సిల్చార్ (అస్సాం): ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో, దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్ వేదికగా శనివారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
#WATCH | Silchar, Assam: PM Narendra Modi says, "Nowadays, conditions of war prevail all around the world. Our government is making every possible effort to ensure that the citizens of our country face the fewest hardships possible. Our objective is to minimise the impact of this… pic.twitter.com/gQlE3iivDF
— ANI (@ANI) March 14, 2026
భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న కొన్ని అంతర్జాతీయ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలుబొమ్మగా మారుతోందని ప్రధాని ఆరోపించారు. ‘ప్రస్తుతం ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటువంటి క్లిష్ట సమయంలో దేశ ప్రజలపై ఆ ప్రభావం పడకుండా తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అయితే బాధ్యతాయుతమైన రాజకీయ పక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్.. దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దేశం ఇబ్బందుల్లో చిక్కుకోవాలని, తద్వారా మోదీని నిందించవచ్చని వారు ఆశిస్తున్నారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని మెరుగుపరిచే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 22,860 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న 'షిల్లాంగ్-సిల్చార్ కారిడార్'కు భూమిపూజ చేశారు. 166 కిలోమీటర్ల మేర సాగే ఈ గ్రీన్ ఫీల్డ్ ఫోర్-లేన్ హై స్పీడ్ కారిడార్ పూర్తయితే, గౌహతి నుంచి సిల్చార్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 8.5 గంటల నుండి కేవలం 5 గంటలకు తగ్గుతుంది. ఇదేవిధంగా ప్రధాని మోదీ సిల్చార్లోని NH-306 పై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు భూమిపూజ చేశారు.అలాగే కరీంగంజ్ జిల్లాలోని పత్తర్కండి వద్ద కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అస్సాంలో వ్యవసాయ విద్య, పరిశోధనలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, విపక్షాలు కేవలం విమర్శలకే పరిమితమవుతున్నాయని ప్రధిన మోదీ అన్నారు.


