సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (IWT) పక్కనబెట్టాలన్న భారతదేశం నిర్ణయం పాకిస్తాన్ను ఒక రేంజ్లో వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాలను ఆపితే యుద్ధమే అంటూ పాక్ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని తీసుకుంటామని ప్రకటించడం కలకలం రేపింది.
పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధూ జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. సైనిక కమాండర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని పునరుద్ఘాటించింది .అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ నదీ జలాల వాటాను దక్కించు కునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధూ జలాల హక్కుల కోసం పోరాడుతామని సైన్యం వెల్లడించింది.
గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) భారతదేశం నిలిపివేసింది (Abeyance లో పెట్టింది). దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం, మంత్రులు భారత్పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు, వార్ వార్నింగ్లివ్వడం శోచనీయం.
పాకిస్తాన్ NSC మార్గదర్శకాలు ఏమిటి?
నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని "యుద్ధ చర్య" (Act of War)గా పరిగణించాలని పాకిస్తాన్ NSC గతంలోనే నిర్ణయించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' కింద పోరాడుతామని తెలిపింది. అలాగే కాశ్మీరీలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది.
బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరిక వైరల్
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక వీడియో వైరల్ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తి లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, అన్ని రంగాలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము."
పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతు న్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేసింది.
సింధు జలాలు- పాకిస్తాన్
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్కు.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఆ సమాచారాన్ని పంచు కోవాల్సిన అవసరం ఉండదు.
భారత్ ప్రాజెక్టులు: సింధు బేసిన్లో సావల్కోట్, రట్లే, బుర్సార్, పకాల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. పాక్ వ్యవసాయం అతలాకుతలం: పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80-90 శాతం ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యామ్లలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.
దీంతో తమ అత్యంత బలహీనమైన పాయింట్ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం, ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్


