సాక్షి, కాకినాడ: ప్రశ్న రావణ్పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రావణ్పై ఇప్పటికే ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా రావణ్ నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు.
వివరాల మేరకు.. యూట్యూబర్ రావణ్ బ్యాంక్ ఖాతాలను సర్పవరం పోలీసులు ఫ్రీజ్ చేయించారు. అలాగే ఆయన నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు. రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రతి నెల సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఆదాయం వివరాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.
వివాదాస్పద వీడియోలను తొలగించాలని, ఛానల్ను నిలిపివేయాలని పోలీసులు మెటా సంస్థను కోరారు. దీనిపై స్పందించిన మెటా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తామని, అయితే మొత్తం ఛానల్ను పూర్తిగా నిలిపివేయడం తమ పరిధిలో లేదని పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
అయితే, ఈ వ్యవహారం 2025లో పిఠాపురం నియోజకవర్గం యండమూరు గ్రామంలో దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణ ఆరోపణల ఘటన నేపథ్యంలో మొదలైనట్లు తెలుస్తోంది. ఆ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరిని ప్రశ్నిస్తూ రావణ్ వీడియోలు చేసినట్లు సమాచారం. అప్పట్లో రావణ్పై పిఠాపురం జనసేన ఫైవ్మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో జూలై 2న రావణ్ను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం బెయిల్పై విడుదల చేశారు. ప్రస్తుతం రావణ్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా కంటెంట్పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


