కేబినెట్ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్లో మొదలైన అసంతృప్తి మరింత తీవ్రరూపం దాలుస్తోంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు నిరసనలు కొనసాగిస్తుండగా.. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ నేతలు నేడు కీలక సమావేశం నిర్వహిస్తుండడం.. ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే పలువురు సీనియర్ నేతలు తమకు అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతల అనుచరులు బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట నిరసనలు కూడా చేపట్టారు. ముఖ్యంగా తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నేతలు.. ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. కొన్ని జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదని, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా అసంతృప్త నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యే..
మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి చెందిన ఇండీ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదని అనుచరులు చెబుతున్నారు. మరో నేత బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు దినేశ్ గుండు రావు, ఎం. కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, ఎం.సీ. సుధాకర్, ఆర్బీ తిమ్మాపూర్, రహీం ఖాన్ వంటి పలువురు నేతలు కేబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి పదవుల ఎంపికలో ప్రాంతీయ సమతుల్యత పాటించలేదని, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు తమ అనుచరులతో కలిసి నిరసనలు చేపట్టగా.. మరికొందరు పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా: డీకే
అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరికలపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కఠినంగా స్పందించారు. రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరని, రాజీనామా లేఖలు వస్తే నిమిషాల్లో ఆమోదిస్తామని హెచ్చరించారు. “రాజకీయాల్లో రాజీనామాలు సాధారణం. పార్టీ అన్నింటికంటే ముఖ్యం. ఓపికగా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, సహనం పాటించడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అసంతృప్త నేతలకు సూచించారు. ఈ తరుణంలో.. డీకే శివకుమార్తో చర్చల అనంతరం కొందరు నేతలు మెత్తబడినట్లు సమాచారం.
నేడు ఏం తేలనుంది?
మంత్రి పదవులు దక్కని నేతలు నేడు రహస్యంగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో.. తమ డిమాండ్లు, పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచే మార్గాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. సీఎం డీకే వైఖరి కారణం.. అవసరమైతే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని కూడా వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేల సమావేశం నేపథ్యంలో ఈ అసంతృప్తి ఏ స్థాయికి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
అధిష్టానం రంగంలోకి..
కర్ణాటక కాంగ్రెస్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలాను బెంగళూరుకు పంపింది. ఇప్పటికే ఆయన సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించారు. ఇవాళో, రేపో అసంతృప్త నేతలతో చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా హైకమాండ్ ప్రయత్నిస్తోంది.
ప్రభుత్వానికి ముప్పు ఉందా?
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి 135 స్థానాలు గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్క్ కంటే 22 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి.
అందుకే ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పడిపోయేంత సంఖ్యాబలం సంక్షోభం లేదని పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బయటకు వెళితే తప్ప ప్రభుత్వానికి తక్షణ ముప్పు ఉండదన్న అంచనా ఉంది. అయితే సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. సీనియర్ నేతల అసంతృప్తి కొనసాగితే అది డీకే శివకుమార్ నాయకత్వానికి, పార్టీ అంతర్గత ఐక్యతకు రాజకీయ సవాల్గా మారే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు మంత్రి పదవుల కోసం జరిగిన అసంతృప్తి.. నేడు జరిగే ఎమ్మెల్యేల సమావేశంతో ఏ మలుపు తిరుగుతుందన్నదే కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అధిష్టానం వారిని బుజ్జగిస్తుందా? లేదంటే డీకే శివకుమార్ కఠిన వైఖరినే కొనసాగిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.


