ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్‌గాంధీ | BRS Working President KTR comments over Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్‌గాంధీ

Mar 12 2026 4:18 AM | Updated on Mar 12 2026 4:18 AM

BRS Working President KTR comments over Rahul Gandhi

ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై బహిరంగ దాడి 

అసెంబ్లీ స్పీకర్‌ను రాహుల్‌ వెనుక ఉండి ఆడిస్తున్నాడు 

ఆయన అనుమతి లేకుండా స్పీకర్‌ సాహసం చేయలేరు 

ఫిరాయింపులపై దానం, కడియం వ్యాఖ్యలు హాస్యాస్పదం: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికం, దారుణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ పిటిషన్లు డిస్మిస్‌ చేశారన్నారు. అసెంబ్లీ స్పీకర్‌పై రాహుల్‌గాంధీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తు న్న డబ్బు సంచుల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

ఫిరాయింపుల వ్యవహారాన్ని కాంగ్రెస్‌ పార్టీ నడిపించిందని, స్పీకర్‌ చేతుల్లో నిర్ణయాధికారం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్‌గాంధీ అని, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై కాంగ్రెస్‌ చేస్తున్న దాడిలో ప్రధాన నేరస్తుడు రాహుల్‌గాంధీ అని కేటీఆర్‌ విమర్శించారు. ఆయన అనుమతి లేకుండా అనర్హత పిటిషన్లు డిస్మిస్‌ చేసేంత సాహసం స్పీకర్‌ చేయలేరన్నారు. 

మాజీ మంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, డాక్టర్‌ ఆనంద్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులతో కలిసి కేటీఆర్‌ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి. ఈ నిర్ణయంతో రాహుల్‌ గాంధీ జోకర్‌గా నిలిచిపోయారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వెనువెంటనే సభ్యత్వం కోల్పోయేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీకి ఏమాత్రం సిగ్గూ, గౌరవం ఉన్నా స్పీకర్‌ నిర్ణయంపై స్పందించాలి’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

వెలుగుమట్ల కూల్చివేతలపై వదిలిపెట్టం 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్‌ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అంశాన్ని అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రశ్నించి తీరుతామని కేటీఆర్‌ అన్నారు. ‘ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బినామీలు భూ మాఫియాగా ఏర్పడి పేదల మీద దాడి చేసి బయటకు పంపుతున్నారు. వెలుగుమట్లతోపాటు రాష్ట్రంలో కూలగొడుతున్న ప్రతీ ఇంటికి తిరిగి పట్టా ఇచ్చేంత వరకు వదిలిపెట్టం. ఇళ్లు కోల్పోయి ఏడుస్తున్న బాధితులను పెయిడ్‌ ఆర్టిస్టులు అంటూ మృగాల్లా మాట్లాడుతున్నారు. మంత్రుల ఆదేశాలతో ఖమ్మం ఏసీపీ బాధితులపైనే కేసులు పెడుతున్నారు’అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

స్పీకర్, రాహుల్‌నుసన్మానించాలి
‘ఒక పార్టీ బీ ఫామ్‌ మీద ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ ఫామ్‌ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు. ఇంత అద్భుత నిర్ణయం తీసుకున్న స్పీకర్‌ను, ఆయన వెనుక ఉన్న రాహుల్‌గాందీని బహిరంగ సభ వేదికపై సత్కరించాలి’అని కేటీఆర్‌ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నా, విచారణ చేయాల్సిన అవసరం ఏముంది. ఫిరాయింపుల సంస్కృతి గురించి ఇకపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్‌గాం«దీ, కాంగ్రెస్‌ పార్టీకి లేదు. 

పార్టీ ఫిరాయింపుల అంశంపైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. కడియం శ్రీహరికి బీఆర్‌ఎస్‌ ఇచ్చిన గౌరవం, వచి్చన పదవులపై ఆయనే ప్రశ్నించుకోవాలి. మురికి మాటలు మాట్లాడుతున్న కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నట్టు చేస్తున్న ప్రకటనలు ఆయన నైతిక పతనానికి అద్దం పడుతున్నాయి’అని కేటీఆర్‌ విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement