కాలంతో సంబంధం లేకుండా కొందరికి పెదవులు పొడిబారి, పగులుతుంటాయి. వాతావరణ మార్పులు, డీహైడ్రేషన్ వంటివి ఇందుకు కారణాలు కావచ్చు. అందువల్ల ఇంట్లోనే తయారుచేసుకునే వాటితో కొన్ని చిట్కాలను పాటిస్తే పెదవులకు అవసరమైన తేమ అంది, మృదువుగా మారుతాయి. తేనె, కలబంద, నెయ్యి, షియా బటర్ వంటి పదార్థాలు పెదవుల్లో తేమను పట్టి ఉంచి పగుళ్లను తగ్గించడంలో సహాయపడుతాయి.
ఒక స్పూన్ తేనెలో కొద్దిగా పంచదార కలిపి వారానికి రెండుసార్లు పెదాలపై సున్నితంగా రుద్దితే మృతకణాలు తొలగిపోతాయి. అదేవిధంగా అలోవెరా జెల్లో కొద్దిగా తేనె కలిపి పెదాలపై రాసుకుని, పావుగంట తరువాత కడిగితే పెదాలు మృదువుగా ఉంటాయి. రాత్రి నిద్రించే ముందు బీట్ రసాన్ని పెదవులకు రాస్తే సహజమైన గులాబీ రంగు వస్తుంది.
ఎర్రమట్టితో ముఖానికి మెరుపు
ఈజిప్షియన్ రాచ వంశీకులు నైలు నదీ పరివాహక ప్రాంతంలోని ఎర్ర మట్టిని ఎక్కువగా ఉపయోగించేవారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన అందాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి నైలు నది ఒడ్డున దొరికే ఎర్రటి మట్టిని ఉపయోగించేదని ప్రాచీన ఆధారాలు, కథనాలు చెబుతున్నాయి. నైలు నది ఒడ్డున ఉండే ఎర్రమట్టిలో అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్తో పాటు అనేక ఖనిజాల గాఢత అత్యధికంగా ఉంటుంది.
ఇది చర్మానికి పూసుకున్నప్పుడు ముఖంలోని రంధ్రాలు తక్షణమే బిగుతుగా మారేవి. అందువల్ల ఈ మట్టిని అప్పటి రాజులు, రాణులు విరివిగా ఉపయోగించేవారు. అంతేకాదు వారు చనిపోయినప్పుడు కూడా వారి సమాధుల్లో ఆహారంతో పాటు ఎర్రమట్టి ఫేస్ ప్యాక్లు కూడా భద్రపరచేవారట. చనిపోయిన తర్వాత కూడా వారు అందంగా కనిపించాలని నమ్మేవారు!
(చదవండి: ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!)


