పూంచ్: జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి బుధవారం సాయంత్రం జరిగిన ల్యాండ్మైన్ పేలుడులో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. పూంచ్లోని మేంథర్ సెప్టార్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూంచ్ సెక్టార్లోని కంగా గలీ ప్రాంతంలో సైనిక బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సాధారణ గస్తీ నిర్వహించింది. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతంలో లభించిన ఒక ల్యాండ్మైన్ను నిర్వీర్యం చేస్తుండగా అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో గాయపడిన ఇద్దరు సైనికులను వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
సరిహద్దు వెంబడి చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు ల్యాండ్మైన్లను అమరుస్తుంటాయి. అయితే, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల కారణంగా కొన్నిసార్లు ఈ మైన్లు తమ స్థానాల నుంచి కదిలిపోతుంటాయి. వీటిని భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు గుర్తించి నిర్వీర్యం చేస్తుంటారు. ఈ క్రమంలోనే దెబ్బతిన్న ఒక అనుమానాస్పద పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు, పూంచ్ జిల్లాలోని నల్వా-దేగవార్ తర్వాన్ ప్రాంతంలో కూలీలకు తుప్పు పట్టిన ఒక అనుమానాస్పద పేలుడు పదార్థం లభించింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతానికి చేరుకుని దానిని సురక్షితంగా పేల్చివేసి తొలగించింది. ఇదిలా ఉండగా కశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన సోదాల సమయంలో ఒక ఇంటి నుంచి కబాడీకి సంబంధించిన 45 రకాల షెల్స్ను స్వాధీనం చేసుకున్నారు. సోపోర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీకి చెందిన 5వ రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. షీర్ కాలనీలోని ఒక ఇంట్లో ఈ షెల్స్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: అఖిలేశ్కు షాక్ ఇచ్చిన యోగి సర్కార్


