యజమాని సహా ముగ్గురి మృతి తమిళనాడులో ఘోరం
సాక్షి,చెన్నై: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని సెంగమలపట్టిలో ఆదివారం ఉదయం అనుమతి లేకుండా ఒక వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా నడుపుతున్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పరిశ్రమ యజమానిసహా ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దాటికి మృతుల శరీరావయవాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడటంతో మృతులను గుర్తించడం కష్టంగా మారింది.
రేకుల షెడ్డు పక్కనే నిలిపి ఉంచిన ఒక కారు, బైక్ ధ్వంసమయ్యాయి. అలాగే సమీపంలోని మూడు ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న శివకాశి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ధ్వంసమైన బాణసంచా పరిశ్రమ


