సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కుమారస్వామితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం సమావేశమైంది. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. ఈ-ఫార్ములా రేసు కేసులో జులై 31న కోర్టులో హాజరవుతానని.. న్యాయబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. కేసు నుంచి బయటపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘‘న్యాయస్థానంపైన విశ్వసనీయత ఉంది. వచ్చే ఏడాది పాదయాత్ర మొదలు పెడతా. ఎప్పుడు ఎక్కడ అనేది త్వరలో చెప్తాం. కేసీఆర్ నెక్స్ట్ సీఎం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరు తెలియదు. 8 మంది తామంటే తాము సీఎం అని అంటున్నారు’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
‘‘దక్షిణాది వాటా తగ్గకుంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది వాటా 24 శాతం కొనసాగాలి. యథావిధిగా దక్షిణాది వాటా ఉంటే బిల్లుకు మద్దతిస్తాం. 73 సార్లు ఢిల్లీకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి 73 పైసలు తీసుకువచ్చాడా?. హిట్లర్ ఆదర్శమని చెబుతున్న రేవంత్పై రాహుల్ గాంధీ చూస్తూ ఊరుకుంటాడా.. ఎన్డీఎస్ఏ కార్యాలయానికి ఎందుకు వెళ్లలేదు?. ఎన్డీఎస్ఏ కేవలం ఒక సలహా సంఘం మాత్రమే’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రైతులు, నిరుద్యోగులు ఆశపడ్డారు. కొందరు ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేది. రేవంత్ రెడ్డి నాలుగు సర్వేలు చేయించుకున్నాడు. సర్వేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఫోన్ ట్యాపింగ్లో హీరోయిన్ల ఫోన్లు రికార్డ్ చేశామన్నారు. ఎక్కడ ఆధారాలు పెట్టలేదు. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా అలాంటివేవీ రికార్డు లేదని చెప్పాడు.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


