సాక్షి, తిరుపతి: టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు కాజేసిన భారీ మోసం తిరుపతిలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీటీడీ లోగోతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు తయారు చేసి పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అడ్వకేట్గా తనను పరిచయం చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించాడు. ఉద్యోగాల పేరుతో ఒక్కో బాధితుడి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు తీసుకున్న అనంతరం జాయినింగ్ ప్రక్రియ కొనసాగుతోందంటూ కాలయాపన చేస్తూ బాధితులను మభ్యపెట్టినట్లు సమాచారం.
చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 30 మందికి పైగా బాధితులు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.5 కోట్లకు పైగా మోసం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
బాధితులే నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


