లక్నో: నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ (ప్రయాగ్రాజ్) ప్రాంతాన్ని తన నేరసామ్రాజ్యంతో గజగజలాడించిన మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతీక్ అహ్మద్కు ఉన్న ఐదుగురు కుమారులలో అందరికంటే చిన్నవాడైన అబాన్ అహ్మద్ గురువారం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. జైలులో ఉన్న తన సోదరులను కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. అబాన్ అహ్మద్ తన స్నేహితులతో కలిసి ప్రయాగ్రాజ్ నుండి ఝాన్సీకి ఎస్యూవీ వాహనంలో బయలుదేరాడు. ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిపై పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వీరి వాహనం అతివేగంతో హైవే డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో అబాన్ అహ్మద్తో పాటు సోను అనే మరో ప్రయాణికుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వాహనంలో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు.
అన్నను కలవడానికి వెళ్తుండగా..
గతంలో నైని సెంట్రల్ జైలు నుండి ఝాన్సీ జిల్లా జైలుకు తరలించిన తన సోదరుడు అలీ అహ్మద్ను కలిసేందుకు అబాన్ వస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులో అలీ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అంతేకాకుండా, బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ను ఫిబ్రవరి 2023లో దారుణంగా హత్య చేసిన కేసులో కూడా అలీ నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్యకు సంబంధించిన కుట్ర జైలు నుంచే పన్నారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. తండ్రి అతీక్ అహ్మద్ హత్య తర్వాత ఐఎస్-227 అనే గ్యాంగ్ ముఠా బాధ్యతలను అలీనే స్వీకరించాడని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఉమేష్ పాల్ హత్య కేసుతో సహా 100కు పైగా నేర కేసుల్లో నిందితుడిగా ఉన్న అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్లను 2023 ఏప్రిల్ నెలలో పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రయాగ్రాజ్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వారు మీడియాతో మాట్లాడుతుండగా, జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు లైవ్ టీవీ కెమెరాల ముందే వారిని అతిదగ్గరి నుండి కాల్చి చంపారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత, ఇప్పుడు అతీక్ చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం గమనార్హం.


