
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు విచారణ నిలుపుదల కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ అంశం ప్రత్యేక న్యాయమూర్తి ముందు వాదనలకు సిద్ధంగా ఉందని, ఈ తరుణంలో స్టే కుదరదని స్పష్టం చేసింది.
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా పని చేశారు. 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు(Land For Jobs Scam) రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ అభియోగాలతో ఆయనతోపాటు మరో 15 మందిపై 2022 మే 18న సీబీఐ (CBI) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అదే ఏడాది అక్టోబరులో తొలి ఛార్జీషీట్ను దాఖలు చేయగా, 2023 జులై 3న మరో ఛార్జ్షీట్ను సమర్పించింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) విచారణ జరుపుతోంది. ఈ కేసులో లాలూ, ఆయన కుటుంబ సభ్యులకు ట్రయల్ కోర్టు గతంలో బెయిల్ కూడా ఇచ్చింది. జూన్ 2వ తేదీన ఈ కేసులో తర్వాతి విచారణ జరగనుంది.
ఇదీ చదవండి: మాకు నమ్మకం లేదు దొర!