Haryana: కాంగ్రెస్‌కు ఘోర పరాభవం | Big Jolt To Congress in Haryana Local Body Election Results | Sakshi
Sakshi News home page

Haryana: కాంగ్రెస్‌కు ఘోర పరాభవం

Mar 12 2025 2:49 PM | Updated on Mar 12 2025 4:11 PM

Big Jolt To Congress in  Haryana Local Body Election Results

ఛండీగఢ్‌: హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకుగానూ తొమ్మిదింటిని బీజేపీ కైవసం చేసుకోగా.. మిగిలిన ఒక స్థానం మానేస‌ర్‌లో బీజేపీ రెబ‌ల్ లీడ‌ర్ ఇంద్ర‌జిత్ యాద‌వ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయన విజయం దాదాపు ఖరారైనట్లు సమాచారం. 

గురుగ్రామ్‌, ఫరిదాబాద్‌, రోహతక్‌, హిసార్‌లాంటి కీలక ప్రాంతాలతో పాటు మరో మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో మార్చి 2వ తేదీన పోలింగ్‌ జరిగింది. అలాగే.. పానిపట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మార్చి 9వ తేదీన విడిగా పోలింగ్‌ జరిగింది. వీటితోపాటు అంబాలా, సోనిపట్‌ మేయర్‌ పోస్టుల కోసం ఉప ఎన్నికలు, అలాగే.. 21 మున్సిపల్‌ కమిటీల ప్రెసిడెంట్స్‌, వార్డ్‌ మెంబర్స్‌ ఎన్నిక కోసం మార్చి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. 

బుధవారం ఉదయం నుంచి ఫలితాలు వెలువడడం ప్రారంభం అయ్యాయి. దాదాపు అన్ని చోట్ల కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండడంతో  ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఏ చోటా కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.  మాజీ సీఎం భూపింద‌ర్ సింగ్‌ హుడా అడ్డా రోహతక్‌లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. పలు వార్డు మెంబర్స్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ  స్థానిక సంస్థల ఎన్నికలను ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌ సీఎం నయాబ్‌ సైనీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాలతో బీజేపీ ప్రచారం చేయించగా.. ప్రతిగా కాంగ్రెస్‌ సచిన్‌ పైలట్‌, హుడాలతో ప్రచారం చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం ఓటింగ్‌ నమోదు కాగా.. ఈ లోకల్‌ బాడీ ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement