ఇద్దరు భారతీయ నావికులు గల్లంతు
లండన్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయంలో ఉన్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు గల్లంతయ్యారు. ‘ఎంవీ ఏజీఎన్ రగ్నార్’ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయ నావికులు మాత్రం దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారని కీవ్ నగరంలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
శనివారం జరిగిన ఈ ఘటనలో గల్లంతైన భారతీయుల ఆచూకీ కనుగొనేందుకు ఉక్రెయిన్ అధికారులతో సంప్రతింపులు జరుపుతున్నామని ఎంబసీ వివరించింది. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో తరచూ రష్యా నల్ల సముద్ర తీరంలోని ఒడెసా పోర్టుపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది. అయితే, తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ నుంచి వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు కనీసం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అప్రమత్తంగా ఉండండి: విదేశాంగ శాఖ
నల్ల సముద్ర ప్రాంతం వంటి సంక్షోభాలు కొనసాగుతున్న చోట్ల విధులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం భారతీయ నావికులు, సిబ్బందిని కోరింది. ఈ మేరకు ఆదివారం ఒక అడ్వైజరీ జారీ చేసింది. అటువంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, భద్రతా పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా నల్ల సముద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని హెచ్చరించింది.


