కాసరగోడ్: మంగళూరు-గోవా వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేరళలోని కోజికోడ్ వరకు పొడిగించే ప్రతిపాదన మళ్లీ పరిశీలనకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సురేష్ గోపి.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ పొడిగింపు వల్ల కేరళ ప్రయాణికులకు ఎంతో మేలు జరగడమే కాకుండా, పర్యాటకరంగానికి పెద్దపీట వేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. కొల్లూరు మూకాంబికా ఆలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం బైందూరులో స్టాపింగ్ కల్పించాలని ఈ లేఖలో కోరారు.
గతంలోనే ఈ ప్రతిపాదనపై రైల్వే అధికారులు కసరత్తు చేసినప్పటికీ, కర్ణాటకలోని కొన్ని రాజకీయ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఇది సాకారం కాలేదు. ప్రస్తుతం మంగళూరు-గోవా వందే భారత్లో ప్రయాణికుల సంఖ్య (ఆక్యుపెన్సీ) చాలా తక్కువగా ఉంది. కేరళలో నడిచే వందే భారత్ రైళ్లు 150 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తుంటే, మంగళూరు-గోవా సర్వీసులో మాత్రం సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఈ రైలును మలబార్ ప్రాంతానికి పొడిగిస్తే ఆక్యుపెన్సీ పెరిగి, రైల్వేకు లాభదాయకంగా మారుతుందని ప్రయాణికుల సంఘాలు, అధికారులు భావిస్తున్నారు. తద్వారా బైందూరు, ఉడుపి, మురుడేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు, అలాగే గోవా వెళ్లే కేరళ ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అయితే, రైల్వే మంత్రిత్వ శాఖ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: ఇండోనేషియాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం


