డబుల్‌ గేమ్‌ మొదలుపెట్టిన ట్రంప్‌ | Trump’s Double Game, Iran Talks Continue As Threat Of Massive Attack Looms, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ట్రంప్‌ డబుల్‌ గేమ్‌

Jul 25 2026 9:31 AM | Updated on Jul 25 2026 10:09 AM

Trump Double Game: Iran Talks Continue But Massive Attack Threat Looms

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే.. అవసరమైతే భారీ సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ ఇప్పుడు చర్చల్లో మరింత సీరియస్‌గా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన.. ఒప్పందం కుదరకపోతే గతం కంటే తీవ్ర స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్‌.. ఇరాన్‌పై భారీ దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అమెరికా సైన్యం మాత్రం పూర్తిగా సిద్ధంగా ఉందని, ‘‘మేం సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే ముందుకు వెళ్తాం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘డీల్‌ లేదంటే భారీ దాడులు’
ఇరాన్‌కు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాతో ఒక ఒప్పందానికి రావడం లేదా మరింత తీవ్ర స్థాయి సైనిక చర్యలను ఎదుర్కోవడం అని హెచ్చరించారు. ‘‘మేము వారితో మాట్లాడుతున్నాం. గతంతో పోలిస్తే ఇరాన్‌ ఇప్పుడు మరింత సీరియస్‌గా కనిపిస్తోంది. అయితే చర్చలు ఫలిస్తాయని ఇప్పుడే చెప్పలేం’’ అని ట్రంప్‌ అన్నారు.

‘లాక్‌డ్‌ అండ్‌ లోడెడ్‌’
అమెరికా సైనిక సామర్థ్యంపై ట్రంప్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. అవసరమైతే ఇరాన్‌పై మరింత భారీ దాడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దౌత్య మార్గానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సైనిక ఎంపికను పూర్తిగా పక్కన పెట్టలేదని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరాన్‌ అణు కార్యక్రమమే ఈ వివాదానికి ప్రధాన కారణమని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇరాన్‌ మాత్రం..
మరోవైపు అమెరికా ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ తెలిపారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఇరాన్‌ను నియంత్రించలేరని స్పష్టం చేశారు. చర్చలకు తాము సిద్ధమే అయినప్పటికీ.. బలవంతపు షరతులను అంగీకరించబోమని పేర్కొన్నారు. 

మరోవైపు మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఘర్షణలు, సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్‌ జలసంధిపై ప్రభావం పడుతోంది. గల్ఫ్‌ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై అనిశ్చితి నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్‌ ప్రాంతంలో వేలాది మంది నౌకా సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వందలాది నౌకలు ఆగిపోయాయని.. దాదాపు 6 వేల మంది నౌకా సిబ్బంది ఈ ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) పేర్కొంది. నౌకల రాకపోకలకు అంతరాయాలు, భద్రతా పరమైన సవాళ్ల కారణంగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

రష్యా, చైనాపైనా ట్రంప్‌ దృష్టి
ఇరాన్‌కు రష్యా, చైనా ఆయుధ సహాయం అందిస్తున్నాయన్న వార్తలపైనా ట్రంప్‌ స్పందించారు. ఆ దేశాల అధినేతలు ఇరాన్‌కు ఆయుధాలు అందించబోమని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇరాన్‌ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్‌ జలసంధిలో ఏదైనా పెద్ద పరిణామం చోటుచేసుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు సఫలం అవుతాయా? లేక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయా? అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement