సాక్షి, అనంతపురం: అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీనికి ధీటుగా టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు తోపుదుర్తి సిద్ధమయ్యారు. టీడీపీకి కౌంటర్గా వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కాగా, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల తనను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తన హత్యకు ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కుట్ర చేశారని తెలిపారు. ఇందుకు మంత్రి నారా లోకేష్ సహకరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
ఇటీవల తనపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ముందుకు పెట్టి పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్ర బాబు రాజకీయాలు చేస్తున్నారని తోపుదుర్తి విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆయన తన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, టీడీపీ నేతల ఆరోపణలను రాజకీయంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని తోపుదుర్తి ఏర్పాటు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. తోపుదుర్తి ఇంటి వద్ద భారీగా మోహరించారు. తోపుదుర్తి ఇంటికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్లకుండా వారిని అడ్డుకుంటున్నారు. తోపుదుర్తి ఇంటి వద్దకు పార్టీ శ్రేణులు చేరకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.


