'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని కమోడిటీ మార్కెట్పైకి మళ్లించారు. ఈసారి బంగారం, వెండి కాకుండా రాగి (కాపర్) భవిష్యత్తుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాగి ధరలు గత ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయని, అయినప్పటికీ ఈ పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలను చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఆయన ఫేస్బుక్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
కియోసాకి ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, విద్యుత్ గ్రిడ్ల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగంగా పెరుగుతుండటంతో రాగికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ రంగాలన్నీ విడివిడిగా కాకుండా ఒకేసారి రాగిని అధికంగా వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రపంచ రాగి డిమాండ్ సుమారు 2.8 కోట్ల టన్నులుగా ఉండగా, 2040 నాటికి అది 4.2 కోట్ల టన్నులకు మించి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనాలను ఆయన ప్రస్తావించారు.
అయితే మరోవైపు రాగి ఉత్పత్తి అంతే వేగంగా పెరగడం లేదని కియోసాకి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుల్లో ఒకటైన చిలీలో ఈ ఏడాది ఉత్పత్తి 9.5 శాతం తగ్గిందని, వచ్చే ఏడాదిలో కూడా ఉత్పత్తి తగ్గే అవకాశముందని గనుల సంస్థలు హెచ్చరిస్తున్నాయని చెప్పారు. గనుల్లో లభించే ఖనిజ నాణ్యత కూడా గత రెండు దశాబ్దాలుగా క్షీణిస్తుండటంతో, అదే పరిమాణంలో రాగిని పొందేందుకు గతంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ రాళ్లను తవ్వాల్సి వస్తోందని వివరించారు.
ఈ పరిస్థితిని కియోసాకి "కాపర్ సిజర్స్"గా అభివర్ణించారు. ఒకవైపు డిమాండ్ పెరుగుతుండగా, మరోవైపు సరఫరా తగ్గిపోతోందని, ఈ రెండు పరిస్థితులు కలిసి ధరలను మరింత పెంచే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
సాంప్రదాయిక పొదుపు పథకాలపై మాత్రమే ఆధారపడే వారు ఈ పరిస్థితిలో నష్టపోయే ప్రమాదం ఉందని, మారుతున్న ఆర్థిక ధోరణులను అర్థం చేసుకుని పెట్టుబడి అవకాశాలను గుర్తించాల్సిన అవసరం ఉందని కియోసాకి సూచించారు. ఏ గనుల కంపెనీ విజయం సాధిస్తుందో ఊహించడం కంటే, ఏ సంస్థలు లేదా రంగాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ లాభపడతాయనే దానిపై దృష్టి పెట్టాలని తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన పాఠమని ఆయన పేర్కొన్నారు.


