పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భార్య తనపై పాశవికంగా దాడిచేశారంటున్న ఆ పార్టీ మండల కార్యదర్శి
చేయివిరిగి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు
ప్రశ్నించడానికి వెళ్తే అతనే దుర్భాషలాడాడని ఎమ్మెల్యే సతీమణి ఫిర్యాదు
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొయ్యలగూడెం పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన
కొయ్యలగూడెం : ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పార్టీ శ్రేణులు.. ఈసారి దాడులకు తెగబడినట్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వివరాలివీ.. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సతీమణి జ్యోతి తనపై పాశవికంగా దాడిచేసి కొట్టి గాయపరిచారని జనసేన కొయ్యలగూడెం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏపూరి సతీష్ గురువారం ఆరోపించాడు. ఎమ్మెల్యే భార్య, మరో ఏడుగురు వ్యక్తులు ఉదయం రెండు వాహనాల్లో కొయ్యలగూడెంలోని తన ఇంటికి వచ్చారని.. ఎమ్మెల్యే వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ పత్రం గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేశావని అడిగారని.. ఎమ్మెల్యే వద్దకు వెళ్లి క్షమాపణ అడగమంటూ కారులో ఎక్కించుకున్నట్లు సతీష్ చెప్పాడు.
ఆ తర్వాత జంగారెడ్డిగూడెం రోడ్డులోని కొత్తూరు ప్రాంతానికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే అనుచరులైన కేకే, ఆయన పీఏ ప్రసన్న మరో ఐదుగురు వ్యక్తులు దుర్భాషలాడుతూ ఇనుప రోడ్డుతో దాడిచేశారన్నాడు. అంతేకాక.. గన్ పెట్టి బెదిరించారని వాపోయాడు. ఈ నేపథ్యంలో తన ఎడమ చేయి విరిగిందని, కాలికి తీవ్రగాయం కాగా రక్తస్రావమైందన్నారు. తిరిగి అదే కారులో పిడిగుద్దులు గుద్దుతూ కొయ్యలగూడెం పోలీస్స్టేషన్కి తీసుకొచ్చి తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని సతీష్ చెప్పాడు.
ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు..
మరోవైపు.. సతీష్పై ఎమ్మెల్యే భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకి, తన భర్తకు మధ్య వ్యక్తిగత విషయాలు మనస్పర్థలు ఉన్నట్లు సతీష్ ఇటీవల సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులో పోస్ట్చేసి తమను కించపరిచాడని ఆరోపించారు. దీనిపై నలుగురు పెద్దలను తీసుకుని సతీష్ ఇంటికి వెళ్లామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి వెళ్లిన తమను సతీష్ దుర్భాషలాడి కులం పేరుతో దూషించాడని, దీంతో స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, తనపై హత్యాయత్నానికి ఎమ్మెల్యే భార్య జ్యోతి, ఎమ్మెల్యే అనుచరులు పాల్పడ్డారని సతీష్ ఫిర్యాదు చేశాడు.
జనసేన శ్రేణుల ధర్నా..
అయితే, సతీష్పై ఎమ్మెల్యే వర్గీయులు దాడిచేశారని, వారిపై కేసులు నమోదుచేయాలంటూ జనసేన శ్రేణులు పోలీస్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ను పరామర్శించి అక్కడ నుంచి ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని బైఠాయించారు. చివరకు.. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసా్తమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.


