వర్షాకాలం రాగానే చల్లటి వాతావరణం వల్ల వేడివేడి టీలు తాగాలని, పకోడీలు, సమోసాలు తినాలని మన మనస్సు లాగేస్తుంటుంది. అయితే, ఇవన్నీ మన దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చాలా మందికి తెలియదు.. చిగుళ్లవాపు, పంటినొప్పి, నోటి దుర్వాసన వంటివి వేధిస్తుంటాయి. అందువల్ల చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
రాత్రివేళల్లో బ్రషింగ్ను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చల్లటి వాతావరణంలో బద్ధకం వల్ల బ్రష్ చేయడం మానేయడమో, హడావిడిగా ముగించడమో చేస్తుంటారు. దీనివల్ల దంతాల మధ్య మిగిలి΄ోయిన ఆహార వ్యర్థాలపై బాక్టీరియా చేరి యాసిడ్లను విడుదల చేస్తుంది. ఇది ఎనామిల్ను దెబ్బతీసి కేవిటీలకు దారితీస్తుంది.
సాయంత్రం వేళల్లో టీ, కాఫీలతోపాటు తియ్యటి బిస్కెట్లు, వేపుళ్లు, స్వీట్లు తినడం సహజం. అయితే జిగటగా ఉండే తీపి పదార్థాలు దంతాల సందుల్లో పేరుకుపోయి బాక్టీరియాకు ప్రధాన ఆహారంగా మారతాయి. అందువల్ల ఆహారం, స్నాక్స్ తిన్న వెంటనే స్వచ్ఛమైన నీటితో నోటిని బాగా పుక్కిలించాలి.
దాహం వేయకపోవడం వల్ల వర్షాకాలంలో చాలామంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల నోటిలో లాలాజలం ఊరడం తగ్గుతుంది. లాలాజలం నోటిని సహజ సిద్ధంగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. లాలాజలం తగ్గితే నోటి దుర్వాసన, పంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల దాహం వేయక΄ోయినా రోజంతా తగినంత కాచి చల్లార్చిన నీటిని తాగుతూ శరీరాన్ని, నోటిని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి.
వర్షాకాలంలో ఇమ్యూనిటీ కాస్త తగ్గడం వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం లేదా వాపు రావడం గమనిస్తే చాలామంది దాన్ని సాధారణ విషయంగా వదిలేస్తారు. చిగుళ్ల రక్తస్రావం అనేది ఇన్ఫెక్షన్కు ప్రారంభ సంకేతం. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్ట్ను సంప్రదించాలి.
వర్షాకాలంలో బాత్రూమ్లలో తేమ ఎక్కువగా ఉంటుంది. బ్రషింగ్ పూర్తయ్యాక టూత్బ్రష్ను బాత్రూమ్లోనే వదిలేస్తే, దానిపై బాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. అందువల్ల బ్రష్ చేసిన తర్వాత
దాన్ని శుభ్రంగా కడిగి, గాలి తగిలే పొడి ప్రదేశంలో నిలువుగా ఉంచాలి.


