హోటళ్లలో నిండుకుంటున్న గ్యాస్.. టీ, టిఫిన్స్ బంద్ చేస్తున్న వైనం
క్లబ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లలోనూ మొదలైన ఆంక్షలు
నిలిచిపోయిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ హాస్టళ్లు, పీజీలు, ఐటీ కారిడార్లలో ఆహారం కోసం ఆందోళన
ఆటోలు, కార్లలో వాడే ఎల్పీజీ, సీఎన్జీ ధరల పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. పది రోజులుగా సరఫరాలో నెలకొన్న అంతరాయం ఇప్పుడు సామాన్యుడి కడుపు కొడుతోంది. అటు గృహ వినియోగదారులు, ఇటు వ్యాపార వర్గాలు గ్యాస్ కోసం అల్లాడిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలుకొని మారుమూల జిల్లాల వరకు పరిస్థితి అదుపు తప్పుతోంది. వంటింటి గ్యాస్ బుకింగ్ల సంఖ్య రెండు మూడు రోజులుగా భారీగా పెరిగినట్టు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
బుక్ చేసిన వారికి గ్యాస్ సిలిండర్లు పంపించేందుకు ఎప్పటికప్పుడు స్టాక్లతో ఏజెన్సీలు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ను ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా గ్యాస్ బుకింగ్, సరఫరా పేరుతో సైబర్ నేరగాళ్లు కూడా రంగంలోకి దిగారని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ప్రజలకు సూచించారు.
చాయ్ డబ్బా నుంచి స్టార్ హోటల్ వరకు..
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా ఆధారపడిన హోటల్, దాని అనుబంధ రంగాలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరతతో మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ను కంపెనీలు తాత్కాలికంగా నిలిపివేయడంతో హోటల్ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రతీరోజు ఐదు నుంచి పది సిలిండర్లు వాడే హోటళ్లకు ఏజెన్సీలు తమ వద్ద స్టాక్ ఉంటే ఒకటీ అరా పంపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్లోని క్లబ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లలో ఆంక్షలు మొదలయ్యాయి.
నగరంలోని దాదాపు అన్ని క్లబ్లు సభ్యులకు ఆంక్షలు విధిస్తూ సమాచారం ఇస్తున్నాయి. లిమిటెడ్ మెనూతో పాటు విజిటర్స్ను తీసుకురావొద్దని సమాచారం ఇచ్చాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, క్యాంటీన్లలో కూడా గ్యాస్ తక్కువగా వినియోగించేలా మెనూను రూపొందించారు. మధ్యతరగతి హోటళ్లు, రెస్టారెంట్లలో కేవలం రైస్ ఐటమ్స్, కూరలు మాత్రమే వండుతున్నారు.
గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే స్వీట్లు, బేకరీ ఐటమ్స్ తయారీని పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోని చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు గ్యాస్ దొరక్క కొన్ని మూతపడ్డాయి. దీనివల్ల రోజువారీ కూలీలు, బ్యాచిలర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వసతి గృహాల్లో ’డ్రై’ డేస్... ఐటీ కారిడార్లో ఆందోళన
హైదరాబాద్లోని ఐటీ కారిడార్ (మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి)లో పరిస్థితి దయనీయంగా మారే అవకాశముంది. వేలాదిగా ఉన్న పీజీలు, హాస్టళ్లలో గ్యాస్ నిల్వలు అయిపోతాయనే భయంతో యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కష్టంగా ఒకే పూట వండి పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓ హాస్టల్ యజమాని వ్యాఖ్యానించాడు.
దిల్సుఖ్నగర్, అమీర్పేట, ఫిల్మ్నగర్, విద్యానగర్, సికింద్రాబాద్, హిమాయత్నగర్, పంజగుట్ట ప్రాంతాల్లో హాస్టళ్లు, రూముల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగినులు కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటర్ పరీక్షలు ముగుస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఊరట లభించినట్టయింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు కూడా త్వరలోనే సెలవులు వచ్చే అవకాశం ఉండడంతో కొద్దిరోజుల పాటు కాలం వెళ్లదీసేందుకు ప్రిన్సిపాల్స్ తగిన ఆదేశాలు జారీ చేశారు.
రంజాన్ వేళ... బిర్యానికే పరిమితం
రంజాన్ నెల కావడంతో హైదరాబాద్తోపాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లింల కోసం సాయంత్రం నుంచి రాత్రి వేళ్లలో పెద్ద ఎత్తున హోటళ్లు పనిచేస్తాయి. సిలిండర్ల సమస్యతో హైదరాబాద్లోని ఇరానీ హోటళ్లలో కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. వీటిల్లో బిర్యానీ, హలీమ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తందూరీ రొట్టెల కోసం వాడే బట్టీలనే కూరల కోసం కూడా వినియోగిస్తున్నారు.
రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు పాతబస్తీ, నాంపల్లి, మెహిదీపట్నం, టోలిచౌకీ, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, దాబాలు బట్టీలు, కట్టెల పొయ్యిలతోనే ఆహార సేవలు అందిస్తున్నాయి. కాగా ఇరానీ హోటళ్లలో చాయ్, ఇతర తినుబండారాల విషయంలో కోతలు పెడుతున్నట్టు తెలుస్తోంది.
బ్లాక్ మార్కెట్ హల్చల్..ధరల మోత
వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ దందాకు తెర లేపినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. రూ.965కు లభించే డొమెస్టిక్ సిలిండర్ను రూ.1200 వరకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రూ.2,050 వరకు ఉన్న కమర్షియల్ గ్యాస్ను కూడా కొన్ని ఏజెన్సీలు దాదాపు రూ.2,800 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం.
ఎల్పీజీ, సీఎన్జీలతో నడిచే ఆటోలు, కార్లు ఆయా గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఐదు రోజుల్లో ఎల్పీజీ ధరను 50 రూపాయలు పెంచినట్టు ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో కూడా ఎల్పీజీ, సీఎన్జీ లభించే పరిస్థితి లేక ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఎదురవుతున్నా పౌరసరఫరాల శాఖ కనీసం స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి.


