పట్నా: బిహార్లోని పట్నాకు చెందిన 23 ఏళ్ల అవిభాజ్య కవల సోదరీమణులు సబా, ఫరా తీవ్ర ఆనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. ‘క్రేనియోపేగస్’ అనే అరుదైన రుగ్మతతో తలలు కలిసి పుట్టిన ఈ సోదరీమణులు, గత మూడు నెలలుగా సరైన మందులు అందక నరకం అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పట్నా సివిల్ సర్జన్ కార్యాలయం ద్వారా వీరికి నిత్యం ఆరు రకాల అత్యవసర మందులు అందాల్సి ఉండగా, ప్రస్తుతం అవి నిలిచిపోయాయి.
కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. మందులు అందకపోవడంతో సబా, ఫరాల చేతులు, కాళ్లలో వాపులు రావడమే కాకుండా, థైరాయిడ్ సమస్యలు పెరిగి, ఎముకల నొప్పితో వారు మరింత బలహీనంగా మారారు. 2012లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఆరుగురు వైద్యుల బృందం క్రమం తప్పకుండా వీరిని పరీక్షించాల్సి ఉంది.
2020 జనవరి నుంచి ఒక్క వైద్యుడు కూడా వారిని పరీక్షించలేదు. తినడానికి, మాట్లాడటానికి కూడా వారు ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తుండగా, స్పందించిన సివిల్ సర్జన్ డాక్టర్ యోగేంద్ర ప్రసాద్, సమస్య తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే మందులు అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: రాహుల్, ప్రియాక ఎక్కడ? క్లిష్ట సమయంలో ఏమయ్యారు?


