సుసంపన్న తెలంగాణ నిర్మిద్దాం | Shiv Pratap Shukla is the new Governor of Telangana State | Sakshi
Sakshi News home page

సుసంపన్న తెలంగాణ నిర్మిద్దాం

Mar 12 2026 3:48 AM | Updated on Mar 12 2026 3:48 AM

Shiv Pratap Shukla is the new Governor of Telangana State

ప్రమాణ స్వీకారం అనంతరం సంతకం చేస్తున్న గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా. చిత్రంలో హైకోర్టు సీజే జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి

అందరం కలిసి ముందుకు సాగుదాం 

రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా 

ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ 

హాజరైన సీఎం, స్పీకర్, మండలి చైర్మన్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ‘సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రివర్గ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మనమందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదాం. రాష్ట్ర గవర్నర్‌గా సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటా. నా విధులను న్యాయబద్ధంగా, నిజాయితీగా, భారత రాజ్యాంగానికి లోబడి అంకితభావంతో నిర్వహిస్తా. 

మనమందరం సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి కలిసి పని చేద్దాం..’అని రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్‌భవన్‌లో ఆయన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని విడుదల చేశారు.  

తెలంగాణ ప్రజలకు సేవ చేయడం అదృష్టం 
‘తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం. ఈ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహన శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజల అకుంఠిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి.. సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన నా అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. 

తెలంగాణ జై తెలంగాణ..’అని గవర్నర్‌ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, డీజీపీ శివధర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం, ఆయన మంత్రివర్గ బృందంతో గవర్నర్‌ గ్రూపు ఫొటో దిగారు. 

తెలుగులో ప్రమాణం 
గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకా­రం చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన­కు తెలుగు భాషతో ఇప్పటివరకు ఎలాంటి పరిచయం లేకపోయినా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి బాగా ప్రాక్టీస్‌ చేసినట్టు లోక్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం తెలుగులోనే ‘అనే నేను..’అనే పదాలతో ప్రమాణాన్ని ప్రారంభించగా, శివపత్రాప్‌ శుక్లా అనే నేను.. అంటూ గవర్నర్‌ పూర్తిగా తెలుగులో ప్రమాణం చేశారు.  

భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు 
చార్మినార్‌: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా తన కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌ కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిపి దాదాపు 19 మంది వరకు ఆయన వెంట ఉన్నారు. ఆలయ ట్రస్టీ శశికళ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement