న్యూయార్క్: అమెరికా గూఢచారి సంస్థ ‘సిఐఎ’ 1980ల కాలంలో తనను రహస్యంగా 2118వ సంవత్సరానికి పంపిందని అలెగ్జాండర్ స్మిత్ అనే వ్యక్తి సంచలన ప్రకటన చేశాడు. ‘అపెక్స్ టీవీ’ అనే యూట్యూబ్ ఛానెల్లో లాటెక్స్ మాస్క్ ధరించి ప్రత్యక్షమైన అతను జనానికి తెలియకుండా దాచిపెట్టిన రహస్య సాంకేతిక పరిజ్ఞానాన్ని, భవిష్యత్తు విశేషాలను ప్రపంచానికి వెల్లడించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ప్రజలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థలు, ఎగిరే వాహనాలతో కూడిన భారీ నగరాలలో నివసిస్తారని చెబుతూ, అందుకు రుజువుగా 2118 సంవత్సరానికి సంబంధించిన ఒక ఫోటోను కూడా అతను చూపించాడు.
అయితే రాబోయే శతాబ్దంలో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య తలెత్తే విభేదాల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందని అతను హెచ్చరించాడు. ఈ ఘర్షణలో ఉత్తర కొరియా తరపున రష్యా రంగంలోకి దిగుతుందని, దీనివల్ల పరస్పరం క్షిపణి దాడులు జరుగుతాయని పేర్కొన్నాడు. ఈ యుద్ధం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ, చివరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరిహద్దులు తుడిచిపెట్టుకుపోయి, ప్రజలు జీవిత విలువను గ్రహించి పరస్పరం కలిసికట్టుగా జీవించడం ప్రారంభిస్తారని, తద్వారా ప్రపంచం శాంతియుతంగా మారుతుందని అతను పేర్కొన్నాడు.
సాంకేతిక రంగంలో రాబోయే అద్భుతమైన మార్పుల గురించి చెబుతూ, 2028 నాటికల్లా సాధారణ ప్రజలకు కూడా వాణిజ్యపరమైన ‘టైమ్ ట్రావెల్’ (కాల ప్రయాణం) అందుబాటులోకి వస్తుందని స్మిత్ తెలిపాడు. అదే సంవత్సరంలో, తెలివైన గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారనే విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధృవీకరిస్తుందంటూ చెప్పాడు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న ఈ టైమ్ ట్రావెల్ అంశం మరోమారు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: ‘ఇది సినిమా ప్రొడక్షనా? సెక్రటేరియట్ పాలనా?’


