గ్వాలియర్ భారీ క్రిప్టోకరెన్సీ పెట్టుబడి స్కాం
సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్కు రూ..21.06 కోట్ల టోకరా
"హలో... నేను దివ్య మాట్లాడుతున్నాను" అనే మెసేజ్తో మొదలైన ఒక సాధారణ వాట్సాప్ సందేశం, భారతదేశంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ పెట్టుబడి మోసానికి తెర తీసింది. ఈ స్కాం కారణంగా గ్వాలియర్కు చెందిన 70 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ రూ. 21 కోట్లకు పైగా నష్టపోయారు. అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ,మధ్యప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ అశోక్ విజయవర్గీయకు భారీ టోకరా ఇచ్చిన వైనం కలకలం రేపింది. ఈ నకిలీ క్రిప్టోకరెన్సీ స్కామ్లో చిక్కుకుని ఏకంగా రూ. 21.06 కోట్లు కోల్పోయారు.
మోసం ఎలా జరిగింది?
ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్తో మొదలైన ఈ మోసం, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ ద్వారా సాగింది. 2025 డిసెంబర్లో విజయవర్గీయకు ఒక ఇండియన్ నంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో అవతలి వ్యక్తి తన పేరు "దివ్య" అని, తాను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్నని పరిచయం చేసుకుంది.
క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు వస్తాయని ఆమె నమ్మబికింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ మొత్తం అమెరికా కంట్రీ కోడ్ (+1) ఉన్న ఒక వర్చువల్ నంబర్కు మారింది. బాధితుడితో ఒక నకిలీ ట్రేడింగ్ పోర్టల్లో అకౌంట్ తెరిపించారు. మొదట ఆయన సరదాగా పెట్టిన చిన్న పెట్టుబడులపై లాభాలు వస్తున్నట్లు స్క్రీన్పై చూపించారు. నమ్మకం కలిగించడానికి జనవరి 7న రూ. 1.88 లక్షల లాభాన్ని నేరుగా ఆయన HDFC బ్యాంక్ ఖాతాకు జమ చేశారు. అంతే ఈ డబ్బు చేతికి అందడంతో విజయవర్గీయ ఆ ప్లాట్ఫారమ్ నిజమైనదేనని నమ్మారు. ఆ తర్వాత ఆయన విడతల వారీగా కోట్లాది రూపాయలు బదిలీ చేశారు. అంతేకాదు విజయవర్గీయను నమ్మి ఆయన స్నేహితులు, వ్యాపార భాగస్వాములు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఆ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్పోర్టల్లో ఆయనకు రూ. 33.25 కోట్ల లాభం వచ్చినట్లు చూపించారు.
తీరా బాధితుడు ఆ లాభాన్ని విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారి అసలు రంగు బయటపడింది. నిందితులు ఆ లావాదేవీని బ్లాక్ చేశారు. పైగా ఆ డబ్బు రావాలంటే రూ.10.84 కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టాలని, ఆ తర్వాత "రిస్క్ మార్జిన్" కింద మరో రూ. 1 కోటి కట్టాలని చెప్పి మరికొంత డబ్బు లాగారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ , '1930' హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న దాదాపు రూ.2 కోట్లను సకాలంలో ఫ్రీజ్ చేయగలిగారు.

అశోక్ విజయవర్గీయ
ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్
దీనిపై గ్వాలియర్ సైబర్ సెల్ విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితులు పోలీసులు లేదా బ్యాంకులు డబ్బును ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు అత్యంత సంక్లిష్టమైన, నాలుగు అంచెల బదిలీ వ్యవస్థను ఉపయోగించారు. మొత్తంగా 20,049 లావాదేవీల ద్వారా డబ్బు దేశవ్యాప్తంగా పంపిణీ అయింది.
Layer 1లో బాధితుడి నుండి నేరుగా డబ్బులు స్వీకరించిన 77 బ్యాంక్ ఖాతాలను పోలీసులు గుర్తించారు.
Layer 2లో ఆ 77 ఖాతాల నుండి నిధులు 493 ఖాతాలకు బదిలీ అయ్యాయి.
Layer 3లో : అక్కడి నుండి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 12,700 ఖాతాలకు డబ్బును చిన్న చిన్న మొత్తాలుగా విడగొట్టి పంపారు.
Layer 4లో చివరిగా దాదాపు 7,500 లావాదేవీల ద్వారా ఆ డబ్బును ఏటీఎంల (ATMs) ద్వారా విత్డ్రా చేయడం, షాపింగ్ వోచర్లు, క్యాష్ వోచర్లుగా మార్చడం లేదా తిరిగి USDT వంటి క్రిప్టోకరెన్సీల్లోకి మార్చడం చేశారు.
ఇదీ చదవండి: ‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగం
ఈ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ఖాతాలలో చాలా వరకు "మనీ మ్యూల్స్" (కమిషన్ ఆశతో తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు వాడుకోవడానికి ఇచ్చే ఇంటర్మీడియరీలు) ఖాతాలు అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇది దేశంలోనే జరిగిన అతిపెద్ద మోసాలలో ఒకటి సైబర్ సెల్ డిఎస్పీ సంజీవ్ నయన్ శర్మ ప్రకటించారు. USDT ట్రేడింగ్ పేరుతో సీనియర్ CAను మోసం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఖాతాల ద్వారా ఈ నిధులను మళ్లించారని తెలిపారు. గుర్తుతెలియని నిందితులపై సమాచార సాంకేతిక చట్టం (IT Act) సెక్షన్ 66D, సహా పలు సెక్షన్ల కింద కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం సైబర్ టీమ్స్ నిందితులు ఉపయోగించిన నకిలీ యుఆర్ఎల్లు (URLs), ఐపీ అడ్రస్లు మరియు వాట్సాప్ నంబర్లను ట్రాక్ చేస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు?


