న్యూఢిల్లీ,సాక్షి: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహా ధర్మాసనం ఈ కేసును పరిశీలించనుంది.
గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పు పట్టాయి.
దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం, దానిపై సుప్రీంకోర్టు స్పందనపై ఉత్కంఠం నెలకొంది.


