హెల్త్
మనం ఏదైనా ఎగ్జామ్కి వెళ్లేముందు గానీ, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయేపుడు గానీ మనసులోనే కాకుండా పొట్టలోనూ గాబరాగా అనిపిస్తుంటుంది. అయితే ఇది వట్టి ముచ్చట కాదని.. మన జీర్ణవ్యవస్థ, మెదడు నిరంతరం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పొట్టలో ఉండే బాక్టీరియా ఇచ్చే సంకేతాలే మన భావోద్వేగాలను, ఒత్తిడిని, మూడ్ను ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల ప్రకారం, మన జీర్ణ వ్యవస్థకు, మెదడుకు మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. దీనినే ‘గట్–బ్రెయిన్ ఆక్సిస్’ అని పిలుస్తారు. బ్రెయిన్ను, జీర్ణ వ్యవస్థను కలిపే వేగస్ అనే ఒక ముఖ్యమైన నరాల వ్యవస్థ ద్వారా సంకేతాలు మార్పిడి చెందుతుంటాయి. అలాగే మన మనసును సంతోషంగా ఉంచే ‘సెరోటోనిన్’ అనే రసాయనం మెదడులో కాకుండా ఎక్కువగా జీర్ణ వ్యవస్థలోనే తయారుకావడం విశేషం.
మనసు ఎందుకు మారుతుంది?
మన జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. ఆహారం, ఒత్తిడి, ఆల్కహాల్, లేదా ఇతర వ్యాధుల వల్ల పొట్టలో వాపు లేదా సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, జీర్ణవ్యవస్థ నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలలో మార్పులు వస్తాయి.
ఇది ఆందోళన, ఒత్తిడి, నీరసానికి కారణమవుతుంది. అందుకే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటూ పొట్ట ఆరోగ్యాన్ని కా΄ాడుకుంటే మానసిక ప్రశాంతతను కూడా కా΄ాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


