డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దించింది కూటమి ప్రభుత్వం.
వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీసు వ్యవస్థను ప్రయోగించింది. గురువారం వేకువ జాము నుంచి.. పలు జిల్లాల్లో దీక్షా శిబిరాలను పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గురజాలలో పోలీసుల ఓవరాక్షన్
- డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని బ్రహ్మనాయుడు సర్కిల్లో రిలే దీక్ష
- దీక్షకు సిద్ధమైన వైఎస్సార్సీపీ యువజన విద్యార్థి విభాగం
- దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకోమని హుకుం జారీ చేసిన పోలీసులు
- కనీసం దీక్ష శిబిరం ఏర్పాటు కూడా చెయ్యనివ్వని పోలీసులు
- దీక్ష శిబిరానికి సంబంధించిన టెంటును వెనుక పంపిచేసిన పోలీసులు
బాపట్ల జిల్లా వేమూరులో..
- అమృతలూరులో పోలీసుల ఓవరాక్షన్
- డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని దీక్ష చేయడానికి రెడీ యువజన విభాగ నాయకులు
- దీక్షా శిబిరాన్ని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులు
- అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత
మాచర్లలో దీక్షకు అడ్డంకులు
పల్నాడు జిల్లా మాచర్లలో డీఎస్సీ అక్రమాలపై నిరసనగా దీక్ష చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలం వద్ద శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను అడ్డుకున్నారు. “మా సొంత స్థలంలో దీక్ష చేసుకుంటాం.. దానికి కూడా అనుమతి లేదా?” అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నప్పుడు తమ దీక్షను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
గుంటూరులో టెంట్ తొలగింపు
గుంటూరు జిల్లాలోనూ డీఎస్సీ వ్యవహారంపై నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. పొన్నూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. శిబిరానికి వేసిన టెంట్ను పోలీసులు తొలగించారని మండిపడ్డారు.
కనిగిరిలోనూ ఉద్రిక్తత
మార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పట్టణంలో సాధారణంగా ధర్నాలు నిర్వహించే ప్రదేశంలోనే టెంట్ ఏర్పాటు చేశామని, అయినప్పటికీ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి తొలగించారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న జెన్జీ విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి ధద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు.
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ రణభేరి
డీఎస్సీ-2025 నియామకాల్లో పారదర్శకత లేదంటున్న వైఎస్సార్సీపీ.. విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ సంఘాలతో కలిసి ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించింది. పార్టీ నేతలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ నెల 10న విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు.
మరోవైపు.. ఈ నిరసనల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమై పోలీసులను రంగంలోకి దించడం గమనార్హం. నిరసనలను అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది.


