హంగరీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు హంగరీలోని ఓ హైవేపై పోలాండ్కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై హంగరీ ప్రధాని పీటర్ మగ్యార్ విచారం వ్యక్తం చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పు హంగరీలోని మెజోకెరెష్టెస్ పట్టణం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. న్యిరెగ్యాజా నగరానికి వెళ్తున్న పోలాండ్ దేశానికి చెందిన బస్సు ఎం3 మోటార్వేపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపక్కనున్న గోతిలోకి దూసుకెళ్లింది. అనంతరం అందులో బోల్తా పడింది.
ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు హంగరీ ప్రభుత్వ వార్తా సంస్థ ఎంటీఐ తెలిపింది. ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపు తప్పి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.


