మీర్ఖాన్పేటలో బుధవారం అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అమెజాన్ ప్రతినిధులు అనురాగ్, విక్రమ్, సీఎస్ సంజయ్జాజు, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తదితరులు
ఫార్చ్యూన్–500 కంపెనీలను ఆకర్షించడానికి దోహదపడుతుంది
అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి
ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలి.. రూ.60 వేల కోట్లు కాదు రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలి
ఈస్థాయి పెట్టుబడులు వస్తేనే 2034కి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం
పరిశ్రమలకు అవసరమైన వసతుల ఏర్పాటుకు, అనుమతులివ్వడానికి సిద్ధం
ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల కోసం భూములు త్యాగం చేసిన రైతులను గుర్తుంచుకుంటామన్న సీఎం
రైతు కుటుంబాలకు నష్ట పరిహారం, ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఆదేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమెజాన్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఫ్యూచర్ సిటీలో ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు దోహద పడుతుందని సీఎం రేవంత్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్–500 కంపెనీలను ఆకర్షించడానికి ప్రధాన పరిశ్రమగా అమెజాన్ దోహదపడుతుందని అన్నారు. ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నూతన డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగేలా ప్రణాళికలు
‘2025 డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాం. 108 దేశాలకు చెందిన 3 వేల మంది వివిధ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ తెలిపింది. కానీ రాష్ట్ర అవసరాలకు అది సరిపోదు. 2034 నాటికి అమెజాన్ రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తేనే 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యాన్ని చేరుకోగలం. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం. 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలపాలన్న వికసిత భారత్–2047 లక్ష్యంలో భాగంగా జాతీయ జీడీపీలో తన వాటాను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 10 శాతానికి పెంచుకునేలా తెలంగాణ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన కీలకం. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, అనుమతులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..’అని సీఎం తెలిపారు.
అభివృద్ధికి నమూనాగా తెలంగాణ
‘ఫ్యూచర్ సిటీని అత్యంత అధునాతన నగరంగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి నెలా పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నాం. అమెజాన్ పెట్టుబడులకు సంబంధించి కూడా ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం . తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీని రూపొందించాం. పరిశ్రమలు, పర్యాటకం, ఇంధనం, ఆరోగ్యం, క్రీడలు వంటి రంగాల్లో నిర్దిష్ట పాలసీలు రూపొందించాం. ఉద్యోగాల కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో హైదరాబాద్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయం..’అని రేవంత్ చెప్పారు.
ఎలక్ట్రిక్ రైడ్ దిశగా..
‘మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో డీజిల్ మీద ఆధారపడి నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈవీల రిజి్రస్టేషన్కు పన్నును పూర్తిగా మినహాయించి హైదరాబాద్ను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాదికి రూ.1,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలో ఇతర నగరాల్లో ఉన్న కాలుష్య సంబంధిత సమస్యలు హైదరాబాద్లో ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించాం. సమగ్ర ప్రణాళికతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం.
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల కోసం భూములను త్యాగం చేసిన రైతులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. భూమి ఇచ్చి అభివృద్ధికి సహకరించిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారులు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి అవసరమైన నష్ట పరిహారాన్ని అందించాలి. ఆందోళనలు చేపడుతున్న రైతులతో మంత్రి శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి చర్చించాలి. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను, మంచి నష్ట పరిహారాన్ని అందించాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నిరంతర విద్యుత్, నీటి సరఫరా: మంత్రి శ్రీధర్బాబు
ప్రభుత్వం నియంత్రణ సంస్థ కాదని, పరిశ్రమలకు ఒక సులభతరమైన సదుపాయకర్తగా మాత్రమే పనిచేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, ఆలూరులో ఒక డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక్కడ డేటా సెంటర్లకు అత్యంత కీలకమైన వనరులైన నిరంతర విద్యుత్, నీటి సరఫరాతో సహా సమగ్ర వసతులను కల్పిస్తున్నామని చెప్పారు.


