మంచిర్యాల: నవమాసాలు మోసి కూతురికి జన్మనిచ్చిన ఓ తల్లి.. పసికందును గుండెలకు హత్తుకుని మురిసిపోకముందే మృత్యువు ఒడికి చేరింది. ఈ హృదయ విదారక సంఘటన ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు శాంతినగర్ కాలనీకి చెందిన ఆయిందాల రుచిత (23) గత వారం నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రసవం అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మంగళవారం ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది. రుచిత భర్త హరీష్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పాప పుట్టిన ఆనందం ఆ కుటుంబంలో ఎక్కువ రోజులు నిలవకుండానే తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి ప్రేమకు దూరమైన నవజాత శిశువు, అమ్మకోసం ఎదురు చూస్తున్న కొడుకు బిత్తరచూపులు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ఈ ఘటనతో శాంతినగర్ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.


