దేశవ్యాప్తంగా 43,250 ఇంటర్న్షిప్ సీట్లు.. తెలంగాణకు 4,871
ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో 7.5 శాతం సీట్లు ఎఫ్ఎంజీలకే
కొత్త కాలేజీల్లో సీఆర్ఎంఐ సీట్లలో 100 శాతం ఎఫ్ఎంజీలకే
అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో మెడిసిన్ చదివి, ఇక్కడ వైద్య సేవలు అందించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)ఊరట కలిగించింది. 2026–27 విద్యా సంవత్సరానికి విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీస్) కోసం దేశవ్యాప్తంగా 43,250 కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) సీట్లు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. ఇందులో తెలంగాణలో 4,871 సీట్లు ఉన్నాయి. ఈ మేరకు ఎన్ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) మంగళవారం రాష్ట్ర వైద్య మండళ్లకు సర్క్యులర్ జారీ చేసింది.
ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర వైద్య మండళ్లు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో సమన్వయం చేసుకొని ఎఫ్ఎంజీలకు ఇంటర్న్షిప్ సీట్లు కేటా యించాలి. ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో అనుమతించిన ఇంటర్న్ల సంఖ్యలో 7.5 శాతం సీట్లు విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్స్కు ఇవ్వాలని సూచించింది. కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీలలో సీఆర్ఎంఐ సీట్లలో 100 శాతం ఎఫ్ఎంజీలకు కేటాయించాలని పేర్కొంది. 2022–23 నుంచి 2025–26 మధ్య పెరిగిన ఎంబీబీఎస్ సీట్ల కారణంగా ఏర్పడిన అదనపు ఇంటర్న్షిప్ అవకాశాలను కూడా విదేశీ విద్యార్థులకు ఇవ్వాలని తెలిపింది.
తెలంగాణలో కొత్త కాలేజీల్లో 100 శాతం సీట్లు
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్స్కు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో గాంధీ మెడికల్ కాలేజీ–13 సీట్లు, ఉస్మానియా మెడికల్ కాలేజీ –19 సీట్లు , కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్కు 19 సీట్లు, ప్రభుత్వ కాలేజీల్లో మహబూబ్నగర్లో 13, సిద్దిపేటలో 13, సూర్యాపేటలో 11, నల్లగొండలో 11, నిజామాబాద్లో 9 సీట్లు, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, రామగుండం, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 150 సీట్లు, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, మహేశ్వరం, నిజామాబాద్, నిర్మల్, నాగర్కర్నూల్, వికారాబాద్, నారాయణపేట, కామారెడ్డి, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, ప్రభుత్వ కాలేజీల్లో 100 సీట్లు , నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 200 సీట్లు, నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్– 250 సీట్లు , మహవీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్–200 సీట్లు , ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 150 సీట్లు, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలో 150 సీట్లు కాగా మిగతా ప్రభుత్వ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున కేటాయించారు.
పాత ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మమత(ఖమ్మం)లో 61, మెడిసిటీ (ఘన్పూర్) 11, మమత (బాచుపల్లి)11, మహేశ్వర (మెదక్) 11, మల్లారెడ్డి, మల్లారెడ్డి (మహిళ) కళాశాలల్లో 15 చొప్పున సీట్లు కేటాయించారు. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,871 సీఆర్ఎంఐ సీట్లు అందుబాటులో ఉంటాయి.


