ప్రమాద సమాచారం మత్స్యకార కుటుంబాలకు జూలై 5న ఉదయం 5 గంటలకు అందినట్లు పేర్కొన్న త్రిసభ్య కమిటీ.
ఘటన జరిగిన 4వ తేదీనే సమాచారం ఇచ్చినా స్పందన కరువు
తీరిగ్గా మరుసటి రోజు సహాయక చర్యలు
అసలు 4వ తేదీ తమకు సమాచారం లేదంటూ బుకాయింపు
4వ తేదీ రాత్రే హెలికాప్టర్లు వెళ్లాయంటూ అంతలోనే అబద్దాలు
మత్స్యకారుల ఆందోళనతో సహాయక చర్యలపై మాటమార్చిన వైనం
చివరకు 5వ తేదీ ఉదయం తెలిసిందని తెలిపిన త్రిసభ్య కమిటీ
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మత్స్యకార కుటుంబాల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆరుగురు మత్స్యకారులు గల్లంతయిన బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యమే మత్స్యకార కుటుంబాలను విషాదంలోకి నెట్టిందని అక్షరాలా స్పష్టమవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, ఆలస్యంగా స్పందించి తీరిగ్గా మరుసటి రోజున సహాయక చర్యలు ప్రారంభించడం.. అనంతరం బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఆధారాలతో సహా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమాద సమాచారం ఎప్పుడు అందిందనే అంశంలోనే అధికారుల ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఘటన జరిగిన 4వ తేదీనే సమాచారం అందిందని కొందరు అధికారులు చెబుతుండగా, 5వ తేదీ ఉదయం వరకూ తమకు తెలియలేదని మరికొందరు పేర్కొనడం ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోంది. పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రమాద సమయంలో విలువైన గంటలు వృథా కావడం, సమన్వయం లోపించడం, అనంతరం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం పట్ల బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఘటన జరిగిన రాత్రే పక్కా సమాచారం
4వ తేదీన మధ్యాహ్నం ప్రమాదం జరిగిన తర్వాత అదే రోజు రాత్రికి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులందరికీ బోటు ప్రమాదంపై పక్కాగా సమాచారం అందింది. అయినప్పటికీ వెంటనే సహాయక చర్యలు ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కపెట్టి కాలం గడిపారు. ఈ లోగా జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోయింది. సదరు మత్స్యకారుల కుటుంబాలు ఫిషింగ్ హార్బర్తో పాటు మత్స్యశాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి.
జిల్లా యంత్రాంగంతో పాటు నేరుగా జిల్లా కలెక్టరుకు కూడా 4వ తేదీ రాత్రి సమాచారం అందించిన విషయాన్ని ఆధారాలతో సహా మత్స్యకారులు వెల్లడించడంతో... ముందురోజే సహాయక చర్యలు చేపట్టామంటూ కొత్త పలుకులు ప్రారంభించారు.ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాము చెప్పిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి మత్స్యకారులను రక్షించేందుకు ప్రయత్నించి ఉంటే.. అందరూ సురక్షితంగా బయటకు వచ్చే వారని, ప్రభుత్వ నిర్లక్ష్యమే తమ కొంపముంచిదని మండిపడుతున్నారు.
ఎప్పుడూ అదే నిర్లక్ష్యం..
2025 అక్టోబరులో పశ్చిమ బెంగాల్తో పాటు రాష్ట్రానికి చెందిన మొత్తం 23 మంది మత్స్యకారులు... సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ నేవీకి పట్టుబడ్డారు. వీరిని విడిపించేందుకు ప్రభుత్వం కనీస కృషి చేయలేదు. వీరంతా విశాఖపట్నంకు చెందిన మత్స్యకారులు కాకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు కనీసం వారి గురించి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. మరోవైపు విశాఖపట్నం నుంచి చేపలవేటకు వెళ్లిపోయారంటూ విజయనగరం జిల్లా అధికారపార్టీ నేతలు కూడా ఆ కుటుంబాలను పరామర్శించలేదు.
ఈ నేపథ్యంలో మత్స్యకార సంఘ నేత వాసుపల్లి జానకీరామ్ కాస్తా నేరుగా బంగ్లాదేశ్కు వెళ్లి.. వారిని విడిపించే ప్రయత్నం చేశారు. తీరిగ్గా 2026 జనవరి నెలలో వారు అక్కడి నుంచి వస్తున్నారని తెలిసి.... ప్రభుత్వం హడావుడి చేసి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసింది. మత్స్యకార భరోసా నిధుల విడుదలలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. సగం కుటుంబాలకు కూడా భరోసా అందని పరిస్థితి.
మొహమాటం లేకుండా మాట మార్పు
» ఈ నెల 4వ తేదీన రాత్రి 11.30 గంటలకు ప్రమాదంపై సమాచారం వచ్చింది. 5వ తేదీ ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాం. – డీఐజీ గోపినాథ్ జెట్టి
» ప్రమాదంపై మాకు 5వ తేదీ ఉదయం 8.30 గంటలకు సమాచారం అందింది. – మత్స్యశాఖ కమిషనర్ , రాంశంకర్ నాయక్!
» 4వ తేదీ రాత్రే సహాయక చర్యల కోసం హెలికాప్టర్ వెళ్లింది. – ఆర్డీవో దిలీప్ చక్రవర్తి
» ప్రమాదంపై 5వ తేదీ ఉదయం 5 గంటలకు మత్స్యకార కుటుంబాలు సమాచారం అందించాయి. – త్రిసభ్య కమిటీ నివేదిక
పూర్తి స్థాయి అధికారి లేకపోవడం శాపమే..!
వాస్తవానికి విశాఖపట్నంలో మత్స్యకారుల జనాభా అధికం. ఇక్కడే ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. మత్స్యశాఖలో కూడా ఇక్కడ జాయింట్ డైరెక్టర్ (జేడీ) పోస్టు ఎంతో కీలకమైనది. అటువంటి కీలకమైన విశాఖ జిల్లాలో రెగ్యులర్ జేడీ విధులు నిర్వర్తించడం లేదు. మత్స్యశాఖ జేడీ ఇన్చార్జ్గా ఎల్బీఎస్ వర్ధన్ వ్యవహరిస్తున్నారు. అనకాపల్లి జేడీగా ఉన్న వర్ధన్ను 4వ తేదీన విశాఖపట్నం జిల్లాకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)తో జేడీగా నియమించారు. గతంలో జేడీగా ఉన్న లక్ష్మణ్రావును ఎటువంటి కారణం లేకుండానే నెల్లూరుకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి.
కొత్తగా వచ్చిన జేడీకి ఇక్కడి పరిస్థితులు కొత్త కావడంతో ఈ బోటు ప్రమాదంపై వెనువెంటనే స్పందించలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా రెగ్యులర్ జేడీ కాకపోవడం వల్ల కూడా అంత శ్రద్ధ పెట్టలేకపోయినట్టు అర్థమవుతోంది. వాస్తవానికి మంత్రి ప్రోటోకాల్ ఖర్చుల పేరుతో భారీగా వసూళ్లకు దిగడంతో పూర్తి స్థాయి జేడీ బాధ్యతల నిర్వహణకు ఎవ్వరూ ముందుకు రావడంలేదన్నది ఆరోపణ.


