న్యూఢిల్లీ,సాక్షి: సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఆదేశాలను వెంటనే అధికారికంగా పబ్లిష్ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత పిటీషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను నాలుగు రోజుల్లో ఇవ్వాలని సూచించింది.
అంతకుముందు గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పు పట్టాయి.
దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ ముందు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్లు ప్రకటించింది.


