వాషింగ్టన్: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలు, ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్లు, అంతర్జాతీయ విద్యార్థుల వీసా కాలపరిమితి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్లలో కీలక మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నూతన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ నిపుణులు, విద్యార్థులపై అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉంది.
హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, లేబర్, స్టేట్ డిపార్ట్మెంట్లు విడుదల చేసిన తాజా నిబంధనల ప్రకారం, థర్డ్-పార్టీ క్లయింట్ సైట్లలో పనిచేసే హెచ్-1బీ ఉద్యోగుల అర్హతలను మరింత కఠినతరం చేయనున్నారు. ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు గట్టి నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, అందులో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉన్న పెద్ద కంపెనీలకు వీసా పొడిగింపుల (ఎక్స్టెన్షన్స్) సమయంలో అదనపు బయోమెట్రిక్ ఫీజులను విధించనున్నారు.
మరోవైపు, గ్రీన్ కార్డ్ ప్రక్రియకు కీలకమైన 'పెర్మ్ (PERM) లేబర్ సర్టిఫికేషన్' విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. విద్యార్థుల విషయానికొస్తే, ఇప్పటివరకు ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానాన్ని రద్దు చేసి, గరిష్టంగా నాలుగేళ్ల నిర్ణీత కాలపరిమితిని (ఫిక్స్డ్ టెన్యూర్) ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత ప్రతిసారీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, హెచ్-4 వీసాదారుల వర్క్ పర్మిట్ (ఈఏడీ) ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ను నిలిపివేయనున్నారు. దీనివల్ల దాదాపు లక్ష మంది భారతీయులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.


