తమిళనాడులో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాలను అరికట్టేందుకు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. లంచం అడిగే అధికారులు, ఉద్యోగులపై ప్రజలు నేరుగా సమాచారం అందించేలా కొత్త ఫోన్ నంబర్ను అందుబాటులోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. లంచంపై సమాచారం ఇవ్వడానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 9498180936 నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సీఎం విజయ్ కూడా తన పాలనలో అవినీతికి తావులేని ప్రభుత్వం అందిస్తామని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయబోమని గతంలో స్పష్టం చేశారు. పారదర్శక పాలన, జవాబుదారీతనం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రజలు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండకూడదని, అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం విజయ్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా తమిళనాడు అవినీతి నిరోధక శాఖ (DVAC) రంగంలోకి దిగి విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, అనుమతులు, సంక్షేమ పథకాలు, ఇతర సేవల కోసం కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
లంచం అడిగిన సందర్భాల్లో బాధితులు ఆలస్యం చేయకుండా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు నిఘా పెట్టి, అవసరమైతే ట్రాప్ ఆపరేషన్లు నిర్వహించే అవకాశం ఉంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అవినీతి రహిత పాలన అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సీఎం విజయ్ చెబుతున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, ప్రజలకు వేగంగా సేవలు అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఫిర్యాదుల వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలంటే వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వేగంగా విచారణ, చర్యలు ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి వచ్చే సమాచారంతో అవినీతిపై పోరాటం మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు.


