గువాహటి: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం చరైదియో, గోలాఘాట్, జోర్హాట్, నగావ్, శివసాగర్ జిల్లాల్లో 5.24 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. వరదల కారణంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 68కు చేరింది.
గత 24 గంటల్లో చరైదియో జిల్లాలో ఇద్దరు వరద నీటిలో మునిగి మృతి చెందారు. వరద ప్రభావిత జిల్లాల్లో చరైదియో అత్యంత తీవ్రంగా దెబ్బతింది. అక్కడ సుమారు 1.9 లక్షల మంది వరదల బారిన పడగా, శివసాగర్లో 1.5 లక్షల మందికి పైగా, జోర్హాట్లో సుమారు 1.4 లక్షల మంది ప్రభావితులయ్యారు.
🚨BREAKING : Assam floods worsen as relentless rain & upstream cloudbursts hit multiple districts. 47 dead after 6 deaths in last 24 hrs (ASDMA). 7.21 lakh+ people affected, with Sivasagar among the worst hit. IAF, NDRF, SDRF continue rescue & relief pic.twitter.com/vmWziRi5Yf
— The Lie Lamaa 🏹 (@TweetsOfLamaa) July 26, 2026
బాధితుల సహాయార్థం ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో 354 సహాయ శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో 37,724 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తోంది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 763 గ్రామాలు నీటమునిగాయి. ఇదిలా ఉండగా, నుమాలిగఢ్ వద్ద ధనసిరి నది ఇంకా ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నట్లు ఏఎస్డీఎంఏ వెల్లడించింది. వరదల ప్రభావంతో రాష్ట్రంలో 88,240 పశువులు, పౌల్ట్రీ పక్షులు కూడా నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.


