ఇటీవల కాలంలో భార్యభర్తల బంధాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అలాంటి తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న కథ నెటిజన్ల మనసుని అమితంగా ఆకర్షిస్తోంది. వారి 35 ఏళ్ల అనురాగ దాంపత్యానికి ముచ్చటపడి అభినందనలు చెబుతుండటం విశేషం.
ఇంతకీ అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన జౌజియావోలిన్, తన భార్య యిన్ జీ కోసం భారీ తోటను నిర్మించాడు. అది ఎంత పెద్దదంటే..ప్రపంచంలో అతిపెద్ద ఉద్యానవన తోట. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో అతిపెద్ద రంగరంగు పూల తోట కనువిందు చేస్తోంది. ఆ దంపతులే ఈ భారీ తోటను స్వయంగా చూసుకుంటున్నారు. ఒక టెలివిజన్ షోలో ఈ దంపతులు కనిపించడంతో వారి కథ వెలుగులోకి వచ్చింది. ఆ షో వారిని ఆదర్శ జంటగా అభివర్ణించడం విశేషం.
ఇంతకీ జౌజియావోలిన్ ఎందుకు ఈ తోటను నిర్మించాడంటే..2013లో తన భార్య యిన్ బీజింగ్లో పెరిగే హాలీహాక్లుగా పిలిచే ఆ పువ్వులంటే తనకెంత ఇష్టమో చెప్పింది. ఆ నేపథ్యంలోనే జౌ ఆమె కోసం ఒక తోటను నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతనికి తోటపని చేసిన అనుభవం లేదు. అయినా తన సొంత ఇంటిని అమ్మి..ఝువాన్లాంగ్ టౌన్లో సుమారు 80 హెక్టార్ల లోయను కొని, హాలీహాక్ మొక్కలను పెంచడం గురించి నేర్చుకున్నాడు. అలా పదేళ్లకు పైగా దేశ విదేశాల నుంచి విత్తనాలను సేకరించి ఒక పెద్ద తోటనే నిర్మించాడు.

అదికాస్తా ఇప్పుడు అతి పెద్ద వైవిధ్యమైన హాలీహాక్ తోటగా ప్రసిద్ధి చెందింది. 35 ఏళ్ల వైవాహిక బంధం వారిది. పిల్లలు లేని ఆ దంపతులు తమ విశ్రాంత జీవితాన్ని పెంపుడు జంతువులు, పూల మొక్కల మధ్య గడుపుతున్నారు. సంప్రదాయబద్ధంగా సంపద లేదా కుటుంబంతో కాకుండా ప్రకృతిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న ఈ జంట నిజంగానే ఆదర్శ దంపతులు కదూ..!. నెటిజన్లు కూడా డబ్బు సంపాదించడం, పిల్లలను పెంచడం కంటే జీవితంలో ఇంకా చాలానే ఉందని నిరూపించారు ఈ దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..)


