దేశీయ ఉత్పత్తుల ఎగుమతులను మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల పెట్టుబడులతో పనిచేసే ఈ-కామర్స్ సంస్థలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనల్లో సడలింపులు ప్రకటించింది. భారతదేశంలో తయారైన లేదా ఉత్పత్తి చేసిన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే పరిమితమయ్యేలా ఈ-కామర్స్ సంస్థలు ఇన్వెంటరీ ఆధారిత నమూనాను నిర్వహించడానికి అనుమతినిచ్చింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది.
పాలసీలో మార్పు
ఇంతకుముందు అమల్లో ఉన్న ఎఫ్డీఐ విధానం ప్రకారం.. వ్యాపారాల మధ్య జరిగే ఈ-కామర్స్ (బీ2బీ), మార్కెట్ ప్లేస్ మోడళ్లకు మాత్రమే విదేశీ పెట్టుబడుల అనుమతి ఉండేది. సొంతంగా సరుకులను నిల్వ ఉంచుకుని నేరుగా వినియోగదారులకు విక్రయించే ఇన్వెంటరీ మోడల్, అలాగే బీ2సీ విక్రయాలపై కఠినమైన నిషేధం ఉండేది. అయితే, నూతన నిబంధనల ద్వారా దేశీయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే సందర్భాల్లో ఈ ఇన్వెంటరీ, బీ2సీ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజాలు ఇకపై భారత్లో తయారైన వస్తువులను నేరుగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుని అంతర్జాతీయ వినియోగదారులకు ఎగుమతి చేసే వీలుంది.
పరిశ్రమల వర్గాల స్పందన
దేశీయంగా చిల్లర వర్తకాన్ని పరిరక్షించేందుకే గతంలో ఇన్వెంటరీ విధానంపై ఆంక్షలు విధించారని, అయితే ఎగుమతుల విషయంలో ఈ స్పష్టత ఇవ్వడం ద్వారా విదేశీ పెట్టుబడిదారుల్లో విధానపరమైన నమ్మకం పెరుగుతుందని ఈవై ఇండియా పన్ను, నియంత్రణ సేవల భాగస్వామి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అమెజాన్ సంస్థ స్వాగతించింది. తమ గ్లోబల్ విజన్కు ఇది మరింత బలమిస్తుందని, ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న, మధ్యతరహా తయారీదారులకు గ్లోబల్ మార్కెట్తో అనుసంధానం ఏర్పడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్


