తమ్ముని అంత్యక్రియలకు వెళ్తూ అతీక్‌ కుమారుని వీరంగం! | FIR Filed Against Atiq's Son Umar for Breaking Toll Barriers | Sakshi
Sakshi News home page

తమ్ముని అంత్యక్రియలకు వెళ్తూ అతీక్‌ కుమారుని వీరంగం!

Aug 10 2026 9:56 AM | Updated on Aug 10 2026 10:03 AM

FIR Filed Against Atiq's Son Umar for Breaking Toll Barriers

ప్రయాగ్‌రాజ్: దివంగత మాఫియా డాన్ అతీక్‌ అహ్మద్ పెద్ద కుమారుడు ఉమర్ అహ్మద్ కాన్వాయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్ముడు ఆబాన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లక్నో జైలు నుంచి పెరోల్‌పై ప్రయాగ్‌రాజ్ వస్తున్న క్రమంలో ఉమర్ కాన్వాయ్‌లోని దాదాపు 30 వాహనాలపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

మార్గం మధ్యంలో ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లోని టోల్ ప్లాజా బూమ్ బారియర్లను ఈ కాన్వాయ్ ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జాతీయ రహదారి-19లోని నవాబ్‌గంజ్ టోల్ ప్లాజా, ప్రతాప్‌గఢ్ జిల్లా కుండాలోని భద్రి టోల్ ప్లాజా సిబ్బందిని బెదిరించడమే కాకుండా, వారిపైకి వాహనాలు ఎక్కించి చంపే ప్రయత్నం చేశారని టోల్ మేనేజర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో గత ఆగస్టు 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతీక్‌ చిన్న కుమారుడు ఆబాన్ మృతి చెందాడు. ఆగస్టు 8న కసారి-మసారిలో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా, లక్నో జైలులో ఉన్న ఉమర్‌కు అల్లహాబాద్ హైకోర్టు పెరోల్ మంజూరు చేసింది. ప్రభుత్వ వాహనంలో అతడిని తరలిస్తుండగా, వెనుక అనుచరులు, సన్నిహితులు సుమారు 30 వాహనాలతో కాన్వాయ్‌గా తరలివచ్చారు.

వారు టోల్ ట్యాక్స్ చెల్లించకుండా రోడ్లపై దూసుకెళ్తూ, అడ్డుకున్న సిబ్బందిని బూతులు తిడుతూ, భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనపై నవాబ్‌గంజ్ టోల్ ప్లాజా అసిస్టెంట్ మేనేజర్ జయ్ ప్రకాష్ యాదవ్ ఫిర్యాదు మేరకు 28 మందితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే భద్రి టోల్ ప్లాజా మేనేజర్ ఇషాక్ ఖాన్ ఫిర్యాదు ఆధారంగా మరో రెండు వాహనాలపై హతిగ్వాం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టోల్ సిబ్బందిని తొక్కించే ప్రయత్నం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇది కూడా  చదవండి: ‘నీట్‌’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement