బీజింగ్ : చైనాను టైఫూన్ డాల్ఫిన్ తుపాన్ అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాన్ దాటికి దేశ ఆర్థిక రాజధాని షాంఘైతో సహా తూర్పు చైనాలోని వివిధ ప్రాంతాల నుండి పది లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దానితో పాటు ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. ఈ రోజు ఒక్కరోజే (సోమవారం) షాంఘైలో దాదాపు 1,000 విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు.
వాతావరణ శాఖ అధికారుల ప్రకారం, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జెజియాంగ్ ప్రావిన్స్లోని వుహాన్లో తొలిసారిగా తీరాన్ని తాకిందని అప్పుడు ఆ డాల్ఫిన్ గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఈ తుపాన్ ధాటికి పర్యాటకులు అధికంగా వచ్చే షాంఘై ప్రాంతాల్లోని భవనాల కింది అంతస్తులలోని వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు వరదల కారణంగా ప్రభావితమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని వీధుల్లోని వరద నీటిలో నిల్చున్నారని పేర్కొన్నారు.
న్జౌలోని అధికారులు సుమారు 9 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, దాదాపు 1,000 అత్యవసర ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. తైజౌ నగరంలో 3,90,000 మంది ప్రజలను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ఫుజియాన్ తీరప్రాంతంలో, సముద్ర అధికారులు డజన్ల కొద్దీ ప్రయాణీకుల ఫెర్రీ సర్వీసులను నిలిపివేసి, 100కు పైగా సముద్ర నిర్మాణ ప్రాజెక్టుల పనులను నిలిపివేశారని పేర్కొన్నారు.
అయితే తుఫాన్ గురించి చాలా మంది తప్పుడు సమాచారం ప్రసారం చేస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలుతీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అటువంటి సమాచారాన్ని పంపినందుకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


