న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన సోషల్ మీడియా ఖాతాపై ‘మెటా’ సంస్థ ఆంక్షలు విధించిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో తొలగింపు వ్యవహారంలో మెటాకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
తన సోషల్ మీడియా ఖాతాను ‘మెటా’ నిలిపివేసిందని, కేజ్రీవాల్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. దీనిపై ‘మెటా’ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, తన కార్యాలయం ద్వారా విచారించినా ఎలాంటి కారణాలు చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెటా సంస్థకు రాసిన ఈమెయిళ్లకు సాధారణ రసీదు మినహా ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు.
ఈ సందర్భంగా మెటా ఇండియాను ట్యాగ్ చేస్తూ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీకి, ఆయన ప్రభుత్వానికి మెటా తలవంచకూడదని డిమాండ్ చేశారు. మెటా సంస్థ తన సేవలను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని అన్నారు. అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఏ ఖాతాలపై ఈ ఆంక్షలు విధించారనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో తొలగింపు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఆప్ అధినేత ఖాతా నిలిపివేత అంశం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: ట్రాలీ బ్యాగులో కుళ్లిన మృతదేహం.. రైల్లో కలకలం!


