ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇతరుల్ని ఆకర్షించే విషయంలో ముందుంటారు. ఏవైనా వేడుకలు జరిగేటప్పుడు.. అందరి కళ్లూ ఆయనపైనే ఉంటాయి కాబట్టి.. తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు డ్రెస్లు, తలపాగాల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతారు. అలానే ఈసారి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకట్టుకునే దుస్తులతో పాటు ధరించే తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ ఈ వేడుకల్లో క్లాసిక్ ఆఫ్-వైట్ కుర్తా-పైజామా, బ్రౌన్ స్లీవ్లెస్ జాకెట్తో కనిపించగా, తలకు ఎరుపు రంగు బంధానీ తలపాగతో అందర్నీ ఆకర్షించారు.
టై-అండ్-డై సఫా ముదురు ఎరుపు రంగు, చక్కటి తెలుపు, పసుపు రంగు చుక్కలతో అలంకరించిన తలపాగతో మెరిశారు. ఆయన భుజం వరకు జాలువారే ఆ తలపాగ అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు అనుగుణంగా పాకెట్కి త్రివర్ణ పాకెట్ స్క్వేర్ను జతచేశారు. చారిత్రాత్మక 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ధరించిన వస్త్రధారణ భారతదేశపు స్వదేశీ వస్త్ర వారసత్వాన్ని చాటిచెప్పింది.
ఆ స్ఫూర్తిని ప్రోత్సహించారు..
గత దశాబ్ద కాలంగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ధరించే తలపాగా ఫ్యాషన్కు అతీతంగా, భారతదేశపు విభిన్న ప్రాంతీయ హస్తకళలకు ప్రతీకాత్మక నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్లలో పాతుకుపోయిన టై-అండ్-డై బంధానీ సాంకేతికత, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈసారీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం కూడా ఈ ప్రతిష్టాత్మక వస్త్ర కళారూపాన్ని ఎంచుకోవడం ద్వారా, ప్రధానమంత్రి భారతీయ హస్తకళను ప్రదర్శిస్తూ, ప్రపంచ వేదికపై 'వోకల్ ఫర్ లోకల్' స్ఫూర్తిని ప్రోత్సహించారు.
కాగా, 2014లో ప్రధాని మోదీ, ప్రకాశవంతమైన ఎరుపు రంగు బంధేజ్ తలపాగాకు భిన్నమైన ఆకుపచ్చ తోకను జతచేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. అప్పటి నుండి, ఆయన ధరించే తలపాగాలు ఎర్రకోట వేడుకలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే దృశ్యాలలో ఒకటిగా మారిపోయింది.
(చదవండి: తొలి స్వాతంత్ర్య దినోత్సవం రోజున వందేమాతరం ఆలపించింది ఎవరో తెలుసా..!)


