నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది.
భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.

ఎవరీ తల్లీకూతుళ్లు?
అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.
ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.
Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD.
We convey our deep sense of gratitude to all our friends and well wishers.
Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కొత్త చర్చకు కారణం
మంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.


