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కొత్త వ్యక్తికి సంవత్సరాల అనుభవం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే గగన్యాన్, ఇతర జాతీయ ప్రాధాన్యత కలిగిన మిషన్లలో పనిచేసే గ్రూప్-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలను నేరుగా కేంద్ర అంతరిక్ష శాఖ పరిశీలించేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని స్థాయిల వరకు ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకే రాజీనామాలు ఆమోదించే అధికారం ఉండేది. ఇప్పుడు కీలక మిషన్లకు సంబంధించిన సిబ్బంది విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.ఇస్రో చీఫ్ ఏమన్నారంటే.. శాస్త్రవేత్తల రాజీనామాలపై ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ.. సంస్థ నుంచి ఉద్యోగులు వెళ్లడం సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఒకరి స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే కీలక ప్రాజెక్టులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.స్పేస్ రేసులో భారత్కు కొత్త పరీక్షఅంతరిక్షంలో భారత్ కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమవుతున్న వేళ.. ఇస్రోలో కొనసాగుతున్న ఈ టాలెంట్ ఎగ్జిట్ను సంస్థ ఎలా ఎదుర్కొంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రయాన్ విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. ఇప్పుడు గగన్యాన్ వంటి చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను నిలుపుకోవడం సంస్థ ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది -
జడ్జి పదవిలో ఉంటూ సైడ్ బిజినెస్?
న్యాయ పీఠం అంటే కేవలం ఓ పదవి కాదు.. అది విశ్వాసానికి ప్రతీక. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై సమాజంలో అత్యున్నత నమ్మకం ఉంటుంది. అందుకే వారి వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకత, నైతికతకు పెద్దపీట వేయడం ఆనవాయితీ. అలాంటి విలువలకే ఓ న్యాయమూర్తి తిలోదకాలు ఇచ్చారనే వ్యవహారం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దేశాన్ని కుదిపేసిన నోట్ల కట్టల జడ్జి ఘటన మరువక ముందే వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలోకి వెళ్తే.. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, మణిపూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్కు చెందిన ‘కిచెన్ ఫ్లేమ్’ ఎల్పీజీ డీలర్షిప్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనూ ఈ డీలర్షిప్ కొనసాగిందన్న అంశంపై వివాదం రేగింది. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ 2008లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 అక్టోబర్లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. 2024 నవంబర్లో పదవీ విరమణ చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు రాజ్యాంగబద్ధమైన న్యాయ పదవుల్లో కొనసాగిన సమయంలోనే గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ కొనసాగిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.న్యాయ పదవి.. వ్యాపార సంబంధం.. ఏంటి తప్పా?రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు వ్యక్తిగత వ్యాపారాలు, ఆర్థిక ప్రయోజనాలకు దూరంగా ఉండాలన్న నైతిక ప్రమాణాలు ఉన్నాయి. ప్రయోజన సంఘర్షణ (Conflict of Interest)కు అవకాశం లేకుండా వారి ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. కానీ, జస్టిస్ మృదుల్ విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ‘కిచెన్ ఫ్లేమ్’ ఏజెన్సీకి సంబంధించి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో డీలర్షిప్ ఒప్పందాలు పలుమార్లు రెన్యువల్ అయ్యాయి. 1995, 2005, 2010, 2015 సంవత్సరాల్లో ఒప్పందాల పునరుద్ధరణతో పాటు 2025లోనూ ఒప్పందం కొనసాగినట్లు సమాచారం. అయితే న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో ఈ వ్యాపార సంబంధం కొనసాగడం నిబంధనలకు విరుద్ధమా? అనే అంశంపై బీపీసీఎల్ వివరణ కోరింది.నోటీసులు.. స్పందన లేక సస్పెన్షన్ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన బీపీసీఎల్.. 2025 డిసెంబర్లో వచ్చిన ప్రజా ఫిర్యాదును ఆధారంగా చేసుకుని జస్టిస్ మృదుల్కు నోటీసులు జారీ చేసింది. న్యాయ పదవిలో ఉన్న సమయంలో ఎల్పీజీ డీలర్షిప్ కొనసాగించడం, ఆ సమయంలో అవసరమైన అనుమతులు తీసుకున్నారా? డీలర్షిప్ ఒప్పంద నిబంధనలు పాటించారా? అనే అంశాలపై సంస్థ వివరణ కోరింది. జనవరి 30, ఫిబ్రవరి 26 తేదీల్లోనూ బీపీసీఎల్ నుంచి లేఖలు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులకు సమాధానం రాకపోవడంతో.. జూలై 6న ‘కిచెన్ ఫ్లేమ్’ డీలర్షిప్ను సస్పెండ్ చేసి పారేసింది.మోనికా పిటిషన్.. కొత్త మలుపుఈ వ్యవహారంలో మరో కోణం కూడా తెరపైకి వచ్చింది. ‘కిచెన్ ఫ్లేమ్’ ఎల్పీజీ ఏజెన్సీని నిర్వహిస్తున్న దీపక్ యాదవ్ మరణం తర్వాత.. ఆయన భార్య మోనికా యాదవ్ డీలర్షిప్ యాజమాన్య మార్పు (reconstitution of proprietorship) కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గతంలో బీపీసీఎల్ను ఆదేశించింది. అయితే ఆ తర్వాత ఏజెన్సీని బీపీసీఎల్ సస్పెండ్ చేయడంతో మోనికా మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాను అన్ని నిబంధనలు పాటించినప్పటికీ.. మాజీ యజమాని జస్టిస్ మృదుల్, బీపీసీఎల్ చర్యల కారణంగా తాను నష్టపోతున్నానని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.న్యాయవ్యవస్థపై వరుస వివాదాలుఈ వివాదంపై జస్టిస్ మృదుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదే సమయంలో. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం మరోసారి న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన అధికారిక నివాసంలో నగదు కట్టలు బయటపడిన ఘటన అనంతరం.. పార్లమెంట్ ద్వారా తొలగింపు ప్రక్రియ(అభిశంసన) ప్రారంభం కావడం, చివరకు ఒత్తిళ్లతో ఆయన జడ్జి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒకవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం.. మరోవైపు జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ ఎల్పీజీ ఏజెన్సీ వివాదం.. న్యాయమూర్తుల వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. న్యాయవ్యవస్థకు ప్రజల విశ్వాసమే ప్రధాన బలం. అందుకే ఉన్నత న్యాయ పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రతి అడుగు కూడా నైతిక ప్రమాణాల తూకంలోనే పరిశీలనకు వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్లో బిజీగా భార్య!
కర్ణాటకలోని ధార్వాడ్లో చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైద్యుడు ఇంట్లోనే హత్యకు గురి కాగా.. ఆయన ఎనిమిదేళ్ల కొడుకు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే.. ఈ కేసులో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. భర్త శవం, కొడుకు రక్తపు మడుగులో ఉండగా.. ఆ భార్య మాత్రం ఏం జరగలేదన్నట్లు ఫోన్ చూస్తూ తాపీగా కనిపించింది. ధార్వాడ్లోని బారాకోట్రి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ (45) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కూడా తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో డాక్టర్ కిరణ్, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు. భద్రత ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు.ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో వెలుగులోకి..డాక్టర్ కిరణ్కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆయన భార్య ప్రియాంకను సంప్రదించగా.. ఆమె మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత డ్యూటీకి వెళ్లారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె చెప్పిన సమాధానాలపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్కు చేరుకున్నారు. అక్కడ ఓ గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో పడి ఉండగా.. మరో గదిలో తీవ్ర గాయాలతో బాలుడు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.Shocking, horrifying & ruthless. A woman allegedly killed her doctor husband & stabbed her 8yr old son inside their #Dharwad apartment. As the child lay in a pool of blood fighting for life, mother was scrolling through her phone. @compolhdc rescued the boy & shifted to hospital. pic.twitter.com/RL5GO9fzEV— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) July 16, 2026భార్యపై అనుమానాలు.. విచారణఘటన తర్వాత పోలీసులు డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో ఆమె ఫోన్ చూస్తూ కనిపించిన దృశ్యాలు కూడా చర్చకు దారితీశాయి. అయితే హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యల తర్వాత ఆమె ప్రవర్తించిన తీరుతో మానసిక స్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు దారితీసిన పరిస్థితులు, దాడి జరిగిన సమయం, ఆయుధం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రముఖ వైద్య కుటుంబంలో విషాదండాక్టర్ కిరణ్ స్థానికంగా పేరున్న వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన భార్య ప్రియాంక కంటి వైద్యురాలు. ఇద్దరూ వైద్య వృత్తిలో ఉండగా.. ఇంట్లోనే ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, ఫోరెన్సిక్ నివేదికలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఆ షరతుకు ఒప్పుకుంటేనే ఎన్డీయేకు మద్దతు!!
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతల మధ్య అనూహ్య భేటీలు, మారుతున్న సమీకరణాలు అక్కడి రాజకీయాలను మరింత ఉత్కంఠగా మారుస్తుంటాయి. తాజాగా మరోసారి అలాంటి పరిణామమే తెరపైకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి మారే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు శరద్ పవార్ వర్గం సిద్ధమవుతోందన్న వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ మద్దతుకు ఓ షరతు ఉందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం లోక్సభ స్థానాల పెంపు కల్పిస్తేనే బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని ఎన్సీపీ వర్గాలు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ.. ఎన్డీఏకు దగ్గరవుతోందా? అనే చర్చ మొదలైంది.ప్రతిపక్ష కూటమికి షాక్?గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం అదే బిల్లుపై శరద్ పవార్ వర్గం భిన్నమైన వైఖరి తీసుకుంటే.. ప్రతిపక్ష ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.50 శాతం సీట్ల పెంపు ఉంటే మద్దతుఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ అంశంపై స్పందిస్తూ.. బిల్లులో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా స్పష్టమైన నిబంధనలు ఉంటే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. “అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపునకు అవకాశం కల్పిస్తే, అమలు విధానం స్పష్టంగా ఉంటే మద్దతు ఇస్తాం” అని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికీ నష్టం జరగకుండా లోక్సభ స్థానాలను పెంచేలా సవరణ తీసుకొస్తామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్డీఏలో భాగం కానప్పటికీ.. కీలక సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.అసలు డీలిమిటేషన్ బిల్లు ఏంటి?లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లుగా పిలుస్తున్న ఈ ప్రతిపాదనలో లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే అంశం ఉంది. అయితే జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రహస్య భేటీలతో పెరిగిన చర్చతాజా రాజకీయ పరిణామాలకు మరో కారణం ఎన్సీపీకి చెందిన రెండు వర్గాల నేతల కదలికలు. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో శరద్ పవార్ మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారా? ఎన్సీపీ రెండు వర్గాలు తిరిగి ఒక్కటయ్యే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే ఎన్సీపీ నేతలు మాత్రం ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.కాంగ్రెస్ ఆందోళనమరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఈ పరిణామాలపై స్పందిస్తూ.. శరద్ పవార్ ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని కోరారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.శరద్ పవార్ వ్యూహం ఏమిటి?మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ఎప్పుడూ వ్యూహాత్మక నిర్ణయాలకు పేరుగాంచారు. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న పార్టీలతోనూ అవసరానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మార్చుకోవడం ఆయన శైలిలో భాగమని విశ్లేషకులు చెబుతుంటారు. తాజా పరిణామాలు కేవలం ఒక బిల్లుపై మద్దతుకే పరిమితమా? లేదంటే భవిష్యత్ రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.డీలిమిటేషన్ బిల్లుపై వైఖరి మారితే.. అది మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ప్రతిపక్ష కూటమితో కలిసి నడుస్తున్న శరద్ పవార్ ఎన్సీపీ.. కీలక సమయంలో మిత్రపక్షాలకు హ్యాండ్ ఇస్తుందా? లేక షరతులతో కూడిన మద్దతుకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాలి. -
స్నానపు వీడియోతో వివాహితకు బ్లాక్మెయిల్!?
స్నానం చేస్తుండగా ఓ యువకుడు మహిళను రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియోతో ఆమెను లోబర్చుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసినా కుటుంబ పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యువకుడి ఆగడాలు మితిమీరిపోవడంతో.. అతడిని లేకుండా చేయాలని దంపతులు పథకం రచించారు. గుజరాత్లోని గాంధీనగర్లో తీవ్ర కలకలం రేపిన ఘటన వివరాల్లోకి వెళ్తే..గాంధీనగర్ జిల్లా పరిధిలోని కలొల్ ప్రాంతానికి చెందిన హార్దిక్ (20) కాలేజీ స్టూడెంట్. దాదాపు ఒకటిన్నర నెలల క్రితం ఓ మహిళ స్నానం చేస్తుండగా చాటుగా తన ఫోన్తో వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను మహిళను బెదిరించాడు. తనతో శారీరక సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. భయంతో ఆమె అతడి డిమాండ్లకు అంగీకరించింది.మహిళ భర్త ఫ్యాన్ రిపేర్లు, వైరింగ్ పనులు చేస్తుంటాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పదే పదే ఫోన్లో మాట్లాడడంపై గట్టిగా నిలదీశాడు. ఆమె జరిగింది చెప్పింది. అయితే పరువు పోతుందనే భయంతో అతను మౌనంగా ఉండిపోయాడు. అయితే ఈలోపు హార్ధిక్ మితిమీరి ప్రవర్తించాడు.ఇంటి ముందు నుంచి వెళ్లే సమయంలో మహిళను చూసి కన్ను కొట్టడం, అసభ్య సైగలు చేయడం ఆ భర్త భరించలేకపోయాడు. మొదట హార్దిక్ కుటుంబ సభ్యులతో పంచాయితీ పెట్టి విషయం చెప్పాలని దంపతులు భావించారు. అయితే.. విషయం బయటకు తెలిసిపోతుందని భావించారు. ఈలోపు హార్దిక్ చేష్టలు ఆ భర్తకు మరింత కోపం తెప్పించాయి. దీంతో అతన్ని హతమార్చాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.పథకం ప్రకారం జూలై 11 ఉదయం మహిళ హార్దిక్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. అంతకుముందే భర్త పని కోసం బయటకు వెళ్తున్నట్లు నటించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పిల్లలు స్కూల్కు వెళ్లిపోయారు. హార్దిక్ తన తండ్రికి ఫోన్ చేసి.. పర్బత్పురలో ఓ భూమి చూసేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే అతడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు.ఈలోపు.. హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి హార్దిక్ పరుగులు తీయబోయాడు. భర్త అతని ఛాతీ మీద కూర్చోగా.. భార్య కాళ్లు, చేతులు బలంగా పట్టుకుంది. తొలుత ఆమె స్కార్ప్తో, ఆ తర్వాత కరెంట్ వైర్లను మెడకు బిగించి హార్దిక్ను హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇంటికి తాళం వేశారు. సరాసరి స్కూల్కు వెళ్లి పిల్లలను తీసుకుని.. వివాహిత స్వస్థలానికి పారిపోయారు.మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో..హార్దిక్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కంగారుపడ్డ తండ్రి.. కలోల్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ హత్య బయటపడింది. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి మరణించినట్లు వెల్డి కావడంతో.. దంపతుల్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.హార్దిక్ వద్ద ఉన్న మొబైల్లోనే మహిళకు సంబంధించిన వీడియో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత భర్త ఆ ఫోన్ను పగలగొట్టి రోడ్డుపక్కన పడేసినట్లు సమాచారం. ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు నిందితులను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక నేరాల కేసుల్లో న్యాయస్థానాల వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక నేరాల తీవ్రతను అర్థం చేసుకోవడంలో న్యాయమూర్తులకు మరింత సున్నితత్వం అవసరమని స్పష్టం చేస్తూ.. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ కమిటీ రూపొందించిన నివేదికను సుప్రీంకోర్టు, అన్ని హైకోర్టుల వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇటీవల పట్నా హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ప్రస్తావించింది.మహిళ సల్వార్ తొలగించడం, ఛాతీపై నొక్కడం వంటి చర్యలు అత్యాచారయత్నంగా పరిగణించలేమని, అవి మహిళ గౌరవానికి భంగం కలిగించే నేరం కిందకు వస్తాయని పట్నా హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఇలాంటి అంశాల్లో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.ఈ వివాదం అసలు 2025 మార్చి 17న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మొదలైంది. ఓ బాలిక పైజామా తాడు లాగడం, ఛాతీని పట్టుకోవడం వంటి చర్యలు అత్యాచారయత్నం కిందకు వస్తాయా? అనే కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా విచారణ చేపట్టి.. లైంగిక నేరాల కేసుల్లో న్యాయమూర్తుల సున్నితత్వంపై పరిశీలనకు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో 2025 జూలై 9న పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి చర్చనీయాంశమైంది. 2008లో బిహార్లోని అమర్పూర్లో జరిగిన ఓ కేసులో.. ఫొటో స్టూడియో యజమాని ఓ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఫొటో తీసిన తర్వాత ఆమె తండ్రిని బయటకు పంపించి, తలుపు లోపల నుంచి గడియ పెట్టి దాడికి ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఆమె కేకలు విని తండ్రి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు కేసు వివరాల్లో ఉంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు నిందితుడిని అత్యాచారయత్నం, అక్రమ నిర్బంధం కింద దోషిగా తేల్చింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు పట్నా హైకోర్టును ఆశ్రయించాడు. కేసును పరిశీలించిన హైకోర్టు.. అత్యాచారయత్నాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు లేవని పేర్కొంది. వైద్య ఆధారాలు లేకపోవడం, దర్యాప్తు అధికారిని విచారణలో ప్రవేశపెట్టకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది. అయితే బాధితురాలిపై బలవంతంగా దాడి చేయడం, సల్వార్ తొలగించేందుకు ప్రయత్నించడం, ఛాతీపై నొక్కడం వంటి చర్యలు మహిళ గౌరవానికి భంగం కలిగించే నేరం కిందకు వస్తాయని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు అత్యాచారయత్నం కింద ఉన్న శిక్షను రద్దు చేసి, సంబంధిత సెక్షన్ కింద పరిగణించాలని సూచించింది.ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా.. పట్నా హైకోర్టు తమ గత ఆదేశాలను పరిగణనలోకి తీసుకుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. న్యాయమూర్తులు కూడా తీర్పులు ఇచ్చే ముందు సంబంధిత అంశాలపై అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. లైంగిక నేరాల కేసుల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నుంచి చార్జిషీట్ దాఖలు చేసే వరకు న్యాయ సున్నితత్వానికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ నివేదికను అన్ని కోర్టులకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.మహిళలపై లైంగిక నేరాల విచారణలో చట్టపరమైన ప్రమాణాలు, బాధితుల వాంగ్మూలాల ప్రాధాన్యత, నేర తీవ్రతను అర్థం చేసుకునే విధానం.. ఈ మూడు అంశాలపై న్యాయ వ్యవస్థలో మరోసారి చర్చ మొదలైంది. తాజా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. -
అఫిడవిట్ ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ ఆస్తులు ఎంతంటే..?
ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక బరిలోకి దిగిన ఆయన.. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట చరాస్తులు రూ.22.19 కోట్లు, స్థిరాస్తులు రూ.73.87 కోట్లు ఉన్నాయి. మొత్తంగా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.96 కోట్లకు చేరింది. అఫిడవిట్లో తన అప్పుల వివరాలను కూడా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ప్రస్తుతం తనపై రూ.5.77 కోట్ల బ్యాంకు రుణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆస్తుల్లో ఘజియాబాద్లోని అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు, మరో రెండు ఫ్లాట్లలో 50 శాతం వాటా ఉన్నట్లు తెలిపారు. అలాగే పాట్నాలోని పటాలిపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్ విహార్లో ప్లాట్లు, బక్సర్, స్వగ్రామంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.భార్య పేరిట భారీగానే..ఇక ఆయన భార్య జాన్వి దాస్ పేరిట ఉన్న ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వి దాస్ వైద్యురాలు. ఆమెకు రూ.89.51 కోట్ల చరాస్తులు, రూ.12.42 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ఆమెకు గువాహటిలో రెండు ఫ్లాట్లు, ఓ బంగ్లాలో మూడో వంతు వాటా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే నోయిడాలోనూ ఆస్తులు ఉన్నట్లు వివరించారు.ఆ కంపెనీ నుంచి పార్టీకి విరాళాలుప్రశాంత్ కిషోర్ ‘వేదా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి యజమానిగా ఉన్నారు. ఈ సంస్థ 2024-25లో జన్ సురాజ్కు రూ.85 కోట్ల విరాళం ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతకుముందు 2023-24లో జన్ సురాజ్ ఫౌండేషన్కు రూ.50 లక్షలు, ‘జాయ్ ఆఫ్ గివింగ్’కు రూ.2.75 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి.8 కేసులు.. ఇంకా విచారణ దశలోనే!ప్రశాంత్ కిషోర్పై ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. వీటిలో పరువు నష్టం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, మోసం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏ కేసులోనూ ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.పీకే ఏం చదివారంటే..ప్రశాంత్ కిషోర్ లక్నో విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో హెల్త్కేర్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కోర్సు చేశారు. ఫ్రెంచ్ భాషలోనూ సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేశారు.ఎన్నికల వ్యూహకర్త నుంచి..ప్రశాంత్ కిషోర్ గతంలో దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రూపొందించిన విషయం తెలిసిందే. అయితే 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వ్యూహకర్తగా తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. అనంతరం బిహార్కు తిరిగి వెళ్లి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.2022 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్ అభియాన్’ను ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఆ తర్వాత జన్ సురాజ్ను రాజకీయ పార్టీగా మార్చారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో పీకే పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ ఉప ఎన్నిక ద్వారా పోటీ చేస్తున్నారు.పాట్నా జిల్లా పరిధిలో ఉన్న బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ నేత నితిన్ నబీన్ రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం(బీజేపీ జాతీయాధ్యక్షుడు+రాజ్యసభ సభ్యుడు)తో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అతి త్వరలో బై ఎలక్షన్ జరగనుంది.బిహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్న ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే తన అఫిడవిట్తో రాజకీయ వర్గాల్లో మరో చర్చకు తెరలేపారు. -
కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్
న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియతో ఇప్పటికే లక్షలాది మంది తమ పేర్లు ఓటరు జాబితాలో ఉంటాయా? లేదా? అనే ఆందోళనలో ఉండగా.. ఎన్నికల సంఘం మరో కీలక నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫామ్-6 ఆన్లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా తాతమ్మల పేర్లు గత SIR ఓటరు జాబితాలో ఉన్నాయా? లేదా? అనే వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. దీంతో "పాత జాబితాలో కుటుంబ సభ్యుల పేర్లు లేకపోతే కొత్త ఓటరు నమోదు ఇబ్బందుల్లో పడుతుందా?" అనే చర్చ మొదలైంది.ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే వాళ్ల కోసం ఎన్నికల సంఘం (EC) కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే.. తమతో పాటు తల్లిదండ్రులు లేదా పూర్వీకుల పేర్లు గత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితాలో ఉన్నాయా? లేదా? అనే వివరాలను ఫామ్-6లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆన్లైన్ దరఖాస్తు ముందుకు వెళ్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఫామ్-6లో కొత్త మార్పుకొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు.. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత, గతంలో పేరు తొలగించబడి మళ్లీ నమోదు కోరుకునే వారు ఫామ్-6ను వినియోగిస్తారు. తాజాగా ఈ ఫామ్లో కొత్త డిక్లరేషన్ను జత చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినప్పటికీ, పరిపాలనా ఆదేశాల ద్వారా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ఏ వివరాలు అడుగుతున్నారు?ఆన్లైన్ దరఖాస్తులో అభ్యర్థి మూడు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గత SIR ఓటరు జాబితాలో తన పేరు ఉందా? తల్లిదండ్రులు లేదా తాతమ్మల పేర్లు గత SIR జాబితాలో ఉందా?తన పేరు గానీ, కుటుంబ సభ్యుల పేర్లు గానీ గత SIR జాబితాలో లేవా?మొదటి రెండు ఎంపికల్లో ఏదైనా ఎంచుకుంటే, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబర్, ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.ఈసీ చెబుతున్న కారణం ఇదే..!ఈ ప్రక్రియతో కొత్త ఓటర్లను ఇప్పటికే ఉన్న ఓటరు రికార్డులతో అనుసంధానం చేయడం సులభమవుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. అలాగే అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం కూడా తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం తొలిసారిగా గత ఏడాది బిహార్లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సందర్భంగా అమలు చేసినట్లు తెలిపారు.దేశవ్యాప్తంగా SIR ప్రక్రియదేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించినవారు, చిరునామా మార్చుకున్నవారు, దీర్ఘకాలంగా గైర్హాజరైనవారు, అనర్హులు లేదా విదేశీయుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో SIR పూర్తికాగా.. తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు.. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ సవరణల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించబడటంపై రాజకీయ వర్గాలు, పౌరసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధన భవిష్యత్తులో కొత్త ఓటర్ల నమోదుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది -
పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?
బిహార్లోని బాంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని మార్చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ.. ఆయనతో నామినేషన్ కూడా దాఖలు చేయించింది. అయితే.. గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గి, నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది. దీంతో అసలు ఈ హఠాత్పరిణామం వెనుక కారణమేంటన్న ప్రశ్న బిహార్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.బాంకిపూర్ బీజేపీకి సంప్రదాయ బలమైన నియోజకవర్గం. 1995 నుంచి ఈ స్థానం ఆ పార్టీ చేతిలోనే ఉంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ఎంచుకుంది బీజేపీ. దీంతో గురువారం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా ఎన్డీఏ అగ్రనేతల సమక్షంలో అభిషేక్ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. గంటలు కూడా తిరగక ముందే సీన్ మారింది. Patna, Bihar: BJP candidate Abhishek Kumar “Bunty” filed his nomination for the Bankipur Assembly by-election. Several senior NDA leaders attended the nomination pic.twitter.com/YqQ6MUU7f7— IANS (@ians_india) July 9, 2026శుక్రవారం అనూహ్యంగా ఆయన దానిని ఉపసంహరించుకున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో.. పెద్దగా చదువుకోని బంటీని బరిలోకి దింపడం సబబు కాదని బీజేపీ భావించిందనే ప్రచారం ఉదృతంగా జరిగింది. అయితే దానిని బంటీ కొట్టిపారేశారు. "వ్యక్తిగత కారణాల వల్ల పోటీ చేయడం సాధ్యం కాదని" రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగికి లేఖ రాసి తప్పుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో కూడా అదే కారణాన్ని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం వేరేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. सुनिए क्यों बांकीपुर से BJP के उम्मीदवार अभिषेक बंटी नॉमिनेशन के बाद अपना उम्मीदवारी वापस लिए #BJP #Bankipur #election pic.twitter.com/MQ0UWMrwk5— Mukesh singh (@Mukesh_Journo) July 10, 2026అభిషేక్ బంటీ తండ్రి రవీంద్ర ప్రసాద్.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి దాణా (ఫోడర్) కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి. 2022లో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూతో పాటు మరో 75 మందికి శిక్ష విధించగా, అప్పట్లో మగధ్ కెమికల్ కార్పొరేషన్ మేనేజర్గా పనిచేసిన రవీంద్ర ప్రసాద్కు కూడా మూడేళ్ల జైలు శిక్ష పడింది.ఈ నేపత్యంలో.. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సేకరించి, ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారంలో రక్షణాత్మక స్థితిలో పడకూడదన్న ఉద్దేశంతో బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు ఇటీవలే పార్టీ అగ్రనేతల దృష్టికి రావడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా సాధారణ పార్టీ కార్యకర్తగా గుర్తింపు పొందిన నీరజ్ కుమార్ సిన్హా బరిలో నిలిచారు. ఆయన నేరుగా ప్రశాంత్ కిశోర్తో తలపడనున్నారు.#WATCH | Bye-elections | Bihar BJP President Sanjay Sarogi felicitates party's candidate from Bihar's Bankipur Assembly seat, Neeraj Kumar Sinha Neeraj Kumar Sinha says, "I am overjoyed. I am deeply grateful to the top leadership, the state president, our leader Nitin Nabin ji,… pic.twitter.com/aKPWkznCQq— ANI (@ANI) July 10, 2026ప్రశాంత్ కిశోర్ బరిలో ఉండటం, చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి మారడం వంటి పరిణామాలతో ఈ ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ఆసక్తికర రాజకీయ పోరుగా మారింది. -
పోక్సో చట్టం.. కవచమా? కాగితపు పులినా?
పోక్సో కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన నిందితుడు ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడం.. అందునా బాధిత బాలికను అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోక్సో.. పిల్లలకు కవచమా? నిందితులకు అవకాశమా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన సామూహిక హత్యలు ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుకు తెచ్చాయి. దీంతో పిల్లల రక్షణ కోసం రూపొందించిన కఠిన ‘పోక్సో’ చట్టం అమలులో ఏ మేర లోపాలున్నాయి? మైనర్లకు రక్షణ కల్పించాల్సింది బదులు నిందితులకు అవకాశంగా మారుతున్నాయా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.మన దేశంలో 2012లో లైంగిక దాడుల్లో మైనర్ల రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే ఏడాది డిసెంబర్లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలను చాలామంది ఒకటిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి పోక్సో చట్టం నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందే (2012 నవంబర్ 14 నుంచి) అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోక్సో చట్టం అమలు మరింత కఠినంగా మారింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పోక్సోకు కొన్ని సవరణలు చేసి, కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష వరకు విధించే అవకాశాన్ని కూడా చట్టంలో చేర్చింది.పోక్సో ప్రత్యేకత ఏంటి?ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి బాలుడు, బాలికకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. శారీరక దాడితో పాటు లైంగిక వేధింపులు, అశ్లీల ప్రదర్శనలు, ఆన్లైన్ లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాల తయారీ, వినియోగం వంటి అనేక నేరాలను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అలాగే ప్రత్యేక పోక్సో కోర్టులు, ఇన్కెమెరా విచారణ, బాధితుడి గుర్తింపు గోప్యంగా ఉంచడం, పిల్లలకు అనుకూలమైన విచారణ విధానం వంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.పోక్సోకు ముందు పరిస్థితి ఏంటి?చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే.. పోక్సోకు ముందే పిల్లలపై లైంగిక నేరాలకు చట్టమే లేదనేది. కానీ అది నిజం కాదు. పోక్సోకు ముందు కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద అత్యాచారం, అసభ్య ప్రవర్తన, వేధింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షలు విధించేవారు. అయితే ఆ చట్టాల్లో పిల్లల కోసం ప్రత్యేక నిర్వచనాలు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక విచారణ విధానం లేవు. ముఖ్యంగా అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులు, శారీరక సంబంధం లేకుండా జరిగే లైంగిక వేధింపులు, పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించడం వంటి అనేక నేరాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనం లేకపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండేవి.పోక్సో వచ్చాక కూడా.. బెయిల్ ఎలా?పోక్సో కేసు అంటే బెయిల్ రాదనుకోవడం సరికాదు. నేర తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు దశ, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, బాధితుల భద్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టులు బెయిల్పై నిర్ణయం తీసుకుంటాయి. అంటే చట్టం బెయిల్ను పూర్తిగా నిషేధించలేదు. అయితే బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించే షరతులు, వాటి అమలు చాలా కీలకం. షాబాద్ కేసులో..రాజశేఖర్ విషయంలో ఇదే జరిగి ఉంటుంది.చట్టంలో లోపమా.. అమలులో లోపమా?న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య ఎక్కువగా చట్టంలో కంటే అమలులోనే ఉంది. బెయిల్పై విడుదలైన నిందితులపై నిరంతర నిఘా, బాధిత కుటుంబాలకు రక్షణ, నిందితుడు బాధితులను సంప్రదించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయడం, అవసరమైతే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వంటి వ్యవస్థలు మన దేశంలో ఇంకా పరిమితంగానే ఉన్నాయి.ఇలాంటి చర్చ ఇదే తొలిసారి కాదు. పోక్సో చట్టం అమలు, దాని వ్యాఖ్యానంపై గతంలోనూ దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీవ్ర చర్చ జరిగింది. 2021లో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఇచ్చిన 'స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్' తీర్పు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. బట్టలపై నుంచి తాకితే అది పోక్సో కింద లైంగిక దాడి కాదన్న వ్యాఖ్యలపై బాలల హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ.. లైంగిక ఉద్దేశంతో పిల్లలను తాకే ఏ చర్య అయినా పోక్సో పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోక్సో కేసుల్లో బెయిల్పై విడుదలైన నిందితులు బాధితులను బెదిరించడం, సాక్షులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు కూడా గతంలో పలు రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో బెయిల్ షరతులను మరింత కఠినతరం చేయడం, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం, విడుదలైన నిందితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న డిమాండ్ అప్పట్లోనే వినిపించింది.విదేశాల్లో ఎలా ఉంటుంది?అమెరికాలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని రికార్డుల్లో(Sex Offender Registry)లో నమోదు చేసి.. విడుదల తర్వాత కూడా ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తారు. పిల్లల పాఠశాలలు, పార్కులు, నివాస ప్రాంతాలకు వెళ్లకుండా కోర్టులు ఆంక్షలు విధిస్తాయి.బ్రిటన్లో ఎస్హెచ్పీవో( Sexual Harm Prevention Orders) ద్వారా నిందితుల కదలికలు, పిల్లలతో సంబంధాలు, ఇంటర్నెట్ వినియోగంపైనా పరిమితులు విధించవచ్చు.ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్లో విడుదలైన లైంగిక నేరస్థులపై ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, పోలీసు పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉన్నాయి.భారత్లో చట్టం బలహీనమా?శిక్షల పరంగా చూస్తే భారత పోక్సో చట్టం ప్రపంచంలోనే కఠినమైన చట్టాల్లో ఒకటి. తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కానీ నిపుణులు చెబుతున్నది ఒక్కటే. చట్టం కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితులపై కఠిన నిఘా, బాధిత కుటుంబాల భద్రత, వేగవంతమైన విచారణ, సాక్షుల రక్షణ వంటి అంశాలు కూడా అంతే బలంగా అమలు కావాలి.షాబాద్ ఘటన చెబుతున్న పాఠంషాబాద్ సామూహిక హత్యలు కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు. పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమలు విషయంలో ఉన్న లోటుపాట్లను మరోసారి గుర్తు చేశాయి. పోక్సోను మరింత కఠినతరం చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చట్టం కంటే దాని అమలు, బెయిల్ తర్వాత నిందితుల పర్యవేక్షణ, బాధిత కుటుంబాల భద్రతను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.:::వెబ్ ప్రత్యేకం -
చట్టాల పేరుతో కొత్త సవాళ్లు.. ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న ప్రశ్నలు!
భారతదేశం ఎటు వైపు పయనిస్తోంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించి పౌర హక్కులను కాలరాశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కాకపోయినా, దాదాపు అదే రీతిలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయా అన్న భావనను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 25న ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్ను ఎండగట్టే బీజేపీ పెద్దలు, తాము ఏమి చేస్తున్నామో కూడా ఆత్మపరీశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తుంది.పశ్చిమబెంగాల్లో తీసుకువచ్చిన ఒక చట్టం అందరిని భయపెట్టేలా ఉంది. పేరుకు సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు వస్తున్నామని, దీనిని దుర్వినియోగం చేయబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించినా, ఆచరణలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో అన్న ఆందోళనను వివిధ రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో అతి ముఖ్యమైన క్లాజ్ ఏమిటంటే ఎవరైనా ఈ చట్టం కింద అరెస్టు అయితే ఏడాదిపాటు జైలులోనే ఉంచుతారట. లాయర్ కలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదట. దీనిని రాజకీయంగా వాడుకోబోమని చెబుతున్నా గ్యారంటీ ఏమి ఉంటుందన్న ప్రశ్న వస్తుంది.ఒకవైపు ఉత్తరప్రదేశ్లో హాఫ్ ఎన్కౌంటర్ల పేరిట పోలీసులు సాగిస్తున్న ఘాతుకాలపై ఆయా జాతీయ ఆంగ్ల పత్రికలలో వస్తున్న వ్యాసాలు చదువుతుంటే భయం వేస్తుంది. యూపీలో మరీ ఇంత ఘోరంగా పరిస్థితి ఉందా అన్న భావన కలుగుతుంది. ఇక పశ్చిమబెంగాల్ వంతు వచ్చిందేమో అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టి అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటి సోషల్ యాక్టివిటీస్ బిల్లును ఆమోదించారు. ఇది కేవలం జైళ్లకు పంపడం కాదు.. సమాజాన్ని రక్షించడం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాని ఒక ఏడాది వరకు ఎలాంటి విచారణ లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా చట్టాన్ని అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించుకోవడం కష్టం కాదు. ఈ బిల్లు దెబ్బకి, ఆ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరవలసిన అనివార్య పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. తద్వారా కేసుల బారీ నుంచి తప్పించుకోవచ్చు.గతంలో టీఎంసీలో మంత్రిగా ఉన్న సువేందు అధికారిపై స్వయంగా ప్రధాని మోదీ పలు అవినీతి ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అదే సువేందు బీజేపీలో చేరడం, ముఖ్యమంత్రి అవడం కూడా జరిగిపోయింది. అలాగే ఆయా పార్టీల ఎంపీలు తమపై ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా బీజేపీ లేదా దాని మిత్రపక్షాలలో చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రజాస్వామ్యానికి మరింత చేటు చేసే అవకాశం ఉంది. ఈ చట్టం న్యాయ సమీక్షలో నిలబడదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ చట్టం యూపీ మోడల్లో వచ్చిన బిల్లు అని కొందరు అభివర్ణిస్తున్నారు.ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రౌడీ శక్తులను అణచివేయడానికి ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్ల పద్దతిని అనధికారికంగా ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 30 నాటి సంచికలో సందీప్ రాయి, కృష్ణ చౌదరి అనే ఇద్దరు వ్యాసకర్తలు రాసిన ఆర్టికిల్ చదివితే యూపీలో భయానక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.2017లో యోగి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఈ ఎన్కౌంటర్లను కొన్ని సందర్భాలలో ప్రజలు కూడా స్వాగతించి ఉండవచ్చు. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ఆయా కేసులలో నిందితుల ఇళ్లను కూల్చివేసేవారు. అలాంటి వాటిని సుప్రింకోర్టు కూడా తప్పు పట్టింది. ఇటీవలికాలంలో నిందితులుగా భావించేవారి ప్రాణం పోకుండా కాళ్లపైనో, ఇతర శరీర భాగాలపైన పోలీసులు తుపాకితో కాల్చుతున్నారట. దాంతో వారు ఏళ్ల తరబడి కదలలేని స్థితిలో పడిపోతున్నారు. వీటిని హాఫ్ ఎన్కౌంటర్లని పిలుస్తున్నారు. ఇలా గాయపడ్డవారిలో ఎందరు నిజంగా నేరం చేశారో, ఎందరు అమాయకులో ఎవరికి తెలియదు. ఈ వ్యాసంలో పలు ఉదాహరణలను కూడా వారు వివరించారు.యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత 289 మందిని ఎన్కౌంటర్లలో మరణించారట. క్రిమినల్స్గా పరిగణించిన 34వేలమందిలో సుమారు మూడోవంతు 11834 మంది హాఫ్ ఎన్కౌంటర్లలో తీవ్రంగా గాయపడ్డారట. వీరిలో పలువురు కదలలేని స్థితిలో ఉన్నారు. వారికి జీవనోపాధి కూడా లేకుండా పోయిందట. నిజంగానే ఈ ఎన్కౌంటర్లు ఫలితాన్ని ఇస్తున్నాయా అంటే అదీ గ్యారంటీ లేదు. 2024లో 2823 మంది తీవ్రంగా గాయపడితే, 2025లో హాఫ్ ఎన్కౌంటర్లలో గాయపడ్డవారి సంఖ్య 3153 గా ఉందట. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఫలిస్తే ఇలాంటివి తగ్గాలి కాని, ఎలా పెరుగుతాయన్న ప్రశ్నకు బదులు దొరకదు. రాజకీయ వైరాలకు కూడా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో పోలీసులలో విచ్చలవిడితనం పెరిగి, వారి ఇష్టారాజ్యంగా ఎవరిపైన అయినా ఇలా దారుణంగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పలేం.బీహారులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బహిరంగంగా కాల్చి చంపడం పెద్ద వివాదం అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక బీజేపీ మిత్ర పక్షమైన తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిన సంగతే. తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్షాన్ని అణచివేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసులను వాడుకోవడం సర్వసాధారణం అయిపోయిందన్న విమర్శ ఉంది.కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సీఐ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీవారు దాడులు చేసినా, అరాచకాలు చేసినా వారిపై తూతూమంత్రంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై గంటల తరబడి పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసినా వారిపై సరైన కేసులే పెట్టలేదు. పైగా బాధితులపైనే కేసులు పెట్టడం ట్రెండ్గా చేసుకున్నారు.తాజాగా అమరావతి గ్రామాలలో కొందరు రైతుల కోరిక మేరకు వారి సమస్యలను చూడడానికి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అయినా పోలీసులు వైఎస్సార్సీపీవారిపై కేసులు పెట్టారు. ఇలా బీజేపీ, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో అధికార దుర్వినియోగం, ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్లు, లాకప్ డెత్లు సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్లో ఏడాదిపాటు నిర్భందించే చట్టం వస్తే ఇంకెంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలను కాపాడేదెవరు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సినీ ఫక్కీలో ఛేజ్.. గురుగ్రామ్లో హైటెన్షన్ ఎన్కౌంటర్!
హర్యానాలోని గురుగ్రామ్లో గతరాత్రి హైటెన్షన్ ఎన్కౌంటర్ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులకు పాల్పడి తప్పించుకునేందుకు ప్రయత్నించిన గ్యాంగ్స్టర్లను పోలీసులు మట్టుబెట్టారు. సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా గాయాలపాలయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ లోక్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు కొంతకాలంగా దీపక్నందల్ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. అయితే ఆయన వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. బుధవారం రాత్రి కొందరు దుండగులు ఆయన నివాసంపై కాల్పులకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. దీంతో ఆ గ్యాంగ్ పారిపోయే ప్రయత్నం చేసింది. ఈలోపు.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ స్కార్పియో వాహనంలో నిందితులు ఆయుధాలతో ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అలా చాలా దూరం చేజ్ చేసుకుంటూ వెళ్లారు.లొంగిపోకుండా కాల్పులు..పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ.. నిందితులు ఆధునిక ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారని అధికారులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు నిందితులకు బుల్లెట్ గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నలుగురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరో నిందితుడు చికిత్స పొందుతున్నాడు.విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్స్టర్ దీపక్ నందల్కు చెందిన షూటర్లుగా వీరిని పోలీసులు గుర్తించారు. నందల్ గ్యాంగ్ హరియాణా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్న నేర ముఠాగా పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. వ్యాపారవేత్తలు, ప్రముఖులను టార్గెట్ చేసి బెదిరింపు సందేశాలు పంపడం, డబ్బులు డిమాండ్ చేయడం వంటి కార్యకలాపాల్లో ఈ గ్యాంగ్ సభ్యుల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది. విదేశాల నుంచి ఆపరేషన్లు నడుపుతూ స్థానిక షూటర్ల ద్వారా దాడులు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ అనంతరం నిందితుల నేర చరిత్ర, గ్యాంగ్ నెట్వర్క్, ఆయుధాల సరఫరా మార్గాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.#WATCH | Gurugram, Haryana: Visuals from Sushant Lok in Gurugram where four shooters of the foreign-based Deepak Nandal gang were killed and one was injured during a police encounter. The miscreants had arrived to open fire at the residence of SGT University founder's son over… pic.twitter.com/nOsa9J1Jhh— ANI (@ANI) July 10, 2026పోలీసులకు కూడా గాయాలుఎన్కౌంటర్లో ముగ్గురు క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి తూటా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, నిందితుల నేర చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.భయపెట్టే గ్యాంగ్లకు చెక్ప్రజల్లో భయాందోళనలు సృష్టించే నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ పోలీసులు స్పష్టం చేశారు. వ్యాపారవేత్తల నుంచి బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసే గ్యాంగ్లపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
రైలు బోగీనే హనీమూన్ సూట్!.. వైరల్ వీడియోపై విమర్శలు
ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డుతో కూపేను అందంగా తీర్చిదిద్దింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే స్పందించాల్సి వచ్చింది.. జూలై 6న ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–పండర్పూర్ నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ జల్నా స్టేషన్కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బయటకు చెందిన డెకరేషన్ సిబ్బందిని రైలులోకి అనుమతించి, ప్రయాణికుల కూపేను ప్రత్యేకంగా అలంకరించారు. కొద్దిసేపటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వీడియోలు వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే వెంటనే విచారణకు ఆదేశించింది. ప్రయాణికులు తమ సీట్లు లేదంటే కూపేను చిన్నపాటి వ్యక్తిగత అలంకరణలతో అందంగా మార్చుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా బయటి వ్యక్తులను రైలులోకి తీసుకురావడం, భారీగా అలంకరణలు చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.ఈ ఘటనలో అసలు తప్పు కొత్త దంపతులది కాదని, భద్రతా నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులను అనుమతించిన సిబ్బందిదేనని రైల్వే భావిస్తోంది. దీంతో విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సస్పెండ్ చేశారు. అలాగే అనుమతి ఎలా ఇచ్చారు? భద్రతా తనిఖీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే అంశాలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.కొత్త దంపతులపై మాత్రం ఎలాంటి జరిమానా లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. రైల్వే దృష్టి మొత్తం భద్రతా నిబంధనల ఉల్లంఘనపైనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన హాట్టాపిక్గా మారింది. కొందరు "ఇలాంటి సర్ప్రైజ్ జీవితంలో ఒక్కసారే వస్తుంది" అంటూ కొత్త దంపతుల ఆలోచనను మెచ్చుకోగా, మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు సరదాగా ఈ రైలుకు "సుహాగ్రాత్ ఎక్స్ప్రెస్" అని పేరు పెట్టి మీమ్స్ సృష్టించారు.Hello @AshwiniVaishnaw, does Indian Railways permit passengers to use a First AC coach for a suhagraat? pic.twitter.com/nDUQMkxEyt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) July 8, 2026ఒక జంట తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలన్న ప్రయత్నం.. చివరకు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తి అధికారుల విచారణ వరకు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.Honeymoon coach on Indian Railways. Ticket checker suspended. South Central Zone A couple travelling in Train No. 11002 Nandigram express on 6/7/26 had privately engaged a decorator online to decorate their 1st AC coupe. The decorator's entry into the coach was… pic.twitter.com/1ati4A13G4— Rajendra B. Aklekar (@rajtoday) July 8, 2026 -
ఇథనాల్ పెట్రోల్.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటు రాజకీయంగానూ కొంతకాలంగా.. కొన్ని రకాల ప్రచారాలు, ఊహాగానాలు, ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ పెట్రోల్తో గడ్కరీ కుటుంబం విపరీతంగా లాభపడుతోందని.. ఆ ఉద్దేశంతో ఆయన ఈ విధానాన్ని ప్రొత్సహిస్తున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. అయితే ఇథనాల్ విధానాన్ని తానే రూపొందించి.. వ్యక్తిగతంగా లాభపడుతున్నానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. అంతేకాదు ఈ20 పెట్రోల్తో వాహనాలు దెబ్బతింటున్నాయనే ఘటనకు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. తాజాగా ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం ఒక వ్యక్తి నిర్ణయం కాదు. దాని వెనుక నేను మాత్రమే ఉన్నానన్నది ఆరోపణలే. శాస్త్రీయ పరిశోధనలు, పెట్రోలియం శాఖ, కేంద్ర మంత్రివర్గం సంప్రదింపుల తర్వాతే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఇథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీల్లో తన కుటుంబానికి(కుమారులకు) సంబంధాలున్నాయనే విమర్శలపై స్పందించిన గడ్కరీ.. తమ కుటుంబం చెరుకు పరిశ్రమలో చాలాకాలం కిందటే ఉందని గుర్తుచేశారు. అంతేకాదు.. ప్రస్తుతం దేశంలో సుమారు 550 ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా.. అందులో తన వాటా చాలా కొద్దిమాత్రమేనని చెప్పారు. "నా వాటా 0.07 శాతం మాత్రమే. అంత చిన్న వాటాతో దేశ ఇథనాల్ విధానాన్ని నా ప్రయోజనం కోసం ప్రభావితం చేయడం అసాధ్యం. ఈ విధానం వల్ల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి లాభం లేదు. పైసా రాదు" అని గడ్కరీ స్పష్టం చేశారు.ఆధారాలు చూపండి.. ఈ20 పెట్రోల్ వాడితే ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలపై కూడా గడ్కరీ తీవ్రంగా స్పందించారు. "ఈ20 వల్ల ఎవరి వాహనం దెబ్బతిన్నా డీలర్కు, మా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయండి. మేం విచారణ చేసి న్యాయం చేస్తాం. మీకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరి వాహనాలైనా ఈ20 కారణంగా దెబ్బతిన్నాయని చెప్పగలరా?" అంటూ ప్రశ్నించారు.ప్రముఖ కంపెనీల నుంచి ఫిర్యాదుల్లేవుదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటర్స్, మహీంద్రా&మహీంద్రా నుంచి ఈ20 ఇంధనం కారణంగా వాహనాలు దెబ్బతిన్నాయని ఎలాంటి అధికారిక ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. ఇటీవల టయోటా కారుకు సంబంధించిన ఓ ఘటనలో కూడా ఇథనాల్ కారణం కాదని.. ఇంధనంలో నీరు కలవడమే సమస్యకు కారణమని విచారణలో తేలిందని చెప్పారు.నాలుగేళ్ల పరీక్షల తర్వాతే అనుమతిఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని హడావుడిగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాదని గడ్కరీ వివరించారు. వాహనాలను నాలుగేళ్లపాటు పరీక్షించి, లక్షల కిలోమీటర్లు నడిపిన తర్వాతే అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇది ప్రయోగాత్మక విధానం కాదని, శాస్త్రీయంగా నిర్ధారించిన ప్రక్రియ అని పేర్కొన్నారు.రైతులకు లాభం.. దిగుమతులు తగ్గుతాయితాను ఇథనాల్ను మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ ఇంధనాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నానని గడ్కరీ తెలిపారు. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. దేశ ఇంధన భద్రతకు కూడా ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.నాపై దుష్ప్రచారం చేస్తోంది.. ఇథనాల్ విధానంపై వస్తున్న వివాదం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని గడ్కరీ ఆరోపించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ఇథనాల్ కార్యక్రమాన్ని అపఖ్యాతిపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.ప్రపంచమంతా ఇదే దారిఇథనాల్ వినియోగంలో భారత్ కొత్త ప్రయోగం చేయడం లేదని గడ్కరీ గుర్తు చేశారు. అమెరికా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, థాయ్లాండ్, స్వీడన్ ఇలా.. అనేక దేశాల్లో ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ ఇంధనం విజయవంతంగా వినియోగిస్తున్నారని చెప్పారు.అసలు ఈ20 వివాదం ఏంటి?ఈ20 అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం. కాలుష్యం తగ్గించడం, చమురు దిగుమతులను తగ్గించడం, చెరకు వంటి పంటలకు డిమాండ్ పెంచి రైతుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యాలు. అయితే పాత మోడల్ వాహనాల్లో దీర్ఘకాలంలో ఇంజిన్, మైలేజ్పై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతోంది. -
పైరసీ సినిమాలు.. టెలిగ్రామ్కు బిగ్ షాక్.. కేంద్రం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: పైరసీ సినిమాలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్న వ్యవహారంపై టెలిగ్రామ్ యాప్నకు భారత ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఛానెల్స్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) నోటీసులు పంపింది. ప్రభుత్వం తాజా నోటీసులో టెలిగ్రామ్ను కేవలం ఒక్కో ఛానల్ను తొలగించే విధానానికి పరిమితం కాకుండా, ప్లాట్ఫామ్ స్థాయిలోనే పైరసీని నియంత్రించే సమగ్ర వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించింది. పైరసీ కంటెంట్తోపాటు ఓటీటీ కంటెంట్ పంచుతున్న ఛానెల్స్, గ్రూప్స్, బాట్స్, అడ్మిన్స్, సంబంధిత అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.అలాగే.. సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల కోసం సమర్థవంతమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం వివరాలను కూడా సమర్పించాలని సూచించింది. సమాచారం సాంకేతిక చట్టం 2000, ఐటీ రూల్స్ 2021 ప్రకారం మధ్యవర్తిగా టెలిగ్రామ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుందని కేంద్రం గుర్తు చేసింది.పైరసీ కేవలం సివిల్ వివాదం మాత్రమే కాకుండా, కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 ప్రకారం క్రిమినల్ నేరంగా కూడా పరిగణించబడుతుందని ఆ నోటీసుల్లో టెలిగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే 3,000కిపైగా పైరసీ ఛానెల్స్పై చర్యలు తీసుకున్నప్పటికీ.. ఇంకా కంటెంట్ కొనసాగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణతో పాటు ‘యాక్షన్ టేకన్ రిపోర్ట్’ (ATR) సమర్పించాలని స్పష్టంగా సూచించింది.ఇదిలా ఉండగా.. భారత్లో టెలిగ్రామ్కు 15 కోట్ల యూజర్లు ఉన్నట్లు ఓ అంచనా. అయితే కొంతకాలంగా ఈ యాప్ కష్టాలు ఎదుర్కొంటోంది. ఇందుకు ముందు కూడా నియంత్రణ చర్యల బారినపడింది. మొన్నీమధ్యే నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఘటనల నేపథ్యంలో తాత్కాలికంగా బ్యాన్ ఎదుర్కొంది. తాజాగా యూజర్నేమ్ ఫీచర్ విషయంలోనూ కేంద్రం వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. -
అయోధ్య తరహాలో బద్రీనాథ్లోనూ కుంభకోణం?!
యూపీ అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగ ఆరోపణల తర్వాత ఇప్పుడు అదే తరహా ఆరోపణలు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ధామ్ను కూడా తాకాయి. ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (BKTC) వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.బద్రీనాథ్ ఆలయానికి వచ్చే భక్తుల విరాళాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఒక సంస్థ సోషల్ మీడియాలో చేసిన తర్వాత ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన టెంపుల్ కమిటీ, అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు కూడా కోరినట్లు అధికారులు తెలిపారు.ఈ విషయంపై స్పందించిన BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది.. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను తీసిపారేయలేమన్నారు. అందుకే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే తెరపైకి వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. గోల్మాల్కు పాల్పడ్డాడని చెబుతున్న వ్యక్తి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని.. ఆయన సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.ఇక బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే అందుబాటులో ఉన్న ఫుటేజ్ స్పష్టంగా లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి విచారణ అవసరమని కమిటీ భావిస్తోంది.ప్రస్తుతం సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు తీసుకుంటూ, విచారణ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన పంపినట్లు అధికారులు తెలిపారు. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు, సంబంధిత పక్షాల వాదనలు పరిశీలించి నివేదిక సమర్పించనుంది. విచారణలో ఏవైనా అక్రమాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో.. ఇది లక్షలాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం కావడంతో, నిర్ధారణ లేని ఆరోపణలు చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. -
ఆ ఒక్క మాటే తీర్పును తిరగరాసింది!
భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్య నోరు జారింది. భర్త తట్టుకోలేకపోయాడు. గర్భంతో ఉందని కూడా చూడకుండా రాయి తీసుకుని దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. క్షణికావేశంలో చేసిన నేరానికి వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ, సమాజం ఊరుకోలేదు!. కోర్టు జీవితఖైదు విధించి తన పని తాను చేసింది. అయితే ఒక్క మాటతో ఆ తీర్పును ఇప్పుడు తిరగరాయాల్సి వచ్చింది.ఐదేళ్ల కిందట.. మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో జరిగిన గర్భిణీ హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. మాటామాటా పెరిగి కిరణ్ అనే మహిళను ఆమె భర్త శివ రాళ్లతో దాడి చేసి చంపాడు. ఆపై విషయాన్ని ఇరు వైపులా కుటుంబాలకు తెలియజేశాడు. అయితే.. ఆమె కడుపుతో ఉండడం, రక్తపు మడుగులో ఆమె మృతదేహం కనిపించేసరికి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ట్రయల్ కోర్టు దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి జీవిత ఖైదు విధించింది. అయితే..ఈ శిక్ష పునఃపరిశీలన కోసం తాజాగా ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుకు రాగా.. సంచలన తీర్పు వెలువడింది. నిందితుడి జీవితఖైదును ఏడేళ్ల శిక్షగా మార్చేసింది. కేసు విచారణలో కీలకంగా మారిన అంశం.. గొడవ సమయంలో భార్య చేసిన ఒక వ్యాఖ్య. కిరణ్ తన భర్తను ఉద్దేశించి “నువ్వు కాకపోతే.. నీలాంటి వందల మంది నాకు మొగుళ్లుగా దొరుకుతారు” అని అన్నదట. ఈ మాట తనలో తీవ్ర ఆవేశాన్ని రేపిందని, అదే ఆవేశంలో రాయితో ఆమెపై దాడి చేయాల్సి వచ్చిందని శివ కోర్టుకు తెలిపాడు. ఆధారాలను, వాదనలను సమగ్రంగా పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ అవినీంద్ర కుమార్ సింగ్.. Grave and sudden provocationను పరిగణనలోకి తీసుకున్నారు.ఇది క్షణికావేశంలో జరిగిన నేరంగా భావించిన ధర్మాసనం.. దాడి జరిగిన వెంటనే నిందితుడు స్వయంగా పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. “అది ప్రణాళికాబద్ధ(ప్లాన్ప్రకారం చేసిన) హత్య కాదు. కోపంలో జరిగింది అని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. భారత శిక్షాస్మృతి సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 1 వర్తిస్తుందని పేర్కొంది. అందువల్ల హత్యగా కాకుండా ‘కల్పబుల్ హోమిసైడ్’ (Section 304 Part II) కింద కేసును పరిగణించింది. జీవితఖైదును కాస్త.. ఏడేళ్ల శిక్షగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.Grave and sudden provocation (IPC సెక్షన్ 300 Exception 1).. దీని ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన అవమానం లేదంటే తీవ్ర ఆవేశాన్ని రేపే మాట/పరిస్థితిని అకస్మాత్తుగా ఎదుర్కొన్నప్పుడు.. నియంత్రణ కోల్పోయి నేరం చేయడం.. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కీలక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు తర్వాత సమాజంలో మాటల ప్రభావం, గృహహింస కేసుల్లో భావోద్వేగ ప్రేరణ పాత్ర వంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకవైపు న్యాయపరమైన సడలింపు సరైన దేనా? అనే ప్రశ్నలు వస్తుండగా, మరోవైపు భావోద్వేగ ఆవేశంలో జరిగే నేరాలపై చట్టం ఎలా స్పందించాలన్నదానిపై కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. -
నా దుస్తులు విప్పేస్తా… నీ గతి అదోగతే!
కొన్నిరోజులుగా ఇంట్లో వరుసగా డబ్బు, నగలు మాయం అవుతుండటంతో యజమానికి అనుమానం పెరిగింది. ఇంటా బయట సీసీటీవీలు ఏర్పాటు చేయించాడు. వాటిల్లో కనిపించిన దృశ్యాలు ఆయనను షాక్కు గురి చేశాయి. వెంటనే అప్రమత్తమై దొంగను అడ్డుకోగా.. ఆమె చేసిన పని నెట్టింట వైరల్గా మారింది.రాజస్థాన్లోని జైపూర్ ముహానా ప్రాంతంలోని ఓ ఇంట్లో కొద్దిరోజులుగా అనుమానాస్పద చోరీలు జరుగుతున్నాయి. మొదట్లో చిన్నగా డబ్బు మాయం కావడం ప్రారంభమై, తర్వాత నగలు కూడా కనిపించకపోవడంతో యజమాని అనుమానం బలపడింది. దీంతో ఆయన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.గురువారం కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్లో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అల్మారా తెరిచి నగల పెట్టెను పరిశీలిస్తున్న దృశ్యాలను చూసిన యజమాని ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. తక్షణమే అప్రమత్తమైన యజమాని పొరుగువారికి సమాచారం ఇచ్చి ఇంటి గేటును లాక్ చేయించాడు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న వారు ఆమెను ఇంట్లోనే అడ్డుకున్నారు.అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బయటపడే మార్గం లేకపోవడంతో ఆమె తీవ్రంగా బెదిరింపులకు దిగింది. పోలీసులు వస్తారా? రానివ్వు.. వాళ్లు వచ్చేలోపు నా దుస్తులు విప్పేస్తా!. నువ్వు నన్ను బలవంతం చేయబోయావని ఏడుస్తా.. వాళ్లు నిన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నీ గతి అదోగతే.. నన్ను బయటకు పోనివ్వండి’’ అంటూ ఆమె చెప్పిన మాటలు విని ఆ ఓనర్, స్థానికులు నిర్ఘాంతపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సోనమ్ బెయిల్పై సుప్రీం కోర్టు అనుమానాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతివాదులకు(సోనమ్కు, ఇతరులకు) నోటీసులు జారీ చేసింది.మేఘాలయ ప్రభుత్వం వాదన ఇదే..మేఘాలయ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్య అని, సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసి లోయలో పడేశారని కోర్టుకు తెలిపారు. హత్య అనంతరం సోనం పరారై ఉత్తరప్రదేశ్లో అరెస్టయ్యిందని వివరించారు.అయితే, హత్య కేసుకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్యకు శిక్ష)కు బదులుగా పొరపాటున సెక్షన్ 403(1)గా అరెస్ట్ మెమోలో టైప్ చేయడాన్ని ఆధారంగా తీసుకుని ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని.. అలాగే హైకోర్టు కూడా ఆ బెయిల్ను సమర్థించిందని కోర్టుకు నివేదించారు. అది కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఈ ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమికంగా కొన్ని సందేహాలు ఉన్నాయని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. నిందితురాలిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని.. బెయిల్ విషయంలో మేఘాలయా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారాయన. అలాగే అరెస్టు కారణాలను నిందితురాలికి వివరించారని రికార్డుల్లో ఉందని, గతంలో దాఖలైన బెయిల్ పిటిషన్లలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని బెంచ్ ప్రస్తావించింది. కేవలం తప్పుగా సెక్షన్ పేర్కొన్నందుకే బెయిల్ ఇవ్వడం సరైందేనా? అని ప్రశ్నించింది.అయితే, సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున ఈ దశలో బెయిల్పై స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘బెయిల్ రద్దు విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె విడుదల కాకపోయి ఉంటే.. బెయిల్పై కచ్చితంగా స్టే విధించేవాళ్లం’’ అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బెయిల్ ఉత్తర్వుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని, తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.హనీమూన్ కేసులో జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ 2025 మేలో వివాహం చేసుకున్నారు. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. జూన్ 2న ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని వైసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభించింది. కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో సోనం రఘువంశీ కనిపించగా, అనంతరం పలు అనుమానాల నడుమ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భర్త హత్యకు సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్నిందని, ఇందుకోసం కిరాయి హంతకులను నియమించిందని మేఘాలయ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో సోనం, రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 700కు పైగా పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వగా.. జూన్ 29న మేఘాలయ హైకోర్టు సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ పత్రాల్లో సెక్షన్ను తప్పుగా నమోదు చేయడం సాధారణ టైపింగ్ పొరపాటు కాదని, దర్యాప్తు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు బెయిల్ను సమర్థించింది. ఇప్పుడు ఆ బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బెయిల్పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించినప్పటికీ, హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగించేందుకు అంగీకరించింది. -
పోలీసులు రాజకీయ నాయకుల సేవకులేం కాదు
ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికీ ఉంటుందని చెబుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అలాగే.. పోలీసులు రాజకీయ నాయకులకు సేవకులు కాదని.. ప్రజా సేవకులని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రన చర్యలు తీసుకోవడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.ముంబై పోలీసులు ఒక రాజకీయ కార్యకర్తపై విధించిన నగర బహిష్కరణ (externment) ఆదేశాన్ని తాజాగా ముంబై హైకోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జందార్ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పౌరులు ప్రభుత్వానికి బానిసలు కారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు కూడా ఉంది. పోలీసులు ప్రజల సేవకులు.. అంతేకానీ రాజకీయ నాయకుల సేవకులు కారు’’ అని వ్యాఖ్యానించారు.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ప్రధాన కార్యదర్శి సయ్యద్ వహీద్ చౌదరిపై ముంబై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. ఆయన 2019 నుంచి 2024 మధ్య వివిధ నిరసనల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ పోలీసులు పలు FIRలు నమోదు చేశారు. అందులో సీఏఏ, ఎన్ఆర్సీతోపాటు బాబ్రీ మసీదు–జ్ఞానవాపి వివాదాలు, ఇంధన ధరల పెరుగుదల వ్యతిరేక నిరసనల్లాంటివి ఉన్నాయి. ఈ కేసుల ఆధారంగా కొంకణ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ 2025 డిసెంబర్లో చౌదరిని ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక సంవత్సరం పాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను డివిజనల్ కమిషనర్ కూడా సమర్థించారు. ఈ బహిష్కరణ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు, వాటిని పూర్తిగా కొట్టివేసింది. పోలీసులు తీసుకున్న చర్యలు చట్టబద్ధంగా నిలబడవని స్పష్టం చేసింది.కోర్టు ప్రధాన పరిశీలనలుకేవలం నిరసనల్లో పాల్గొన్నందుకే నగర బహిష్కరణ విధించడం సరైనదికాదు. ఇది పౌరుల భావప్రకటన స్వేచ్ఛ (Article 19), జీవించే హక్కు (Article 21)ను ఉల్లంఘిస్తుందని తేల్చింది. అలాగే, ఆ ఆరోపణలు ప్రజా భద్రతకు తీవ్రమైన ముప్పుగా పోలీసులు నిరూపించలేకపోయారు అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీంతో ముంబై పోలీసులు జారీ చేసిన నగర బహిష్కరణ ఆదేశాన్ని, అలాగే అప్పీల్ స్థాయిలో ఇచ్చిన ఆమోదాన్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కు మూలాధారం అని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం నేరం కాదని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
భానుడి భగభగలకు బ్రేక్.. ఎట్టకేలకు ఢిల్లీకి ఊరట
కొన్ని రోజులుగా భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఢిల్లీ-ఎన్సీఆర్కు ఎట్టకేలకు భారీ వర్షాలు ఊరటనిచ్చాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే పరిస్థితుల తీవ్రత దృష్ట్యా.. అనూహ్యంగా రెడ్ అలర్ట్ను ప్రకటించింది భారత వాతావరణ శాఖ.జూన్ మొత్తం కూడా ఢిల్లీలో తీవ్ర ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, భరించలేని ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. పగటి వేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రతతో పాటు గాలిలో తేమ అధికంగా ఉండటంతో ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి అనిపిస్తూ ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కోసం ఢిల్లీ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో వరుణుడు కరుణించాడు. గురువారం ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు కూడా నమోదయ్యాయి. ఆకాశమంతా మేఘాలు కమ్ముకోవడంతో పగటిపూటే చీకటి వాతావరణం కనిపించింది.భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం మరికొన్ని గంటల్లో.. ఢిల్లీ-ఎన్సీఆర్ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కొన్ని చోట్ల 100 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ను రెడ్ అలర్ట్గా మార్చి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.दिल्ली NCR के कई इलाकों में लंबे इंतजार के बाद हुई बारिश के बाद लोगों को गर्मी से राहत मिली। #DelhiRains #DelhiNCR #Monsoon #WeatherUpdate pic.twitter.com/qe6bZOvK8O— NBT Hindi News (@NavbharatTimes) July 2, 2026VIDEO | Delhi: Several parts of the national capital received light to moderate rainfall on Thursday morning, bringing relief from the humid conditions. Visuals from near Mayur Vihar.#DelhiRains #Monsoon #WeatherUpdate(Full video available on PTI Videos -… pic.twitter.com/pYciTxQTxg— Press Trust of India (@PTI_News) July 2, 2026VIDEO | Rain lashes parts of Delhi. Visuals from Pandit Pant Marg.#DelhiRains #Monsoon #WeatherUpdate(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/nBKeggeekQ— Press Trust of India (@PTI_News) July 2, 2026ఈ వర్షాలతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. అయితే భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు చెట్ల కింద, బలహీన నిర్మాణాల వద్ద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
ఎవరు దేశ పౌరులు?
పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అది కేవలం ప్రయాణానికి సంబంధించిన పత్రమని చెప్పింది. ఇది దేశ ప్రజల్లో అలజడి, ఆందోళనలను రేపింది. దేశ పౌరుడిగా నిరూపించుకోవాలంటే, మరింకేమి పత్రాలు కావాలని ప్రజలు అడుగుతున్నారు.మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5–11, ఎవరు దేశ పౌరులో నిర్వచించాయి. రాజ్యాంగం అమలు నాటికి ఎవరు భారత పౌరులో, దేశ విభజన వలన ప్రభావితమైనవారికి కొన్ని షరతులకు లోబడి ఈ దేశ పౌరసత్వం పొందే అర్హతను నిర్వచించింది. భారత పార్ల మెంటుకు దేశ పౌరసత్వంపై చట్టం చేయడానికి ఆర్టికల్ 11 అధికార మిచ్చింది. ఆర్టికల్ 5 ప్రకారం, భారత్లో జన్మించినవారు లేక దేశంలో వారి తల్లిదండ్రులు జన్మించినా ఈ దేశ పౌరులే అని తెలిపింది.ఎవరు దేశ పౌరసత్వానికి అర్హులు అన్నది పౌరసత్వ చట్టం– 1955 నిర్దేశించింది. పౌరసత్వ చట్టంలోని 3, 4, 5, 6 సెక్షన్లు పౌర సత్వం ఏ విధంగా లభిస్తుందో నిర్వచించాయి. సెక్షన్ 3 ప్రకారం 1950 జనవరి 26 తరవాత, 1987 మధ్యన భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికీ; 1987 జూలై 1 తరువాత భారతదేశంలో జన్మించి నవారి తల్లితండ్రులిద్దరూ భారతీయ పౌరులు అయితే లేక తల్లితండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులు, మరొకరు అక్రమంగా భారత దేశానికి వలస రాకుంటే వారికీ భారత పౌరసత్వం లభిస్తుంది. సెక్షన్ 4 ప్రకారం, భారతదేశంలో జన్మించకున్నా, తల్లి, తండ్రి ఈ దేశ పౌరులైతే వారికీ పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థి తుల్లో, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, న్యాచుర లైజేషన్ ద్వారా కూడా సెక్షన్ 5, 6 ప్రకారం పౌరసత్వం లభిస్తుంది.పాస్పోర్ట్కు ఎవరు అర్హులు? పాస్పోర్ట్ చట్టం–1967లో పాస్పోర్ట్ పొందడానికి ఎవరు అర్హులో పేర్కొనలేదు. అయితే, ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, పాస్పోర్ట్ అధికారి, పాస్పోర్ట్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తిరస్కరించాలి. దానిలో మొట్టమొద టిగా పేర్కొన్న కారణం, దరఖాస్తుదారు భారత పౌరుడు కాక పోవడం. అంటే చట్ట ప్రకారం భారత పౌరుడు కానివారికి భారత దేశ పాస్పోర్ట్ పొందే అర్హత లేదు.మరెందుకు భారత ప్రభుత్వం పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్తూ బాంబే హైకోర్టు తీర్పును ఉటంకిస్తున్నది? ‘మోతిమియా రహిమియా వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో తాము భారతదేశంలోనే జన్మించామనీ, దానికి రుజువుగా పాస్పోర్ట్ను కోర్టులో సాక్ష్యంగా చూపి తమను భారత దేశం నుంచి పంపకుండా ఆదేశాలివ్వాలనీ కోరారు. బాంబే హైకోర్టు వారి వాదనను తోసిపుచ్చుతూ, ‘కేవలం వారిచ్చిన సమాచారంపై ఆధారపడి పాస్పోర్ట్ను ప్రభుత్వం ఇచ్చింది. కానీ వారుగానీ, వారి తల్లితండ్రులుగానీ ఈ దేశంలోనే జన్మించారని ఎలాంటి ఆధారం చూపలేదు’ అని పేర్కొంది.చట్టం ప్రకారం పాస్పోర్ట్ అధికారి, తప్పనిసరిగా దరఖాస్తు దారులు భారత పౌరులని నిర్ధారించుకున్న తరవాతనే పాస్పోర్ట్ ఇవ్వడానికి ఆమోదించాలి. పైన చెప్పినట్టుగా, ఎవరు భారత పౌరులో రాజ్యాంగం, పౌరసత్వ చట్టం–1955లో పొందుపరచ బడింది. ఒకవేళ, ఎవరైనా తప్పుడు సమాచారంతో పాస్పోర్ట్ పొందినా, సెక్షన్ 10 ప్రకారం దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వా నికి ఉంది. కాబట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉటంకించి పాస్పోర్ట్ దేశ పౌర సత్వానికి రుజువు కాదని చెప్పడం రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ వక్రీకరించడమే.అంటే, కేవలం దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పాస్పోర్టులు ఆమోదిస్తూ, దేశ భద్రతను పణంగా పెడుతు న్నారని భావించాలా? అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ... పాస్పోర్ట్ దేశ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం. కాబట్టి, ప్రజలను ఈ విధంగా ప్రభుత్వమే తికమకపెట్టడం దారుణం. గతంలో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ వంటివి కూడా పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కావని న్యాయస్థానాలు చెప్పాయి. మరి ఏ పత్రం దేశ పౌర సత్వానికి రుజువో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – కె.ఎస్. హరీశ్ కుమార్, ఏజీఎం (లా) రిటైర్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
బస్సులోంచి తెగిపడిన తల
రెప్పపాటులో ఒక కుర్రాడి జీవితం ఆగిపోయింది. ఇంకా ఎన్నో కలలు కంటూ, భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన 17 ఏళ్ల విద్యార్థి.. ఓ చిన్న నిర్లక్ష్య దారుణరీతిలో బలైపోయాడు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన కుర్రాడిని ఆ ఘోర స్థితిలో చూసి తోటి ప్రయాణికులు వణికిపోయారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో బుధవారం జరిగిన ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగల్చడమేకాదు.. వెన్నులో వణుకు పుట్టించింది. హుబ్బళి నుంచి లక్ష్మేశ్వర్ వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఫక్కీరేష్ అనే 17 ఏళ్ల విద్యార్థి, వెనుక సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్నాడు. కుందగోళ్ (Kundgol) స్టేజ్ దగ్గర్లో ఉండగా.. ఫక్కీరేష్ ఒక్కసారిగా కిటికీలోంచి తల బయటకు పెట్టాడు. క్షణంలోనే వెనుక నుంచి వస్తున్న టిప్పర్ అతడిని బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో అతని తల తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయగా, బస్సులో విషాద వాతావరణం నెలకొంది. మృతుడు అతను ఐటీఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థిగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.కదులుతున్న వాహనాల్లో కిటికీల వద్ద జాగ్రత్తలు పాటించకపోతే చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
'చెవిలో పువ్వులు పెడుతున్నారా?.. అదంతా ప్రజల సొమ్మే!'
వీధి కుక్కల నియంత్రణ అంశంలో పలు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు తీవ్ర నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అది ఎలా ఉందో తెలియజేసే ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి వచ్చిన అధికారుల వద్ద కనీస సమాచారం కూడా లేకపోవడంపై ఆయన వాళ్లపై మండిపడ్డారు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంగళవారం బెంగళూరులో కర్ణాటక మంత్రి రాష్ట్ర మంత్రి కృష్ణ బైరెగౌడ నేతృత్వంలో వీధికుక్కల నియంత్రణం అంశంపై సమీక్ష సమావేశం జరింది. దీనికి పశుసంవర్ధక శాఖకు చెందిన 19 మంది అధికారులు పాల్గొన్నారు. అయితే గత ఐదేళ్ల ఖర్చు, ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు, ప్రస్తుతం వీధికుక్కల సంఖ్య ఎంత వంటి ప్రాథమిక వివరాలు కూడా వారి వద్ద లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు."మీరు సమావేశానికి ఎందుకు వచ్చారు? కనీస డేటా కూడా లేకుండా ఎలా వచ్చారు? అదంతా ప్రజల డబ్బు కదా? ఎక్కడికి పోయింది? అలా ఎలా ఖర్చు పెట్టారు?" అంటూ కాస్త కఠినంగానే అధికారులను ప్రశ్నించారు. ఐదేళ్ల వ్యయ వివరాలు వెంటనే ఇవ్వాలని, డేటా లేకుండా సమావేశానికి రావడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.ఈ క్రమంలో అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఆ ఇచ్చిన సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో మంత్రి మరింత అసహనం వ్యక్తం చేశారు. "నేను చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చోలేదు.. మీరు చెప్పిందల్లా వినడానికి" అంటూ కన్నడలోని ఒక సామెతను ఉపయోగిస్తూ.. తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా.. వీధికుక్కల సంఖ్య యథాతథంగా ఉండటంపై ఆయన తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు.Bengaluru Development Minister @krishnabgowda on Tuesday pulled up Animal Husbandry Department officials during a review meeting over the stray dog sterilisation programme. Questioning how stray dog population had remained unchanged despite sterilisation being carried out for… https://t.co/a3bPBWvJcI pic.twitter.com/b3HQPZ5Ls9— ChristinMathewPhilip (@ChristinMP_) June 30, 2026ఈ సందర్భంగా సంబంధిత అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని సమావేశంలోనే ఆదేశించారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, స్టెరిలైజేషన్ల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులను ఆదేశించారు.కృష్ణ బైరెగౌడ కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుకుని, అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న కృష్ణ బైరెగౌడ.. ప్రస్తుతం బెంగళూరు అభివృద్ధి శాఖ (Bengaluru Development) మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనంపై రాజీ పడని నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కృష్ణ బైరెగౌడ అధికారుల పనితీరుపై కఠిన వైఖరికి పేరుగాంచారు. ఇటీవల కూడా నాసిరకం రోడ్డు నిర్మాణ పనులను గుర్తించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు కాంట్రాక్టర్కు జరిమానా విధించారు. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు.సుప్రీంకోర్టు కూడా సీరియస్..దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు, రేబీస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై భారత సుప్రీంకోర్టు కూడా పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కల సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, జంతు సంక్షేమ నిబంధనలను కూడా పాటించాలని స్పష్టం చేసింది. కేవలం స్టెరిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం కాకుండా.. వాటి ఫలితాలు ప్రజలకు కనిపించేలా ఉండాలని కోర్టు పరోక్షంగా సూచించింది. ఈ నేపథ్యంలో.. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై కర్ణాటక మంత్రి కృష్ణ బైరెగౌడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
హమ్మయ్యా... అది కూడా ఆరోగ్యమేనట!
ఆరోగ్యం అంటే ఏమిటి? కండలు తిరిగిన దేహమా? జబ్బుల్లేని జీవితమా? ఎంత తిన్నా లావు కాకపోవడమా? లేక ఎలాంటి చింతా, దిగులు లేకుండా జీవించడమా?..నిజానికి, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే భారతీయ సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటికీ, వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. "మెంటల్" అనే ముద్ర పడుతుందేమో, నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అనే భయంతో చాలామంది తమ సమస్యను బయటకు చెప్పడానికే వెనుకాడుతున్నారు.అయితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మణిపాల్ సిగ్నా నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ సర్వే ప్రకారం తొలిసారిగా భారతీయులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది మానసిక ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావిస్తుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో 53 శాతం మంది ఇప్పటికీ వ్యాయామం, ఫిట్నెస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.మెదడు పగిలేంత ఒత్తిడి... కానీ సమస్యే కాదట!ఈ అధ్యయనం బయటపెట్టిన మరో ఆందోళనకర విషయం భారతీయులు.. స్ట్రెస్ను చాలా తేలికగా తీసుకోవడం!. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పినా, అది తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అంగీకరించింది కేవలం ఒక శాతం మాత్రమే. అంటే ఒత్తిడి ఎంత తీవ్రమైనా, దాన్ని ఆరోగ్య సమస్యగా భావించే అవగాహన ఇంకా చాలామందిలో లేదన్నమాట.ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆరోగ్య ఖర్చుల భారం చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ)ని పెంచుతుండగా, ఆరోగ్య బీమా ఉన్నవారిలో ఈ ఒత్తిడి కొంత తక్కువగా కనిపించింది.శారీరక, మానసిక ఆరోగ్యాలను వేర్వేరుగా చూడలేమని, రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని మణిపాల్ సిగ్నా సీఈవో జోయ్దీప్ సాహా పేర్కొన్నారు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం పెరగడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే సవాళ్లు ఇంకా పెద్దవే. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మానసిక వైద్యుల సంఖ్య పదివేలకు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతుండటం మాత్రం ఆశాజనక పరిణామమే.భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఐదు మానసిక సమస్యలు1. డిప్రెషన్:సుమారు 4.57 కోట్ల మంది భారతీయులు డిప్రెషన్తో బాధపడుతున్నారు. దేశంలో ఏటా జరిగే దాదాపు 2.5 లక్షల ఆత్మహత్యలకు ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిరుద్యోగం, లింగ వివక్ష, సామాజిక అసమానతలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.2. యాంగ్జైటీ డిజార్డర్స్:ఓసీడీ, పీటీఎస్డీ, పానిక్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, ఫోబియాలు వంటి అనేక సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని చాలామంది అసలు మానసిక సమస్యలుగానే గుర్తించకపోవడం వల్ల లక్షలాది మంది చికిత్సకు దూరమవుతున్నారు.3. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం: దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 83 లక్షల మంది తీవ్ర వ్యసనపరులుగా ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించే వారు 3.7 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. సుమారు 18 లక్షల మంది చిన్నారులు కూడా వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.4. బైపోలార్ డిజార్డర్:దేశ జనాభాలో కనీసం రెండు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతకాలం అమితమైన ఉత్సాహంతో ఉండటం, ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోవడం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆత్మహత్య ప్రమాదం కూడా పెరుగుతుంది.5. స్కిజోఫ్రేనియా:ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రాంతులు, ఆలోచనల్లో గందరగోళం, సమాజానికి దూరంగా ఉండడం దీని ప్రధాన లక్షణాలు. పురుషుల్లో ఇది తక్కువ వయసులోనే కనిపించగా, మహిళల్లో గర్భధారణ, ప్రసవం సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల్లాగే వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులే. వాటిని దాచిపెట్టడం కాదు, గుర్తించి సరైన సమయంలో నిపుణులను సంప్రదించడమే నిజమైన ఆరోగ్యానికి మొదటి అడుగు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అయోధ్య విరాళాల స్కామ్.. కీలక సభ్యుల రాజీనామా
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోట్లాది మంది భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో.. అయోధ్య రామమందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చంపత్రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్ను యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఎనిమిది మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ కేసులో అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద కేసులు నమోదు చేసి సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.దర్యాప్తు సంస్థల ప్రాథమిక అంచనాల ప్రకారం.. రామమందిరానికి భక్తులు సమర్పించిన రూ.200 కోట్లకు పైగా విరాళాలు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయి. హుండీల్లో పడిన నగదు, విలువైన కానుకల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు విచారణలో వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.ఈ కేసులో మరింత సంచలనంగా మారిన అంశం.. సీసీటీవీ ఫుటేజీ మాయమవడం. అలాగే ఆలయ హుండీల తాళాలు అధికారిక ట్రస్ట్ ప్రతినిధుల వద్ద కాకుండా అనధికార వ్యక్తుల వద్ద ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో విరాళాల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు విశ్వాసంతో సమర్పించిన డబ్బు, కానుకలను అంతర్గతంగా ఉన్నవారే దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.ప్రస్తుతం అరెస్టయిన నిందితులను సిట్ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. విరాళాల సొమ్ము ఎక్కడికి మళ్లింది? ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ట్రస్ట్లోని మరికొందరికి ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.దేశంలో అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన అయోధ్య రామమందిరంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా సమర్పించిన విరాళాలే అక్రమాలకు గురయ్యాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రస్ట్లో ఇద్దరు కీలక సభ్యుల రాజీనామా, పలువురు అరెస్టులు, భారీ విరాళాల మాయంపై ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.యోగి ఏమన్నారంటే.. అయోధ్య విరాళాల చోరీ కేసుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పందించారు. "అయోధ్య మన విశ్వాసానికి ప్రతీక. అయోధ్యపై నిరాధార ఆరోపణలు చేయొద్దు.. శ్రీరాముడిని గౌరవించడం నేర్చుకోండి. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముందే చెప్పాం. ఇప్పుడు నివేదిక వచ్చింది.. చర్యలు కూడా ప్రారంభమయ్యాయి" అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన.. "ఈరోజు ఆరోపణలు చేస్తున్నవారే ఒకప్పుడు శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించారు. అయోధ్య ఉద్యమాన్ని మొదటి నుంచే వ్యతిరేకించారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేసిన వారిపై లాఠీచార్జీలు, కాల్పులు జరిపారు. రామనవమి వేడుకలను అడ్డుకునేందుకు, కావడ్ యాత్రను నిషేధించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ దేశాన్ని దోచుకోవడమే కాకుండా ముక్కలు చేసింది. ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే వాటిని సిట్కు అందించాలి. రామభక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడొద్దు" అని యోగి అన్నారు. -
కాంగ్రెస్ వస్తే.. బీజేపీ నేతలు సెక్యూరిటీతో తిరగాలి
న్యూఢిల్లీ: సీనియర్ నేత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్రంలో అధికార మార్పు జరిగితే.. రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. గత 12-15 ఏళ్ల పరిణామాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొంటూ.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నాయకులు ప్రజల్లోకి భద్రత లేకుండా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుండగా, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి.గురువారం కాంగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ ఖేరా.. గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. అధికార దుర్వినియోగం, దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్షాలపై రాజకీయ ఒత్తిళ్లు వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు భద్రత లేకుండా రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.A very strong statement by Congress MP @Pawankhera ji to BJP, “Let our government come to power. When we recount these 12–15 years, BJP leaders will not be able to step out on the streets without security. I am telling you this, they will even need protection to come out in… pic.twitter.com/YrpIHF96Ch— Harmeet Kaur K 🇮🇳 (@iamharmeetK) June 25, 2026మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం పవన్ ఖేరా వ్యాఖ్యలను వేరే కోణంలో చూడాలని అంటున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల వినియోగం, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వంటి అంశాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వివరిస్తున్నాయి.అయితే పవన్ ఖేరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వాటిని రాజకీయ వ్యాఖ్యలుగానే అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. -
కుట్ర లవర్స్దే.. మరి తోసిందెవరు?
పెళ్లికి పెద్దల అంగీకారం.. ఒకరికొకరు ప్రేమలో మునిగి తేలడం.. బయటకు కనిపించిన కథ ఇదే. కానీ ఆ నవ్వుల వెనుక ఓ చీకటి కుట్ర నడిచింది. రహస్య ప్రేమ, కేఫ్లలో జరిగిన గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు, వేల ఫోన్ కాల్స్, వరుస విఫల హత్యాయత్నాలు... చివరకు లోహగడ్ కోట అంచున ఓ యువ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. పుణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కుట్ర వెనుక ఉన్న దాదాపు అన్ని కోణాలను పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తొలుత కనిపించిన దృశ్యం ఒక సాధారణ ప్రమాదం. ట్రెక్కింగ్కు వెళ్లిన యువకుడు లోయలో పడి మృతి చెందాడు. కాబోయే భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కూడా ప్రమాద మరణంగానే కేసు నమోదు చేశారు. కానీ ఆ కథలో ఏదో తేడా ఉందనే అనుమానం మొదట కేతన్ కుటుంబ సభ్యులకే వచ్చింది. ముఖ్యంగా కేతన్ సోదరి సంజనా అడిగిన కొన్ని ప్రశ్నలకు.. నిందితురాలు సియా గోయల్ ఇచ్చిన సమాధానాలు దర్యాప్తును పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించాయి. అక్కడి నుంచే ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు.. ప్రేమ, మోసం, కుట్ర, హత్యతో కూడిన భయంకర కథను వెలుగులోకి తీసుకొచ్చాయి.జూన్ 18న లోహగడ్ కోట వద్ద ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ సమయంలో జరిగిన ఘటన తర్వాత కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు. తొలుత ప్రమాద మరణంగా కేసు నమోదైంది. అయితే అంత్యక్రియలు పూర్తైన నాలుగు రోజుల తర్వాత కేతన్ సోదరి సంజనా సియాకు ఫోన్ చేసింది. ఇంటికి రమ్మంటూ పిలిచింది. సోదరుడి గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అలా.. అసలు ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించింది. సియా చెప్పిన వివరాల్లో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు మళ్లీ మొదలైంది.విచారణలో బయటపడిన అంశాలు ఒక్కొక్కటిగా సియాపై అనుమానాలను పెంచాయి. కేతన్ మరణానికి ముందు ఆమె పలుమార్లు లోహగడ్కు రావాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 31న మొదటిసారి అక్కడికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జూన్ 4న కూడా వెళ్లాలని పట్టుబట్టిందని, కానీ కేతన్ తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో అది జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మే 31న ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జూన్ 14న మరోసారి ఇద్దరూ లోహగడ్కు వెళ్లారు. అక్కడే మొదటి హత్యాయత్నం జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లోయ అంచు వద్ద కేతన్ను నెట్టినప్పుడు అతడు పొదలను పట్టుకుని బయటపడ్డాడని, వెంటనే సియా పాము కనిపించిందంటూ నాటకం ఆడి పరిస్థితిని చక్కబెట్టిందని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో అది ప్రమాదంగా కనిపించినా.. ఇప్పుడు అదే ఘటన హత్యా కుట్రలో భాగమని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు బాలి ట్రిప్ కూడా కేసులో కీలక అంశంగా మారింది. ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం కేతన్, సియా ఇండోనేషియా వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణానికి ముందు కేతన్ పాస్పోర్ట్ కనిపించకుండా పోయింది. దీంతో ట్రిప్ రద్దయింది. ఈ ఘటన వెనుక కూడా సియా పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ను బాలి వెళ్లకముందే హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పాస్పోర్ట్ను మాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.దర్యాప్తులో మరో కీలక మలుపు సీసీటీవీ ఫుటేజీలతో వచ్చింది. టికెట్ కౌంటర్ వద్ద కేతన్, సియా నడుచుకుంటూ వెళ్తుండగా.. కొంత దూరంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని వెంబడిస్తున్న దృశ్యాలు కనిపించాయి. 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. అంతా వేడిలోనూ కూడా ముఖం కనిపించకుండా హుడీ, హెడ్సెట్తో తిరగడం పోలీసులకు అనుమానం కలిగించింది. తర్వాత అతడే చేతన్ చౌదరి అని గుర్తించారు.చేతన్ తన మొబైల్ను ఇంట్లో వదిలేసి, ఒక ఉద్యోగి ఫోన్తో ప్రయాణించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. లోకేషన్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికే ఈ ప్లాన్ వేసినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా ఫొటోలు, డిజిటల్ ఆధారాలను సరిపోల్చిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కాల్ రికార్డులు మరింత బలపరిచాయి. జనవరి 1 నుంచి జూన్ 18 వరకు సియా, చేతన్ల మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంటల తరబడి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వ్యాపార పరిచయంతో మొదలైన సాన్నిహిత్యం ప్రేమగా మారిందని, కేతన్తో పెళ్లి విషయంలో సియా ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని దర్యాప్తులో తేలింది.పోలీసుల కథనం ప్రకారం.. సియా, చేతన్లు గత ఏడాది దీపావళి వేడుకల్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత తరచూ కేఫ్లలో కలుస్తూ హత్యా ప్రణాళికను రచించినట్లు అనుమానిస్తున్నారు. సియా పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేదని, కుటుంబ ఒత్తిడితో సంబంధాన్ని కొనసాగించిందని విచారణలో వెల్లడైంది. అయితే చేతన్తో పారిపోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. నిశ్చితార్థం రద్దు చేసి ప్రేమికుడితో వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందని భావించిందని చేతన్ విచారణలో చెప్పినట్లు సమాచారం.కేతన్, సియా వివాహం నవంబర్లో ఉదయ్పూర్లో జరగాల్సి ఉంది. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జూన్ 18న జరిగిన ట్రెక్కింగ్ ప్రయాణమే కేతన్ జీవితానికి చివరి ప్రయాణమైంది.పోలీసుల ప్రకారం, ఘటన రోజున చేతన్ ముందుగానే లోహగడ్కు చేరుకుని అక్కడ మాటు వేసి ఉన్నాడు. తర్వాత సియా, కేతన్లను అనుసరిస్తూ ఏకాంత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి కేతన్ను సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టే ప్లాన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆపై సియా కేకలు వేస్తూ భద్రతా సిబ్బందిని పిలిచి, అది ప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదు చేశారు.ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చేతన్ స్నేహితుడు నీరజ్ను కూడా అదుపులోకి తీసుకుని అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, ఘటనాస్థల పరిశీలన కొనసాగుతోంది.అయితే ఈ కేసులో ఇప్పటికీ ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కేతన్ను చంపాలన్న కుట్ర ఇద్దరిదేనని పోలీసులు చెబుతున్నారు. కానీ చివరి క్షణంలో లోయ అంచున నిలబడ్డ కేతన్కు నెట్టేసి చంపింది ఎవరు?.. పక్కనే నడుస్తున్న సియానా?.. లేక మాటు వేసి ఎదురుచూస్తున్న చేతనా?.. లేదంటే ఇద్దరూనా?. వీళ్లకు సహకరించిన నీరజా? ఈ విషయంలో నిందితుల నుంచి మౌనమే పోలీసులకు ఎదురవుతోంది. అదే సమయంలో.. వాళ్ల తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. దర్యాప్తు మొత్తం ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగి.. ఆ సమాధానం బయటపడే వరకు ఈ కేసు అతిపెద్ద మిస్టరీ అలాగే కొనసాగనుంది. -
టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలు!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు వర్గాలు పార్టీ మమతా బెనర్జీకి షాక్ల మీద షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే ఎంపీల వర్గం విలీనం పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల వర్గం ఆమెను పార్టీ చైర్పర్సన్ పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించడమే కాకుండా.. కొత్త నాయకత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని కూడా చెబుతోంది. దీంతో టీఎంసీలో అంతర్గత సంక్షోభం మరో మలుపు తిరిగినట్లైంది.ప్రతిపక్ష నేత(తాత్కాలిక) రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నేతృత్వంలోని అసంతృప్త వర్గం సోమవారం కోల్కతాలోని న్యూ టౌన్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు సహా దాదాపు 500 మంది టీఎంసీ నాయకులు హాజరైనట్లు తిరుగుబాటు వర్గం ప్రకటించింది. ఈ సమావేశంలో 30 మంది సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని (National Working Committee) ఏర్పాటు చేస్తూ, తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించారు.కొత్త అధినేత అరూప్ రాయ్సమావేశంలో ఎమ్మెల్యే అనూప్ రాయ్ను కొత్త చీఫ్గా ఎన్నుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. అలాగే మాజీ కోల్కతా మేయర్ ఫర్హిద్ హకీమ్ , అరోప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా యాస్మిన్లను ఉపాధ్యక్షులుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా, అఖ్రుజ్జమాన్ అన్సారిని ఖజానాదారుగా నియమించినట్లు ప్రకటించారు.ఎవరీ అరూప్?అరూప్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. హౌరా ప్రాంతానికి చెందిన ఆయన, తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. హౌరా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, మమత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం టీఎంసీలో తిరుగుబాటు వర్గం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అరూప్ రాయ్ను పార్టీ చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఒకప్పుడు మమతకు నమ్మినబంటుగా ఉన్న నేతే ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.మమతకి మరో చాన్స్మమత బెనర్జీని పార్టీ నుంచి పూర్తిగా దూరం చేయలేదని, ఆమె కోరుకుంటే ప్రధాన సలహాదారుగా (Chief Advisor) వ్యవహరించవచ్చని తిరుగుబాటు వర్గం వ్యాఖ్యానించడం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉండగా, 2022లో ఏర్పాటైన కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీ ఏర్పాటు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.మమత, అభిషేక్ ఫొటోలకు చోటు లేదు!తిరుగుబాటు వర్గం నిర్వహించిన సమావేశంలో టీఎంసీ పార్టీ గుర్తు కనిపించినప్పటికీ, మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఫొటోలు కనిపించకపోవడం గమనార్హం. ఇది పార్టీపై తమ హక్కును ప్రకటించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.టీఎంసీ క్రమశిక్షణా చర్యలుమరోవైపు అధికారిక టీఎంసీ నాయకత్వం కూడా వేగంగా స్పందించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్హాద్ హకీమ్, అరోప్ బిశ్వాస్, అరూప్ రాయ్, జావేద్ ఖాన్, రతిన్ ఘోష్, బిప్లబ్ మిత్రా, స్నేహాశిష్ చక్రవర్తి, సబీనా యాస్మిన్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఎంపీల దారి వేరే..!టీఎంసీలో అసంతృప్తి ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు. ఇప్పటికే 20 మంది తిరుగుబాటు ఎంపీలు పార్టీకి గుడ్బై చెబుతూ **నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)**లో విలీనమయ్యారు. అంతేకాదు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటించారు. త్రిపురలో వెయ్యి ఓట్లకే పరిమితమైన ఓ అనామక పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.ఒరిజినల్ టీఎంసీ ఏది?పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే టీఎంసీలో అసంతృప్తి స్వరాలు వినిపించడం మొదలైంది. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో నాయకత్వానికే సవాల్ విసిరిన ఘటన ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు తిరుగుబాటు వర్గం తమదే అసలైన టీఎంసీ అని ప్రకటిస్తుండగా, మరోవైపు అధికారిక నాయకత్వం క్రమశిక్షణా చర్యలకు దిగింది. దీంతో పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులు, నాయకత్వంపై పోరు మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలు!ఇప్పటివరకు ఇది కేవలం రాజకీయ తిరుగుబాటులా కనిపించినా.. అసలు పోరు ఇకపై ఎన్నికల సంఘం వద్ద జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. "అసలైన తృణమూల్ కాంగ్రెస్" ఎవరిది? పార్టీ గుర్తుపై హక్కు ఎవరికుంది? తిరుగుబాటు వర్గం బలం ఎంత? మమతా బెనర్జీ తదుపరి అడుగు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లోనే తేలనున్నాయి. అందుకే బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్క అంశంపైనే ఉంది... టీఎంసీ సంక్షోభం అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైందా?. -
NEET రీ-ఎగ్జామ్.. వెలుగులోకి భారీ కుంభకోణం!
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్-యూజీ రీ-ఎగ్జామ్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా, ఒక్క బీహార్లోనే ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్వర్క్ను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.బిహార్లో నీట్ రీటెస్ట్-2026 సందర్భంగా భారీ అక్రమాలు వెలుగు చూశాయి. పరీక్ష రాస్తున్న వారి స్థానంలో ఇతరులు హాజరయ్యిన ఘటనలు బయటపడటంతో అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 30 మంది అరెస్టు కాగా, అందులో 9 మంది నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాస్తూ పట్టుబడటం కలకలం రేపింది. లఖిసరాయ్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. కేఆర్కే హైస్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్పూర్ స్కూల్ నుంచి మరో వ్యక్తి.. నకిలీగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. వీరంతా వేరే అభ్యర్థుల స్థానంలో పరీక్షకు హాజరైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో పాటు మరో 21 మందిని కూడా అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరి పాత్ర ఈ మోసపూరిత నెట్వర్క్లో ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తం అరెస్టుల సంఖ్య 30కి చేరగా.. ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.అరెస్టయిన వారిని ఎస్డీఎం ప్రభాకర్ కుమార్, ఎస్డీపీవో శివమ్ కుమార్ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ మోసానికి వెనుక పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణ కుమార్ ఈ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మరింత మంది ఈ రాకెట్లో భాగమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే NEET పరీక్షలో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి నెట్వర్క్ను బయటకు తీసేందుకు విచారణ కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ స్పందించాల్సి ఉంది. -
‘మోగ్లీ గర్ల్’ పూజ ఇక లేదు
అడవిలో ఒంటరిగా కనిపించిన ఆ చిన్నారి కథ ఒకప్పుడు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మానవ సమాజానికి దూరంగా గడిచిన బాల్యం నుంచి, మనుషుల మధ్య జీవించడం నేర్చుకున్న ఆమె జీవితం పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ సాగిన ఆ ప్రయాణం చివరకు ఆగిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మోగ్లీ గర్ల్’ ఎహ్సాస్ (18) ఇక లేదు.చిన్నారిగా అడవుల్లో దొరికిందని అధికారులు చెబుతున్న ఎహ్సాస్ అలియాస్ పూజ చిన్నవయసులోనే కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా వచ్చిన తీవ్రమైన రక్త సంక్రమణ (సెప్టీసీమియా) ఆమె మృతికి కారణమైందని వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చికిత్స పొందుతూ ఆమె జూన్ 15నే మరణించిందట. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎహ్సాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. అయితే జూన్ 15న ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.ఎహ్సాస్ కథ 2017 జనవరిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలోని మోతీపూర్ రేంజ్ సమీపంలో ఆమె కనిపించింది. అప్పటికి ఆమె మానవ సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నట్లు కనిపించింది. ఆమె ప్రవర్తన కూడా వింతగా అనిపించింది. నాలుగు కాళ్లపై నడవడం, దుస్తులు ధరించడానికి నిరాకరించడం, మనుషులు దగ్గరకు వస్తే దూకుడు దాడులు చేయడం.. ఇవన్నీ అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రముఖ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ రచించిన ‘జంగిల్ బుక్’లోని మొగ్లీ పాత్రతో పోలుస్తూ ఆమెను ‘మోగ్లీ గర్ల్’గా పిలవడం ప్రారంభించారు.రక్షించిన తర్వాత బాలికను తొలుత ‘పూజ’గా పేరు పెట్టిన అధికారులు.. అనంతరం లక్నోలోని ప్రత్యేక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు ‘ఎహ్సాస్’ అనే పేరు పెట్టారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని, మేధో వికలాంగతతో పాటు ఎపిలెప్సీ (మూర్ఛ) సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ, సంవత్సరాల తరబడి అందించిన వైద్య సేవలు, థెరపీ, పునరావాస కార్యక్రమాల వల్ల ఆమె ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది.క్రమంగా దుస్తులు ధరించడం, సంరక్షకులను గుర్తుపట్టడం, సామాజిక జీవనంలోని కొన్ని అంశాలకు అలవాటు పడడం నేర్చుకుంది. ఆమెను చూసుకునే సిబ్బందితో ఆత్మీయ బంధం ఏర్పడింది. ముఖ్యంగా సంరక్షకురాలు రాణిని ‘అమ్మ’ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేదని సహచరులు గుర్తు చేసుకున్నారు.ఎహ్సాస్ మరణంపై భావోద్వేగానికి గురైన రాణి, ‘‘ఒకరోజు ఆమె పూర్తిగా కోలుకుంటుందని ఎప్పుడూ నమ్మేదాన్ని. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు."ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలోకి ఎలా చేరింది? అన్న ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అడవిలో ఒంటరిగా కనిపించిన ఓ బాలిక.. సమాజంలో కలిసిపోవడానికి ప్రయత్నించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ‘మోగ్లీ గర్ల్’గా దేశం గుర్తుపెట్టుకున్న ఎహ్సాస్ జీవితం మాత్రం ఒక అసాధారణ గాథగా నిలిచిపోయింది. -
రాబోయేది ఆషామాషీ ఎల్ నినో కాదు!
ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్ నినో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈసారి ఇది సాధారణ ఎల్నినో కాదని, గతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ఘటనల్లో ఒకటిగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం కొన్ని నెలలపాటు కొనసాగితే భారత్ సహా ప్రపంచానికి ‘ట్రిపుల్ షాక్’ తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అసాధారణ వాతావరణ మార్పులు వరుసగా ఎదురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.తాజాగా విడుదలైన నార్త్ అమెరికన్ మల్టీ-మోడల్ ఎన్సెంబుల్ (NMME) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అంచనాల ప్రకారం.. మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సాధారణ స్థాయికంటే 2 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని నమూనాల్లో ఈ వ్యత్యాసం 5 డిగ్రీల సెల్సియస్ను కూడా దాటవచ్చని సూచిస్తున్నాయి.వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. పసిఫిక్లోని నినో-3.4 ప్రాంతంలో(మానిటరింగ్ జోన్) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1.5 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటే దాన్ని ‘బలమైన ఎల్నినో’గా పరిగణిస్తారు. 2 డిగ్రీలకుపైగా పెరిగితే ‘సూపర్ ఎల్నినో’గా వర్గీకరిస్తారు. తాజా అంచనాల ప్రకారం 2026 చివరినాటికి ఈ స్థాయిని దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇది ఇంకా ప్రారంభ అంచనాల దశలోనే ఉన్నందున తుది ఫలితంగా పరిగణించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వివిధ వాతావరణ నమూనాలు ఎల్ నినో బలపడే సంకేతాలను చూపుతుండటంతో శాస్త్రవేత్తలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.ఎల్నినో ప్రభావం వల్ల భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల ప్రసరణ విధానాలు మారిపోతాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, సముద్ర ఉష్ణ తరంగాలు, పగడపు దిబ్బల నాశనం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే భారత్కు ఇది మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.చరిత్రను పరిశీలిస్తే బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, వడగాల్పులు తీవ్రరూపం దాల్చడం వంటి పరిస్థితులు తరచుగా కనిపించాయి. దీంతో వ్యవసాయం, తాగునీటి వనరులు, ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అస్తవ్యస్తత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు పెరగవచ్చు. దక్షిణ అమెరికా పశ్చిమ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది. ట్రిపుల్ షాక్.. ఎల్ నినో బలపడితే ఒకేసారి మూడు పెద్ద స్థాయిలో ప్రభావాలు రావచ్చని సూచన:రుతుపవనాలు బలహీనపడే అవకాశంవర్షాభావం / కరువు పరిస్థితులువడగాల్పులు పెరగడంకొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో భారీ వర్షాలు/వరదలుగ్లోబల్ టెంపరేచర్లు పెరగడంసముద్ర ఉష్ణతరంగాలుపగడపు దిబ్బల (coral reefs) నష్టంకార్చిచ్చులు పెరగడం (ఆస్ట్రేలియా/ఆగ్నేయాసియా)ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా భూమి అసాధారణ వేడిని ఎదుర్కొంటున్న వేళ.. దానికి ఎల్నినో ప్రభావం తోడైతే 2027 వరకూ ప్రపంచం మరింత తీవ్రమైన వాతావరణ అస్తవ్యస్తతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
టెలిగ్రామ్ బ్యాన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
నీట్ రీ-ఎగ్జామ్కు ముందు కేంద్రం విధించిన టెలిగ్రామ్పై టెంపరరీ బ్యాన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించగా.. కోర్టు అందుకు అంగీకరించింది. దీంతో న్యాయస్థానంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.నీట్ యూజీ 2026 రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ, టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ తేజస్ కారియా విచారించేందుకు అంగీకరించారు. ఇవాళే ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.#BREAKING Telegram moves Delhi High Court against Centre's ban on the platform https://t.co/9ncovLLlaY— Live Law (@LiveLawIndia) June 17, 2026కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. NEET రీ-ఎగ్జామ్ (జూన్ 21) దాకా కొన్ని రోజులు పాటు టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించబడింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పేపర్ లీక్ రాకెట్లు, ఫేక్ మెసేజ్లు, మోసపూరిత ఛానల్స్ను అడ్డుకోవడమే ఈ చర్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమాచార సాంకేతిక చట్టం(IT Act) సెక్షన్ 69A కింద ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎన్టీఏ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. అయితే ఇది లక్షలాది సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తోందని టెలిగ్రామ్ తన పిటిషన్లో పేర్కొంది.టెలిగ్రామ్ను అడ్డుకున్నంత మాత్రాన మిగతా యాప్లతో పేపర్ లీక్లు జరగడం లేదా? అని పిటిషన్లో కేంద్రానికి టెలిగ్రామ్ సూటి ప్రశ్న వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి కారణమైన ప్రధాన అంశం నీట్ పరీక్షల చుట్టూ పెరిగిన ఫేక్ పేపర్ లీక్ నెట్వర్క్. “PAPER LEAKED NEET”, “Re-NEET 2026” వంటి పేర్లతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. కొందరు ఛానల్స్ కొన్ని వేల నుండి లక్షల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిట్ ఫీచర్ను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. పరీక్ష తర్వాత ఫేక్ పేపర్ లీక్ సాక్ష్యాలు సృష్టించడానికి ఈ ఫీచర్ను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్టీఏ ఆరోపించింది. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా స్పందించారు. భారత్లో 15 కోట్లకు పైగా వినియోగదారులను ప్రభావితం చేసే ఈ చర్య తప్పుడు నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఇటు డిజిటల్ హక్కుల సంస్థలు కూడా దీనిని “ఓవర్ బ్రాడ్ రెస్పాన్స్”గా అభివర్ణించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యను తాత్కాలిక భద్రతా చర్యగా పేర్కొంటోంది. పరీక్ష సజావుగా, మోసాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యమని ఇటు ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం గమనార్హం. -
టీఎంసీలో మరో ట్విస్ట్.. అందుకు ఎమ్మెల్యేల నో!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు టీవీ సీరియల్లా సాగిపోతూ.. వెబ్ సిరీస్ల పూటకో ట్విస్టులను పంచుతున్నాయి. ప్రతిపక్ష తృమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంతర్గత సంక్షోభం.. రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఆ పార్టీ మెజారిటీ ఎంపీలు సరికొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఇప్పుడు మెజారిటీ సంఖ్యలో ఉన్నామని చెప్పుకుంటున్న రెబల్ ఎమ్మెల్యేల వర్గ వైఖరి ఏమిటన్న ఆసక్తి నెలకొంది.టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు.. ఓ అనామక పార్టీ అయిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ‘ప్రత్యేక సిట్టింగ్’ కేటాయించమని లేఖ కూడా అందజేసింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించింది కూడా. ఈ పరిణామం మమతా బెనర్జీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో టీఎంసీ ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. టీఎంసీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు(64 మంది) తనకే ఉందని.. తనకు తానుగా ప్రతిపక్ష నేతగా ప్రకటించుకున్నారు రితబ్రతా బెనర్జీ. రెబల్ ఎంపీల దారిలోనే పయనిస్తారా? అనే ప్రశ్నకు ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానమే వచ్చింది. ఎమ్మెల్యేల వర్గం మాత్రం ఆ నిర్ణయాన్ని అనుసరించబోదని రితబ్రతా బెనర్జీ స్పష్టం చేశారు. తమ వర్గంలో అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ చర్చకు రాలేదని, ఎన్సీపీఐలో చేరే ఆలోచన కూడా తమకు లేదని తెలిపారాయన. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని చెబుతున్న రితబ్రతా బెనర్జీ.. ఎంపీల విలీన నిర్ణయం గురించి కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని అన్నారు. శాసనసభ పక్షంగా తమకు ఆ విషయంపై ఎలాంటి సమాచారం లేదని.. కాబట్టి విలీనంపై చర్చే లేదని పేర్కొన్నారు.మరోవైపు తిరుగుబాటు ఎంపీల వర్గం తామే అసలైన టీఎంసీ అని గుర్తింపు కోరుతూ, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు సాధించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేల వర్గం మాత్రం అలాంటి పనులు చేయబోమని అంటోంది. మమతా బెనర్జీనే తమ నాయకురాలని.. ఆమె మార్గదర్శకత్వంలోనే తాము ముందుకు సాగాలని అనుకుంటున్నామని రితబ్రతా చెబుతున్నారు. అయితే అధికారిక టీఎంసీ వర్గం ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీ మొత్తం విలీనమైతేనే అది చట్టబద్ధమవుతుందని, కేవలం ఎంపీలు లేదంటే ఒక వర్గం విడిపోవడం ద్వారా కొత్త గ్రూప్కు గుర్తింపు ఇవ్వలేమని రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉటంకిస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో అసంతృప్తి బహిర్గతమైంది. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ చీలిక మొదలైంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. 1998లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఇదేనని చెబుతున్నారు.ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం తమకు రెండొంతులకుపైగా సభ్యుల మద్దతు ఉందని చెబుతుండగా.. అధికారిక టీఎంసీ మాత్రం పార్టీ పూర్తిగా ఏకతాటిపై ఉందని.. తిరుగుబాటు నేతల వాదనలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేస్తోంది. దీంతో బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ భవిష్యత్తు ఎటువైపు మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ మరింత పెరిగింది. -
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
బేకరీలోకి వెళ్తే మీకు కేకులు, కూల్డ్రింకులు, బిస్కెట్లు చాకెట్లు కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడ ఓ షాప్లో మాత్రం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అక్కడ కస్టమర్లకు “స్వీట్ షాక్” కాదు, నేరుగా “సర్ప్రైజ్ షాక్” ఎదురైంది. లోపల కనిపించిన దృశ్యం చూసి కొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు!ఉత్తరప్రదేశ్లోని మీరట్ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో భారీ కొండచిలువ కనిపించి అందరినీ హడలెత్తించింది. అది బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చిందా? లేదంటే డిస్కౌంట్ ఆఫర్ చూసి వచ్చిందా? అనే జోకులు పక్కన పెడితే… అక్కడి సిబ్బంది మాత్రం ‘బాబోయ్’ అంటూ బయటకు పరుగులు తీశారు. పామును చూసిన వెంటనే షాప్లో క్షణాల్లోనే “బిజినెస్ క్లోజ్, ఎమర్జెన్సీ ఓపెన్” పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. కానీ సమస్య ఏంటంటే… ఆ పాము దాగిన చోటు అంత ఈజీగా కనిపించలేదు. దాదాపు 3 గంటల పాటు సాగిన సినిమా స్టైల్ రేస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ భారీ పైథాన్ను సురక్షితంగా పట్టుకున్నారు. తీరా చూస్తే అది ఎనిమిది అడుగుల పొడవుతో భయానకంగా ఉంది. చుట్టూ గుమిగూడిన జనాలు మొత్తం “ఇదేందిరా ఇంత ఉంది!” అనే ఫీలింగ్లో షాక్లోనే నిల్చిపోయారు. ఆ సమయంలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నవాళ్లు.. పైథాన్ను పట్టుకునే క్రమంలో ఒకరి మీద ఒకరు వేసుకున్న జోకులతో అక్కడంతా నవ్వులు పూశాయి.చివరికి పామును అడవిలోకి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ షాప్ మాత్రం ఒక్క రోజుకే “స్వీట్ షాప్” నుంచి “స్నేక్ షాక్ 🐍”గా ఫేమస్ అయిపోయింది!. స్వీట్స్ కోసం వెళ్లిన వాళ్లకి ‘స్వీట్ బిల్’ కాదు… జీవితాంతం గుర్తుండే షాక్ బిల్ పడింది! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.#मेरठ: दुकान में घुसा विशाल अजगरसिविल लाइन क्षेत्र में मची दहशतकर्मचारियों में मची अफरा-तफरीवन विभाग ने चलाया रेस्क्यूतीन घंटे बाद पकड़ा गया अजगरसुरक्षित रेस्क्यू के बाद राहत#Meerut #UPNews #BreakingNews #Python #Rescue #ForestDepartment #LocalNews #UPNow pic.twitter.com/RamOTx0ko5— UP NOW (@UPNOWTV) June 14, 2026 -
సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి (Returning Officer) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన ఆమె నామినేషన్ను, పెండింగ్లో ఉన్న ఒక క్రిమినల్ కేసును(తెలంగాణలో నమోదు అయ్యింది) వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ్టి విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, సంబంధిత కేసులో ఇప్పటివరకు చార్జీలు (charges) ఫ్రేమ్ కాలేదని తెలిపారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చార్జీలు నమోదు కాకుండా నామినేషన్ను తిరస్కరించడం సరైనది కాదని ఆయన కోర్టుకు వివరించారు. అయితే ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ, నామినేషన్ ప్రక్రియ అనంతరం రిటర్నింగ్ అధికారి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి నామినేషన్ను అంగీకరించిన ఏమైనా తీర్పులు ఉన్నాయా చూపించాలని సింఘ్వీని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఏ కేసులోనైనా వాస్తవాలు వచ్చినప్పుడు మాత్రమే కోర్టు చట్టాన్ని వర్తింపజేస్తుందని.. చట్టం ఇప్పటికే స్పష్టంగా ఉందని.. తగిన సందర్భంలో కోర్టు దాన్ని అమలు చేస్తుందని తెలిపారు.మధ్యప్రదేశ్ ఆర్వో తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. నామినేషన్ తిరస్కరణ అంశం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, అందువల్ల ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ నిలవదని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి ఆర్టికల్ 329 అడ్డుకట్ట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు న్యాయ సమీక్ష పరిధికి బయట ఉంటుందని, ఏదైనా తప్పు జరిగితే అది ఎన్నికల ట్రైబ్యునల్లోనే సవాలు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోహిందర్ సింగ్ గిల్ కేసు సహా పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు.విచారణ సందర్భంగా సాంకేతిక లోపం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఈ జోక్యంపైనా సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల సంఘం అభ్యర్థి తరఫున వాదనలు వినిపించకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే.. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఆర్వో నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఇలాంటివి జరిగినప్పుడు ఈసీని ఆశ్రయించాలని సూచిస్తూ.. పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జరిగిన నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై తాను మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నానని, అవి మరోసారి నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెనుక పారదర్శకత లేకపోవడాన్ని తాము ఎత్తిచూపామని, అయితే తమ వాదనలను సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించినందుకు మాత్రం ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?
న్యూఢిల్లీ: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ ప్రమాదం ఎందుకు? ఎలా? జరిగిందనే కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ తరుణంలో తాజాగా ఉన్నతాధికార వర్గాలు స్పందించాయి. మరో రెండు నెలలు ఒపిక పెడితే అన్ని విషయాలు బయటపెడతాయని కీలక ప్రకటన చేశాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే తుది నివేదిక విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, అనవసర ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని వర్గాలు సూచించాయి. అలాగే దర్యాప్తులోని ఏ అంశాన్నీ దాచిపెట్టబోమని, అన్ని వివరాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చాయి.ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలపై కూడా అధికారులు స్పందించారు. వాటిలో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన విమాన ఇంజిన్లను తయారు చేసిన జీఈ ఏరోస్పేస్ సంస్థ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ.. విచారణలో వెలుగుచూస్తున్న అంతర్గత అంశాల్లో మాత్రం జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. తుది నివేదిక సిద్ధం చేసే ప్రక్రియపై మాత్రమే అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.తుది నివేదిక విడుదలకు ముందుగా ఒక మధ్యంతర స్థితిగతుల నివేదిక (స్టేటస్ రిపోర్ట్) విడుదల చేసే అవకాశాన్ని కూడా ఏఏఐబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనల ప్రకారం అలాంటి నివేదిక తప్పనిసరి కాదని అధికారులు గుర్తుచేస్తున్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కూడా దర్యాప్తు వేగంపై ప్రభావం చూపినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తుకు సంబంధించిన పలు అంతర్జాతీయ భాగస్వాములు, సాంకేతిక నిపుణులు, సంస్థలపై ఆ పరిస్థితుల ప్రభావం పడిందని, అందువల్ల జాప్యానికి దర్యాప్తు బృందాన్ని తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డాయి.గత ఏడాది విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో మాత్రం కీలక విషయాన్ని వెల్లడించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే బోయింగ్ 787 విమానంలోని రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు దాదాపు ఒకేసారి "రన్(RUN)" స్థితి నుంచి "కటాఫ్(CUTOFF)" స్థితికి మారినట్లు గుర్తించారు. దీంతో రెండు ఇంజిన్లకూ ఇంధన సరఫరా నిలిచిపోయి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చారు.అయితే ఆ స్విచ్లు ఎందుకు మారాయి? సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదంటే మరేదైనా కారణమా? అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం తుది నివేదిక వచ్చిన తర్వాతే లభించనుంది. అందుకే ఇప్పుడు విమానయాన రంగం మాత్రమే కాదు.. దేశమంతా ఆ నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.తుగ్లకాబాద్లోని మాధ్యమ్ మార్గ్, నయా తారా అపార్ట్మెంట్ సమీపంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపల పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.అర్ధరాత్రి 2.35 గంటల నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. మూడు ఫైర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, శ్వాస సహాయక యూనిట్, క్విక్ రెస్పాన్స్ వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.Delhi: A fire broke out in a multi-storey building in Tughlakabad Extension during the early hours of the day. The blaze reportedly started in the ground-floor parking area, where 7–8 motorcycles and scooters caught fire, before spreading through the building. The fire department… pic.twitter.com/rHgTcXvG8T— IANS (@ians_india) June 12, 2026అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం లోపల పార్క్ చేసిన వాహనాల వద్ద నుంచి మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, నాలుగు గంటలకు అగ్నిమాపక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న భవన ప్రమాదాలు, అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. గత నెలలో మాలవీయనగర్లో మూడు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, జూన్ 3న హౌజ్రాణిలోని ఐదు అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో.. జూన్ 5 నుంచి 10 దాకా 607 ప్రదేశాలను అధికారులు తనిఖీ చేయగా, గురువారం ఒక్కరోజే మరో 47 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో మొత్తం తనిఖీ చేసిన ప్రదేశాల సంఖ్య 654కు చేరింది. ఇదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు ఆరు భవనాలను సీజ్ చేసింది. అలాగే 61 షోకాజ్ నోటీసులు, 8 సీలింగ్ నోటీసులు, 16 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి 11 వరకు మొత్తం 179 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, 206 భవనాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, అగ్నిమాపక నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
భారత రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నరేంద్ర మోదీ ఖాతాలో జమ కానుంది. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. తద్వారా.. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఇన్నేళ్ల తర్వాత మోదీ చెరిపేయబోతున్నారు. మోదీ ఇవాళ్టితో.. ప్రధానిగా నెహ్రూ పదవి కాలాన్ని సమం చేయబోతున్నారు. రేపటితో(జూన్ 10) 4,399 రోజులతో అత్యధిక కాలం నిరవధిక ప్రధానమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారు. నెహ్రూ తరహాలోనే.. వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం నిరవధికంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4,077 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.భారత ప్రధానమంత్రుల పదవీకాలం – టాప్ లిస్ట్జవహర్లాల్ నెహ్రూ – 4,398 రోజులు (ఎన్నికల తర్వాత నిరవధిక పదవీకాలం)నరేంద్ర మోదీ – 4,399+ రోజులు (ప్రస్తుత ప్రధానమంత్రి)ఇందిరా గాంధీ – 4,077 రోజులుమన్మోహన్ సింగ్ – 3,652 రోజులు (2004–2014)అటల్ బిహారీ వాజ్పేయి – 2,272 రోజులు (మూడు విడతలు కలిపి)పి.వి. నరసింహారావు – 1,827 రోజులురాజీవ్ గాంధీ – 1,826 రోజులుమొరార్జీ దేశాయ్ – 857 రోజులులాల్ బహదూర్ శాస్త్రి – 576 రోజులుఅయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 1964 మే 27న మరణించే వరకు మొత్తం 6,131 రోజులు పదవిలో కొనసాగారు. అయితే 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన కొనసాగిన కాలాన్ని మాత్రమే అధికారిక రికార్డుగా పరిగణిస్తారు. అందుకే ప్రస్తుతం నరేంద్ర మోదీ అధిగమిస్తున్నది నెహ్రూ మొత్తం పదవీకాల రికార్డు కాదు.. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డు మాత్రమే. అంటే.. ఆ రికార్డు ఇంకా నెహ్రూ పేరిటే పదిలంగా ఉందన్నమాట. మోదీ ప్రధానిగా ఇంకో 1,732 రోజులు.. అంటే దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు పూర్తి చేసుకుంటే ఆ రికార్డు కూడా బద్ధలు కానుంది. మరోవైపు మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. గత 12 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆ మార్పుల కేంద్రబిందువు పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమేనని పేర్కొన్నారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, స్వచ్ఛ భారత్, ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చామని మోదీ తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందని వర్గాలకు చేరేలా పనిచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నీట్, సీబీఎస్ఈ పరీక్షల వ్యవహారాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రతిపక్షాల నుంచి విమర్శలకు దారితీస్తున్నాయి. అదే సమయంలో మహిళా రిజర్వేషన్, ఒకే దేశం-ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.మొత్తానికి, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించడం భారత రాజకీయాల్లో మరో ముఖ్య ఘట్టంగా నిలవనుంది. -
ఢిల్లీ హోటల్ ఘటన: సిలిండర్ పేలుడు కాదంట!
ఢిల్లీ: మాలవీయా నగర్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై.. ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్ బ్లాస్ట్ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్పీజీ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా? అనుమానం వ్యక్తమైంది. కానీ దర్యాప్తు బృందాలు ఆ కోణాన్ని ప్రస్తుతం పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణమన్న వాదన బలహీనపడింది.దర్యాప్తులో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. హోటల్లో రెండు వేర్వేరు కిచెన్లు ఉండటం. వాటిలో ఒకటి భవనం బేస్మెంట్లో ఉండగా, మరొకటి పై అంతస్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కిచెన్లలోనూ అనేక ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నప్పటికీ, అవి ఏదీ పేలిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో మంటలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ ఎలక్ట్రికల్ పాయింట్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న అంశాలపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రేక్ఫాస్ట్ కోసం వంటమనిషి(చెఫ్) ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కోణమే ప్రధాన అనుమానంగా కొనసాగుతోంది. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ హౌజ్రాణి ప్రాంతంలో ఉన్న ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు ఆఫ్రికా, తుర్క్మెనిస్థాన్కు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. గురుగ్రావ్కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మరణించారు. మరో 35 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భవనంలో ఒకే ఎగ్జిట్ ఉండటం, అనుమతులకు మించి గదులు నిర్వహించడం, బేస్మెంట్తో సహా అనధికార నిర్మాణాలు ఉండటం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కొందరు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుంచి దూకిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ హోటల్ ప్రభుత్వ B&B పథకం కింద నడుస్తుండగా, కేవలం ఆరు గదుల అనుమతి ఉన్నా 25 గదుల వరకు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న హోటల్ యాజమానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నానని.. భయంతో పారిపోయానని చెబుతున్నాడతను. -
అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్!
ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. సౌత్ ఢిల్లీలోని ఫ్లారిష్ స్టే బీ అండ్ బీ హోటల్లో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా, వారిలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మరణించిన భారతీయుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. గుర్గ్రామ్ సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ (48), ఆయన భార్య తరణి అగర్వాల్, తల్లి ప్రేమలత అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా (ఏంజెల్), వర్య (పర్ల్)తో పాటు మరో ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి.ఈ కుటుంబం ఢిల్లీకి రావడానికి కారణం అత్యంత హృదయ విదారకం. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ (80లు) శ్వాస సంబంధిత వ్యాధితో సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రయాణం ఒక్కసారిగా శాశ్వత విషాదంగా మారింది.తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన మరో ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఎనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మరణించారు. మరింత హృదయ విదారకంగా, చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ అగర్వాల్ వద్దకే తన భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది.ఈ ఘటనలో మరణానికి ముందు జరిగిన చివరి క్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి “బహుశా మేము బతకలేము” అని చెప్పినట్లు తెలిపారు. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి వేగంగా దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.ప్రాథమిక దర్యాప్తులో హోటల్లో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు బయటపడింది. ఒకే ప్రవేశ–నిష్క్రమణ మార్గం ఉండడం, చిన్న కిటికీలు, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల అనేక మంది బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు మూసివేయబడినట్లు కూడా గుర్తించారు.అంతేకాకుండా హోటల్ అనుమతి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ 25 గదులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్మెంట్లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ గుంపుగా ఉండటం, విద్యుత్ తీగల అడ్డంకులు కూడా రక్షణ చర్యలకు ఆటంకంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.మొత్తం ఘటనలో గుర్తింపు సమస్యలు కూడా కుటుంబాలను తీవ్రంగా బాధిస్తున్నాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను ఫోటోల ఆధారంగా గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కన్నీరు.. హృదయాలను కలిచివేస్తున్నాయి. -
ఐసీయూలో మంటలు.. పలువురి సజీవదహనం!
పాట్నా: దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ అగ్నిప్రమాదం విషాదం మరువకముందే బిహార్లో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ముజఫర్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు సమాచారం. మరికొందరికి గాయాలు కాగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రసాద్ ఆస్పత్రి ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ విభాగంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతోంది.मुजफ्फरपुर के प्रसाद हॉस्पिटल के ICU में लगी भीषण आग ने दिल दहला दिया। हादसे में 3 लोगों की मौत की खबर है, जबकि कई मरीज आग की चपेट में आए। अस्पतालों में सुरक्षा व्यवस्था और फायर सेफ्टी मानकों पर गंभीर सवाल खड़े हो गए हैं।दिवंगतों के परिजनों के प्रति संवेदना। प्रशासन से निष्पक्ष… pic.twitter.com/0gZPFHnnb2— Indian Observer (@ag_Journalist) June 4, 2026ప్రాథమిక విచారణలో.. షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మాలవీయ నగర్లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యంలో, తాజాగా బిహార్లో ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ విషాదం మరింత కలకలం రేపుతోంది.కీలకాంశాలుబిహార్లోని ముజఫర్పూర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదంఐసీయూ విభాగంలో ప్రారంభమైన మంటలుముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం!20 మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తెచ్చారుపలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్షార్ట్సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానంకొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం -
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి 21 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్టారెంట్లో పలువురు చిక్కుకుని ఉండడం.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.హౌజ్రాణి ఏరియాలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఉదయం 8గం.50ని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు, హోటల్లో బస చేసినవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. #DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9— Payall Singhh (@PayallSingh13) June 3, 2026మంటలు భారీగా ఎగసి పడడంతో.. దట్టమైన పొగతో రెస్టారెంట్ అలుముకోవడంతో.. ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురి సాహసాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 30 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. రెస్టారెంట్లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో.. సౌతాఫ్రికా, సోమాలియా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.दिल्ली के मालवीय नगर में एक रेस्ट्रां में लगी आग हादसे में 10 लोगों की मौत की खबरबेसमेंट में फंसे तीन नाइजीरियन नागरिकों को रेस्क्यू कर बाहर निकाला गया।#DELHIFIRE#MALVIYENAGAR#RESTRAURENTFIRE pic.twitter.com/GVD3yKxmXR— Vivek Shukla (@anchorviveks) June 3, 2026ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 3, 2026 -
టిక్.. టిక్.. టిక్.. సినీ ఫక్కీలో టైమ్ బాంబు నిర్వీర్యం
బాంబు ఉందని సమాచారం అందుకోవడం.. ముసుగులేసుకుని స్క్వాడ్లు అక్కడికి చేరుకోవడం.. ఏ వైర్ తెంపాలో అనే ఉత్కంఠ చివరిదాకా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. మహారాష్ట్ర పుణేలో ఈ తరహాలోనే ఓ ఘటన జరిగింది. ఓ ఆస్పత్రి ఆవరణలో లైవ్ బాంబు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.పుణే సిటీలోని హడప్సర్ కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం బాంబు బయటపడింది. తొలుత అనుమానాస్పద వస్తువుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత అది టైమర్ బాంబ్ అని తేలడంతో అందరి గుండెలు గుభేల్మన్నాయ్. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్ను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసుపత్రి పరిసరాలను ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ పరిణామాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే.. పరిశీలనలో అది 7 గంటల తర్వాత పేలేలా టైమర్తో అమర్చిన లైవ్ బాంబు అని తేలింది. బీడీడీఎస్ సిబ్బంది బాంబును సురక్షిత ప్రదేశానికి తరలించి.. ఓపెన్ ఫీల్డ్లో నిర్వీర్యం చేశారు. బాంబులో తక్కువ శక్తి గల పేలుడు పదార్థం ఉందని నిర్ధారించారు."నగరంలో తక్కువ శక్తి గల IED (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) కనుగొనబడింది. దానిని నిర్వీర్యం చేశాం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది." అని పుణే పోలీస్ కమిషనర్ నితేష్ కుమార్ తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
బీజేపీలో చేరినా.. అరెస్ట్ తప్పదా?
రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను పావుగా వాడుకుంటోందని కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శ ఒకటి ఉంది. ఈ క్రమంలోనే ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్లను బూచిగా చూపించి ప్రతిపక్ష నేతలను లొంగదీసుకుంటోందని ప్రతిపక్షాలు తిట్టిపోస్తుంటాయి. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీ ఇదే తరహాలో తమ గూటికి చేర్చుకుందనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ.. అయితే ఈ జంపింగ్ ఎపిసోడ్లో ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆప్ (AAP) నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్ అరెస్టు అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార నివాసం నుంచి ఆయన గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఆయన వెనుక ద్వారం నుంచి కారులో బయటకు వెళ్లిపోయినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. పంజాబ్లో ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అందుకు ఒకటి అవినీతి సంబంధితమైంది కాగా, మరొకటి మహిళా వేధింపుల కేసుగా తెలుస్తోంది. ఇవి నాన్బెయిలబుల్ కేసులుగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. కాగా బీజేపీ లీగల్ సెల్ ఆయనకు సహాయం అందించేందుకు రంగంలోకి దిగింది.ఆప్ నుంచి బీజేపీలో చేరిన వెంటనే సందీప్పై ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. పంజాబ్ ఆప్ ప్రభుత్వం ప్రతీకారం పేరిట చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ, అకాళీదళ్ విమర్శిస్తుండగా.. అంతా పద్ధతి ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం ఆ విమర్శలను తిప్పికొట్టింది.గత నెలలో ఆప్ రాజ్యసభ సభ్యులలో ఏడుగురు ఒకేసారి పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్జిత్ సహ్నే ఈ లిస్ట్లో ఉన్నారు. మాలివాల్(ఢిల్లీ) తప్ప మిగతా ఆరుగురు పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే.. పార్టీ మారిన వాళ్ల సంఖ్య 2/3 వంతు కావడంతో వీళ్లపై ఫిరాయింపుల యాంటీ-డిఫెక్షన్ చట్టం (Tenth Schedule) వర్తించబోదని.. అనర్హత వేటు పడకపోవచ్చనే నిపుణులు చెబుతున్నారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన సందీప్ పాఠక్.. ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్గా పని చేశారు. ఆప్ పార్టీలో ఆరంభం నుంచి క్రియాశీలకంగా పని చేశారు. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయంలో ఈయన వ్యూహాలే కీలకమయ్యాయి. అదే ఏడాది ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే ఆప్ తన ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ.. ఇటీవలె బీజేపీలో చేరారు. -
కేంద్రానికి ఇదే నా చివరి హెచ్చరిక: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్లో గనుక డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, తమిళనాడులో ఇప్పటివరకు చూడని స్థాయిలో భారీ ఉద్యమాన్ని చేపడతానని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం తన సోషల్ మీడియాలో స్వయంగా సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘అదే గనుక జరిగితే నా రాష్ట్ర ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయిస్తాను. 1960 నాటి డీఎంకే ఉద్యమాన్ని మళ్లీ పరిచయం చేస్తాను. కేంద్రానికి, ప్రధానికి ఇదే నా చివరి హెచ్చరిక’’ అని ప్రకటించారాయన. ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన. ఈ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఉత్తర రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో.. తమిళనాడు ప్రజల హక్కులను కాపాడేందుకు తాను వెనుకాడబోనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ అంశంపై తమిళనాడులో ఇప్పటికే డీఎంకే కార్యకర్తలు, మిత్రపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టాలిన్ హెచ్చరికతో ఉద్యమానికి మరింత ఊపిరి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Hon’ble Prime Minister, this is Tamil Nadu’s final warning.மாண்புமிகு பிரதமர் அவர்களே, இது தமிழ்நாட்டின் இறுதி எச்சரிக்கை!#TNwillFightTNwillWin pic.twitter.com/v9wkYYM6MO— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 14, 2026 -
తేజస్ యుద్ధ విమానాలపై అనుమానాలు క్లారిటీ ఇచ్చిన HAL
-
ఇండియన్ ఆర్మీ లోకి వేట పక్షులు
-
జనాల్ని కాపాడబోయి ప్రాణాలు వదిలిన పోలీస్
హర్యానాలోని ఫరీదాబాద్లో ప్రతి ఏటా సూరజ్కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా జరుగుతుంది. ఈసారి కూడా అలానే నిర్వహించారు. అయితే శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ మేళాలో ఏర్పాటు చేసిన రంగుల రాట్నం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీళ్లని కాపాడబోయిన ఓ పోలీసు.. మృతి చెందడం విషాదంగా మారిపోయింది.అసలేం జరిగిందంటే?సూరజ్కుండ్ మేళాలో సునామీ స్వింగ్ అనే భారీ రంగుల రాట్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు అందులో చాలామంది కూర్చుని ఉన్నారు. రాట్నం కూలిన వెంటనే ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. సందర్శకులు భయంతో పరుగులు తీశారు. 13 మందికి పైనే తీవ్రంగా గాయపడ్డారు. అయితే రంగుల రాట్నంలో ఇరుక్కు వారిని రక్షించేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ ప్రయత్నిస్తున్నప్పుడు.. రంగుల రాట్నంకు సంబంధించిన ఓ భారీ భాగం ఆయన ముఖానికి, తలకు బలంగా తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలేశారు.ఈ ఘటనలో గాయపడిన వాళ్లని పోలీసులు.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలానే ప్రమాదానికి కారణమైన రైడర్ ఆపరేటర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సంఘటనపై హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన పోలీస్ అధికారి జగదీష్ ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.#WATCH: A joyride collapsed at #Surajkand Mela in Faridabad, Haryana earlier this evening. 9 people injured and admitted to a hospital. One Police Inspector, who was trying to save people, died.Visuals from the spot as a Forensics team carries out investigation.(ANI) pic.twitter.com/vv5rPkXJ9Z— Prameya English (@PrameyaEnglish) February 7, 2026 -
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఆ మార్గాల్లో నో ఎంట్రీ
మకర విలక్కు పండుగ సందర్భంగా శబరిమలలో ఆంక్షలు విధించారు. తాజా నిబంధనల ప్రకారం జనవరి 12 నుంచి పంబాలో ఎలాంటి వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు ఎలాంటి వాహనాలు ప్రయాణించడానికి వీల్లేదని పోలీసులు ఆదేశించారు. అదే రోజు ఉదయం 10 గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదన తేల్చి చెప్పారు.కాగా.. మకర సంక్రాంతికి అయ్యప్ప మాల భక్తులు పెద్దఎత్తున శబరిమల చేరుకుంటారు. మకరజ్యోతి దర్శనం కోసం వేలాది మంది అయ్యప్పస్వాములతో ఆలయం కిటకిటలాడుతుంది. అత్యంత రద్దీ ఉండే రోజులు కావడంతో భక్తులు వెళ్లే మార్గాల్లో వాహనాలకు అనుమతులు నిలిపేశారు. ఈ విషయాన్ని శబరిమల అయ్యప్ప భక్తులు గమనించాలని కేరళ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బంగ్లాదేశ్లో మరో దారుణం.. హిందూ జర్నలిస్ట్ హత్య..!
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బంగ్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మరో వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ ఓ బంగ్లా డైలీకి తాత్కాలిక ఎడిటర్గా పనిచేస్తున్న రాణా ప్రతాప్ బైరాగి (38) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇవాళ సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక ఏఎస్పీ అబుల్ బసర్ వెల్లడించారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్లో శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ ఘటన బంగ్లాదేశ్లోని జెస్సోర్ జిల్లాలోని మోనిరాంపూర్ ఉపజిల్లాలో జరిగింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ రాణా ప్రతాప్ బైరాగి అనే హిందూ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. కాగా.. ప్రతాప్పై పలు పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని.. అతడు నరైల్ జిల్లా నుంచి వెలువడే ఓ దిన పత్రికకు తాత్కాలిక సంపాదకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సదరు పత్రిక న్యూస్ ఎడిటర్ అబుల్ మాట్లాడారు. రాణా ప్రతాప్ తమ పత్రిక సంపాదకుడని తెలిపారు. ఒకప్పుడు అతడిపై పలు కేసులు ఉన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డారని వెల్లడించారు. అయితే ఈ హత్యకు దారి తీసిన కారణాలు ఏమిటనేది మాత్రం తనకు తెలియదని అన్నారు. #BreakingNews: Another Hindu youth killed in Bangladesh!A Hindu youth named Rana Pratap Bairagi was shot dead by miscreants in Monirampur upazila under Jessore district in Bangladesh. The incident took place today at noon today. pic.twitter.com/MlewUvcz0i— Salah Uddin Shoaib Choudhury (@salah_shoaib) January 5, 2026 -
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల సజీవ దహనం
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదంపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. రాంగ్రూట్లో వచ్చిన కంటెయినర్ లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించగా.. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది ప్రయాణికులతో( డ్రైవర్, క్లీనర్తో కలిపి 31 మంది అని) కూడిన బస్సు బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా.. బెంగళూరు-హెబ్బులి హైవేపై సిరా-హిరియూర్ మధ్య గోర్లత్తు గ్రామం(చిత్రదుర్గ జిల్లా) వద్ద ప్రమాదానికి గురైంది. ఆ మంటల ధాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా కాలిబూడిదైంది. తొలుత ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, హెల్పర్ సురక్షితంగా బయటపడ్డాడు. వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. అపోజిట్ రోడ్డులోంచి దూసుకొచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగింది. ‘‘డివైడర్కు మరోవైపున ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా నేను వెళ్తున్న రోడ్డు పైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమై బస్సును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించా. కానీ అప్పటికే ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తోన్న మరో వాహనాన్ని కూడా తాకింది. అయితే ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయా. అతివేగం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది’’ అని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వివరించాడు.ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య.. మంత్రులను, అధికార యంత్రాగాన్ని ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లాలని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించాలని ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి గల కారణంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అన్నారాయన. ప్రమాదం జరిగిందిలా..చిత్రదుర్గ జిల్లాలోని జాతీయరహదారి-48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంక్కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ వద్ద ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో రెండు వాహనాలు కాలి బూడిద అయ్యాయి. కంటెయినర్ డ్రైవర్తో పాటు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది కాలి బూడిదయ్యారు. Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999— Naik Kartik (@mekartiknaik) December 24, 2025 యువకుడి సాహసంతో.. ప్రయాణికుల్లో ఒక యువకుడు సాహసం చేసి బస్సు అద్దాలు పగలకొట్టాడు. దీంతో 9 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. వీళ్లలో కొందరికి గాయాలు కావడంతో చిత్రపురి, సిరా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.సకాలంలో స్పందించినా.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే మంటలు శరవేగంగా అంటుకుని అప్పటికే బస్సు మొత్తం బూడిదైంది. ట్రావెల్స్ నిర్వాహకులు ఇచ్చిన లిస్ట్ ప్రకారం.. మృతుల్లో చాలామంది గోకర్ణవాసులేనని తెలుస్తోంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.తప్పిన ఘోరం!అయితే.. ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్ బస్సు.. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ఈక్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే, పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు ఆ బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. -
ఢిల్లీలో ఈ ఎమర్జెన్సీ.. ఇంకెన్నేళ్లో?
తీవ్ర వాయుకాలుష్యానికి తోడయ్యే దట్టమైన పొగమంచు.. ఎటు చూసినా మాస్కులు ధరించిన ప్రజలు.. కరోనా కానరాకుండా పోయినా శీతాకాలంలో మన దేశరాజధాని వీధుల్లో కనిపించే దృశ్యాలివే!. వాహనాల గొట్టాలు కక్కే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి.. పంట అవశేషాల దహనాలు .. ఇవన్నీ కలగలిసిపోయి ఢిల్లీని ఓ గ్యాస్ చాంబర్గా మార్చేస్తున్నాయి.. ప్రతి సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III, స్టేజ్ IV లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటోంది. ఆ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు. స్కూల్స్ మూసేస్తారు. ఆఫీసులను హైబ్రిడ్.. మరింత దిగజారితే వర్క్ఫ్రమ్ హోంకు పరిమితం చేస్తారు. గాలి మందగించి, పొగమంచు కమ్ముకుని, ప్రజలు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ ఏడాది పరిస్థితి మరింతగా ముదిరింది. పిల్లలను కనీసం బయట కూడా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం వల్ల ఎమర్జెన్సీనే నార్మల్గా మారింది. పాలసీ ఫాటీగ్(మానసిక, భావోద్వేగ అలసట) పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కూడా ఈ చర్యలను సీరియస్గా తీసుకోవడం మానేశారు. ఢిల్లీ కాలుష్యం కథ ఒక నిరంతర యుద్ధం. ప్రతి సంవత్సరం అదే దృశ్యం.. అదే చర్యలు.. అదే విఫలత. కానీ ఈసారి ప్రశ్న వేరుగా ఉంది. దేశరాజధానికి ఊపిరి ఇవ్వాలంటే.. సిస్టమ్ మొత్తాన్ని రీడిజైన్ చేయగలమా? లేదంటే ఎమర్జెన్సీని నార్మల్గా అంగీకరించేస్తూ పోతారా?.. ఢిల్లీలోనే ఎందుకంటే.. ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ ఎందుకు పడిపోతోంది?. ఎందుకంటే.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. ఎన్సీఆర్లో ప్రధానంగా ఉండే కోల్ ఆధారిత పవర్ప్లాంట్లు.. ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన వాయువుల్ని విడుదల చేస్తుంటాయి. చుట్టుపక్కల పంజాబ్, హర్యానాల రైతులు పంటలని కాల్చడంతో ఆ పొగ కాలుష్యానికి తోడవుతోంది. వీటన్నింటికి తోడు.. నిరంతరాయంగా కొనసాగే నిర్మాణ పనులతో ఆ ధూళి గాల్లో కలిసి కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. శాశ్వత పరిష్కారం ఉండవా?దేశరాజధానిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజల అవసరాలకు తగ్గట్లు పెంచాలి. మెట్రో లైన్లు విస్తరించినా.. బస్సుల సంఖ్య తక్కువ. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. పంట అవశేషాల దహనం ఆపడానికి రైతులకు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి, కానీ సపోర్ట్ సిస్టమ్ బలహీనంగా ఉంది. రైతులు తక్కువ ఖర్చుతో పంట అవశేషాలను కాల్చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. WHO ప్రమాణాల కంటే 10–15 రెట్లు ఎక్కువ టాక్సిక్ లెవెల్స్ ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సమస్యలు, కంటి ఇర్రిటేషన్, గుండె సంబంధిత సమస్యలతో రోగులు పెరుగుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా విఫలమవుతున్నదనే సూచన.ప్రైవేట్ రంగం, స్టార్టప్లు కాలుష్య నివారణ కోసమంటూ ముందుకు వస్తున్నాయి. కార్పూలింగ్ యాప్లు, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, క్రాప్ రెసిడ్యూ ప్రాసెసింగ్ వంటి పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఇవి చిన్న స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ లాంటి మహానగరానికి ఇవి సరిపోవు. పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ మద్దతు, ప్రజల సహకారం కచ్చితంగా అవసరం.అంటే ఢిల్లీ పొల్యూషన్ కేవలం వాతావరణ సమస్య కాదు.. ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్కి ప్రతీక. ఇది ప్రభుత్వ పాలసీల లోపం, అమలు బలహీనత, ప్రజల ప్రవర్తన, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ కలిసిన విఫలత. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, రైతులకు ప్రత్యామ్నాయాలు, ఇండస్ట్రీలపై కఠిన నియంత్రణ, ప్రజల అవగాహన.. మొత్తం వ్యవస్థనే మార్చగలిగినప్పుడు మాత్రమే ఢిల్లీ మళ్లీ మంచి ఊపిరి తీసుకోగలుగుతుంది. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోరం.. ప్రమాదానికి కారణమిదే!
ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారు ఝామన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనకు పొగమంచు కారణంగా తెలుస్తోంది. భారీ పొగమంచులో తొలుత రెండు వాహనాలు వేగంగా ఢీ కొట్టుకోగా.. ఆ వెంటనే మిగతా వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టి మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం వేకువజామున 4గం. ప్రాంతంలో ఆగ్రా-నోయిడా లేన్ 127వ మైలురాయి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మూడు కార్లు వరుసగా ఢీ కొట్టకున్నాయి. ఆ తర్వాత ఏడు బస్సులు ఢీ కొట్టుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సుల్లో ఒకటి ఆర్టీసీ ఉండగా.. మిగతా ఆరు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సులు. మొత్తం 7 బస్సులు.. నాలుగు కార్లు మంటల్లో చిక్కకుని బూడిదయ్యాయి.ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం నుంచి పలువురు సురక్షితంగా బయటపడగా.. నిద్రలో ఉండడం, ఒక్కసారిగా మంటల ఎగసి పడడం, వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి బయటపడలేని స్థితిలో పలువురు సజీవ దహనం అయ్యి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన 11 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ ఘోర ప్రమాదంతో ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.#WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/k8LdYmBOC1— ANI (@ANI) December 16, 2025#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited.#firemishap #buses #DelhiAgraExpresswayANI pic.twitter.com/kKqC31C7MR— Argus News (@ArgusNews_in) December 16, 2025ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీ-ముంబై రహదారిపైనా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నుహ్(హర్యానా) వద్ద సోమవారం ఉదయం 5గం. ప్రాంతంలో వాహనాలు భారీ పొగమంచు కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకున్నాయి. రెండు ఓవర్లోడెడ్ డంపర్లు యాక్సిడెంట్కు గురి కాగా.. ఆ వెనక 20 దాకా వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. సుమారు 20 మంది దాకా గాయాలయ్యాయి. పొగ మంచు వరుస ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వాహనదారులకు సూచిస్తున్నాయి. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
ఉత్తర ప్రదేశ్ ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. పొగమంచు కారణంగా.. మంగళవారం వేకువ జామున పలు కార్లు, బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత నలుగురు మరణించారని ప్రకటించిన అధికారులు.. సహాయక చర్యల అనంతరం ఆ సంఖ్యను 13గా వెల్లడించారు. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పలు వాహనాలు మంటల్లో చిక్కుకుని 13 మంది మృతి చెందారు. సుమారు 65 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, మథుర ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘యమునా ఎక్స్ప్రెస్వే 127వ మైల్ స్టోన్ వద్ద ఏడు బస్సులు, మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. వాహనాల నుంచి మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఫైర్ బృందాలు రెండు గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశాయి’’ అన్నారు. #WATCH | Mathura, UP | SSP Mathura, Shlok Kumar says, "... An accident took place at the Yamuna Expressway Milestone 127. The reason was low visibility... 7 buses and 3 cars collided as a result of which, a fire broke out in all the vehicles... The rescue operation is nearing… https://t.co/fcMTyQjWBk pic.twitter.com/RY8vdxLqVi— ANI (@ANI) December 16, 2025ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొలుగ మూడు కార్లు మరొకటి ఢీ కొట్టాయి. అనంతరం ఆ వెనకాలే ఏడు బస్సులు ప్రమాదానికి గురై మంటలు అంటుకున్నాయి. అలా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో పలువురు ఫోన్లలో తీసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P— ANI (@ANI) December 16, 2025 #WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/qvKDqAT5T1— ANI (@ANI) December 16, 2025 👉ఢిల్లీ–ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే (యమునా ఎక్స్ప్రెస్వే) పొడవు 165.5 కిలోమీటర్లు. 2012 ఆగస్టు 9న ప్రారంభించబడింది. ఇది గ్రేటర్ నోయిడా నుండి ఆగ్రా వరకు విస్తరించి, ఆరు లేన్లతో నిర్మించబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం పాత ఢిల్లీ–ఆగ్రా జాతీయ రహదారి (NH-2)లోని ట్రాఫిక్ను తగ్గించడం. 👉ఈ హైవే గ్రేటర్ నోయిడా, జేవర్, వృందావన్, మథుర, హత్రాస్ వంటి పట్టణాలను కలుపుతూ ఆగ్రాకు చేరుస్తుంది. భారతదేశంలో ఆరో పొడవైన ఎక్స్ప్రెస్వేగా గుర్తించబడింది. అయితే.. అధిక వేగం, డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం, పొగమంచు కారణంగా తరచూ ఈ హైవేపై ప్రమాదాలు జరుగుతుంటాయి. 👉2012–2023 మధ్య జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్లు నిద్రపోవడం వల్ల జరిగాయి!. ఎక్స్ప్రెస్వే పొడవుగా, సూటిగా ఉండటం వల్ల డ్రైవర్లు వేగంగా దూసుకెళ్తుండడంతో నియంత్రణ కోల్పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక.. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం జరుగుతుంది. అందుకే ఇటీవలే వేగ పరిమితిని 75 kmphకి తగ్గించారు. తాజా ప్రమాదం పొగమంచు కారణంగానే జరిగి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. -
ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం ఆవిష్కరణ
ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. శుక్రవారం గోవాలో పర్యటించిన ఆయన.. సౌత్ గోవా కానాకోనలోని గోకర్ణ జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుక కార్యక్రమం జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని మఠాన్ని సందర్శించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.VIDEO | Canacona, Goa: PM Modi (@narendramodi) unveils 77-feet-tall bronze statue of Lord Ram at Shree Samsthan Gokarn Jeevottam Mutt in South Goa.(Source: Third Party)(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/3sDm0qngb1— Press Trust of India (@PTI_News) November 28, 2025 -
ఇంత జరుగుతున్నా ప్రధాని మౌనంగా ఉన్నారేం?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: దేశరాజధాని వాయు కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఊపిరి తీసుకోలేని పరస్థితుల్లో అవస్థతలు పడుతున్నారని.. ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ ఏం పట్టనట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం వాయు కాలుష్యంపై కొందరు పర్యావరణవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం తీవ్రతరమవుతోంది. పేద, ధనిక అన్నివర్గాల వాళ్లు కాలుష్యం బారిన పడుతున్నారు. నేనూ ఢిల్లీ వాయి కాలుష్యం బాధితుడినే. విషపూరిత వాయువులతో పిల్లలు ఊపిరి ఆడక అవస్థలు పడుతున్నారు అని అన్నారాయన. ‘‘మోదీగారూ.. భారతదేశపు పిల్లలు మన కళ్ల ముందే ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఎలా మౌనంగా ఉండగలరు? ఈ అంశంపై అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి లేదా? ఒక ప్రణాళిక లేదు, బాధ్యతంటూ లేదా?’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. ఇప్పటికైనా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి. కాలుష్యాన్ని కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలి అని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా కొందరు చిన్నారుల తల్లులు ఆందోళన వ్యక్తం చేసిన వీడియోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మరోవైపు.. వాయు కాలుష్యం సోర్స్ నుంచే అరికట్టాలన్న పర్యావరణవేత్తలు.. చిన్నారులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. గత రెండు వారాలుగా ఢిల్లీ వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పిల్లలను పరిస్థితులు చక్కబడేదాకా స్పోర్ట్స్ ఈవెంట్స్కు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది కూడా. -
ట్రాఫిక్ బంధనం నుంచి బయటపడేలా అదిరిపోయే ప్లాన్!
జనాభా అవసరాలకు అనుగుణంగా సొంత వాహనాలు పెరిగే కొద్దీ.. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ అంత కంతకూ పెరిగిపోతోంది. అయితే.. ముంబై వీధుల్లో ఆ గందరగోళం ఇక పాతాళంలోకి కరిగిపోనుంది. భూమి క్రింద మరో కొత్త లోకం తెరుచుకోబోతోంది. అవును..ముంబై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న ప్రణాళికను ప్రకటించారు. “పాతాళ్ లోక్”(Paatal Lok) పేరుతో భూగర్భ టన్నెల్ నెట్వర్క్ను నిర్మించి నగర రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఈ టన్నెల్లు పైభాగంలోని రహదారులకు సమాంతరంగా ఉంటూ.. మెట్రో మార్గాలతో కలుపుతూ.. ముంబైకి కొత్త రవాణా రూపకల్పనను అందించబోతునున్నట్లు తెలిపారాయన. ఎలా సహాయపడుతుందంటే.. ముంబైలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కనెక్టివిటీ మెరుగుపరచడం.. పాతాళ్ లోక్ ముఖ్య ఉద్దేశం. భూమి క్రింద రోడ్లకు సమాంతరంగా పెద్ద టన్నెల్ వ్యవస్థ నిర్మిస్తారు. ఇది భూమి క్రింద సమాంతర రహదారి వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే పైభాగంలోని ప్రధాన రహదారులకు “షాడో నెట్వర్క్”లా ఉంటుందన్నమాట. డీకన్జెషన్తో పైభాగంలోని రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గి.. ట్రాఫిక్ సాఫీగా కదులుతుంది. తద్వారా ప్రయాణికులకు ‘గంటల తరబడి’ అనే నరకయాతన తప్పనుంది. అలాగే.. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారాలు, లాజిస్టిక్స్ వేగవంతం కానుంది. అదే సమయంలో వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా కదలడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది.ముంబై నగరం కోసం ఫడ్నవీస్ సర్కార్ అమలు చేయబోతున్న ప్రణాళికలో.. బోరివలి–గోరేగావ్ మధ్య సమాంతర రహదారి, వర్లీ–శివడి కనెక్టర్ (తదుపరి సంవత్సరం పూర్తి), బాంద్రా–BKC టన్నెల్ ( దీని ద్వారా ఎయిర్పోర్ట్ యాక్సెస్ మెరుగుపరుస్తుంది). దక్షిణ ముంబై నుంచి భయందర్ వరకు విస్తరించే కోస్టల్ రోడ్ కూడా ఈ ప్రణాళికలో భాగం. అలాగే.. ఈ టన్నెల్ ప్రాజెక్ట్కి తోడ్పాటుగా మెట్రో విస్తరణ కూడా జరగనుంది. -
ఒక్క నిమిషంలో 80 మంది.. జరగరానిది జరిగితే ఏం చేస్తారు?
తిరువనంతపురం: శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ జరగరానిది జరిగితే ఏం చేస్తారంటూ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. పవిత్ర వృశ్చిక మాసంలో మండల-మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర ఆదివారం సాయంత్రం మొదలైంది. కొండకు అయ్యప్ప భక్తులు పోటెత్తగా.. ఓ భక్తురాలు మంగళవారం క్యూ లైన్లోనే స్పృహ కోల్పోయి మృతి చెందింది. ఈ దరిమిలా భక్తుల రద్దీపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆలయం తెరిచిన 48 గంట్లోనే సుమారు 2 లక్షల మంది శబరిమలకు చేరుకున్నారు. వాళ్లలో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా భక్తులు రావడంతో రద్దీపై నియంత్రణ కోల్పోయినట్లైంది. భక్తులను అలా హడావిడిగా లోపలికి, బయటకు పంపడమేంటి?.. కేవలం ఒక్క నిమిషంలో 80 మందిని దర్శనానికి అనుమతించాల్సిన అవసరం ఏంటి?. రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోతే విపత్తు తప్పదు. అసలు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు?.. అని ప్రశ్నించింది. దీనిపై శుక్రవారం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో వర్చువల్ క్యూ స్లాట్లు తగ్గించకపోవడాన్ని సైతం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. స్పాట్ బుకింగ్ ద్వారా భక్తుల సంఖ్యను నియంత్రించాల్సి ఉన్నా.. అధికార యంత్రాంగం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది. అదనంగా 10 వేల మంది కొండ ఎక్కారని స్వయంగా దేవస్వం బోర్డే అంగీకరించింది. ఇది భద్రతా ప్రమాణాలకు విరుద్ధమే కదా. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రభుత్వాన్ని, TDBని ప్రశ్నించింది. భక్తుల భద్రతకు ముప్పు కలిగే విధంగా అనవసర రద్దీని ప్రోత్సహించకూడదని స్పష్టం చేసింది. ఇది స్వప్రేరిత (suo motu) విచారణ లేదంటే ఎవరైనా వేసిన పిటిషన్పై విచారణనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.Every year Sabarimala arrangements get worse, but this year was a new low:⏩ No drinking water for devotees⏩ No cleanliness - filth everywhere⏩ Live electric cables lying on the floor⏩ KSEB work right in the middle of pilgrim movement⏩ 15+ hour queuesFor Communists,… pic.twitter.com/J7UHAiSoGa— Anoop Antony Joseph (@AnoopKaippalli) November 18, 2025 -
అతడో పిల్ల చేప.. ‘ఆర్గాన్’ స్కాంలో తెలంగాణకు లింకులు!
కేరళ కేంద్రంగా ఇరాన్కు నడిచిన అవయవాల అక్రమ రవాణా కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మధు జయకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మధు పిల్ల చేప మాత్రమేనని.. దీని వెనుక పెద్ద చేపలు చాలానే ఉన్నాయని.. త్వరలో ఆ వివరాలు బయటపెడతామని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కొచి కోర్టుకు బుధవారం నివేదించింది. ఈ కేసులో ఇరాన్ నుంచి వచ్చిన ఎర్నాకులం వాసి మధు జయకుమార్ను నవంబర్ 8వ తేదీన కొచి ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే.. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేరళతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యాయని తేలింది. అంతేకాదు ఒక్క మధునే ఇరాన్కు భారత్ నుంచి 14 మంది బాధితుల్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 2019 జనవరి నుండి 2024 మే మధ్య.. ఈ చానెల్ ద్వారా కేరళ నుంచి అనేక మందిని అక్రమంగా అవయవదానం కోసం తరలించినట్లు ఎన్ఐఎ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కేసు కేవలం కేరళకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిందని ఎన్ఐఏ వెల్లడించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఈ రాకెట్ కార్యకలాపాలు నడుస్తున్నట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. అవయవాలు దానం చేసిన వాళ్లకు రూ.50 లక్షల దాకా ఆఫర్ చేసినట్లు బాధితుల వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. మరోపక్క.. మధు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆసుపత్రులు, బాధితులు తదితర అంశాలపై విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.కిందటి ఏడాది మే నెలలో త్రిస్సూర్కు చెందిన సబిత్ నసర్(30) కొచి ఎయిర్పోర్టులో అధికారులకు పట్టుబడ్డాడు. ఇరాన్ నుంచి వయా కువైట్ ద్వారా అతను వచ్చాడని, మానవ అవయవాల రవాణా అక్రమ ముఠాతో అతనికి లింకులు ఉన్నట్లు తేలడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. తన ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి కోసం 20 మందిని తీసుకెళ్లానని.. అందులో చాలా మంది ఉత్తర భారతానికి చెందిన వాళ్లు ఉన్నారని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఎర్నాకులం పోలీసులు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపగా.. ఆ తర్వాత అది ఎన్ఐఏ చేతికి వెళ్లింది. కిందటి ఏడాది అగష్టులో ఎన్ఐఏ చార్జిషీట్ను దాఖలు చేసింది. మెడికల్ టూరిజం పేరిట అవయవాల అక్రమ రవాణా ముఠా నడిపించిన నలుగురు నిందితులు సబిత, సాజిత్ శ్యామ్, బెల్లంకొండ రాం ప్రసాద్, మధు జయకుమార్లను గుర్తించింది. ఇదంతా చట్టబద్ధమైన వ్యవహారమేనని బాధితులను నమ్మించి ఇరాన్కు తీసుకెళ్లినట్లు తేలింది. సోషల్ మీడియా, ఏజెన్సీల ద్వారా యువతను ఇందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు నిర్ధారించుకుంది. అయితే అప్పటి నుంచి జయ కుమార్ పరారీలో ఉన్నాడు. అతను ఇరాన్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్పోల్ సాయంతో రెడ్కార్నర్ నోటీసును జారీ చేయించారు. చివరకు స్వదేశానికి వచ్చిన అతన్ని అరెస్ట్ చేయగా.. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నట్లు చెబుతున్నాడు. దీంతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్ఐఏ భావిస్తోంది. -
అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
సాక్షి, అల్లూరి జిల్లా: మారేడుమిల్లి టైగర్జోన్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించారు. మృతుల్లో అగ్రనేత ఒకరు ఉన్నారని ఆయన తెలియజేయగా.. అది మడావి హిడ్మానే అనే ప్రచారం ఊపందుకుంది.ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై సమాచారం అందడంతో టైగర్జోన్ ఏరియాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం(6-7గం. మధ్య) ఇరు వర్గాలు ఎదురుపడి కాల్పులకు దిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో(ఎక్సేంజ్ ఆఫ్ ఫైర్) మావోయిస్టులు ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.Andhra Pradesh | In the Alluri Sitarama Raju district, an exchange of fire took place between the police and Maoists in Maredumilli. The encounter occurred between 6 AM and 7 AM. In the exchange of fire, six Maoists were killed, including a top Maoist leader. A massive combing…— ANI (@ANI) November 18, 2025మృతుల్లో హిడ్మా?మారేడుమిల్లి ఎన్కౌంటర్ మృతుల్లో.. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మా, ఆయన భార్య హేమతో పాటు మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారన్నది ఆ ప్రచార సారాంశం. హిడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల రివార్డు ఉంది. చనిపోయింది మడావి హిడ్మానేనా.. అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే గనక మావోయిస్టు ఉద్యమం పని అయిపోయినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.మరోవైపు.. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎర్రబోర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అటవి ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సెర్చ్లో భాగంగా ఎర్రబోర్ అటవీ ప్రాంతంలో ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులను ముట్టడించాయి. ఈ క్రమంలోనే వారి మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అయితే కాల్పుల్లో కొందరు మావోయిస్టులు గాయపడినట్ల సమాచారం అందుతోంది. ఈ ఎన్కౌంటర్ను జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. అయితే.. కాల్పులు జరిగిన ఖచ్చితమైన ప్రదేశం, పాల్గొన్న బలగాల సంఖ్య వంటి కీలక వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని ఆయన అన్నారు. -
ఢిల్లీ పేలుడు.. ఆత్మాహుతి దాడి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం 6:52కు జరిగిన భారీ పేలుడు రాజధానిని వణికించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడు ఒక ఐ20 కారులో జరిగినట్లు ప్రాథమిక సమాచారం.అయితే సంఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఐ20 కారులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారని, ఆ కారు వెనుక వైపు నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు శబ్దం దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. అయితే కారును గుర్తించడానికి, దానిలో ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని పలువురు భద్రతా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేలుడు జరిగిన స్థలానికి ఎన్ఐఏ (NIA), డిఆర్డిఓ (DRDO) బాంబ్ నిపుణుల బృందాలు చేరుకున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేసి, ఫోరెన్సిక్ పరిశోధన ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. -
ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి
భారీ పేలుడుతో దేశరాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో ఓ కారు పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పేలుడు ఘటనపై ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ఆరాపోలీసు అధికారులు, ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వైద్యులతో రేఖాగుప్తా సమావేశంబాధితులను పరామర్శించిన సీఎం రేఖాగుప్తా ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హైఅలర్ట్ పలు నగరాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ అధికారులుఢిల్లీలో పేలుడు దృష్ట్యా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలో హై అలర్ట్హైదరాబాద్లోనూ పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారుఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన, మృతి చెందినవారుహర్షుల్ S/O సంజీవ్ సేథిశివ జైస్వాల్ S/O తెలియదుమిస్టర్ సమీర్ S/O తెలియదు, మండవాలి ఢిల్లీజోగిందర్ S/O తెలియదు, దిల్షాద్ గార్డెన్, ఢిల్లీభవాని సంకర్ సహ్మ్రా S/O తెలియదుగీత డి/ఓ శివ ప్రసాద్, ఢిల్లీవినయ్ పాఠక్ S/O రమా కాంత్ పాఠక్, ఢిల్లీపప్పు S/O దుధ్వి రామ్,మిస్టర్ వినోద్ S/O విశాల్ సింగ్శివమ్ ఝా , ఢిల్లీమహ్మద్ సాన్వాజ్, ఢిల్లీఅంకుష్ శర్మ , ఢిల్లీమహ్మద్ ఫరూఖ్, ఢిల్లీతిలక్ రాజ్ఐ20 కారు యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులుహరియాణాకు చెందిన నదీమ్ఖాన్ పేరుతో ఉన్న పేలుడు జరిగిన కారు హుండాయ్ ఐ20 కారును తొలుత మహ్మద్ సల్మాన్ కొన్నాడుఅనంతరం అది నదీమ్ఖాన్ అనే వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు తెలిపారుపేలుడు జరిగిన ఐ20 కారు నంబరు HR267674 గా గుర్తింపుఆత్మాహుతి దాడి?ఐ20 కారు లోపల ముగురు కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది. కారు వెనుక వైపు నుండి పేలుడు సంభవించినట్టు సమాచారం. ఇది ఆత్మాహుతి దాడిగా పలువురు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మాహుతి దళాల ప్రమేయం ఉందని విశ్లేషకుల అంచనాబ్లాస్ట్ ఆందోళనకరం అంటున్న విశ్లేషకులు70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయంసోమవారం కావడంతో ఆలయ సందర్శనకు పెద్ద ఎత్తున వచ్చిన జనం100 నుంచి 150 మీటర్ల వరకు పేలుడు ధాటి పరిధి.ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే క్రమంలో భారీ పేలుళ్లుచాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాదచాయలు2011 లో ఢిల్లీ హైకోర్టు దగ్గర జరిగిన పేలుళ్లు, అంటే దాదాపు 14 సంవత్సరాల తరవాత ఢిల్లీలో పేలుళ్లు జరగడం ఇదేభద్రతా సిబ్బంది ఊహిస్తున్నట్లు సీఎన్జీ పేలుడు కారణం కాదేమో అన్న అంచనాలుటెర్రరిస్టుల పనే అయి ఉంటుందని అనుమానాలుభీభత్సంగా మారిన సంఘటనా స్థలంఅమిత్ షా తో ప్రధాని నరేంద్ర మోడీ సంభాషణ. సంఘటన జరిగిన తీరుపై ఆరా.దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేతమెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుళ్లుపేలుళ్ల దెబ్బకు 6 కార్లకు వ్యాపించిన మంటలు. నాలుగు ఆటో రిక్షాలు, 4 బైకులు దగ్ధం.ఆసుపత్రికి తరలించేలోపే 9 మంది మృతి.30 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మరో 10 మంది పరిస్థితి విషమం.సంఘటనా స్థలానికి అంబులెన్స్, 15 ఫైర్ టెండర్ల తరలింపు.పేలుడు జరిగిన పరిసరాల్లో 15 చోట్ల బారికేడ్లు.సంఘటనా స్థలానికి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర భద్రతా సిబ్బంది.పెద్ద ఎత్తున మోహరింపు, పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు.మీడియాతో సహా ఎవరినీ పేలుడు జరిగిన స్థలానికి అనుమతించని పోలీసులు.స్పాట్ కు చేరుకుంటున్న నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్.సంఘటనా స్థలానికి ఢిల్లీ స్పెషల్ సెల్ టీం, క్లూస్ టీంలు, ఫోరెన్సిక్ నిపుణులు.సంఘటనా స్థలం నుంచి శాంపిల్స్ సేకరిస్తున్న నిపుణులు.రెడ్ ఫోర్ట్ దగ్గరకు చేరుకుంటున్న సీనియర్ కాప్స్, పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్, డీజీపీ.చాందినీ చౌక్ మూసివేత. వ్యాపారులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.షాప్ కీపర్స్ ను పేలుడు జరిగిన ప్రాంతం నుంచి పంపించి వేసిన భద్రతా బలగాలు.హై అలెర్ట్ లో కొత్త ఢిల్లీఢిల్లీ పేలుళ్లతో అప్రమత్తమైన ఉత్తర ప్రదేశ్, వాణిజ్య రాజధాని ముంబై మహానగరం.అయోధ్య రాం మందిర్ దగ్గర భద్రత కట్టుదిట్టం.దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు.గత కొంతకాలంగా దేశంలోని జమ్మూ కాశ్మీర్, హర్యానా, గుజరాత్ లతో పాటు ఢిల్లీలో పాగా వేసిన ఉగ్రవాద మూకలు.స్లీపర్ సెల్స్ కదలికలు. నాలుగు వేల మంది పాకిస్తానీలతో కూడిన ఒక టెలిగ్రామ్ గ్రూప్ ను గుర్తించిన పోలీసులు.ఢిల్లీ శివారు ప్రాంతం ఫరీదాబాదులో పెద్ద ఎత్తున అంటే దాదాపు 2560 కిలో గ్రాముల అమ్మోనియం నైట్రేట్, 350 కేజీల ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలను సీజ్ చేసిన పోలీసులు.ఢిల్లీ నుంచి గుజరాత్ కు భారీ స్థాయిలో రవాణా అవుతున్న పేలుడు పదార్థాలను పట్టుకున్న పోలీసులు.నదీమ్ఖాన్ పేరుతో కారు రిజిస్ట్రేషన్ఢిల్లీ పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తుకేంద్ర భద్రతా సంస్థల దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు నదీమ్ఖాన్ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్హెచ్ఆర్26తో రిజిస్టర్ అయిన పేలుడు జరిగిన కారుఘటనాస్థలికి కేంద్ర హోం మంత్రి(LNJP) ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్న బాదితులను పరామర్షించిన అమిత్ షాఢిల్లీ ఘటనా స్థలికి చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాఢిల్లీ ఘటనాస్థలాన్ని కేంద్ర హోం అమిత్ షా పరిశీలించారుఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పేలుడు స్థలం పరిశీలనఅధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న హోం మంత్రిఅమిత్ షా ఏమన్నారంటే..ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందనసాయంత్రం 7గం. సమయంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఘటన జరిగిందిహుండాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించిందిపేలుడు ధాటికి పలువురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. పలు వాహనాలు దెబ్బతిన్నాయిసమాచారం అందుకున్న పది నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలిలోకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారుపేలుడుపై విచారణ జరుగుతోందిఎన్ఐఏ, ఎన్ఎస్జీ దర్యాప్తు చేస్తున్నాయిసీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారుఅన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందిత్వరలోనే నేను ఘటనా స్థలానికి వెళ్తాను.. క్షతగాత్రులను పరామర్శిస్తాను ప్రధాని మోదీ ఆరాఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా అమిత్షాతో మాట్లాడిన ప్రధాని మోదీ ఘటన గురించి అడిగి వివరాలు తీసుకున్న ప్రధాని ఘటనపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశంఐబీ చీఫ్,ఢిల్లీ సీపీకి అమిత్షా ఫోన్పేలుడు ఘటన గురించి ఆరా త్వరగతిన దర్యాప్తునకు ఆదేశంఎన్ఎస్జీ, ఎన్ఐఏతో పాటు దర్యాప్తు జరపనున్న ఢిల్లీ స్పెషల్ సెల్పోలీసుల అదుపులో అనుమానితుడుఢిల్లీ పోలీసుల అదుపులో అనుమానితుడువిచారిస్తున్న పోలీసులుముంబై పోలీసుల అప్రమత్తంముంబైలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలురైల్వే స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలుకదులుతున్న కారులో పేలుడు?పేలింది పార్కింగ్ కారు కాదని ప్రకటించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చాఎర్రకోట వద్ద ‘రెడ్సిగ్నల్ దగ్గర ఆగిన కారులు ఆ సమయంలో నెమ్మదిగా వచ్చిన కారు ఒకసారిగా సంభవించిన పేలుడు ఆ సమయంలో కారులో ప్రయాణికులు సాయంత్రం 6.52 గంటలకు పేలుడు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటనహైదరాబాద్లో హైఅలర్ట్ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో హైదరాబాద్లో హైఅలర్ట్రద్దీ ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలుపాతబస్తీలో విస్తృతంగా కొనసాగుతున్న సోదాలుఅనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలి: సీపీ సజ్జనార్ పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు పేలింది. ఆ తర్వాత మంటలు పక్కన్న వాహనాలకు అంటుకున్నాయి. ఏడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. గాయపడిన వాళ్లను లోక్నాయక్ జయ్ ప్రకాష్ ఆస్పత్రి (LNJP) ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి ఎనిమిది వాహనాలు ధ్వంసం అయినట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతోంది. పేలుడుతో ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది.సాయంత్రం 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్ కాల్ వచ్చింది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఘటన నేపథ్యంలో కేంద్రం ఢిల్లీతో పాటు దేశంలో పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. రాజధాని, చుట్టుపక్కల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG) బృందాలు చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీ పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే సోమవారం ఎర్రకోట సందర్శనకు సెలవు దినం కావడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం తప్పింది. BREAKING: Explosion near Red Fort area in Old Delhi. Explosion near metro station. Blasts on a day when there has been a major crackdown on terror modules plotting a strike on Delhi. Details awaited. pic.twitter.com/tELxBP9bBh— Rahul Shivshankar (@RShivshankar) November 10, 2025 -
అన్నా.. ప్లీజ్ అన్నా.. వద్దన్నా..!
బైక్పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.. ఇన్స్టాగ్రామ్లో ఓ బైక్ డ్రైవర్తో తనకు ఎదురైన పరిస్థితిని ఓ యువతి పంచుకోగా అది నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది. మెట్రో నగరం బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైక్పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యం, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి చర్చ్ చర్చ్ స్ట్రీట్ నుంచి తాను ఉండే హాస్టల్కు ర్యాపిడో ద్వారా బైక్ రైడ్ను బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి కెప్టెన్ తన చేతులతో ఆమె తొడలను తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని వారించింది. అయినా కూడా పట్టించుకోకుండా అతను అదే పని చేస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘‘అన్నా.. ఏం చేస్తున్నావ్?.. వద్దన్నా..’’ అంటూ బతిమాలుకుంది. అయినా ఆ కామాంధుడు వినలేదు. ఈలోపు.. తన గమ్యస్థానం రావడంతో ఆమె దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ కెప్టెన్ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం మరేయితర మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ పోస్ట్ చేసింది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాడిడో సంస్థ స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: తుపాకులు కావాలా? ల్యాప్ట్యాప్లు కావాలా? -
ఒక వ్యక్తి.. 10వేల ఓటర్ఐడీలు!
ఏఐ జమానాలో ఏది అసలైందో తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారింది. దానికి వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారంతో తోడవ్వడంతో మరింత వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. దీంతో వాస్తవం ఏంటో తెలియకుండానే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. ఒక వ్యక్తి 10వేల ఓటర్కార్డుల పేరిట ఓ ప్రచారం విపరీతంగా జరుగుతోంది. వీడియోతో సహా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. జరిగింది ఏంటి?.. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లా కల్యాణి టౌన్లోని మేజర్చర్ ప్రాంతంలో అక్టోబర్ 25వ తేదీన అనుమానాస్పదంగా ఓ వ్యక్తి సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఇద్దరు యువకులు అతన్ని పట్టుకుని సంచి తెరిచి చూడగా.. అందులోంచి ఓటర్ ఐడీ కార్డులు బయటపడ్డాయి. ఆ సమయంలో తీసిన వీడియోనే అది. సో.మీ. ప్రచారంఒక వ్యక్తికి 10వేల ఓటర్ కార్డులు. అదసలు సాధ్యమేనా? అనేది పట్టించుకోకుండానే ప్రచారం చేసేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో పరిస్థితి అధ్వానంగా తయారైందన్నది ఆ వీడియో సారాంశం. నేరగాళ్లు ఫేక్ ఓటర్ ఐడీలతో రెచ్చిపోతున్నారని.. ఇది ప్రభుత్వం కాదని.. పశ్చిమ బెంగాల్ను పశ్చిమ బెంగాల్గా మార్చే ప్రయత్నమని తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవి 100–250 దాకా ఉన్నాయి. అందులో మూడు డిజిటల్ కార్డులు అస్సాం రాష్ట్రానికి చెందినవిగా ఉన్నాయి. మిగతావి కల్యాణి, చుట్టుపక్కల వార్డులకు చెందినవిగా తెలుస్తోంది. అవి నకిలీవా? అసలువేనా?.. వీటితో మోసానికి పాల్పడ్డారా? అని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతోంది. ఫేక్ ప్రచారం అంటే.. పట్టుబడింది 250 ఓటర్కార్డులు. జాతీయ వార్త సంస్థలు కొన్ని ఆ విషయాన్ని ధృవీకరించాయి. అయితే అవి అసలువో.. నకిలీవో కూడా తెలియదు. కానీ,సోషల్ మీడియాలో కొందరు ఆ సంఖ్యను 10,000గా పేర్కొంటు ప్రచారానికి దిగారు. కొసమెరుపు.. 2018లో బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో ఒక అపార్ట్మెంట్లో 10,000కు పైగా ఓటర్ ID కార్డులు లభ్యమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు హస్తం ఉందని, ఆ అపార్ట్మెంట్ ఆయన సిబ్బందినేనని ఆ సమయంలో బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. భారీ సంఖ్యలో ఫేక్ ఓటర్ ఐడీలు బయటపడడంతో అక్కడి ఓటింగ్ను ఈసీ వాయిదా కూడా వేసింది. ఆ సమయంలో.. ఓటమి భయంతోనే సిద్ధరామయ్య ఇదంతా చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు కూడా. అయితే వాయిదా అనంతరం జరిగిన ఎన్నికలోనూ మునిరత్న నాయుడు ఘన విజయం సాధించారు. ఇప్పుడు 10వేల ఓటర్కార్డుల పట్టివేత ప్రచారం నేపథ్యంలో ఈ అంశం మరోసారి చక్కర్లు కొడుతోంది. -
‘యాసిడ్’ దాడి.. అమ్మాయి తండ్రి ప్లానే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన అనూహ్య మలుపు తిరిగింది(Delhi Acid Attack). ప్రకారమే ఆమె టాయిలెట్ క్లీనర్ను యాసిడ్ అంటూ కథ అల్లినట్లు పోలీసు విచారణలో తేలింది. అంతేకాదు, తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళపై ప్రతీకారంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడంటూ ఆమె భర్తను ఇరికించేందుకే బాధిత విద్యార్థిని తండ్రి అకీల్ ఖాన్ ఈ కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఆదివారం ఉదయం బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ప్రైవేట్ క్లాసుకోసం వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి తనపై యాసిడ్ చల్లారని ఆరోపించింది. జితేందర్తోపాటు అతడి మిత్రులు ఇషాన్, అర్మాన్ అనే వారి పేర్లు చెప్పింది. అయితే, ఇషాన్, అర్మాన్ అనే ఇద్దరు సోదరులు బాధితురాలికి బంధువులని పోలీసులకు తెలిసింది. ఘటన సమయంలో జితేందర్ తన భార్యతో కలిసి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని కరోల్ బాగ్లో ఉన్నట్లు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో వాడినట్లు చెబుతున్న బైక్ కూడా కరోల్ బాగ్లోనే ఉన్నట్లు సీసీకెమెరాల ద్వారా తెలుసుకున్నారు. దీంతోపాటు, అకీల్ ఖాన్ తనపై అత్యాచారం చేసినట్లు జితేందర్ భార్య పోలీసులు ఈ నెల 24, 25 తేదీల్లో మౌఖికంగా చేసిన ఫిర్యాదు చేసిన విషయం బయటకు వచ్చింది. ఆమె ఇదివరకు అకీల్ ఖాన్ నడిపే సాక్స్ దుకాణంలో పనిచేసేది. అప్పట్లో ఆమెపై అత్యాచారానికి, వేధింపులకు పాల్పడి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. జితేందర్ భార్య చేసిన ఆరోపణల మేరకు పోలీసులు అకీల్ ఖాన్ను అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి పేరుతో జితేందర్ను కేసులో ఇరికించి, అతడి భార్యపై కక్ష తీర్చుకునేందుకు ఇదంతా చేసినట్లు అకీల్ అంగీకరించాడు. కాలేజీకి ఈ–రిక్షాలో బయలుదేరిన తన కుమార్తె ప్రణాళిక ప్రకారం ముందుగానే కిందికి దిగిందని, ఇంట్లో నుంచి తీసుకెళ్లిన టాయిలెట్ క్లీనర్ను పోసుకుని కేకలు వేసిందని అకీల్ తెలిపాడు. అంతేకాదు, యాసిడ్ చల్లారని బాధితురాలు ఆరోపించిన ఇషాన్, అర్మాన్లు సైతం ఆ సమయంలో తమ తల్లి షబ్నంతోపాటు ఆగ్రాలో ఉన్నట్లు విచారణలో గుర్తించారు.2018లో షబ్నం కూడా అకీల్ ఖాన్పై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఈ రెండు కుటుంబాలకు మంగోల్పురిలో ఉన్న ఈ స్థలం విషయమై వివాదం నడుస్తోంది. షబ్నమ్పై అకీల్ యాసిడ్ దాడికి పాల్పడినట్లు మంగోల్పురి పోలీస్ స్టేషన్లో మరో ఎఫ్ఐఆర్ నమోదై ఉంది.ఇదీ చదవండి: పౌరుల పాలిట పెనుముప్పుగా డిజిటల్ అరెస్ట్! -
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్లాగ్స్తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ అయోధ్య.. ఐదుగురి దుర్మరణం
లక్నో: భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడింది(Ayodhya Blast). ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అయోధ్య సమీంలోని పగ్లాభారీ గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోగా.. చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో ఇల్లు కూలిపోయిందని.. శిథిలాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు చెబుతున్నారు. ఆ వెంటనే పోలీసుల రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. अयोध्या के पुरा कलंदर में एक ज़ोरदार ब्लास्ट से एक मकान ढह गया। राम कुमार के परिवार के 5 लोगों की दर्दनाक मौत हो गई। कहा जा रहा है अवैध पटाखे बन रहे थे या सिलेंडर ब्लास्ट हुआ जांच में साफ होगा।#Ayodhya@ayodhya_police pic.twitter.com/2BX9IRqAhp— Hussain Rizvi हुसैन حسین رضوی (@TheHussainRizvi) October 10, 2025గ్యాస్ సిలిండర్ లేదంటే ప్రెజర్ కుక్కర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే.. పేలుడు జరిగిన చోట గన్పౌడర్, పటాకుల మిగులు భాగాలు బయటపడ్డాయి. దీంతో అనుమతులు లేకుండా బాణాసంచాలు తయారు చేసే క్రమంలోనే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి యాజమానిని రామ్కుమార్ కసౌధన్ అలియాస్ పప్పు గుప్తాగా పోలీసులు నిర్ధారించారు. ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలోనూ ఇదే ఇంట్లో పేలుడు జరిగి యజమాని భార్య, తల్లి మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరా తీశారు(CM Yogi on Ayodhya Blast). ఘటనపై త్వరగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. దీంతో క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. మొన్నే కాన్పూర్లో స్కూటర్ పేలుడు సంభవించి(Kanpur Scooter Blast).. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే తొలుత బాణాసంచాల వల్లే ప్రమాదం జరిగిందని తెలిపిన పోలీసులు.. అది సిలిండర్ బ్లాస్ట్ అని తాజాగా ప్రకటించారు. ఈ రెండు పేలుళ్లపై కుట్ర కోణం ప్రచారం తెర మీదకు రాగా.. పోలీసులు దానిని ఖండించారు.ఇదీ చదవండి: శబరిమలై వ్యవహారంలో మరో ట్విస్ట్ -
అత్తపై మోజుతో..
వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒక ఘటన ద్వారా చూస్తున్నదే. అయితే ప్రేమ పేరిట, శారీరక సుఖం కోసం అనైతిక సంబంధంలోనూ మునిగిపోతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇక్కడ.. మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది.ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. తన అత్తతో అనైతిక సంబంధం(Illicit Relationship) పెట్టుకున్న ఆమె భర్తే హంతకుడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు.. ఆ అత్తాఅల్లుళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) కాస్గాని జిల్లా సిధ్పుర గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో చనిపోయిందంటూ పోలీసులకు కబురు వెళ్లింది. మృతురాలిని శివాని(20)గా గుర్తించిన పోలీసులు.. హత్య జరిగి రెండు అప్పటికే రెండు రోజులు అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె తరఫు బంధువులను విచారించగా.. భర్త ప్రమోదే ఆమెను హత్య చేసి పారిపోయాడని వాళ్లు పోలీసుల వద్ద వాపోయారు.2018లో శివాని, ప్రమోద్ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాబు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.ఈ క్రమంలో.. అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ శివానిని హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఈలోపు.. ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. అత్తపై మోజుతో భార్యను కడతేరచిన భర్త ఉదంతంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిందక్కడ.ఇదీ చదవండి: పరుపు కింద భార్య శవాన్ని కుక్కి.. -
‘దటీజ్ యోగి’.. పోలీసింగ్లో సరికొత్త అధ్యాయం!
ఉత్తర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ దేశచరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఓ మహిళా పోలీసుల బృందం ఎన్కౌంటర్లో పాల్గొంది. ఈ క్రమంలో తమపై కాల్పులకు దిగిన నేరస్తుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోగలిగింది. దీంతో ఆ బృందంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ఘాజియాబాద్ లోహియా నగర్ (Ghaziabad Lohia Nagar) వద్ద మహిళా పోలీసుల బృందం ఒకటి గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో స్కూటర్పై వెళ్తున ఓ వ్యక్తిని ఆపబోయారు. అతను పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో స్కూటర్తో సహా జారి పడిపోయాడు. ఆపై తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ బృందం ప్రతి కాల్పులకు దిగింది. ఈ క్రమంలో.. కాలిలో బుల్లెట్ దిగడంతో నిందితుడు లొంగిపోయాడు. అతని పేరు జితేంద్ర కుమార్ అని, ఫోన్లు, చైన్ల దొంగతనాలతో పాటు బైకుల చోరీలకు సంబంధించి 8 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి ఓ దేశీయ తుపాకీ, రెండు కార్ట్రిడ్జులు, చోరీ చేసిన స్కూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో యోగి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.उक्त सम्बन्ध में श्रीमती उपासना पाण्डेय, सहायक पुलिस आयुक्त नन्दग्राम की वीडियो बाइट-@Uppolice https://t.co/VOUOjuBHf8 pic.twitter.com/x9XCNGSqwh— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) September 22, 2025యోగి ప్రశంసలు దేశంలో ఇప్పటిదాకా జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా పోలీసులు భాగంగా మాత్రమే ఉన్నారు. అయితే పూర్తిగా మహిళా పోలీసులు ఈ ఎన్కౌంటర్లో పాల్గొనడం విశేషం(Women Police Encounter). ఈ ఆపరేషన్ను మహిళా పీఎస్ స్టేషన్ హెడ్ రీతూ త్యాగీ నేతృత్వంలో జరిగింది. ముగ్గురు మహిళా సబ్-ఇన్స్పెక్టర్లు, ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్లో మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది యోగి ప్రభుత్వం. అయితే ఈ ఘటన మహిళా పోలీసుల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఘట్టంగా ఏసీపీ ఉపాసనా పాండే అభివర్ణిస్తున్నారు. మరోవైపు.. ఈ చరిత్రాత్మక ఎన్కౌంటర్లో పాల్గొన్న మహిళా బృందానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలియజేశారు. వారి ధైర్యం, సమర్థత, నిబద్ధత.. పోలీసింగ్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ప్రశంసించారు.మాఫియా, గ్యాంగులు, తీవ్ర నేరస్తులపై యోగి సారథ్యంలోని యూపీ గవర్నమెంట్ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఈ ప్రభుత్వంలో 2017 నుండి 2024 చివరి వరకు మొత్తం 10,713 ఎన్కౌంటర్లు జరిగాయని అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ ఎన్కౌంటర్లలో 63 మంది క్రిమినల్స్ మరణించగా.. 1,708 మంది నేరస్థులు గాయపడ్డారు. మరో 5,967 మంది అరెస్ట్ అయ్యారు. పోలీస్ సిబ్బంది 401 మంది గాయపడగా.. ఒకరు వీరమరణం పొందారు.ఇదీ చదవండి: నా 23 కోట్లు పోయాయి.. వాళ్లతో మీరు జాగ్రత్త! -
కోల్కతా గజగజ
కోల్కతా: ఎడతెరిపి లేని భీకర వర్షం ధాటికి పశి్చమ బెంగాల్ రాజధాని కోల్కతాతోపాటు పొరుగు జిల్లాలు గజగజ వణికిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం దాకా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. పది మంది మృతిచెందారు. వీరిలో తొమ్మిది మంది విద్యుదాఘాతానికి బలయ్యారు. మరొకరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కోల్కతా నగరంలో గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అతిపెద్ద వర్షం కావడం గమనార్హం. 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 1986 తర్వాత ఈ స్థాయిలో భారీ వర్షం పడడం ఇదే తొలిసారి. గత 137 ఏళ్లలో ఇది ఆరో అతిపెద్ద వర్షంగా రికార్డుకెక్కింది. నగరంలో రహదారులు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. మంగళవారం విద్యా సంస్థలు మూసివేశారు. నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజలకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 25 దాకా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 27 దాకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దుర్గా మండపాల్లోకి నీరు కోల్కతాలో దయనీయ దృశ్యాలు కనిపించాయి. గరియా జోధ్పూర్ పార్కు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయాయి. వంట సరుకులు పనికిరాకుండా పోవడంతో జనం ఆకలితో అలమటించారు. నగరమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. మోకాలి లోతు నీటిలోనే జనం బయటకు వచ్చారు. దుకాణాల్లో వస్తువులు సైతం మునిగిపోవడంతో యజమానాలు లబోదిబోమన్నారు. భారీగా నష్టపోయామని చెప్పారు. కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కాలువులు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దుర్గా మండపాలు సైతం నీట మునిగాయి. విగ్రహాలతోపాటు అలంకరణ సామగ్రి దెబ్బతినే ప్రమాదం ఉండడంతో నీటిని బయటకు పంపించేందుకు కారి్మకులు శ్రమించారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వర్షం కారణంగా పలు స్టేషన్ల మధ్య మెట్రో రైళ్లను నిలిపివేయాల్సి వచి్చంది. ప్రతికూల వాతావరణం వల్ల 30 విమానాలను రద్దుచేశాయి. 31 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్వ మేదినీపూర్, పశి్చమ మేదినీపూర్, జార్గ్రామ్, బంకూరా తదితర జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇంతటి వర్షం ఏనాడూ చూడలేదు: మమతా బెనర్జీ ఇలాంటి కుండపోత వర్షం తాను ఏనాడూ చూడలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. పది మంది మృతిచెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆమె మంగళవారం ప్రజలను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. ప్రైవేట్ విద్యుత్ సరఫరా సంస్థ సీఈఎస్సీ ఎలాంటి రక్షణ లేకుండా కరెంటు వైర్లను వదిలేయడం వల్ల విద్యుత్ షాక్తో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. కోల్కతాలో విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానికి కాదని, సీఈఎస్సీ కాంట్రాక్టు దక్కించుకుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు సీఈఎస్సీ సంస్థ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. అలాగే కనీసం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అయ్యప్ప చుట్టూ రాజకీయం! -
దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట.. అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఊరట కలిగిస్తూ.. జీఎస్టీ 2.0 సోమవారం అమల్లోకి వచ్చింది. నూతన శ్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను శ్లాబ్లు సరళతరం కావడంతో.. ఇవాళ్టి నుంచి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి.వంటగది సరకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకున్నా.. విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఈ తగ్గింపులు మధ్య తరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఊరట లభించొచ్చు. అదే సమయంలో పండుగలపూట సాధారణంగానే డిస్కౌంట్లు ప్రకటించే కంపెనీల నిర్ణయంతో వినియోగదారులకు మరింత ఊరట దక్కే అవకాశం ఉంది. జీఎస్టీ 2.0లో ప్రధానంగా తగ్గినవి ఇవే:ఔషధాలు & వైద్య పరికరాలు36 జీవన రక్షక ఔషధాలపై జీరో జీఎస్టీసాధారణ మందులు 12% నుంచి 5%కి తగ్గింపుడయాగ్నస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్లు – 5% GSTనిర్మాణ సామగ్రిసిమెంట్ – 28% నుంచి 18%కి తగ్గింపు ఎలక్ట్రానిక్స్ & గృహోపకరణాలు (18% GST)టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, డిష్వాషర్లు32 ఇంచుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీ రేట్లే తగ్గనున్నాయి రూ.2,500-85,000 తగ్గనున్న టీవీల ధరలువాహనాలుచిన్న కార్లు (1200cc లోపు) – 28% నుంచి 18%ద్విచక్ర వాహనాలు – 18% GSTమారుతి, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీల కార్లు లక్షల రూపాయల వరకు చౌకయ్యాయిద్విచక్ర వాహనాల ధరలు రూ.18,800 వరకు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. సేవలుజిమ్, యోగా సెంటర్లు, సెలూన్లు, హెల్త్ క్లబ్లు – 5% GSTరూ.7500 - అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదులపై జీఎస్టీని 12% నుంచి 5 శాతానికి తగ్గింపు.. రూ.525 వరకు ఆదా. జీఎస్టీ తగ్గింపుతో పాటు ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) లేకుండా తగ్గించడం ఇందుకు కారణం. దినసరి వినియోగ వస్తువులు (5% GST)• టూత్పేస్ట్, సబ్బులు, షాంపూలు• హేర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, టాల్కం పౌడర్• బిస్కెట్లు, నంకీన్, జామ్, కెచప్, జ్యూస్• ప్యాకేజ్డ్ ఫుడ్స్, డైరీ ప్రొడక్టులు (నెయ్యి, పనీరూ, బటర్)• డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్• సైకిల్స్, స్టేషనరీ, నోట్బుక్స్• చపాతీ, రొటీ, పరాటా, పిజ్జా బ్రెడ్అయితే హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40 శాతానికి పెరిగింది. అంటే సిగరెట్లు, గుట్కాలు తదిరాలు. - చక్కెర కలిగిన లేదా ఫ్లేవర్ కలిగిన నాన్-అల్కహాలిక్ బీవరేజెస్, విలాసవంతమైన హైఎండ్ కార్లు (350cc పైగా బైకులు, 1200cc పెట్రోల్ కార్లు, 500ccపైన డీజీల్ కార్లు, 4 మీటర్ల కంటే పొడవున్న కార్లు, ఎస్యూవీలు), హెలికాప్టర్లు, యాచ్లు, ఆన్లైన్ గేమింగ్ & బెట్టింగ్ ప్లాట్ఫారమ్లు, గేమింగ్ యాప్స్ (రియల్ మనీ గేమ్స్), కోల్, లిగ్నైట్, పీట్ (Coal products), డైమండ్స్.. ప్రెషస్ స్టోన్స్ ఇలా విలాసవంతమైన వస్తువులకు జీఎస్టీ పెరిగింది. జీఎస్టీ అంటే Goods and Services Tax. ఇది ఒక ఏకీకృత పన్ను విధానం, అంటే దేశవ్యాప్తంగా అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్నుగా వసూలు చేసే విధానం. 2017లో ఇది అమల్లోకి వచ్చింది. అయితే.. జీఎస్టీ 2.0లో గతంలో ఉన్న నాలుగు శ్లాబ్లను నుంచి రెండుకు తగ్గించింది కేంద్రం. అందులో ఉన్న 12, 28 శాతం శ్లాబ్లను తొలగించింది కేంద్రం. దీంతో ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం శ్లాబ్లే కొనసాగనున్నాయి. అదే సమయంలో నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. 12 శాతంలో ఉండే 99 శాతం వస్తువులపై 5 శాతం జీఎస్టీ, 28 శాతం ఉండే 99 శాతం వస్తువులపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. తాజా సవరణలతో.. ఒకే పన్ను-ఒకే విధానం లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా అమలు కావొచ్చని కేంద్రం ఆశిస్తోంది. -
‘అదంతా ఫేక్’.. షీనా బోరా కేసులో కీలక మలుపు
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ కూతురు విద్ది ముఖర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. సీబీఐ ఛార్జ్షీట్లో తన పేరుతో ఉన్న స్టేట్మెంట్లు తనవి కాదని.. అవి నకిలీవని పేర్కొన్నారు. దీంతో ప్రాసిక్యూషన్కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కూతురే విద్ధి ముఖర్జీ. మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి జేపీ దరేకర్ ఎదుట సాక్ష్యాన్ని నమోదు చేసే క్రమంలో ఆమె కీలక విషయాలను వెల్లడించారు. ఏ దర్యాప్తు సంస్థ తన వాంగ్మూలం నమోదు చేయలేదని, తన పేరిట నమోదైన ప్రకటనలు నకిలీవని అన్నారామె. ఇంద్రాణీ అరెస్టు తర్వాత.. పీటర్ ముఖర్జీ, ఆయన కుటుంబ సభ్యులు ఆమె ఆస్తులపై గొడవపడినట్టు విద్ది తెలిపారు. పీటర్ కొడుకులు రాహుల్, రబిన్లు ఇంద్రాణికి చెందిన కోట్ల విలువైన ఆభరణాలను, రూ.7 కోట్ల నగదు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. చివరకు ఆ కుటుంబ సభ్యులు ఇంద్రాణి వాడిన పర్ఫ్యూమ్లు, బ్యాగులు, చీరల కోసం కూడా కొట్టుకున్నారని తెలిపారు. దీంతో తన తల్లి దగ్గర చిల్లిగవ్వ లేకుండా అయ్యిందని వాపోయారామె. అంతేకాదు.. ఆస్తులను ఎక్కడ అప్పగించాల్సి వస్తుందోనని ఉద్దేశపూర్వకంగానే తన తల్లి ఇంద్రాణి ముఖర్జీని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారామె. తన తల్లి అరెస్ట్ అయిన సమయంలో తాను మైనర్గా ఉన్నానని, ఆ సమయంలో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని విద్ధి ప్రత్యేక న్యాయమూర్తికి తెలిపారు. ఈ కేసు విచారణలో ముంబై పోలీసులు తొలుత తనను సంప్రదించారని, ఆ తర్వాత సీబీఐ తనను ప్రశ్నించాలనుకుందని తెలిపారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని విద్ధి తెలిపారు. అయితే.. పోలీసులుగానీ, సీబీఐగానీ తన స్టేట్మెంట్ను ఎక్కడా అధికారికంగా నమోదు చేయలేదని అన్నారామె. అలాగే..సీబీఐ కార్యాలయంలో తనను ఖాళీ పత్రాలపై, కొన్ని ఈమెయిల్ ప్రతులపై సంతకం చేయమని ఒత్తిడి చేశారని, ఛార్జ్షీట్లో ఉన్న ప్రకటనలు తనవిగా చూపించడంలో దురుద్దేశం కనిపిస్తోందని అన్నారామె. తన తల్లిదండ్రుల్ని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. బోరాను తన తల్లి ఇంద్రాణి ముఖర్జీ సోదరిగానే ప్రపంచానికి పరిచయం చేసింది. ఒకానొక టైంలో ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఎప్పుడైతే పీటర్ ముఖర్జీ పెద్ద కొడుకు రాహుల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడే పరిస్థితి మారిపోయింది. అతను తరచూ సెంట్రల్ ముంబై వోర్లీలో ఉన్న బోరా ప్లాట్కు వెళ్లడం ప్రారంభించాడో.. అప్పటి నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. రాహుల్, షీనాకు సన్నిహితంగా ఉండడం మాత్రమే కాదు.. డ్రగ్స్ అలవాటు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. చివరిసారిగా.. బోరాను 2011లో గోవాలో జరిగిన ఓ వివాహ వేడుకలో చూశాను. కానీ, 2013 దాకా ఆమె ఈమెయిల్స్తో టచ్లో ఉండేది అని విద్ధీ కోర్టుకు తెలిపింది. 2015 ఆగస్టులో తన తల్లి అరెస్ట్ అయ్యేదాకా అంతా బాగానే ఉండేది. ఆ టైంలో పీటర్ కొడుకులు రాహుల్ ఏ పనీ పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు. రాహుల్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే డబ్బు కోసం వాళ్లిద్దరూ తెగించారు. పీటర్ ముఖర్జీ అరెస్ట్ కంటే ముందే వాళ్లిద్దరూ ఇంద్రాణికి చెందిన నగలు దొంగిలించారు. వాటిని కొత్తగా ఓ బ్యాంక్ లాకర్ తెరిచి దాచారని అన్నారామె. తద్వారా వాళ్లిద్దరూ ఇంద్రాణిని కావానే ఇరికించినట్లు స్పష్టమవుతోందని అన్నారు. తల్లి కావాలా? ముఖర్జీ వారసత్వం కావాలా? ఎంచుకోవాలని రబిన్ తనను బెదిరించాడని, ఒకవేళ తల్లి వైపు నిలవడితే ఆస్తులను వదులుకోవాల్సి ఉంటుందని బెదిరించాడని కోర్టుకు తెలిపింది. బుధవారం కూడా విద్ధి సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేయాల్సి ఉంది. షీనా బోరా.. ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె మొదటి భర్త సిద్దార్థ్ దాస్లకు పుట్టిన సంతానం. 2012లో షీనా బోరా అనుమానాస్పద రీతిలో అదృశ్యమైంది. అయితే ఆమె అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిందని ఇంద్రాణీ అందరికీ చెబుతూ వచ్చింది. 2015లో ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ ఓ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారించే క్రమంలో.. షీనా బోరా హత్య కేసు బయటకు వచ్చింది. ఈ కేసులో ఇంద్రాణీ, ఆమె మాజీ భర్తలు, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జీలను పోలీసులు అరెస్ట్ చేసింది. ఇంద్రాణీ, సంజీవ్, డ్రైవర్ శ్యామ్వర్లు షీనాను కారులో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. హత్య అనంతరం ఆమె శరీరాన్ని రాయగడ్ అడవిలో తగలబెట్టి పారేసినట్టు ఆరోపణ ఉంది. అంతేకాదు.. షీనా మరణించాక కూడా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె పేరిట అందరికీ మెయిల్స్ పంపిందని అంటోంది. ఈ కేసులో పీటర్, సంజీవ్లకు కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఆరున్నరేళ్లు జైలు జీవితం గడిపిన ఆమె.. 2022 మే 18న ముంబై బైకులా మహిళా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. -
లేడీస్ హాస్టల్లోకి దర్జాగా చొరబడి.. అసభ్యంగా ప్రవర్తించి..
బహిరంగ ప్రదేశాల్లో వరుస లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తున్న బెంగళూరులో.. మరో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆగంతకుడు అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి చొరబడి ఒకరితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చోరీ సైతం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. బెంగళూరు సుద్దగుంటేపాళ్య పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆగంతకుడు పీజీలోకి ప్రవేశించి.. నిద్రిస్తున్న మహిళను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మెలుకువ వచ్చి గట్టిగా అరిచింది. అయితే కంగారుపడ్డ ఆ వ్యక్తి.. ఆమె బ్యాగ్ నుంచి నగదు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో.. ఆమె అతన్ని వెంబడిస్తూ కేకలేస్తూ బయటకు పరుగులు తీసింది. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటనపై సుద్దగుంటేపాళ్య పీఎస్లో కేసు నమోదు అయ్యింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు.. నిందితుడు దర్జాగా పీజీలోకి చొరబడిన దృశ్యాలు, అలాగే పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. బెంగళూరులో పీజీలు, లేడీస్ హాస్టల్స్లో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. దీంతో గట్టి భద్రత ఏర్పాటు చేయించాలని నిర్వాహకులకు పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోయిన నెలలో బెంగళూరులో ఓ దారుణం జరిగింది. పీజీ నిర్వాహకుడు ఒకడు.. ఓ కాలేజీ యువతిపై అత్యాచారం చేశాడు. బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యాం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
జడ్జి ఇంట నోట్ల కట్టల వివాదంలో కీలక మలుపు
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనపై మోపబడిన ఆరోపణలు వాస్తవమేనని, గౌరవ ప్రదంగా తప్పుకోకపోవడంతో ఆయన్ని తొలగించాల్సిందేనని ఇన్హౌజ్ కమిటీ ఇంతకు ముందు నివేదిక ఇచ్చింది. అయితే ఆయన్ని అభిశంసించాలన్న వ్యవహారంపై పార్లమెంట్లో ఓ అడుగు ముందుకు పడింది. ఇన్హౌజ్ కమిటీ నివేదిక ఇచ్చిన ప్రతిపాదనపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు మంగళవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇందులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ మణిందర్ మోహన్, సీనియర్ అడ్వొకేట్ బీవీ ఆచార్య సభ్యులుగా ఉంటారని తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలన్న ప్రతిపాదనపై 146 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు స్పీకర్ వెల్లడించారు. కమిటీ వీలైనంత త్వరగా నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. వాట్ నెక్ట్స్.. పార్లమెంట్లో ఏర్పాటైన కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ సెషన్ 21వ తేదీతో ముగియనుంది. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ధర్మస్థళ కేసు: అదే సస్పెన్స్.. తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ!
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.జీపీఆర్ టెక్నాలజీతో..2003 సమయంలో కోల్కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్ను కోరుతున్నారు.జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే.. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా.. జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి. తప్పుకున్న జడ్జిజులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఐటీఆర్తో గుట్టురట్టుధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
బీఈడీ స్టూడెంట్ కేసు.. ఏబీవీపీ నేత అరెస్ట్
ఒడిశా బీఈడీ స్టూడెంట్ బలవన్మరణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్, వేధింపులకు పాల్పడిన హెచ్వోడీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒకరు ఏబీవీపీ నేత ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఫ్యాకల్టీ వేధింపులు తాళలేక ఒడిశాలో 20 ఏళ్ల బీఈడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని కాలేజీ ఆవరణలోనే నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. జులై 13వ తేదీన జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 90 శాతం కాలిన గాయాలతో రెండు రోజుల తర్వాత ఎయిమ్స్లో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో.. వేధింపులకు పాల్పడ్డ ఫ్యాకల్టీ సమీర్ రంజన్ సాహోతో పాటు ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఏబీవీపీ లీడర్ సుభాత్ సందీప్ నాయక్ కూడా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు బలవనర్మణానికి పాల్పడే సమయంలో సందీప్ నాయక్ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు అయ్యాయన్నది తెలియరావాల్సి ఉంది.తన కోరికె తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ సమీర్ రంజన్ సాహో సదరు విద్యార్థిపై బెదిరింపులకు దిగాడు. లైంగిక వేధింపులను ఆమె కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా అతనిపై చర్యలేవీ తీసుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. పైగా.. తనకు చావే గతంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే ఘటన జరిగిన రోజు.. ప్రిన్సిపాల్ను కలిసిన కాసేపటికే ఆమె ఒంటికి నిప్పటించుకుందని పోలీసులు చెబుతున్నారు. హెచ్వోడీపై ఫిర్యాదు నేపథ్యంతో ఆరోజు ప్రిన్సిపాల్ గదిలో సమావేశం జరిగింది. సమీర్పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారని, కొంతమంది విద్యార్థులతో సదరు విద్యార్థిపై ఆ హెచ్వోడీ తప్పుడు ప్రచారం చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. తాజా అరెస్టుల నేపథ్యంలో దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థళలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానని (Mass Burial Case) ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. అతడు చూపించినట్లు 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 6వ పాయింట్లో మానవ అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడిందని భావించారంతా. ధర్మస్థళ(Dharmasthala) కేసులో ఇవాళ ఐదో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావళి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో.. 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ ఐదు స్పాట్లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ ప్రత్యక్ష సాక్షిని అధికారులు విచారిస్తారని సమాచారం. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం గురువారం(జులై 31వ తేదీ) ఆరో పాయింట్లో ఓ చోట కొన్ని అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపించారు. అయితే ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. అయితే.. ఆరో పాయింట్ తప్ప.. ఇప్పటిదాకా అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. అవి వరదలతో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో మానవ కంకాళాలు(ఎముకలు) కొట్టుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. అటవీ ప్రాంతంలోని మిగతా పాయింట్ల మీద దృష్టి సారించారు. పైగా ఈ ప్రాంతాల్లోనే సామూహికంగా తాను శవాలను పాతిపెట్టానని అతను చెబుతున్నట్లు కర్ణాటకకు చెందిన కొన్ని వార్తా చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ కథనాలు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఐదు ప్రాంతాలు ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ధర్మస్థళ.. ఉష్ గప్చుప్!జనాలు రాకుండా.. గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని(మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని) వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు. గుంతలు తవ్వేందుకు 20 మంది కార్మికులు, బుల్డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికం, మంగళూరు కేఎంసీ వైద్యులు, ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రవతీ నది ఒడ్డున సిట్ తవ్వకాలు జరుపుతుండడంతో జనం ఆ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే.. ఏంటీ మిస్టరీ కేసు..దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక (Karnataka) ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు(62).. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్కు ఇటీవల ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం క్లుప్తంగా.. ‘‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా. 1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’’2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అతనికి రక్షణ కల్పించారు. మరోవైపు.. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థళ పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు ఆ వ్యక్తి లేఖలో పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.వందల మంది మిస్సింగ్?దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో.. ధర్మస్థళ, బెళ్తంగడి, ఉజిరె పీఎస్ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థి(20)ని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందినవారు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బాధితురాలి తల్లి సుజాత భట్ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: ధర్మస్థళ కేసు.. పురుషుల మృతదేహాలు కూడా?!మీడియాకు ఊరటధర్మస్థళలో ఏం జరుగుతోందంటూ.. గత కొన్నిరోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు పెద్దలు ధర్మస్థళ పేరును చెడగొడుతున్నారంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సామూహిక ఖననాలకు సంబంధించిన వేలకొద్దీ కథనాల లింకులను తొలగించాలని, అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు సూచిస్తూ న్యాయస్థానం గాగ్ ఆర్డర్ను ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆ గాగ్ ఆర్డర్ను కొట్టేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. -
గుండెపోటుతో మరో మరణం.. ఆ వదంతులను కొట్టిపారేసిన మంత్రి
రాయచూరు రూరల్: కర్ణాటకలో వరుసగా గండెపోటు మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువతి మరణించిన ఘటన కొప్పళలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి శివగంగా కాలనీలో నివాసముంటున్న మంజుల హూగార్(26) గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మంజుల ఇటీవల వరకు బెంగళూరులో పని చేస్తుండేది. అక్కడ పని వదిలిపెట్టి ఇటీవలే కొప్పళకు వచ్చింది. తల్లిదండ్రులు బస్టాండ్లో పూల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. మంజుల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారని తప్పుడు సందేశం ప్రచారం అయిందని, అయితే గుండెపోటు వల్లే ఎక్కువ మంది చనిపోతారనడం అబద్ధం అని ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. హావేరి తాలూకా నిలోగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈటీటీసీ శిక్షణ సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గుండెపోటు కేసులపై వికాస సౌధలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్తో ఇటీవల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించామన్నారు. ఆ మేరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయిందన్నారు. గత 6 నెలల గణాంకాల వివరాలు విశ్లేషించాం. దీని కోసం ఓ సమితిని కూడా ఏర్పాటు చేశామన్నారు. సమితి నివేదిక ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువ కాలేదన్న సమాచారం ఉందన్నారు. అయితే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లినందువల్ల భయకంపితులయ్యారు. ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గుండెపోటు మృతులపై పూర్తి సమాచారం తీసుకున్నాం. అంతేగాక ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వస్తుందన్న తప్పుడు విశ్వాసం ఉంది. గుండెపోటుకు సదరు వ్యాక్సిన్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. -
డార్క్ క్వీన్ సాన్ రేచల్ కన్నుమూత
ప్రముఖ మోడల్ సాన్ రేచల్ (San Rechal) బలవన్మరణానికి పాల్పడింది. పుదుచ్చేరిలో తన నివాసంలో ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ శనివారం కన్నుమూసింది. పుదుచ్చేరిలో పుట్టిపెరిగిన సాన్ రేచల్.. మోడలింగ్ రంగంలో మిస్ డార్క్ క్వీన్గా, మిస్ బెస్ట్ ఆటిట్యూడ్గా, మిస్ ఆఫ్రికా గోల్డెన్ ఇండియా లాంటి టైటిల్స్ గెలుచుకున్నారు. మోడలింగ్ మాత్రమే కాదు.. ఆమె మెడిసిన్ విద్యనూ అభ్యసించారు. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె.. అధిక డోస్లో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యుల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె.. రెండు కిడ్నీలు చెడిపోవడంతో జూలై 12వ తేదీన కన్నుమూసినట్లు సమాచారం.రేచల్ తల్లి ఆమె చిన్నతనంలోనే కేన్సర్తో కన్నుమూసింది. అప్పటి నుంచి తండ్రి, సోదరుడి ప్రోత్సాహంతో ఆమె పెరిగారు. రంగు గురించి తోటి స్నేహితులు, బంధువులు ఆమెను ఎగతాళి చేసేవారు. అయినా ఆమె కుంగిపోలేదు. ‘‘రంగులో ఏముందిలే.. కరుపు(నలుపు) కూడా అందమే’’ అనే ఆమె మాటలు మోడలింగ్ రంగంలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. అయితే.. View this post on Instagram A post shared by San rechal Gandhi / Pageant Coach (@san_rechal_official)సూసైడ్ నోట్లో.. తన మరణానికి భర్త(ఇటీవలె వివాహం జరిగింది), కుటుంబ సభ్యులు కారణం కాదని ఆమె ఒక లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె మృతిపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవమానాలను, ట్రోలింగ్ను తట్టుకుని మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న రేచల్.. పాతికేళ్లకే ఇలా తనువు చాలించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు.. అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
పప్పు పంచాయితీ.. ఎమ్మెల్యేపై కేసు నమోదు
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై కేసు నమోదైంది. పాడైపోయిన పప్పు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఓ జాతీయ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకోవైపు తీవ్ర దుమారం రేపుతున్నాయి.బుల్దానా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్.. ముంబైలోని తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్ను తీవ్రంగా కొట్టారు. పాచిపోయిన ఆహారం ఇచ్చారంటూ పప్పు ఉన్న కటోరాను కాంట్రాక్టర్ ముక్కు వద్ద పెట్టిన గైక్వాడ్.. ఆ వెంటనే అతనిపై ముష్టిఘాతాలు కురిపించారు. సదరు కాంట్రాక్టర్ కింద పడిపోయి.. లేవలేని స్థితిలో ఉన్నా.. తన దాడిని ఆపలేదు. ఈ దాడికి సంబంధించిన వీడియో బుధవారం నెట్టింట వైరల్ అయ్యింది.అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును ప్రతిపక్షాలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్, శివసేన బాస్.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. అయినా కూడా గైక్వాడ్ తన నోటి దురుసును ఆపలేదు. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత.. శుక్రవారం ఆయనపై కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేశారో స్పష్టత రావాల్సి ఉంది.గురువారం రాత్రి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణ భారతీయులపై శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారు. శెట్టి అనే దక్షిణాది వ్యక్తికి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? మహారాష్ట్ర స్థానికుడికి ఇవ్వాలి కదా? ఏం తినాలో మాకు తెలుసు. దక్షిణాదివారు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. పిల్లల్ని చెడగొడుతుంటారు. అలాంటి వారు మంచి ఆహారం ఎలా అందిస్తారు? అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఢిల్లీలో భూకంపం..
-
ఢిల్లీలో దంచికొట్టిన వాన
ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. నగరంతో పాటు శివారులో కుండపోత భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పని వేళలు ముగిసే సమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం పడొచ్చని చెబుతూ వాతావరణ శాఖ(IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఢిల్లీ అధికార యంత్రంగాణం పలు సూచనలు జారీ చేసింది. #WATCH | Heavy rain lashes parts of Delhi. Visuals from the GRG Road, which is waterlogged. pic.twitter.com/EOVN69XZRQ— ANI (@ANI) July 9, 2025నగర వ్యాప్తంగా పలు అండర్పాస్లను మూసేస్తున్నట్లు చెబుతూ.. ఆ వైపుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.అందుకు తగ్గట్లే నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.#WATCH | Heavy rain lashes parts of Delhi, visuals near Kartavya Path. pic.twitter.com/vPgcg2iuiU— ANI (@ANI) July 9, 2025VIDEO | Delhi: Heavy rain lashes parts of the national capital, bringing relief from heat. Visuals from Constitution Club. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#Delhi pic.twitter.com/vsrcgn1i7Q— Press Trust of India (@PTI_News) July 9, 2025 -
ముంచుకొచ్చిన ఉపద్రవం.. ఊరినే కాపాడిన కుక్క!!
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అక్కడి ప్రజల జీవనం కష్టతరంగా ఉంటోంది. మరోవైపు వర్షాలకు ఇప్పటిదాకా 75 మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఊరకుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది!!. వివరాల్లోకి వెళ్తే..హిమాచల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడి ధరంపూర్ తాలుకా సియతి గ్రామం జూన్ 30న అర్ధరాత్రి సమయంలో పెద్ద కొండచరియ విరిగిపడడంతో సర్వనాశనమైంది. ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయినా.. ఓ ఊరకుక్క కారణంగా ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు వాళ్లు. ఆ రాత్రి ఏం జరిగిందో ఓ గ్రామస్తుడి మాటల్లో.. మా ఇంటి రెండోఅంతస్తులో ప్రతిరోజు ఓ శునకం నిద్ర పోయేది. అయితే ఆరోజు అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. భయంతో అరుస్తుందేమోనని ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్లాను. పైకి వెళ్లి చూడగా.. ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి చిన్నగా నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే కుక్కను కూడా కిందికి పరిగెత్తా. ఇంట్లో వాళ్లను.. చుట్టుపక్కల అందరినీ లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. అలా దూరంగా వెళ్లామో, లేదో.. మా గ్రామంపై ఓ పెద్ద కొండచరియ విరిగిపడింది. పదుల సంఖ్యలో ఇళ్లు దానికింద నేలమట్టం అయ్యాయి అని చెప్పారాయన. అలా కుక్క అరుపు.. 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలను రక్షించిందన్నమాట. -
ఎయిరిండియా విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం...
-
వైఫ్ లు కాదు.. వైల్డ్ నైఫ్ లు
-
ఖర్గే చురకలు.. శశిథరూర్ కౌంటర్!
కాంగ్రెస్ అధిష్టానంతో సీనియర్ నేత శశిథరూర్కు ఉన్న విభేదాలు ఇవాళ మరోసారి అధికారికంగా బయటపడ్డాయి. శశిథరూర్ను ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. కాసేపటికే థరూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు ఇంగ్లీష్ చదవడం అంత బాగా రాదు. కానీ, శశిథరూర్ భాష చాలా బాగుంటుంది. అందుకే ఆయన ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నారు. మేము మాకు వచ్చిన భాషలో ‘‘దేశమే ముందు(మా తొలి ప్రాధాన్యం) అంటాం’’. భారత సైన్యానికి మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ కోసం ఐక్యంగా నిలబడ్డాం. కానీ కొంతమంది ‘‘మోదీనే ముందు.. ఆ తర్వాతే దేశం అంటారు. అలాంటప్పుడు మేమేం చేయాలి?’’ అని నవ్వుతూ అన్నారాయన. మోదీని ప్రశంసించినందుకు థరూర్పై చర్యలు ఉంటాయా? అని ఎదురైన ప్రశ్నకు.. ఆ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంటుందని, చర్యలు తీసుకునే ఉద్దేశమేదీ లేదని అన్నారు. అదే సమయంలో పార్టీ ఐక్యతే అధిష్టానానికి ముఖ్యం అని ఖర్గే పేర్కొన్నారు. #WATCH | #Congress President #MallikarjunKharge says #ShashiTharoor’s strong language skills earned him a spot in the party's working committee and emphasizes that the entire opposition stands united in support of the #IndianArmy.@kharge @ShashiTharoor pic.twitter.com/kiJLpcwE8K— The Federal (@TheFederal_News) June 25, 2025మరోవైపు.. ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తన ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. ‘‘ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. రెక్కలు నీవి.. ఆకాశం ఎవరి సొంతం కాదు’’ అంటూ ఓ పోస్ట్ను ఉంచారాయన. దీంతో ఇది ఖర్గేకు సెటైరే అంటూ ఆయన కామెంట్ సెక్షన్లో చర్చ నడుస్తోంది. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 20252020 – G-23 లేఖ దగ్గరి నుంచి శశిథరూర్కు, అధిష్టానం మధ్య గ్యాప్ మొదలైంది. థరూర్ సహా 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) తిరుగుబాటు లాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. శశిథరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా, థరూర్కు 1,000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక సూచించింది.2023–24.. శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. -
రాహుల్ గాంధీ డిమాండ్ను తిరస్కరించిన ఈసీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లలోని CCTV ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపర్చలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాల డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చేయడం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఈసీ వర్గాలు ఏం చెప్పాయంటే.. ఓటర్ల గోప్యత: సీసీటీవీ ఫుటేజీ ఫుటేజ్ ద్వారా ఓటు వేసినవారిని, వేయని వారిని గుర్తించవచ్చు. తద్వారా వాళ్లపై వివక్ష లేదంటే బెదిరింపులకు పాల్పవచ్చు. చట్టపరమైన పరిమితులు: ఈ ఫుటేజ్ను బయట పెట్టడం ద్వారా.. ప్రజాప్రతినిధుల చట్టం (Representation of the People Act) ఉల్లంఘన అవుతుంది. పైగా ఓటు వేయడం.. ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. అంతర్గత వినియోగం మాత్రమే: ఈ వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతాం. ఫుటేజ్ తొలగింపు: ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత వీడియో ఫుటేజ్ను తొలగించడం సాధారణ ప్రక్రియనే అని ఈసీ తెలిపింది కిందటి ఏడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మయూతీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ పదే పదే చెబుతూ వస్తోంది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ మధ్యే 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కన్సాలిడేటెడ్, డిజిటల్ ఓటర్ రోల్స్ను ప్రచురించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, మహారాష్ట్రలో ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ బూత్లలో రికార్డ్ అయిన అన్ని CCTV ఫుటేజ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసీ తాజాగా చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ఫిక్సింగ్ అని.. ప్రజాస్వామ్యానికి ఇదొక విషమని పేర్కొంటూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. -
Shashi Tharoor: స్వరం మార్చిన కాంగ్రెస్ ఎంపీ!
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పార్టీలో విభేదాలపై స్వరం తగ్గించారు. గురువారం నీలంబూర్ ఉప ఎన్నిక పోలింగ్ జరగ్గా.. ఆ ఎన్నిక ప్రచారానికి థరూర్ దూరంగా ఉండడంపై మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన పార్టీ నుంచి పిలుపు లేకపోవడం వల్లే దూరంగా ఉన్నానని చెబుతూనే.. అయినా అదేమీ పెద్ద విషయం కాదన్న రీతిలో మాట్లాడారు.దౌత్య సంబంధమైన మిషన్ కోసం నేను విదేశాలు వెళ్లాను. తిరిగి వచ్చాక కూడా అధిష్టానం నుంచి నాకు ఫోన్ రాలేదు. కనీసం ప్రచారం చేయాలని కూడా నాకు సూచించలేదు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నన్ను ఆహ్వానించలేదు. అయినా ఫర్వాలేదు. కొన్ని విషయాల్లో పార్టీ అధిష్టానంతో విభేదాలు ఏర్పడడం సహజమే అని అన్నారాయన.నేను ఇవాళే కేరళకు వచ్చాను. ఇవాళ ఓటింగ్ రోజు(నీలంబూర్ ఉప ఎన్నికకు). మా పార్టీ అభ్యర్తి మంచి వ్యక్తి. ఆయనకు ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని గురువారం ఉదయం ఎయిర్పోర్టులో మీడియాతో ఆయన వ్యాఖ్యానించారు.అయితే పార్టీతో విభేదాల నేపథ్యంతోనే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారా? అనే మీడియా ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. గత నాలుగు ఎన్నికలుగా తిరువనంతపురం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు నా వెంటే ఉన్నారు. నా గెలుపు కోసం వాళ్లు తీవ్రంగా శ్రమించారు. రాజకీయాల్లో అధిష్టానంతో కొన్ని అంశాల్లో విభేదాలు తలెత్తడం సహజమే. అయితే అవి అంతర్గతంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోగలిగినవే. వాటి ఇప్పుడు చర్చించడం అప్రస్తుతం. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. ఇలాంటివి సహజమే. కాంగ్రెస్ పార్టీ విలువలకు నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను’’ అని థరూర్ స్పష్టం చేశారు. Shashi Tharoor left out of Nilambur Congress rally | Kerala politics takes a turn #BusinessToday #ShashiTharoor #Congress #CongressVsBJP #KeralaPolitics #RahulGandhi pic.twitter.com/Hn6Rcr2mo4— Business Today (@business_today) June 19, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఉగ్ర స్థావరాలను, ఎయిర్బేస్లను భారత సైన్యం నాశనం చేసింది. ఆపై దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే.. అఖిలపక్ష ఎంపీల బృందాన్ని పలు దేశాలకు పంపింది. కాంగ్రెస్ ప్రమేయం లేకుండా శశిథరూర్ను ఆ బృందంలోకి ఎంపిక చేసి కేంద్రంలోని బీజేపీ ఆశ్చర్యపరిచింది.ఈ క్రమంలో.. విదేశీ పర్యటనల్లో పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎండగడుతూనే.. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిందంటూ థరూర్ ఆకాశానికెత్తారు. ఈ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ను కూడా థరూర్ ప్రస్తావించి ఉంటే బాగుండేదని, మరీ బీజేపీ ఏజెంట్లా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కొందరు కీలక నేతలు సైతం థరూర్ లక్ష్మణరేఖ దాటారంటూ వ్యాఖ్యానించారు. అయితే తాను సందర్భానుసారం ఆ వ్యాఖ్యలు చేసినట్లు గుర్తిస్తే మంచిదంటూ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారాయన. ఈ క్రమంలో ఆయనకు పార్టీకి మధ్య దూరం పెరుగుతోందని అంతా భావించారు. అయితే తిరిగి స్వదేశానికి చేరుకున్న ఆయన.. ఆ విభేదాలు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోగలిగనవే అని వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్క్రాఫ్ట్లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్ సమావేశం నిర్వహించింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్ చీఫ్కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్-లండన్ సర్వీస్ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్ సర్వీస్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అదే రూట్.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు -
Bike Taxi Ban: అవసరమైతే హైదరాబాద్కి పోతాం!
కర్నాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలకు నిన్నటి(జూన్16) నుంచి బ్రేకులు పడ్డాయి. కోర్టు తీర్పు.. ప్రభుత్వం నుంచి విధానాల రూపకల్పనపై సరైన స్పందన లభించకపోవడంతో ప్రస్తుతం బైక్ ట్యాక్సీలపై నిషేధం అమలు అవుతోంది. దీంతో లక్ష మంది గిగ్ వర్కర్లపై ప్రభావం పడుతోంది. ఇందులో.. ఇదే తమ జీవనోపాధి అని వాపోతున్నారు వేలమంది రైడర్లు. కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం వేలాది మంది రైడర్లను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు బైక్లు నడుపుతున్న విద్యార్థుల దగ్గరి నుంచి.. ఉద్యోగాలు పొగొట్టుకున్న టెక్కీల దాకా ఈ సేవలనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొందరికి ఇది పార్ట్ టైం జాబ్ కాగా.. మరికొందరికి ఫుల్ టైం ఆదాయం అందించే వనరు. 👉కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే మానేసిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ప్రతీ రైడ్ ఒక కొత్త వ్యక్తిని కలవడానికి కలిగించిన అవకాశం. ఈ ప్రయాణం నా ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడింది. నేను ఆనందంగా చేసే పనిలో ఆదాయం కూడా వచ్చింది. అలాంటి ఆదాయ వనరుకు ఇప్పుడు గండిపడింది.👉ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. బిజినెస్ ప్రారంభించాలన్న కల ఉంది. కానీ నెలవారీ జీతంతో పొదుపు కష్టం. అందుకే బైక్ టాక్సీల వైపు వచ్చాను. టార్గెట్లు లేవు, ఒత్తిడి లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిషేధం నా వంటి కలలవాళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే హైదరాబాద్కు మారిపోతాను, కానీ ఈ పని వదలను:::మహదేవపురకు చెందిన ఇంద్ర శేఖర్(25) 👉బైక్ రైడ్లతో రోజుకు రూ.3,000 సంపాదించేవాడిని. అందులో కనీసం రూ.2,000 పొదుపు చేసేవాడిని. ఈ రోజుల్లో ఖర్చులకు ఫుల్ టైం ఉద్యోగం ఒక్కటే సరిపోవడం లేదు. పెద్ద నగరాల్లో జీవించాలంటే అదనపు ఆదాయం కచ్చితంగా అవసరం. అలాంటి ఆదాయం లేకుండా పోయింది:::జగదీష్(24), నాన్-ఐటీ ప్రొఫెషనల్👉సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు సాగర్ బైక్ ట్యాక్సీలతో రైడ్లు కొడుతూ సంపాదించుకుంటున్నాడు. ఈ సేవలు నా జీవన విధానాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా ఆదాయ మార్గం పూర్తిగా కోల్పోయాను. ఇప్పుడు మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని తెలిపాడు. 👉వైట్ఫీల్డ్లో నివసించే 27 ఏళ్ల టెకీకి ఇది పార్ట్టైం జాబ్. ఆఫీస్ తర్వాత బైక్ టాక్సీ రైడ్లు చేస్తాను. ట్రాఫిక్లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇది మంచి మార్గం. కానీ, ఇప్పుడది లేకుండా పోతోంది అని అంటున్నాడు. నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ స్పందనబైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఏదో నేరస్తుల్లాగా పరిగణించడం అన్యాయం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేమూ భాగమే. మమ్మల్ని చర్చ లేకుండానే ఎందుకు బయటకు తోసేస్తున్నారు?. లైసెన్సింగ్, ఇన్సూరెన్స్, భద్రతపై స్పష్టమైన నిబంధనలు కావాలి. లక్షకు పైగా గిగ్ వర్కర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. తీర్పు ఇలా..కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. గత శుక్రవారం ( జూన్ 13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపిస్తామని కోర్టు తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.మాకు అవసరంబెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పును, ప్రభుత్వవ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.వా.. ఎన్ను ఐడియాఇలాంటి నిర్ణయాలతో సంబంధం లేకుండా తమ దారులు తమకు ఉన్నాయని యాప్ ఆధారిత అగ్రిగేటర్లు అంటున్నాయి. రాపిడో తమ యాప్లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ‘‘రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ఓ యూజర్ ఇందుకు సంబంధించిన బుకింగ్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అలాగే.. ఉబెర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా మార్చింది. వా.. ఎన్ను ఐడియా(వా.. ఏం ఐడియా!) తెలివైన ఎత్తుగడ" అని మరో యూజర్ పేర్కొన్నారు. -
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్తో పాటు 25 క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు. -
లక్నో: తప్పిన ఘోర విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. వరుస ఉదంతాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్నో ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. విమానం టైర్ భాగం నుంచి నిప్పు కణికలు ఎగసి పడ్డాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన విమానం హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. #BREAKİNG लखनऊ एयरपोर्ट पर बड़ा हादसा टला सऊदी से आए विमान में तकनीकी खराबी लखनऊ एयरपोर्ट पर लैंडिंग के वक्त खराबी लैंडिंग के वक्त विमान के पहिए से निकली चिंगारी#LUCKNOW #LucknowAirport #SV3112 #JeddahToLucknow #planecrash #flightaccident #SaudiArabia pic.twitter.com/GALwi6Q78g— Ritika Rajora (Tv100 News) (@Rrajora07) June 16, 2025ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో భారత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. -
ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్బాక్స్ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై ఆరంజె కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఏ171 బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్ బాక్స్ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్లో సీవీఆర్, ఎఫ్డీఆర్ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్లో రికార్డయిన చివరి రెండు గంటల పైలెట్, కోపైలెట్ల మధ్య సంభాషణ వినొచ్చు. గురువారం మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.ఇదీ చదవండి: బ్లాక్బాక్స్తో ఏం చేస్తారో తెలుసా? -
భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!
భారత్లో ఇవాళ(జూన్ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్టాప్ రన్వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్ 12, 1996సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్ 26, 1993ఔరంగబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్పోర్టులో దిగుతుండగా.. క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్ 21, 1982ఎయిర్ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్ 12, 1976ముంబైలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్ 14, 1972లో.. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్ఈస్ట్లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్ అవ్రో యార్క్ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో -
నాన్నా.. వదిలిపెట్టు, భయమేస్తోంది!
అనుమానం పెనుభూతమైంది. క్షణికావేశంలో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం.. మొత్తం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య వివాహేతర సంబంధంలో ఉందన్న అనుమానంతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ భర్త.. కొన్ని గంటల్లోనే నలుగురు కొడుకులతో కలిసి పట్టాలపై శవమై కనిపించాడు. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫరిదాబాద్కు చెందిన మనోజ్ మాహట్టో(45) భార్య ప్రియతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఆ భర్త తన నలుగురు పిల్లలు పవన్(10), కరు(9), మురళి(5), చోటు (3)లను తీసుకుని బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నాం దాకా సమీపంలోని ఓ పార్క్లో సేదతీరాడు. పిల్లలకు చిప్స్, కూల్డ్రింక్స్ కొనిచ్చి సరదాగా గడిపాడు. ఆపై వాళ్లను తీసుకుని సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. భుజాలపై చెరోవైపు.. చెరోకరిని, మిగతా ఇద్దరిని రెండు వైపులా చేతులు పట్టుకుని పట్టాలపై నడిపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో ఆ పిల్లలకు అప్పటిదాకా అర్థం కావడంలేదు. మరికాసేపట్లో భల్లాబ్గఢ్ స్టేషన్కు గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సి ఉంది. స్టేషన్ మరో కిలోమీటర్ దూరం ఉందనగా.. పట్టాలపై నలుగురు పిల్లలతో మనోజ్ నిల్చున్నాడు. అయితే పట్టాలపై పిల్లలతో వ్యక్తి నిల్చున్న విషయం గమనించిన లోకో పైలట్ హారన్ కొడుతూ రైలును ఆపే ప్రయత్నం చేశాడు. అయినా మనోజ్లో చలనం లేదు. రైలు దగ్గరగా వస్తుండడంతో భయంతో ఆ పిల్లలు రోదించ సాగారు. తమను వదిలిపెట్టమని పవన్, కరులు గింజుకుంటున్నారు. అయినా ఆ తండ్రి చలించలేదు. వాళ్లను బలంగా అదిమి పట్టుకున్నాడు. చివరకు రైలు వచ్చి ఢీ కొట్టడంతో ఆ ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఆపై కాస్త దూరంలో రైలు ఆగడంతో.. లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు వచ్చి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మనోజ్ జేబులో సూసైడ్ నోట్ లభించగా.. అందులో తన భార్యే కారణమని రాసి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
Land for jobs scam: లాలూకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు విచారణ నిలుపుదల కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ అంశం ప్రత్యేక న్యాయమూర్తి ముందు వాదనలకు సిద్ధంగా ఉందని, ఈ తరుణంలో స్టే కుదరదని స్పష్టం చేసింది.2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా పని చేశారు. 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు(Land For Jobs Scam) రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ అభియోగాలతో ఆయనతోపాటు మరో 15 మందిపై 2022 మే 18న సీబీఐ (CBI) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అదే ఏడాది అక్టోబరులో తొలి ఛార్జీషీట్ను దాఖలు చేయగా, 2023 జులై 3న మరో ఛార్జ్షీట్ను సమర్పించింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) విచారణ జరుపుతోంది. ఈ కేసులో లాలూ, ఆయన కుటుంబ సభ్యులకు ట్రయల్ కోర్టు గతంలో బెయిల్ కూడా ఇచ్చింది. జూన్ 2వ తేదీన ఈ కేసులో తర్వాతి విచారణ జరగనుంది. ఇదీ చదవండి: మాకు నమ్మకం లేదు దొర! -
భారత్లో 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు.. ఏపీలో కోవిడ్ లెక్కలపై దాపరికం!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరువయ్యింది. గత 24 గంటల్లోనే ఏడుగురు వైరస్తో మరణించడం ఆందోళన రేకెత్తిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ.. దాపరికాలు పాటిస్తున్నాయి. ఈ లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏపీలో కోవిడ్ కేసులు(AP Covid Cases) పెరుగుతూ వస్తున్నా.. అధికార యంత్రాంగం నిస్తేజంలో ఉండిపోయింది. వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. ఏలూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్లోని ముగ్గురు ఉద్యోగులకు వైరస్ సోకింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటిట్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.. వైద్యుల సూచన మేరకు ఆ ముగ్గురు ఉద్యోగుల్ని ఐసోలేషన్కి పంపించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తమను అప్రమత్తం చేయకుండా అధికారులు ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. ఏపీలో విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు.. ఇలా కేసులు వెలుగు చూశాయి. కడపలో కరోనా కేసు వెలుగు చూస్తే.. దానిని అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. టీడీపీ మహానాడు నేపథ్యంలోనే ప్రభుత్వ సూచన మేరకు అధికారులు అలా చేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది కూడా. ఇదీ చదవండి: మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటంరాష్ట్రంలో పలు చోట్ల కోవిడ్ కేసులు నమోదు అవుతున్నా.. ఆ సంఖ్యను ఇంకా సింగిల్ డిజిట్గానే ప్రభుత్వం ప్రకటిస్తుండడం గమనార్హం. ఇంకోవైపు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్తో ఒకరు మరణించినట్టు ప్రచారం జరగ్గా.. ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం దానిని కొట్టిపారేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ లెక్కలుకేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ గణాంకాల ప్రకారం.. భారత్లో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య(Covid Active Cases) 2,710కి చేరింది. కిందటి వారంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. తాజా డాటా ప్రకారం కేరళలో రికార్డు స్థాయిలో 1,147 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 కేసులు రికార్డు అయ్యాయి. కర్ణాటక, తమిళనాడులో చెరో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు వెలుగు చూశాయి.గత 24 గంటల్లో.. కోవిడ్తో ఏడుగురు(India Covid Deaths) మరణించారు. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. వీళ్లలో 50 ఏళ్ల పైబడిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గత ఐదు నెలలో మొత్తంగా వైరస్ ధాటికి 22 మంది మృతి చెందారు. అయితే.. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత అంతగా ఉండడం లేదని, పాజిటివ్గా నిర్ధారణ అయిన నాలుగైదు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో.. జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. జ్వరం తీవ్రంగా ఉన్నవారు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అయితే..ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాకున్నా.. జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప.. ప్రయాణాలు చేయరాదని, ఫంక్షన్లకు హాజరు కావొద్దని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్లో కోవిడ్: శరవేగంగా వ్యాప్తి.. ఎందుకో తెలుసా? -
రిసెప్షనిస్ట్ అంకిత కేసులో సంచలన తీర్పు
దాదాపు మూడేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంకితా భండారి కేసు (Ankita bhandari Case)లో సంచలన తీర్పు వెలువడింది. లైంగిక వాంఛ తీర్చలేదని ఆమె పని చేసే రిసార్ట్ ఓనరే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేలుస్తూ ఉత్తరాఖండ్ స్థానిక కోర్టు జీవితఖైదు శుక్రవారం తీర్పు వెల్లడించింది .పౌరీ జిల్లాకు చెందిన అంకిత భండారి(19) రిషికేష్లోని వంతారా రిసార్ట్లో రిసెప్షనిస్టుగా పని చేసేది. అయితే 2022 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల తర్వాత ఆమె మృతదేహం స్థానికంగా ఉన్న ఓ కాలువలో కనిపించింది. ఆమెపై హత్యాచారం జరిగి ఉండొచ్చన్న ప్రచారంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. పుల్కిత్ ఆర్య(Pulkit Arya) తండ్రి వినోద్ ఆర్య బీజేపీ నేత. దీంతో కేసు నుంచి అతన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ విమర్శల నేపథ్యంలో వినోద్ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేశారు.మరోవైపు.. జస్టిస్ ఫర్ అంకిత పేరుతో యువత రోడ్డెక్కింది. ఇటు సోషల్ మీడియాలోనూ #Justiceforankitaఉద్యమం నడిచింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో రిసార్ట్ ఆపరేటర్ పుల్కిత్ ఆర్య, మరో ఇద్దరు ఉద్యోగులు సౌరభ్ భాస్కర్, అకింత్ గుప్తాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక ధృవీకరించింది. తన రిసార్ట్కు వచ్చేవాళ్లతో పాటు తనకూ పడక సుఖం అందించాలని అంకితపై పుల్కిత్ ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమె లొంగలేదు. 2022 సెప్టెంబర్ 18వ తేదీన ఆమెతో ఈ అంశంపై వాగ్వాదానికి దిగాడు. జరిగిన పెనుగులాటలో పుల్కిత్, మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆమెను కాలువలోకి తోసి చేశాడని తేలింది. హత్య, లైంగిక వేధింపులతో పాటు పలు నేరాల సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. సిట్ దర్యాప్తు పూర్తి చేసి 500 పేజీల ఛార్జిషీట్ రూపొందించింది. 2023 మార్చి చివర్లో కోట్ద్వార్ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొత్తం 97 మంది సాక్షుల్లో.. 47 మందిని కోర్టు విచారించింది. రెండేళ్లపాటు సాగిన విచారణ తర్వాత.. ఇవాళ(మే 30వ తేదీన0 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రీనా నెగి.. ఆ ముగ్గురిని దోషులుగా ప్రకటించారు. దోషులకు జీవిత ఖైదు ఖరారు కాగా.. అంకిత కుటుంబం మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది.ఇదీ చదవండి: అలా మాట్లాడాల్సింది కాదు.. ఆమెకు క్షమాపణలు చెప్పండి -
భారీ తుపాను.. ఢిల్లీ అతలాకుతలం!
న్యూఢిల్లీ: భారీ తుపాను(Delhi Massive Storm) ధాటికి దేశ రాజధాని అతలాకుతలం అయ్యింది. బుధవారం సాయంత్రం నుంచి ధూళి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. నిన్నమొన్నటి దాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రలతో.. తీవ్ర ఉక్కపోతతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడిందని అనుకునేలోపే.. ధూళి తుపానుతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ధాటికి ఢిల్లీ, నోయిడాల్లో చాలా చోట్ల చెట్లు, హోర్డింగులు, కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపైనే చెట్లు, హోర్డింగ్స్ పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు రేపటికి తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఢిల్లీకి వర్షాలు ఉండడంతో.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోషల్ మీడియాలో తుపాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. #WATCH | Delhi-NCR experiences weather change. Visuals from Noida Sector 10 in Uttar Pradesh as it experiences dust storm. pic.twitter.com/gsqXxyFGhq— ANI (@ANI) May 21, 2025 #WATCH | Delhi: A tree uprooted at Janpath Road as the city received gusty wind, heavy rainfall and hailstorm. pic.twitter.com/GDVI1OpSz4— ANI (@ANI) May 21, 2025#WATCH | Delhi receives gusty wind, heavy rainfall and hailstorm. Visuals from Geeta Colony. pic.twitter.com/hTIXMzETgZ— ANI (@ANI) May 21, 2025 -
భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం
-
సీమా హైదర్ ఇంట్లోకి చొరబడి మరీ..
న్యూఢిల్లీ: పహల్గాం దాడి తర్వాత పాక్-భారత్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల పౌరులను సొంత దేశాలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.సరిగ్గా రెండేళ్ల కిందట.. భారతదేశంలోని ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో మరీ భారత్కు వచ్చేసింది సీమా హైదర్(37). అంతేకాదు.. ప్రియుడు సచిన్ మీనాను పెళ్లాడి ఓ బిడ్డను సైతం కన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమెను పాక్కు పంపించాలా? వద్దా? అనేదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే తాను మాత్రం ఇక్కడి కోడలినేనని, తనను వెనక్కి పంపించొద్దంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని ఆమె వేడుకుంటోంది. ఈలోపు..ఓ వ్యక్తి సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెపై దాడికి ప్రయత్నించబోయాడు. అయితే అది గమనించిన ఆమె భర్త సచిన్.. ఆ ఆగంతకుడ్ని నిలువరించగలిగాడు. స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడి తేజాస్గా పోలీసులు నిర్ధారించారు.గుజరాత్ సురేందర్ నగర్కు చెందిన తేజస్.. న్యూఢిల్లీకి రైలు ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి బస్సులోసీమా హైదర్ ఉంటున్న గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చేరాడు. అతని ఫోన్లో సీమా హైదర్కు చెందిన ఫొటోల స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అతను ఏ ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది అని పోలీసులు చెబుతున్నారు. అయితే సీమా హైదర్ తనపై చేతబడి చేస్తోందని.. అందుకే ఆమెను కట్టడి చేయడానికి వచ్చానని తేజస్ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి బాగోలేదా? కావాలనే ఇలా చేస్తున్నాడా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెబుతున్నారు. -
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్రేప్!
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. సగటున రోజుకి వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వెలుగులోకి రానివి మరెన్నో?. తాజాగా.. హర్యానాలోని జింద్లో ఘోరమైన ఘటన జరిగింది. నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాత గొడవల కారణాంగానే నిందితులు ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం చెత్త ఏరుకుంటూ జింద్ జిల్లా(Jind) శివారులోని గుడిసెల్లో నివసిస్తోంది. కొన్నిరోజుల కిందట అమిత్ అనే వ్యక్తికి, బాధిత మహిళ భర్తకి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆమె భర్త తలకు గాయం కాగా పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు నిందితుడు అమిత్పై చర్యలు తీసుకోకుండా.. గొడవను సర్దిచెప్పి పంపించారు. ఇది మనసులో పెట్టుకున్న అమిత్, అతని మైనర్ సోదరుడు కోపంతో రగిలిపోయారు. మంగళవారం రాత్రి ఆమె భర్త లేని సమయం చూసి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోయాక.. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ వాళ్లను గుర్తించి స్థానికులకు సమాచారం అందించింది. చిన్నారిని ఖననం చేశాక.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు తన ఐదేళ్ల వయసున్న బిడ్డపైనా నిందితులు అత్యాచారానికి ఒడిగొట్టారని చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై యశ్వీర్, సమాధి నుంచి పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. -
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్ఎఫ్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్గా సైఫుల్లా(హిజ్బుల్ ముహజిదిన్) వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ పాక్ నుంచే ఎల్ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) టీఆర్ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్లైన్లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్చుప్ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్ ముహజిదిన్, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్ లోయలో చాలా కాలంగా యాక్టివ్గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్పై విషేధం విధించింది.ఇంతకుముందు.. సోనామార్గ్, బూటా పాత్రి, గందర్బల్ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ మూసా.. సోనామార్గ్ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్ ఘటన తర్వాత.. ఎల్ఈటీ ఏఫ్లస్ కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్ను డిసెంబర్లో దాచిగామ్ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్కౌంటర్లో గ్రూప్ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్ నుంచి గ్రూప్ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్ఎఫ్ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్లు రిలీజ్ చేశారు. అందులో హషిమ్ మూసా అలియాస్ సులేమాన్, అలీ బాయి అలియస్ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్ హుస్సేన్ తోకర్, అసిఫ్లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్కు వెళ్లి.. ఎల్ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎఫ్లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.ప్లాన్ ప్రకారమే..సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు.. బైసరన్ లోయలోని పిక్నిక్ స్పాట్లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు. -
జమ్మూకశ్మీర్ లో తరచూ ఉగ్రదాడులు
-
పార్లమెంటే సుప్రీం.. ఉప రాష్ట్రపతి నోట మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్(jagdeep dhankhar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం’’ అని అన్నారాయన. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయం గురించి కూడా ధన్ఖడ్ ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. రాజ్యాంగ కార్యకర్తగా తాను మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు మార్గనిర్దేశం చేయబడుతుందని అన్నారు. అంతకు ముందు.. ‘‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారాన్ని సుప్రీం కోర్టు రాష్ట్రపతికి బిల్లుల విషయంలో గడువు విధించడానికి ముడిపెడుతూ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ సీనియర్ న్యాయవాది, పైగా ఉప రాష్ట్రపతి హోదాలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపేక్షాలు సహా మేధో వర్గం తీవ్రంగా తప్పుబట్టింది.మరోవైపు.. బీజేపీ నేతలు సహా ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా సుప్రీం కోర్టు(supreme court) స్పందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. -
పోప్ ఫ్రాన్సిస్ మృతికి ప్రధాని మోదీ సంతాపం
-
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ పిటిషన్ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్ రిట్ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్ లాయర్ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్ గవాయ్(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. -
న్యాయ వ్యవస్థపై బీజేపీకి అపారమైన నమ్మకం ఉంది: జేపీ నడ్డా
-
ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్.. ఇంకా శిథిలాల కిందే పలువురు
న్యూఢిల్లీ, సాక్షి: ముస్తాఫాబాద్(Mustafabad) భవన కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యల్లో.. ఇప్పటిదాకా 14 మందిని రక్షించగలిగారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.ANI న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం కల్లా పలువురిని బయటకు తీసి జీబీటీ ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో నలుగురు చనిపోయారు. ఆ భవనంలో ఒక పోర్షన్లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా..ఇద్దరు గాయపడ్డారు.#WATCH | Delhi: Mustafabad building collapse caught on camera. As per Delhi Police, "Among the 10 people who were taken out, 4 succumbed. Rescue operations still underway"(Source - local resident) https://t.co/lXyDvOpZ3q pic.twitter.com/NlknYWODRR— ANI (@ANI) April 19, 2025#WATCH | Delhi: 4 people died after a building collapsed in the Mustafabad area; rescue and search operation is underway 8-10 people are still feared trapped, said Sandeep Lamba, Additional DCP, North East District pic.twitter.com/qFGALhkPv3— ANI (@ANI) April 19, 2025 -
తమిళనాడులో అమిత్ షా రూల్ చెల్లదు: స్టాలిన్
చెన్నై, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా రూల్ తమిళనాడులో చెల్లదంటూ ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు. విభజించు పాలించు సిద్ధంతం ఇక్కడ పని చేయదు. తమిళనాడు ఏనాటికీ ఢిల్లీ నియంత్రణలోకి వెళ్లబోదు అంటూ వ్యాఖ్యానించారు. నీట్, జాతీయ విద్యా విధానం విషయంలో కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వైరం సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలపడంతో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సుప్రీం కోర్టు తీర్పు.. ఉపరాష్ట్రపతి హాట్ కామెంట్స్
న్యూఢిల్లీ: శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదంటే తిప్పి పంపే విషయంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికీ ఇటీవల సుప్రీం కోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారాయన. రాజ్యసభ ఇంటర్న్స్ 6వ బ్యాచ్ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదన్నారు. అదే జరిగితే రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను.. ప్రజాస్వామ్య శక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు నిర్దిష్ట సందర్భాల్లో ఈ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.తమిళనాడు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించింది.అయితే అటుపై రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై కేంద్రం ప్రభుత్వం సమీక్షకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే వేదిక నుంచి.. ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపైనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పందించారు. ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా.. ఎఫ్ఐఆర్ లేకపోవడం, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం, జడ్జిలకు కలిగే ఉపశమనం గురించీ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. ఈ క్రమంలో.. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదువక్ఫ్ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షంహైదరాబాద్: వక్ఫ్ (సవరణ) బిల్లుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వైఖరి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఊరట కలిగించిందన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం చేసిందన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు. 👉అధికారంలోకి రాగానే వక్ఫ్ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్ను వక్ఫ్ అల్లర్లతో మరో బెంగాల్(ముర్షిదాబాద్)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్ అన్నారు. 👉వక్ఫ్ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్, బీజేపీలు వక్ఫ్ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు. -
మూడు నెలల్లో తేల్చేయాల్సిందే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశసర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల నిలుపుదల విషయంలో గవర్నర్లకు, రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక అధికారాలేవీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.ఇంతకు ముందు గవర్నర్ల విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహా సూచన చేయడం తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో..ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.అంతకు ముందు గవర్నర్ విషయంలోనూ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదంది. ఇక.. తాజాగా ఆర్టికల్ 201 రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు గనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే.. రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో తీవ్ర గందరగోళం
-
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
‘‘అమ్మా.. ఇక సెలవు.. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటున్నా’’ అంటూ ఓ కొడుకు రాసిన సూసైడ్ లెటర్ ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలో బుధవారం ఘోరం జరిగింది. భర్తపై కక్ష గట్టి మరీ ఆ భార్య అతని కటకటాలపాలు చేసింది. అది భరించలేకపోయిన ఓ భర్త.. పైగా ఆ విషయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.రాజ్ ఆర్య, సిమ్రాన్లకు ఏడాది కిందట వివాహం జరగ్గా.. ఈ జంటకు నెలల బాబు ఉన్నాడు. అయితే గతకొంతకాలంగా ఆ కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఓ వివాహ వేడుకకు భార్యతో పాటు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో రాజ్, అతని తండ్రి షాహ్జన్పూర్లోని సిమ్రాన్ ఇంటికి వెళ్లాడు. అయితే సిమ్రాన్ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని సిమ్రాన్ సోదరులంతా రాజ్, అతని తండ్రిపై దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దర బరేలీకి తిరిగి వచ్చారు. ఈలోపు..ఇంటికొచ్చి మరీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారంటూ రాజ్, అతని తండ్రిపై సిమ్రాన్ కేసు పెట్టింది. దీంతో విచారణ పేరిట బుధవారం రాజ్ను పోలీస్ స్టేషన్కు పిలిచారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రాజ్.. తనకు నిద్రగా ఉందంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. స్టేషన్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని, అది భరించలేక పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే.. సిమ్రాన్ వివాహేతర సంబంధమే దీనంతటికి కారణమని రాజ్ సోదరి అంటోంది. పైగా రాజ్పై ఫిర్యాదు చేయడానికి ముందు.. చేశాక.. ‘ఇక ఊచలు లెక్కపెట్టు’ అంటూ ఇన్స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టులను ఆమె బయటపెట్టింది. అంతేకాదు పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు రాత్రంతా రాజ్ను పీఎస్లో ఉంచి చితకబాదాడని, ఆ అవమానాన్ని తన సోదరుడు భరించలేకపోయాడని ఆరోపించిందామె. ఇక ఈ ఘటనపై రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. In the suicide case of #RajArya, a resident of #AkankshaEnclave under the #Izzatnagar police station area in #UttarPradesh's #Bareilly, an FIR has been registered against seven individuals, including his wife #Simran.The report was filed by the deceased's brother, Suresh,… https://t.co/Z4MGrKhyEt pic.twitter.com/otNGtaMmvs— Hate Detector 🔍 (@HateDetectors) April 10, 2025 ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.బీహార్ సమస్తిపూర్(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్ కుమార్ సింగ్(Mukesh Singh Kumar) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయసాగింది. ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్ సింగ్ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం.. -
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట
బెంగళూరు: ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్పూర్ తాలుకా జాలిబెంచి(Jalibenchi village) అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలే అందుకు కారణం.విద్యుత్ సరఫరాలో కలిగిన అంతరాయం.. ఏకంగా ఒక ఊరినే వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో కరెంట్ వైర్లు ఒకదానికొకటి రాజుకుని.. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలిపోయాయి. సెల్ఫోన్లు పేలిపోయాయి. కరెంట్ స్తంభాల నుంచి వైర్లు ఇళ్ల పైకప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలతో భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు.సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో విద్యుత్ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.సుమారు వంద ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గులబర్గ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానిక చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లను పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.Shocking, terrible video!!A tragic incident unfolded in Jalibenchi village of Surpur taluk on Tuesday around 6 PM, as powerful winds caused an electricity-related accident, plunging the area into chaos and fear.Cc @OfficialGescom pic.twitter.com/VCQXLqQymW— Nishkama_Karma (@Nishkama_Karma1) April 8, 2025 -
Bengaluru: ఫ్రెండ్ తోవెళ్తున్న యువతిపై వేధింపులు
-
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును(waqf amendment bill) సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. వీలైనంత త్వరలోనే ఇది ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామన్న ఆయన.. గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై పోరాటాలు చేశామని జైరాం రమేశ్(Jairam Ramesh) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…— Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025 ఇదిలా ఉంటే.. రాజ్యసభ(Rajya Sabha)లో గురువారం మధ్యాహ్నాం నుంచి సుమారు 13 గంటలపాటు వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం బిల్లును ఆమోదించినట్లు పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. బిల్లుపై చర్చ సందర్భంగా.. ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇది చారిత్రక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రం ఈ బిల్లు ముస్లింలకు లబ్ధి చేకూరుస్తుందని అంటోంది. అంతకు ముందు..సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్సభ(Lok Sabha) ఆమోదం తెలిపింది. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో.. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. -
భారత్ పై మయన్మార్ భూకంపం ఎఫెక్ట్!


